పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము/కల్క్యవతారంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ద్వాదశ స్కంధము)
రచయిత: నారయ


తెభా-12-9-క.
దిదినమును ధర్మంబులు,
యము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణ చతుష్కములో;
నెయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రిన్.

టీక:- దినదినము = రోజురోజుకి; ధర్మంబులు = ధర్మానుసరణలు; అనయమున్ = అంతకంతకు; ధరన్ = భూమండలమునందు; అడగిపోవున్ = అణిగిపోతాయి; ఆశ్చర్యముగా = ఆశ్చర్యకరముగా; విను = వినుము; వర్ణచతుష్కము = నాలుగుజాతులవారి {వర్ణచతుష్కము - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు, నాలుగు జాతులు}; లోన్ = అందు; ఎనయంగా = ఎంచిచూసిన; ధనవంతుడు = ధనికుడు; ఐనన్ = అయినచో; ఏలున్ = పరిపాలించును; ధరిత్రిన్ = రాజ్యామును.
భావము:- దానితో లోకంలో రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది. నాలుగు కులాలలోనూ ధనవంతుడు అయినవాడే పాలకుడు అవుతాడు.

తెభా-12-10-క.
వంతుఁ డైన వాడే
కుహీనుం డైన దొడ్డగుణవంతుఁ డగుం
లిమియుఁ బలిమియుఁ గలిగిన
నిలోపల రాజ తండె; యే మన వచ్చున్.

టీక:- బలవంతుడు = బలములుగలవాడు; ఐనన్ = అయితే; వాడే = అతడే; కులహీనుండు = కులంలేనివాడు; ఐనన్ = అయినప్పటికి; దొడ్డ = గొప్ప; గుణవంతుడున్ = గుణాలున్నవానిగ; అగున్ = పరిగణిస్తారు; కలిమియున్ = సంపద; బలిమియున్ = శక్తి; కలిగినన్ = ఉన్నట్లయితే; ఇల = ప్రపంచము; లోపలన్ = లో; రాజు = రాజ్యాధికారముకలవాడు; అతండె = అతడే; ఏమనవచ్చున్ = ఏమనగలము.
భావము:- బలవంతుడిని కులం లేకపోయినా గొప్ప గుణవంతుడుగా పరిగణిస్తారు. కలిమి బలిమీ రెండూ కనుక ఉంటే ఇంక చెప్పటానికేముంది లోకంలో అతడే రాజు.

తెభా-12-11-వ.
అట్లుగాన జనంబులు లోభులై, జారత్వ చోరత్వాదులచేత ద్రవ్యహీనులై వన్యశాక మూల ఫలంబులు భుజించుచు, వన గిరి దుర్గంబులం గృశీభూతులై దుర్భిక్ష, శీత, వాతాతప, క్షుధా, తాపంబులచేత భయంపడి, ధనహీనులై యల్పాయుష్కులు, నల్పతరశరీరులునై యుండ రాజులు చోరులై సంచరించుచు, నధర్మప్రవర్తనులై వర్ణాశ్రమ ధర్మంబులు విడనాడి, శూద్రప్రాయులై యుండెద; రంత నోషధు లల్పఫలదంబులు, మేఘంబులు జలశూన్యంబులు, సస్యంబులు నిస్సారంబులు నగు; నిట్లు ధర్మమార్గంబు దక్కి యున్నయెడ ముకుందుండు దుష్టనిగ్రహ శిష్టపరిపాలనంబుల కొఱకు శంబల గ్రామంబున విష్ణుయశుం డను విప్రునకుఁ గల్క్యవతారుండై దేవతా బృందంబులు నిరీక్షింప, దేవదత్త ఘోటకారూఢుండై దుష్టమ్లేచ్ఛజనంబులం దన మండలాగ్రంబున ఖండీభూతులం జేయు; నప్పుడు ధాత్రీమండలంబు విగతక్రూరజన మండలంబై తేజరిల్లు; నంత నరులు విష్ణుధ్యాన వందన పూజాది విధానాసక్తులై నారాయణపరాయణు లయి వర్తిల్లెద; రిట్లు కల్క్యవతారంబున నిఖిల జనులు ధన్యు లయ్యెద; రంతటఁ గృతయుగ ధర్మంబయి నడచుచుచుండు; జంద్ర భాస్కర శుక్ర గురువులేక రాశి గతులయినం, గృతయుగం బయి తోఁచు; రాజేంద్రా! గత వర్తమాన భావికాలంబులు; భవజ్జన్మంబు మొదలు నందాభిషేక పర్యంతంబుఁ పంచదశాధికశతోత్తర సహస్ర హాయనంబులయి యుండు; నంతట నారాయణుం డఖిల దుష్ట రాజద్వంసంబు గావించి ధర్మంబు నిలిపి వైకుంఠనిలయం డగు;”నని చెప్పిన.
టీక:- అట్లు = అలా; కాన్ = అగుటచేత; జనంబులు = ప్రజలు; లోభులు = దురాశాపరులు; ఐ = అయ్యి; జారత్వ = వ్యభిచారము; చోరత్వ = దొంగతనము; ఆదుల = మోదలగువాని; చేత = ద్వారా; ద్రవ్యహీనులు = దరిద్రులు; ఐ = అయ్యి; వన్య = అడవి; శాక = కాయలు; మూల = దుంపలు; ఫలంబులు = పండ్లు; భుజించుచు = తింటూ; వన = అడవుల; గిరి = కొండల; దుర్గంబులన్ = దుర్గమప్రదేశములలో; కృశీభూతులు = చిక్కినవారు; ఐ = అయ్యి; దుర్భిక్ష = కరువుకాటకాలకు; శీత = చలికి; వాతా = గాలికి; ఆతప = ఎండకు; క్షుదాతాపంబుల = ఆకలిదప్పుల; చేత = కు; భయంపడి = భయపడిపోయి; ధనహీనులు = బీదవారు; ఐ = అయ్యి; అల్పా = తక్కువ; ఆయుష్కులు = ఆయుష్షుగలవారు; అల్పతర = మిక్కిలిచిన్న {అల్పము - అల్పతరము - అల్పతమము}; శరీరులు = దేహధారుడ్యముగలవారు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; రాజులు = పాలకులు; చోరులు = దొంగలు; ఐ = అయ్యి; సంచరించుచున్ = తిరుగుతూ; అధర్మ = ధర్మహీనమైన; ప్రవర్తనులు = నడచువారు; ఐ = అయ్యి; వర్ణ = చాతుర్వర్ణముల {చాతుర్వర్ణములు - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు}; ఆశ్రమ = చతురాశ్రమముల {చతురాశ్రమములు - 1బ్రహ్మచర్య 2గృహస్థ 3వానప్రస్థ 4సన్యాస ఆశ్రమములు}; ధర్మంబులున్ = ధర్మములను; విడనాడు = వదలిపెట్టి; శూద్ర = శూద్రులతో; ప్రాయులు = సమానమైనవారు; ఐ = అయ్యి; ఉండెదరు = ఉంటారు; అంతన్ = ఇంక; ఓషధుల్ = మొక్కలు {ఓషధులు - ఫలించుటతోడనే మరణించునవి, అరటి మున్నగుమొక్కలు}; అల్ప = చిక్కిన; ఫలదంబులు = ఫలవంతములగును; మేఘంబులున్ = మేఘములు; జలశూన్యంబులు = వట్టిపోయినవగును; సస్యంబులు = పంటలు; నిస్సారంబులు = పసలేనివి; అగున్ = అగును; ఇట్లు = ఈ విధముగ; ధర్మమార్గంబున్ = ధర్మమును; తక్కి = తగ్గి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ముకుందుడు = విష్ణుమూర్తి {ముకుందుడు - మోక్షమునిచ్చువాడు, విష్ణువు}; దుష్టనిగ్రహ = దుష్టశిక్షణ; శిష్టపరిపాలనంబుల = శిష్టరక్షణల; కొఱకున్ = కోసము; శంబల = శంబల అనెడి, తీరప్రాంత; గ్రామంబునన్ = ఊరిలో; విష్ణుయశుండు = విష్ణుయశుడు; అను = అనెడి; విప్రున్ = బ్రాహ్మణున; కున్ = కు; కల్క్వవతారుండు = కల్క్యవతారము ధరించిన వాడు; ఐ = అయ్యి; దేవతా = దేవతల; బృందంబులున్ = సమూహములును; నిరీక్షింపన్ = చూస్తుండగా; దేవదత్త = దేవతలచేనివ్వబడిన; ఘోటక = గుఱ్ఱమును; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; దుష్ట = దుష్టులైన; మ్లేచ్ఛ = పాపరతులైన; జనంబులన్ = వారిని; తన = అతని యొక్క; మండలాగ్రంబునన్ = కత్తితో; ఖండీభూతులన్ = నరకబడినవారిగా; చేయున్ = చేస్తాడు; అప్పుడు = ఆ సమయమునందు; ధాత్రీమండలంబున్ = భూమండలము; విగత = తొలగిన; క్రూర = దుష్ట; జన = ప్రజలుకలిగిన; మండలంబు = దేశము; ఐ = అయ్యి; తేజరిల్లున్ = విలసిల్లును; అంతన్ = అప్పుడు; నరులు = మానవులు; విష్ణు = విష్ణుమూర్తిని; ధ్యాన = ధ్యానించుట; వందన = నమస్కరించుట; పూజన్ = పూజించుట; ఆది = మున్నగు; విధాన = విషయములందు; ఆసక్తులు = ఆసక్తులుకలవారు; ఐ = అయ్యి; నారాయణ = విష్ణువు ఎడల; పరాయణులు = భక్తిగలవారు; అయి = ఐ; వర్ధిల్లెదరు = వృద్ధిపొందుతారు; ఇట్లు = ఈ విధముగ; కల్క్యవతారంబునన్ = కల్క్యవతారమువలన; నిఖిల = సమస్తమైన; జనులున్ = వారు; ధన్యులు = కృతార్ధులు; అయ్యెదరు = ఔతారు; అంతటన్ = అటుపిమ్మట; కృతయుగ = కృతయుగపు; ధర్మంబున్ = ధర్మములు; అయి = కలిగి; నడచుచుండున్ = మెలగును; చంద్ర = చంద్రుడు; భాస్కర = సూర్యుడు; శుక్ర = శుక్రుడు; గురువులున్ = గురుగ్రహంబులు; ఏక = ఒకే; రాశిన్ = రాశిలో; గతులు = తిరుగువారు; అయినన్ = అయినచో; కృతయుగంబు = కృతయుగము; అయి = ప్రవేశించినట్లు; తోచున్ = తెలియును; రాజేంద్రా = మహారాజా; గత = భూత; వర్తమాన = వర్తమాన; భావి = భవిష్యత్తు; కాలంబులున్ = కాలములు; భవత్ = నీ; జన్మంబున్ = పుట్టుక; మొదలు = నుండి; నంద = నందరాజు; అభిషేక = రాజ్యాభిషేకము; పర్యంతంబు = వరకు; పంచదశాధికశతోత్తరసహస్ర = వెయ్యినూటయేభై; హాయనంబులు = సంవత్సరములు; అయి = జరిగి; ఉండున్ = ఉంటాయి; అంతట = ఆ పిమ్మట; నారాయణుండు = విష్ణుమూర్తి; అఖిల = సమస్తమైన; దుష్ట = దుర్మార్గపు; రాజ = రాజులను; ధ్వంశంబు = నాశనము; కావించి = చేసి; ధర్మంబున్ = ధర్మమును; నిలిపి = నిలబెట్టి; వైకుంఠనిలయుండు = వైకుంఠవాసుడుగా; అగును = ఔతాడు; అని = అని; చెప్పినన్ = చెప్పగా.
భావము:- అలా కావడంతో ఆ కాలంలోని ప్రజలు దురాశ, వ్యభిచారము, దొంగతనము మున్నగు దుర్గుణాలకు లొంగి, ధనహీనులు అవుతారు. అడవులందు కూరలు, దుంపల, పళ్ళు తింటూ; కొండగుహలలో మెసలుతూ, కృశించి, కరువు కాటకాలకు, చలికి, గాలికి ఎండకు ఆకలికి భయపడిపోతారు. వారి ఆయుర్ధాయం తరిగిపోతుంది. వారి శరీరాలు కూడ చిక్కి చిక్కి చిన్నవైపోతాయి. ఇంక రాజులు తామే దొంగలై తిరుగుతారు. అధర్మంగా సంచరిస్తూ, వర్ణాశ్రమ ధర్మాలను విడచిపెట్టి, శూద్ర సమానులై తిరుగుతారు.
ఆ కాలంలో, ఓషధులు ఫలించడం కూడ తగ్గిపోతుంది. మబ్బులు వట్టిపోయి వర్షాలు కురవవు. పండిన పంటలలో పస ఉండదు. ఈ మాదిరిగా లోకం ధర్మమార్గాన్ని తప్పి ఉన్నప్పుడు విష్ణుమూర్తి దుష్టశిక్షణకోసం శంబల గ్రామంలో విష్ణు యశుడనే విప్రుడికి కొడుకు అయి విష్ణుమూర్తి కల్కి పేర అవతారిస్తాడు. దేవతలు అందరూ చూస్తుండగా దేవదత్తం అనే అశ్వాన్ని అధిరోహించి కల్కి భగవానుడు దుష్టులు అయిన మ్లేచ్ఛులను తన కత్తితో తుత్తునియలు చేస్తాడు.
అప్పుడు భూమండలం దుష్టజన రహితం కావడంతో, ప్రకాశిస్తుంది. ప్రజలలో విష్ణుభక్తి కుదురుకుంటుంది ధ్యానవందనార్చనాదు లందు ఆసక్తి కలిగి ప్రజలు నారాయణ భక్తిపరాయణులై మెలగుతారు. అలా కల్క్యావతారుని వలన సకల జనులు ధన్యులు అవుతారు. సర్వత్రా కృతయుగ ధర్మమే నడుస్తూ ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి ఒకే రాశిలో ప్రవేశించి నప్పుడు కృతయుగం ఆరంభం అవుతుంది. ఓ పరీక్షిన్మహారాజా! నీవు పుట్టింది మొదలుకొని నందాభిషేకంవరకూ జరిగిన జరుగుతున్న జరుగబోవు కాలం వెయ్యినూటపదిహేను సంవత్సరములు. మిగిలిన కాలాన్ని నువ్వే గణించవచ్చు. ఆ తరువాత నారాయణుడు దుష్టరాజులను అందరినీ సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, మళ్ళా వైకుంఠానికి వెళ్ళిపోతాడు.” అని శుకమహాముని చెప్పాడు...

తెభా-12-12-క.
"మునినాథ! యే విధంబున
తరముగఁ జంద్ర సూర్య గ్రహముల జాడల్
నుఁ? గాలవర్తనక్రమ
మొరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్."

టీక:- ముని = మునులలో; నాథ = శ్రేష్ఠుడా; ఏ = ఏ; విధంబునన్ = లాగు; ఘనతరము = మిక్కిలిగొప్పగా {ఘనము - ఘనతరము - ఘనతమము}; చంద్ర = చంద్రగ్రహము; సూర్యగ్రహముల = సూర్యగ్రహముల; జాడన్ = సంచరించుమార్గాలు; చనున్ = ఉంటాయు; కాల = కాలము యొక్క; వర్తన = నడచెడి; క్రమమున్ = పద్ధతి; ఒనరగన్ = చక్కగా; ఎఱిగింపవు = తెలుపుము; అయ్య = తండ్రి; ముదము = సంతోషము; తలిర్పన్ = కలుగునట్లుగా.
భావము:- అప్పుడు పరీక్షిత్తు “మునివరా! చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను. నాకు చెప్తావా?” అని అడిగాడు

తెభా-12-13-వ.
అనిన నట్లగాక, యని చెప్పఁ దొడంగె; “వినుము; సప్తర్షి మండలాంతర్గతంబు లయిన పూర్వ ఋక్షద్వయి సమమధ్యంబు నందు నిశాసమయంబున నొక్క నక్షత్రంబు గానిపించిన కాలంబు మనుష్య మానంబున శతవత్సరపరిమితంబయ్యె నే నా సమయంబున జనార్దనుండు నిజపదంబునఁ బొదలె; నా వేళనె ధాత్రీమండలంబు కలి సమాక్రాంతం బయ్యెఁ; గృష్ణుం డెంతకాలంబు భూమి యందుఁ బ్రవర్తించె, నంత కాలంబునుగలి సమాక్రాంతంబు గాదు; మఘానక్షత్రం బందు సప్తర్షులు నే ఘస్రంబునఁ జరియింతు రా ఘస్రంబునఁ గలి ప్రవేశించి వేయునిన్నూఱు వర్షంబు లయి యుండు; నా ఋషిసంఘంబు పూర్వాషాడ కరిగినం గలి ప్రవృద్ధంబు నొందు; నే దివసంబున హరి పరమపదప్రాప్తుం డయ్యె; నా దివసంబు నంద కలి ప్రవేశించి దివ్యాబ్జసహస్రంబు సనిన యనంతరంబు నాలవ పాదంబునఁ గృతయుగ ధర్మంబు ప్రాప్తం బగు.
టీక:- అనినన్ = అని అడుగగా; అట్లకాక = సరే; అని = అని; చెప్పన్ = చెప్పుట; తొడంగె = మొదలుపెట్టెను; వినుము = వినుము; సప్తర్షిమండల = సప్తర్షిమండలము; అంతర్గతంబులు = లోపలనుండునవి; ఐన = అయిన; పూర్వ = తూర్పు; ఋక్ష = నక్షత్రముల; ద్వయి = జంటకు; సమ = సమంగా; మధ్యంబునన్ = మధ్యప్రదేశము; అందున్ = లో; నిశా = రాత్రి; సమయంబునన్ = సమయమునందు; ఒక్క = ఒకానొక; నక్షత్రంబు = నక్షత్రము; కానిపించినన్ = కనబడినప్పటినుండి; కాలంబు = కాలము; మానుష్య = మానవ; మానంబునన్ = గణనప్రకారము; శత = వంద (100); వత్సర = సంవత్సరములు; పరిమితంబు = పాటి; అయ్యన్ = జరిగినట్లు; అయిన = ఐతే; ఆ = ఆ; సమయంబునన్ = సమయానికి; జనార్దనుండు = కృష్ణుడు; నిజపదంబున్ = స్వస్థానమునకు; పొదలెన్ = వెళ్ళిపోయెను; ఆ = ఆ; వేళనె = సమయమునందే; ధాత్రీ = భూ; మండలంబు = తలముపైన; కలి = కలి; సమాక్రాంతంబు = ప్రవేశించుట; అయ్యెన్ = జరిగినది; కృష్ణుండు = శ్రీకృష్ణుడు; ఎంతకాలంబు = ఎన్నిరోజులు; భూమి = నేల; అందున్ = మీద; ప్రవర్తించెన్ = మెలగెనో; అంతకాలంబునున్ = అన్నాళ్ళు; కలి = కలికాలము; సమాక్రాంతంబు = ప్రవేశించుట; కాదు = జరుగలేదు; మఘానక్షత్రంబున్ = మఘ నక్షత్రము; అందున్ = లో; సప్తర్షులు = సప్తర్షులు; ఏ = ఏ; ఘస్రంబునన్ = రోజున; చరియింతురు = ప్రవేశింతురో; ఆ = ఆ; ఘస్రంబునన్ = రోజుననే; కలి = కలికాలము; ప్రవేశించి = మొదలై; వేయునిన్నూఱు = పన్నెండొందల (1200); వర్షంబులు = సంవత్సరములు; అయి = ఐ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; ఋషిసంఘంబు = సప్తర్షిమండలము; పూర్వాషాడ = పూర్వాషాడ నక్షత్రము; కిన్ = కి; అరిగిన = వెళ్ళినచో; కలి = కలిప్రభావము; ప్రవృద్ధంబు = మిక్కిలవృద్ధిచెందినది; ఒందున్ = అవుతుంది; ఏ = ఏ; దివసంబునన్ = రోజున; హరి = కృష్ణుడు; పరమపదప్రాప్తుండు = వైకుంఠముచేరెనో; ఆ = ఆ; దివసంబునన్ = రోజున; కలి = కలి; ప్రవేశించి = మొదలై; దివ్యాబ్జ = దివ్యసంవత్సరములు; సహస్రంబున్ = వెయ్యి (1000); చనిన = గడచిన; అనంతరంబు = పిమ్మట; నాలవ = నాల్గవ (4) {నాలవపాదంబు - కలియుగము యొక్క చివరి (4వ) పాదము}; పాదంబునన్ = పాదములో; కృతయుగ = కృతయుగపు; ధర్మంబున్ = లక్షణములు; ప్రాప్తంబు = కలుగుట; అగున్ = జరుగును.
భావము:- “సరే అలాగే చెప్తాను, విను” అని శుకముని పరీక్షిత్తు మహారాజుకు ఇలా చెప్పసాగాడు. “సప్తర్షి మండలంలోని పూర్వనక్షత్రాలకు రెండింటికీ సరిగ్గా మధ్య ప్రదేశంలో రాత్రి వేళ ఒక నక్షత్రం కనిపించింది. అది కనిపించాక, మానవ గణన ప్రకారం నూరు సంవత్సరాలు గడిచేక జనార్థనుడైన శ్రీకృష్ణుడు స్వస్థానానికి వెళ్ళిపోయాడు. అవేళనే కలి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు భూమిమీద ఉన్నంత కాలం కలి భూమిమీద అడుగు మోపలేదు. సప్తర్షులు మఘానక్షత్రంలో ప్రవేశించే నాటికి కలి ప్రవేశించి పండ్రెండువందల సంవత్సరాలు అవుతుంది. ఆ సప్తఋషులు పూర్వాషాడలో ప్రవేశించినప్పుడు కలి ప్రవర్ధమానుడు అవుతాడు, శ్రీకృష్ణుడు లోకాన్ని విడచి పరమపదమైన తన లోకాన్ని చేరుకున్న దినముననే కలి ప్రవేశించాడు. ఈ విధంగా వెయ్యి దివ్యసంవత్సరాలు గడిచాక, నాలుగవ పాదంలో కృతయుగ ధర్మం ప్రతిష్ఠితం అవుతుంది.

తెభా-12-14-చ.
వర! తొంటి భూపతుల నామ గుణంబులు, వృత్తచిహ్నముల్,
సిరియును, రూప సంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్
రుస నడంగెఁ గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై
యువడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా!

టీక:- నరవర = రాజా; తొంటి = పూర్వపు; భూపతుల = రాజుల; నామ = పేరు ప్రతిష్టలు; గుణంబులు = గుణగణాలు; వృత్త = నడవడికలు; చిహ్నముల్ = లక్షణములు; సిరియున్ = ఐశ్వర్యములు; రూప = అందచందాలు; సంపదలు = సంపదలు; చెన్నగు = చక్కటి; రాజ్యముల్ = రాజ్యాలు; ఆత్మవిత్తములు = ఆధ్యాత్మికజ్ఞానసంపత్తి; వరుసన్ = క్రమముగా; అడంగెన్ = నశించినవి; కాని = కాని; అట = అక్కడ; వారల = వారి యొక్క; కీర్తులు = కీర్తి; నిర్మలంబులు = స్వచ్ఛములుగా; ఐ = అయ్యి; ఉరవడిన్ = అధికముగానే; భూమి = భూలోకము; లోన్ = అందు; నిలిచి = నిలబడి; ఉన్నవి = ఉన్నాయి; నేడునున్ = ఇవాళ్టికిని; రాజశేఖరా = మహారాజా.
భావము:- ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తనచిహ్నాలు, సిరిసంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారి పోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడ ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలచి ఉన్నాయి.

తెభా-12-15-వ.
శంతనుని యనుజండగు దేవాపియు, నిక్ష్వాకువంశజుండగు మరుత్తును, యోగయుక్తులై కలాపగ్రామనిలయులై కలియుగాంతంబున వాసుదేవప్రేరితులై, ప్రజల నాశ్రమాచారంబులు దప్పకుండ నడపుచు, నారాయణస్మరణంబు నిత్యం బొనర్చి, కైవల్యపదప్రాప్తులగుదు; రిక్కరణి నాలుగుయుగంబుల రాజులును నే నెఱింగించిన పూర్వరాజన్యులును, వీరందఱును సమస్తవస్తు సందోహంబుల యందు మమత నొంది యుత్సాహవంతులై యుండి పిదప నీ భూతలంబువదలి నిధనంబు నొందిరి; కావునఁ గాలంబుజాడ యెవ్వరికిం గానరాదు; మత్పూర్వులు హరిధ్యాన పరవశులై దయాసత్యశౌచశమదమాది ప్రశస్తగుణంబులం బ్రసిద్ధు లై నడచి; రట్లు గావున.
టీక:- శంతనుని = శంతనుని; అనుజుండు = తమ్ముడు; అగు = ఐన; దేవాపియున్ = దేవాపి; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; వంశజుండు = వంశములో పుట్టినవాడు; అగు = ఐన; మరుత్తును = మరుత్తు; యోగయుక్తులు = యోగావలంభకులు; ఐ = అయ్యి; కలాప = కలాప అనెడి; గ్రామ = ఊరిలో; నిలయులు = ఉండువారు; ఐ = అయ్యి; కలియుగాంతంబునన్ = కలియుగాంతము చివర; వాసుదేవ = కృష్మునిచే; ప్రేరితులు = ప్రేరేపింబడినవారు; ఐ = అయ్యి; ప్రజలన్ = లోకులను; ఆశ్రమాచారంబులు = చతురాశ్రమాచారముల; తప్పకుండ = లోటులేకజరుగునట్లు; నడపుచు = నిర్వహించుచు; నారాయణ = విష్ణుమూర్తిని; స్మరణంబు = స్మరించుట; నిత్యంబున్ = ఎడతెగకుండ; ఒనర్చి = చేసి; కైవల్య = కైవల్య; పద = స్థానమును; ప్రాప్తులు = పొందినవారు; అగుదురు = ఔతారు; ఈ = ఈ; కరణిన్ = విధముగ; నాలుగు = నాలుగు (4); యుగంబుల = యుగములకుచెందిన; రాజులును = రాజులు; నేన్ = నేను; ఎఱింగించిన = తెలిపిన; పూర్వ = పూర్వకాలపు; రాజన్యులును = రాజులు; వీరందఱును = వీళ్ళందరు; సమస్త = సమస్తమైన; వస్తు = వస్తువుల; సందోహంబులన్ = సమూహముల; అందున్ = ఎడల; మమతన్ = మమకారం; ఒంది = పొంది; ఉత్సాహవంతులు = ఉత్సాహముగలవారు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; పిదపన్ = పిమ్మట; ఈ = ఈ; భూతలంబున్ = భూలోకమును; వదలి = విడిచిపెట్టి; నిధనంబున్ = మరణంబును; ఒందిరి = పొందారు; కావునన్ = కనుక; కాలంబుజాడ = కాలగమనమును; ఎవ్వరికిన్ = ఎవరికికూడ; కానరాదు = గమనింపరాదు; మత్ = మా; పూర్వులు = పెద్ధలు; హరి = విష్ణుమూర్తి; ధ్యాన = ధ్యానముచేయుటలో; పరవశులు = మైమరచినవారు; ఐ = అయ్యి; దయ = దయ; సత్య = సత్యము; శౌచ = శౌచము; శమ = శమము; దమ = దమము; ఆది = మొదలైన; ప్రశస్త = శ్రేష్ఠమైన; గుణంబులన్ = గుణములతో; ప్రసిద్ధులు = పేరుపొందినవారు; ఐ = అయ్యి; నడచిరి = మెలగిరి; అట్లుగావున = అందుచేత.
భావము:- శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థు డైన మరుత్తు యోగాన్ని అవలంబించి కలాప గ్రామంలో కలియుగాంతం వరకూ ఉంటారు. వారు వాసుదేవుని వలన ప్రేరణ పొందుతారు. ప్రజలు అందరు ఆశ్రమాచారాలు పాటించేలా నడిపిస్తూ నిత్యం నారాయణస్మరణ గావిస్తూ కైవల్యం పొందుతారు. ఈవిధంగా నాలుగు యుగాల రాజులు ఇంతకు ముందు నేను చెప్పిన రాజులు అందరు లోకంలోని సమస్త వస్తువుల మీద మమకారం పెంచుకుని ఉత్సాహంతో జీవితాన్ని గడిపి ఈ భూమండలాన్ని విడిచిపెట్టి మరణం వడిలోకి చేరారు. కాలగమనాన్ని ఎవరు గమనించలేరు. మా పెద్దలు విష్ణుధ్యాన పరాయణులై తమ జీవితాలు గడిపారు. దయా, సత్యం, శౌచం, శమం, దమం మున్నగు సద్గుణాలతో ప్రసిద్ధులై కీర్తిమంతులు అయ్యారు. అందుచేత....

తెభా-12-16-క.
ర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతమును
ర్మిలి గలవారె పుణ్యు వనీనాథా!

టీక:- ధర్మము = ధర్మము; సత్యము = సత్యము; కీర్తియున్ = కీర్తియు; నిర్మలదయ = స్వచ్ఛమైనదయ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; నిరుపమ = సాటిలేని; ఘన = గొప్ప; సత్కర్మ = మంచిపనులు; అహింసావ్రతమును = అంహింసదీక్షపై; నర్మిలిన్ = ఆపేక్ష, కోరిక; కలవారె = ఉన్నవారే; పుణ్యులు = పుణ్యవంతులు; అవనీనాథ = రాజా.
భావము:- ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహా పుణ్యాత్ములు.

తెభా-12-17-తే.
జగంబేలు తొల్లిటి రాజవరులు
కావశమున నాయువు ల్గోలుపోయి
నామమాత్రావశిష్ఠు లైనారు; గాన
లుపవలవదు మమత నెచ్చట నృపాల!

టీక:- ఈ = ఈ; జగంబున్ = లోకమును; ఏలు = పరిపాలించిన; తొల్లిటి = పూర్వపు; రాజ = రాజులలో; వరులు = శ్రేష్ఠులు; కాల = కాలమునకు; వశమునన్ = లొంగి; ఆయువుల్ = ప్రాణాలు; కోల్పోయి = నష్టపోయి; నామ = పేరుకి; మాత్ర = మాత్రమే; అవశిష్ఠులు = మిగిలినవారు; ఐనారు = అయ్యి ఉన్నారు; కాన = కనుక; చెప్ప = చెప్పడానికికూడ; వలవదు = వద్దేవద్దు; మమతన్ = మమకారమును; ఎచటన్ = ఎక్కడకూడ; నృపాల = రాజా.
భావము:- మహారాజా! ఈ లోకాన్ని పాలించిన పూర్వ కాలపు రాజోత్తములు కాలానికి లొంగి, ప్రాణాలు కోల్పోయారు. కేవలం నామమాత్రావశిష్టులు అయ్యారు. మమత్వము అనేది చెప్పటానికి కూడ ఎప్పుడూ ఎక్కడా పనికి రాదు.

తెభా-12-18-వ.
గర్వాంధులయిన నరపతులం జూచి భూదేవి హాస్యంబు సేయు; “శత్రు క్షయంబు సేసి యెవ్వరికి నీక తామ యేలుచుండెద” మనియెడి మోహంబునం బితృపుత్రభ్రాతలకు భ్రాంతి గల్పించి, యన్యోన్య వైరానుబంధంబులం గలహంబు సేసి, రణరంగంబులఁ దృణప్రాయంబులుగా దేహాదులు వర్జించి, నిర్జరలోకప్రాప్తులైన పృథు యయాతి గాధి నహుష భరతార్జున మాంధాతృ సగర రామ ఖట్వాంగ దుందుమార రఘు తృణబిందు పురూరవ శంతను గయ భగీరథ కువలయాశ్వ కకుత్థ్స నిషధ హిరణ్యకశిపు వృత్ర రావణ నముచి శంబర భౌమ హిరణ్యాక్ష తారకాదులైన రాజులును, దైత్యులును ధరణికి మమత్వంబునం జేసి కదా కాలవశంబున నాశంబు నొంది? రది యంతయు మిథ్యగాన సర్వంబునుం బరిత్యజించి “జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ” యని నిరంతర హరి కథామృతపానంబు సేసి, జరా రోగ వికృతులం బాసి హరిపదంబు నొందు" మని చెప్పి.
టీక:- గర్వ = గర్వముచేత; అంధులు = కన్నుమిన్నుకాననివారు; అయిన = అగు; నరపతులన్ = రాజులను; చూచి = చూసి; భూదేవి = భూదేవి; హాస్యంబు = చులకనగాచూచుట; చేయున్ = చేస్తుంది; శత్రు = శత్రువులను; క్షయంబు = సంహరించుట; చేసి = చేసి; ఎవ్వరి = ఏ ఒక్కరి; కిన్ = కి; ఈక = ఇవ్వకుండ; తామ = తామే; ఏలుచుండెదము = పాలిస్తూ ఉంటాము; అనియెడి = అనెడి; మోహంబున్ = మోహముతో; పితృ = తండ్రి; పుత్ర = కొడుకు; భ్రాతల్ = సోదరుల; కున్ = కు; భ్రాంతి = ఆశ; కల్పించి = పుట్టించి; అన్నోన్య = ఒకరిపైనొకరికి; వైర = శత్రుత్వపుభావాలకి; అనుబంధంబులన్ = లొంగిపోతూ; కలహంబున్ = జగడములు; చేసి = పెట్టుకొని; రణరంగంబులన్ = యుద్ధాలలో; తృణప్రాయంబులుగా = గడ్డిపరకలలాగ; దేహ = శరీరాలు; ఆదులు = మున్నగునవి కూడ; వర్జించి = విడిచిపెట్టి; నిర్జరలోక = స్వర్గ {నిర్జరలోకము - నిర్జరుల (దేవతల) లోకము, స్వర్గము}; ప్రాప్తులు = పొందినవారు; ఐన = అగు; పృథు = పృథువు; యయాతి = యయాతి; గాధి = గాధి; నహుష = నహుషుడు; భరత = భరతుడు; అర్జున = కార్తవీర్యార్జునుడు; మాంధాతృ = మాంధాత; సగర = సగరుడు; రామ = రాముడు; ఖట్వాంగ = ఖట్వాంగుడు; దుందుమార = దుందుమారుడు; రఘు = రఘువు; తృణబిందు = తృణబిందువు; పురూరవ = పురూరవుడు; శంతను = శంతనుడు; గయ = గయుడు; భగీరథ = భగీరథుడు; కువలయాశ్వ = కువలయాశ్వుడు; కకుత్థ్స = కకుత్థ్సుడు; నిషధ = నిషధుడు; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుడు; వృత్ర = వృత్రుడు; రావణ = రావణుడు; నముచి = నముచి; శంబర = శంబరుడు; భౌమ = భౌముడు; హిరణ్యాక్ష = హిరణ్యాక్షుడు; తారక = తారకుడు; ఆదులు = మున్నగువారు; ఐన = అయిన; రాజులునున్ = రాజులు; దైత్యులునున్ = రాక్షసులు; ధరణి = రాజ్యముల; కిన్ = అందలి; మమత్వంబునన్ = మమకారముల; చేసి = చేత; కదా = కనుకనే; కాల = కాలానికి; వశంబునన్ = లొంగి; నాశంబున్ = నాశనము; ఒందిరి = ఐపోయారు; అది = అది; అంతయు = సమస్తము; మిథ్య = అసత్యము; కాన = కాబట్టి; సర్వంబున్ = సమస్తతగులములు; పరిత్యజించి = విడిచిపెట్టి; జనార్దన = జనార్దనుడా {జనార్దనుడు - జనులను రక్షించువాడు, విష్ణువు}; వైకుంఠ = వైకుంఠుడా {వైకుంఠుడు - వైకుంఠమున వసించువాడు, విష్ణువు}; వాసుదేవ = వాసుదేవా {వాసుదేవుడు - అంతరాత్మలలో వసించెడి దేవుడు, విష్ణువు}; నృసింహ = నరసింహుడా; అని = అని; నిరంతర = ఎల్లప్పుడు; హరి = విష్ణుమూర్తి; కథ = కథలు అనెడి; అమృత = అమృతమును; పానంబు = ఆస్వాదించుట; చేసి = చేసి; జర = ముసలితనము; రోగ = జబ్బులు; వికృతులన్ = వికారములను; పాసి = దూరము చేసికొని; హరిపదంబున్ = పరమపదమును; ఒందుము = పొందుము; అని = అని; చెప్పి = చెప్పి.
భావము:- గర్వవశులై కన్ను మిన్ను కానక సంచరించే రాజులను చూసి భూదేవి నవ్వుకుంటుంది. “శత్రువులను సంహరించి, భూమిని గ్రహించి ఎవరికీ ఇవ్వకుండ, తామే ఏలుకుంటూ ఉంటాం.” అనే మోహంతో ఉంటారు. అదేవిధంగా తండ్రీకొడుకులకు, అన్నదమ్ములకు ఆశ పుట్టించి, పరస్పరం వైరాలు పెంచుకుంటారు. కలహించి యుద్ధరంగంలో గడ్డిపరకలను విడిచినట్టు శరీరాలను విడిచిపెట్టి దేవలోకాన్ని పొందిన పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, రఘువు, తృణబిందువు, పురూరవుడు, శంతనుడు, గయుడు, భగీరథుడు, కువలయాశ్వుడు, కకుత్థ్సుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు, హిరణ్యాక్షుడు, తారకుడు, మొదలైన రాజులు, రాక్షసులు రాజ్యం మీద మమత్వం పెంచుకుంటూ, కాలానికి లొంగి నాశనం అయిపోయారు. ఇది అంతా ఉత్తి మిథ్య తప్పించి యదార్థం కాదు. కాబట్టి వీటి అంతటినీ విడిచిపెట్టి “జనార్ధన, వైకుంఠ, వాసుదేవ, నరసింహ” అని ఎల్లప్పుడూ శ్రీహరి కథాసుథలు ఆస్వాదిస్తూ ముసలితనం, రోగం అనే వికారాలను దూరం చేసుకొని విష్ణుస్థానమును చేరుకో” అని శుకముని పరీక్షిత్తుకు చెప్పి, మరల ఇలా చెప్పసాగాడు.

తెభా-12-19-తే.
"త్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు;
న్నుతుండగు నెవ్వఁడు కల దిశల;
ట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
ద్గుణంబులు వర్ణింపు రణినాథ! "

టీక:- ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = కీర్తనీయుడు; అనన్ = అనగా; ఎవ్వడు = ఎవరైతే; ఉన్నవాడు = ఉన్నాడో; సన్నుతుండు = స్తుతింపబడెడివాడు; అగున్ = అయిన; ఎవ్వడు = ఎవరో; సకల = సర్వ; దిశలన్ = దిక్కులందును; అట్టి = అటువంటి; పరమేశ్వరుని = భగవంతుని; చిత్తము = మనస్సు; అందున్ = లోపల; నిలిపి = నిల్పుకొని; తత్ = అతని; గుణంబులున్ = గుణములను; వర్ణింపు = కీర్తింపుము; ధరణీనాథ = రాజా.
భావము:- “ఓ మహారాజా! ఉత్తములచే కీర్తింపతగిన వాడు, సర్వదిక్కులలో స్తుతింపబడువాడు అయిన పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను కీర్తించు.”