తెలుగువారి జానపద కళారూపాలు/సానివారు

సానివారు

ఆంధ్రదేశంలో దేవ దాసీలూ, భోగం సానులూ వుండటం చాల మందికి తెలుసు. కాని మరి కొందరు సానులు కూడా జాతి జీవనంలో కళా సంస్కృతులకు దోహదం చేశారు. పూర్వకాలం నుంచీ కొన్ని కులాలలో ఆడపిల్లలను అవివాహితలుగానే విడిచి పెట్టే ఆచారం దేశంలో వుంది. అయితే అవివాహితలు విచ్చల విడితనం లేకుండా కట్టుబాట్లకు లోబడి సామాజిక కార్యక్రమాలను నెరవేర్చేవారు.

ఆనాటి మూఢనమ్మకాలతో వున్న గ్రామీణ ప్రజలు నిర్వహించే జాతర్లలో, దేవతల కొలువుల్లో జరపవలసిన తంతును వీరే నిర్వహించేవారు. ప్రత్యేక నృత్యాలను వీరే చేసేవారు. ఈ నాటికీ జక్కుల సాని,బసివి, మాతంగి మొదలైన వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే పురాతన సాంఘిక నియమాల వల్లే సానివారిగా ఏర్పడ్డారని తెలుస్తుంది.

క్రిందటి శతాబ్దంలో జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఆరు తెగల సానులు లెక్కకు వచ్చినట్లు ఆరుద్రగారు పరిశీలించారు. వారు "తురక సానులూ, గొమ్మన సానులూ, భోగం సానులూ, మంగల భోగాలూ, మాదిగ భోగాలూ అనే ఆరు తెగల సానులు లెక్కకు వచ్చారు. వీరందరూ నృత్య సంప్రదాయలను పోషించినవారే.