నేటి కాలపు కవిత్వం/నిదర్శనాధికరణం

శ్రీ ర స్తు.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

నిదర్శనాధికరణం

నిదర్శనపరంపరలు.

విస్తరదోషంలో నిదర్శనపరంపర యిమిడివున్నా దీన్ని ప్రత్యేకించి తెలపవలసినంత హెచ్చుగా ఈ కాలపుకృతుల్లో వ్యాపించివున్నది.

ఈ దోషాన్ని వివరిస్తాను; ఒకసంగతిని స్ఫుటపరచడానికి నిదర్శనం చలా తోడ్పడుతుంది.

"క్వ సూర్య ప్రభవో వంశః క్వచాల్పవిషయా మతిః"
"తితీర్షుర్దుస్తరం మోహా దుడుపేనాస్మి సాగరం" (రఘు)
సూర్యప్రభవమైన ఆ రఘువంశ మెక్కడ?
అల్పవిషయమైన నామతియెక్కడ?
దుస్తరసముద్రాన్ని పుట్టితో దాటనెంచాను

అని అన్నప్పుడు కాళిదాసు చేయదలచినకార్యంయొక్క దుష్కరత్వం యెంతో హృదయంగమంగా వ్యక్తమవుతున్నది. ఇక పైననిదర్శనాలు చెప్పడం అధిక ప్రసంగమే అవుతున్నది.

భావం హృదయంగమంగాస్ఫుటపడ్డతరవాత దాన్ని యింకా చెప్పడం విసుగును రోతను పుట్టిస్తుంది. ఒకవస్తువును వెడల్పుగా పరచి సాగగొట్టిన కొద్దీదానికి బలంతగ్గి పలచబడిపోతుంది. భావాన్ని వ్యక్తదశకు తెచ్చి వదలితే అఖండబలంతో హృదయాన్ని అధిష్ఠిస్తుంది. లేదా కొట్టికొట్టి వదలితే పలచబడి నీరసిస్తుంది. అందుకే నిదర్శనపరంపర దోషమని హేయమని చెప్పుతున్నాను. హేయం గనకనే కళాదాసాదులు ఉత్తమమార్గమవలంబించి భావవ్యక్తిచేస్తూ కావ్యసౌందర్యాన్ని మనకు ప్రసాదించారు. "దుస్తరసాగరాన్ని అజ్ఞానంచేత పుట్టితో దాటదలచాను" అని భావం వ్యక్తంచేశాడు కాని కొట్టికొట్టి

"హిమవత్పర్వతాన్ని చిన్ననిచ్చెనతో యెక్కదలచాను
 అఖండవాయుగోళాన్ని అరచేతితో పట్టదలచాను
 సముద్రసికతాకణాలనుసాంతం లెక్కించదలచాను"

అని యీతీరున ఉడుకుసోదిలోకి దిగలేదు.

"అపూర్వకర్మచండాల మయి ముగ్ధే విముంచ మాం
 శ్రితాసి చందనభ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం". (ఉత్తర)

(ఓప్రియురాలైనముగ్దా! అపూర్వకర్మ చండాలుణ్నీ నన్ను వదలు చందనవృక్షమనుకొని దుర్విపాకమైన విషవృక్షాన్ని ఆశ్రయించావు). అని భవభూతి శ్రీరాముడిచేత అనిపిస్తాడు. అంతేగాని సాగదీసి

"మణి అనుకొని మహోగ్రాగ్నినిచేపట్టినావు"
 

అని క్రూరసర్పాన్ని మెడవేసుకున్నావు"


అని వదరించడు

అసత్కావ్యమని అహోబలపండితుడన్న ముద్రారాక్షసంలొ సయితం కోపసంరంభసమయంలో కూడా

"ఆస్వాదితద్విరదశోణితశోణశోభాం
 సంధ్యారుణామివ కలాం శశలాంఛనస్య
 జృంభావిదారితముఖస్య ముఖాత్ స్ఫురంతీం
 కో హర్తు మిచ్ఛతి హరేః పరిభూయ దంష్ట్రాం" (ముద్రా)

(యేనుగునెత్తురు ఆస్వాదించి చంద్రుడి సంధ్యారుణకాంతివలె యెర్రగావున్న సింహపుకోరను ఆవలిస్తే బయటికి ప్రకాశిస్తున్న దాన్ని ఆసింహపునోటినుండి యెవడు పరాభవించి పెరకగోరుతున్నాడు) అని ఒక్క నిదర్శనంతోనే రాక్షససాహసికత్వాన్ని నిరూపిస్తాడు.

"నందకులకాలభుజగీం
 కోపానలబహుళనీల ధూమలతాం
 అద్యాపి బధ్యమానాం
 వధ్యః కో నామ నేచ్ఛతి శిఖాంమే" (ముద్రా)

(కోపానలబహుళనీలధూమలత నందకులానికి నల్లతాచు అయి యిప్పటికీ కట్టబడుతున్న నాశిఖను వధ్యుడెవడు ఇచ్చగించడు) అని మలయ కేతునిగ్రహాన్ని సూచించి దాన్ని యింకొక్కనిదర్శనంతో

"ఉల్లంఘయన్మమ సముజ్జ్వలతః ప్రతాపం
 కోపస్య నందకులకాననధూమకేతోః
 సద్యః పరాత్మపరిమాణవివేకమూఢః
 కః శాలభేన విధినా లభతాం వినాశం" (ముద్రా)

(నందకులకానన ధూమ కేతువయిన నాప్రజ్వలించే కోపప్రతాపాన్ని ఉల్లంఘిచి యెవడు పరబలమెరుగని మూఢుడు మిడతవలె వినాశం పొందుతాడు) అని ఉపోద్బలంచేస్తాడు.

దుఃఖం అతిశయించి కొంత అధికాలాపం ఆరంభమయ్యే ఘట్టంలో కాళిదాసు రతిచేత భర్తతోగూడా భార్యపోవాలె ననేఅభిప్రాయానికి

"శశినా సహ యాతికౌముదీ సహమే ఘేన తటిత్ ప్రలీయతే." (కుమా)

(చంద్రుడితో వెన్నెలపోతుంది. మేఘంతో మెరుపులీన మవుతుంది) అని రెండునిదర్శనాలకంటె యెక్కువచెప్పించడు. ఇట్లా చెప్పినా "పునఃపునర్దీప్తి" అనేదోషం రతివిలాసానికి సంక్రమించిందని మమ్మటుడన్నాడు. అది వేరేవిషయం.

కాళిదాసు సాధారణంగా ఒకటి, రెండు, లేదా మూడు నిదర్శనాలను చెప్పుతాడు. నిదర్శనబాహుళ్యం అరుదు యెక్కడనైనా యిప్పటివలె నిదర్శనపరంపరలు అధికంగావుంటే అవి దోషమేగాని గుణంగాదు.

నిదర్శనపరంపరలు మామాలుప్రజలకు వుడుకెక్కించే సభల్లో అవసరమైతే కావచ్చునుగాని పరిణతబుద్దులకు ఉద్దిష్టమైన కావ్యాల్లో విసుగూ రోతా పుట్టిస్తవి శ్లేషలకు వాక్యాల ఉన్మగ్ననిమగ్నతలకు యత్నిస్తూ సర్వార్ధాలను గార్లించ ఉద్యుక్తమైన కాదంబరిలోని నిదర్శనపరంపరలు ప్రత్యేకించి విమర్శించదగ్గవి గనుక వాటివిచారణ యిక్కడ వదులుతున్నాను. శాస్త్రాల్లో విషయం స్ఫుటపరచడానికి ఆవశ్యకత వస్తుంది. వాక్యపదీయకారుడు ద్వితీయకాండంలో

"ప్రమాణత్వేన తాం లోకః సర్వః సమనువశ్యతి,
 సమారంభాః ప్రతీయన్తేతిరశ్చామపి తద్వశాత్." (వాక్య)

(ఆప్రతిభయే ప్రమాణంగా లోకం చూస్తున్నది. ఆప్రతిభావశోననే తిర్యక్కులకుగూడా ప్రవృత్తిప్రతీతమవుతున్నది.} అని ప్రతిభను ప్రతిపాదించి

"స్వరప్రవృత్తిం వికురుతే,
 మధౌ పుంస్కోకిలస్యకః" (వాక్య)

(మధుమాసంలో కోకిలకు పంచమస్వరవిరావం యెవడు కలిగిస్తున్నాడు? ప్రతిభయే.)

అని నిదర్శనం చెప్పుతాడు. కాని శాస్త్రం గనుక .యింకాస్ఫుట పడడానికి,

"జంత్వాదయః కులాయాదికరణే కేన శిక్షితాః,
 ఆహార ప్రీత్యభిద్వేష ప్లవనాదిక్రియాసు కః.
 జాత్యన్వయప్రసిద్దాసు ప్రయోక్తా మృగపక్షిణాం." (వాక్య)

(సాలీడు మొదలైనవాటికి గూళ్లు నిర్మించడం యెవరునేర్పినారు? ఆహారం, ప్రీతి, ద్వేషం, యీదడం మొదలయిన జాత్యన్వయ ప్రసిద్దక్రియలలో మృగపక్షులను యెవడు నడిపేవాడు) అని నిరూపిస్తాడు. అనాది ప్రతిభావశంవల్ల ఈక్రియలు ప్రేరితమై ప్రతీతమవుతున్న వని వీటికి జన్మాంతరంలో శబ్దశ్రవణం బోధహేతువని శ్రుతాశ్రుతశబ్దాలే సర్వప్రవృత్తికి హేతువని యిట్లా శబ్దంవల్ల కలిగే యితికర్తవ్య తారూపమైనదే. వాక్యార్థ మని అదే భగవతి ప్రతిభ అని ఆపంక్తుల అభిప్రాయం. శాస్త్రం గనుక మూడునిదర్శనాలు చెప్పి అభిప్రాయం స్ఫుటపరచాడు. ఇట్లానే సర్వం స్వభావంచేతనే ప్రవృత్తమవుతున్నది గాని వేరే నియంత లేడనే చార్వాకసిద్ధాంతం మాధవాచార్యులవారు సర్వదర్శనసంగ్రహంలో ప్రతిపాదిస్తూ ఉదాహరించిన అభియుక్తోక్తి, అభిప్రాయం స్ఫుట పరచడానికి,

"అగ్నిరుష్ణో జలం శీతం శీతస్పర్శ స్తథానిలః,
 కేనేదం చిత్రితం తస్మాత్ స్వభావాత్ తద్ వ్యవస్థితిః" (సర్వ)

(అగ్ని, వుష్ణం. జలం, శీతం, గాలి. శీతస్పర్శం యిదంతా యెవరు చిత్రించారు? స్వభావంవల్లనే యిదంతా యేర్పడుచున్నది). అని నిదర్శనాలను చెప్పుతున్నది. ఇవి శాస్త్రసందర్భాలు. అక్కడ సయితం మితత్వాన్ని అతిక్రమించలేదు. పరిణతబుద్దులకు భావాన్ని అందిస్తూ రసాస్వాదం కలిగించవలసిన కావ్యంలో కాళిదాసాదులు ఔచిత్యం పరిపాలించి నిదర్శనపరంపరలు లేకుండా కావ్యసౌందర్యాన్ని కాపాడినారు. కాని యీకాలపుకృతికర్తలకు యీవివేకం నశించింది. నిదర్శనం మొదలు పెట్టితే వుడుకుబోతువుపన్యాసంలోకి దింపి విసుగూ రోతా పుట్టిస్తున్నారు.

దుఃఖంలో ఆశ. దాన్ని నిరూపించడానికి కృష్ణపక్షకర్త

"కన్నీటికెరటాల వెన్నెలేలా?
 నిట్టూర్పుగాడ్పులో నెత్తావియేలా ?"

అని అన్నాడు. ఇంతటితో వూరుకోలేదు.

"ప్రళయకాలమహోగ్ర భయదజీమూతోరు
 గళఘోరగంభీర ఫెళ ఫెళార్భటులలో మెర పేలా"

అని ఉడుకెక్కించాడు. ఇంకో ఊరుకోలేదు.

"అశనిపాతమ్ములో నంబువేలా?"

అన్నాడు. ఇంకా ఊరుకోలేదు.

"హాలాహలమ్ములో నమృతమేలా"
 
అని ఇంతటితో చాలించలేదు.

"ప్రబలనీరంధ్రాభ్ర జనితగాడధ్వాంత,
నిబిడ హేమంత రాత్రీ కుంతలములలో చుక్కేలా"

అని అన్నాడు. ఇంతటితో విరమించలేదు.

"శిథిలశిశిరమ్ములో జివురేలా?"
 
అన్నాడు. కాని ఊరుకోలేదు.

"పాషాణపాళిపై బ్రసవమేలా?"
 
అని అన్నాడు. ఇంకా వదలలేదు.

"వికృతక్రూరక్షుధాక్షుభితమృత్యుకఠోర
 వికటపాండురశుష్క వదనదంష్ట్రాగ్నిలో నవ్వేలా"

అని అన్నాడు. ఇప్పటికైనా విడిస్తే చాలు నని అనుకొన్నాను గాని ఆయన అట్లా విడువదలచలేదు.

"కన్నీటికెరటాల వెన్నెలేలా?
 నిట్టూర్పుగాడ్పులో నెత్తావియేలా"

అని వదలినాడు. ఈతీరుగా నీదర్శన పరంపరలు నిండినవి.

"ఆకులో నాకునై పూవులో పూవునై
 కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
          ఈయడవి దాగిపోనా?"

అని చెప్పి ఇట్లా అయిదుసార్లు 'అడవిలో దాగిపోనా' అని 'ఆకునై కొమ్మనై, పూవునై, రెమ్మనై,' అని యింకా యేమేమో అని ఊరుకుంటాడు.

ఈకాలపుపద్యాలకు ఈదోషం హెచ్చుగా కనబడుతున్నది.

ఆంధ్రహెరాల్డులో, బసవరాజు అప్పారావుగారు

"ఆమబ్బు యీమబ్బు ఆకాశమధ్యాన
 అద్దు కున్నట్లు మనమైక్యమౌదామే".

అని ప్రియురాలిని ఉద్దేశించిన మాటలను అంటారు. ఆమాట అని ఈకృతికర్త అంతటితో వూరుకోడు.

"ఆతీగె యీతీగె, ఆవాగు యీవాగు, అమాట యీమాట" అని మొత్తం నాలుగునిదర్శనాలు వేసి పూర్తి చేస్తాడు.

తీగె తీగెకలిసినా వాగువారు కలసినా అంతగా భావభేదంలేని యీనిదర్శనపరంపరలు నిరర్థక మంటున్నాను. సాహితిలో ఒకరు

"సంతత మడంగి యున్నె? నిసర్గగుణము
 ఎంత ప్రతికూల వృత్తిలో నిరికియున్న
 ఎంత యుత్సాహ జలధార లింకుచున్న
 హృదయ మందున కవితాంశదృఢతనుండ
 ఉండునే యది యుప్పొంగ కుండనెపుడు"

అని తన దుర్నివారకవిత్వాన్ని ప్రతిపాదిస్తాడు. దీనికి

"తరణి కిరణంబు లపుడప్డు తప్తుజేయ
 కాలమేఘాళి సారెకు గప్పుచుండ
 కృష్ణపక్షము లెపుడు కృశింపజేయ
 విమల కమనీయ కౌముదీ హిమకరుండు
 శారద నీశీధినుల వేదజల్లకున్నె"

అని అయిదుపంక్తుల్లో ఆకృతికర్త ఒకనిదర్శనం చెప్పుతాడు. ఇది ప్రకృతిశాస్త్ర ప్రథమపాఠం ఫక్కిగాని కావ్యఫక్కిగాదు. అయినా యింతటితో వూరుకోడు.

"గండశైలము లెన్నొ మార్గమునబడిన
 ఉరునికుంజంబులెన్నొ క్రిక్కిరిసియున్న.
 తీక్ష్ణ కిరణము లెంతబాధించుచున్న
 ఝరమతిరయంబుతోడ వర్షాగమమున
 ఇరుకెలంకులు తెగ బ్రవహింపకున్నె".

అని నిదర్శనాన్ని సాగదీస్తాడు. ఇంకా వూరుకోడు.

"అనిల మామోదమును సతం బాహరింప
 మార్దవము నాతవము రూపుమాపుచుండ
 భృంగములు మకరందము బీల్చుచుండ
 కోమలంబుగ విచ్చి పరీమళంబు
 కుసుమము వసంత వేళనువిసరకున్నె"

అని తిప్పితిప్పి చెప్పుతాడు. ఇంకా వదలడు.

"ప్రేమతో గన్నతల్లి తన్వీడి చనిన
 విరసకంఠాల నడుమను బెరగుచున్న
 అరిభయంబుస నాకుల నడగియున్న
 తరుణ మరుదెంచు చోగలస్వరముతోడ
 ప్రమదభరమున కోకిల పాడకున్నె "

అని వూరుకుంటాడు.

ఈ కవికి వున్న యింతదుర్నివారకవిత్వం ఆంధ్రదేశానికి లభించిందేమో నని యెక్కడనైనా వున్నదేమో నని వెదుకుతున్నాను. శబ్దార్థాలను భావాన్ని అందించేమట్టుకు స్వీకరిస్తూ ఆనందఫలకమైన ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తులను రసాస్వాదప్రదానపూర్వకంగా శ్రోతలకు ప్రసాదించే పరమార్థానికి ఉన్ముఖమై వుండవలిసిన కావ్యం జాబితాలను, తయారుచేస్తున్నప్పటి పతితదశ వాస్తవంగా సంతాపకరమైనది.

ఆక్షేపం.

అవునయ్యా. ఇప్పటిది భావకవిత్వమని అది కొత్తదని మేమన్నాము. దాన్ని మీరు కాదనలేదు. భావకావ్యమంటనే యేకభావాన్ని ప్రతిపాదించేది. ఒకటేభావాన్ని అనేకభంగుల ప్రతిపాదించారు. దీంట్లో దోషమేమిటి? అని అంటారా.

సమాధానం.

చెప్పుతున్నా ను, భావకావ్యాన్ని ముందు విచారిస్తాను. ప్రేమ, భక్తి, వంటి చిరావస్థానంగల మనోవృత్తి భావం. ఇదే కావ్యానికి విషయం. నిద్రపోతున్నాను: అన్నందిన్నాను; అనే ఒక వాక్యార్థంకాదు భావం. అదేభావమని వొప్పుకున్నా ఆభావంవల్ల కలిగేచేష్టలు వివిధసందర్భాల్లో వేడలేసంభాషణలు, తత్సంబంధి మనో వ్యాపారాలు, ఇవన్నీ ప్రతిపాదించడం భావ ప్రతిపాదనంగాని ఒకటే అభిప్రాయానికి తిప్పితిప్పి పది పన్నెండు ఉదాహరణా లియ్యడం గాదు. ఇట్లా ఉదాహరణాలు అయిదారో పది పన్నెండో కలిస్తే ఆది వోక కావ్యమనే అభిప్రాయం గూడా ఈరోజుల్లో వ్యాపించింది.

చాటుపద్యాలు.

వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లోవలె ఉదాహరణలు గుప్పడం కవిత్వంగా దని నిరూపించాను. అయినా ఒకభావాన్ని పరిపోషం చేసేటప్పుడు అంగంగా అవసరమైనంతమట్టుకు యివి చెప్పితే ఒకప్పుడు తగివుండవచ్చునుగాని,

"నిట్టూ ర్పుగాడ్పులో
 ఫెళఫెళార్భటులలో
 హాలాహలమ్ములో

రాత్రీకుంతలములలో
శిశిరమ్ములో!!

అని యిట్లా ఉదాహరణలు గుప్పించి, అది కావ్యమవుతుందని మురియడం అనుచితమైనవని.

ఆక్షేపం.

అవునయ్యా. "వాక్యం రసాత్మకంకావ్యం" అని విశ్వనాథు డన్నాడు. ఒక వాక్యమైనాచాలు, రసవంతమైనది. అదేకావ్యం. అనేక వాక్యాలు వుండవలసిన పనిలేదు. అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను; వాక్యం రసాత్మకం కావ్యం అంటే మహావాక్యం అని అభిప్రాయం. లేదా రసాత్మక వాక్యం కావ్యాంశం అని అయినా అభిప్రాయం. మీరుచెప్పిందే ఆవాక్యానికి అర్థమైతే ఒకవాక్యం వ్రాసి కవిగావచ్చును.

వాక్యంతో గూడా పనిలేదు.

"తదదోపౌ శబ్దార్థౌ సగుణావనలంకృతీపునః క్వాపి". (కావ్య) అని సాహిత్యవేత్తలంటారు.

శబ్దార్థౌ అంటే శబ్దం అర్థం రెండు అని అభిప్రాయం. శబ్దానికి అర్థం యెట్లానైనా వుంటుంది గనుక ఒక మంచిశబ్దం రచిస్తే చాలు. కావ్య మౌతుంది. రచయిత కవి అవుతాడు.

"మందః కవి యశః ప్రార్థీ"

అని కాళిదాసువంటివాడు చెప్పడం అనవసరం. ఇంతమంది ఇంత తేలికగా కవులవుతుంటే అతనికి జంకెందుకు? ఇందు వదన ఇది ఒకకావ్యం; సుందరాంగి ఒక కావ్యం; ఇందువదన కౌగిలియ్యవే సుందరాంగి, ముద్దుపెట్టవే; ఇవి రెండు మహాకావ్యాలు అని నిర్ణయించవచ్చును. కాని యివన్నీ తెలివితక్కువమాటలు, ఒక భావంగాని రసంగాని పరిపోషం చెందినప్పుడే కావ్యత్వ సిద్దికలుగుతున్నది. కాదా అవి కొన్ని మాటలే అవుతున్నవి గాని కావ్యంగాదు. ఇందుకే "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న సాహిత్యదర్పణకారుడు,

"తత్ర వాక్యం యథా శూన్యం వాసగృహం" ఇత్యాది "మహావాక్యం యథా రామాయణ మహాభారత రఘువంశాది" (సాహి)

అని వినిపిస్తున్నాడు.

"వాక్యం రసాత్మకం కావ్యం" అన్నప్పుడు కావ్యాంశం వాక్యంలో వుంటుందని అభిప్రాయం. యేకవాక్యమే కావ్యమైతే, మేఘసందేశాదులు మహామహాకావ్యాలు గావలెగదా. మేఘసందేశాదులు ఖండకావ్యాలని విశ్వనాథుడు చెప్పుతున్నాడు. మేఘసందేశంలోని ఒకశ్లోకమే కావ్యమైతే మేఘసందేశమంతా కలిసి ఖండకావ్య మెట్లా అవుతుంది? రసభావాలు పరిపోషంచెంది శ్రోతకు మనః పరిణతి కలిగించడంలో కావ్యత్వసిద్ది యేర్పడుతున్నది. చిరావస్థానం లేని అభిప్రాయాన్ని తెలిపే వకవాక్యంగాని ఒకమాటగాని అట్టాటిపనికి సమర్థంగావు. సాహిత్య గ్రంథాల్లో ఇది రసం, ఇది భావం, ఆని ఒక్కొక్కశ్లోకాన్ని ఉదాహరించడం, ఉపదేశోపాయమని తెలుసుకోవలెను. దాంట్లో రసాంశ, భావాంశ, వున్న దని తెలుసుకోవలెను. అదీ గాక ఈభావం, రసం. భావత్వంచేత, రసత్వంచేత, మాత్రమే గ్రాహ్యం గావు. ఆధారంయొక్క గుణగుణాలు ఆధేయంమీద ముద్రితమవుతున్నవి. ఈసంగతి ముందింకా స్పష్టంగా విశదీకరిస్తాను. రసం, భావం గ్రాహ్యంకావడానికి తదాధారమైన ఆలంబనం విదితమై అవి పరిపోషం చెందడానికి సాంగరూపసిద్ధి కలిగేవరకు ఉపస్థితంకావలెను. అప్పుడే మనకు ఉత్తమకావ్యం సిద్ధించగలదు. అట్లాకాక ఆ చిరావస్థానమైన ఒక అభిప్రాయానికి నాలుగైదు ఉదాహరణాలు వ్రాసి ఆ మాటలను ప్రత్యేకంగా ఒక పేజీమీద ముద్రించినమాత్రాన అది ఒకకావ్యంగాదు. అవి యింపుగావుంటే వాటిని కావ్యాంశగల చాటూక్తు లనవచ్చును. ఆమనోహరత్వం గూడా లేకుంటే అవి పనికిమాలిన ఛాందసపుమాట లవుతవి. కృష్ణపక్షంలోని విరిచేడె, విశ్రాంతి, శాపం, అబ్బ, తొలకరిలోని మరపు, గడ్డిపూలు, మొదటిముక్క, ఇట్లాటివన్నీ చాటూక్తులైనా అవుతవి. ఛాందసపు మాటలైనా అవుతవి. ఈకాలపుఖండ కృతుల్లో ఛాందసపుమాటలే హెచ్చుగా కనబడుతున్నవి. యెంకిపాటల వలె కావ్యత్వ సిద్ధిపొందినవి అరుదుగా కనబడుతున్నవి.

ఆక్షేపం.

అవునయ్యా, ఈ రోజుల్లో మీరన్నట్లు స్వరూపసిద్ధి అయ్యేదాకా కావ్యం వ్రాస్తే చదవడానికి యెవరికీ తీరదు. అదిగాక పత్రికలవారికి చిన్న చిన్న పద్యాలు పద్యసంచయాలు అయితే అనుకూలిస్తవి, కనకనే చిన్న కృతులు వ్రాస్తున్నారు, అదిగాక ప్రజలరుచులు చిన్న వాటిమీదనే వున్నవి. అని అంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. తీరిక లేదనేమాట నేనొప్పుకోను. యేమితోచక యెందరోకాలాన్ని యెట్లానో నెట్టడం మన మెరుగుదుము. చీట్లాడడం యెరుగుదుము. కనుక తీరికెలేదంటే అంగీకరించజాలను. కావ్యాసక్తి గలవారిలో కొందరైనా తీరికగలవారున్నారు. ఇఘ పత్రికలవారికి తీరిక లేనివారికి చిన్నచిన్న వి కావలెనంటె కావలసి వుండవచ్చును. అంతమాత్రం చేత ఉత్తమకవిత్వ మెట్లా అవుతుంది? ఆపద్యాలు ఉత్తమకావ్య మెట్లా అవుతవి? వార్తలవలెయిది చదివి పారవేయడానికి పనికివస్తవంటే, ఇవి పత్రికలవారి వ్యాపారానికి తీరికెలేనివారికి వేసే చిల్లరముక్కలంటే. నాకు విప్రతిపత్తిలేదు. అప్పుడు నావిచారణ ఆవశ్యకంగాదు. ఇక ప్రజలరుచులంటారా? ప్రజలరుచులకు సేవచేయడానికి కవులు వేశ్యలూ, వర్తకులూగారు గదా.

"యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే" (ధ్వన్యా)

(కవికి విశ్వమెట్లా ఇష్టమైతే అట్లా పరివర్తనపొందుతుంది) అని ఆనందవర్ధను డన్నట్లు సర్వలోకాన్ని వశీకరించి ఉత్తమమార్గాన నడపవలసినకవి ప్రజలరుచులకు సేవచేసే వేశ్యాపదవిని వణిక్థ్సానాన్ని పొందడం హైన్యం.

అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో నిదర్శనాధికరణం సమాప్తం.