తెలుగువారి జానపద కళారూపాలు/జోగాట

జోగాట

ఆంధ్ర దేశంలో ఇతర ప్రాంతాల్లో అంతగా ప్రచారంలో లేని ఈ జోగాట తెలంగాణాలో ప్రచారంలో వుంది. హరిజనులలో ఒక తెగకు సంబంధించిన వారే ఈ జోగువారు. వీరు డప్పు వాయిద్యంతో పాటు నృత్యాన్ని చేస్తారు. ఇలా చేసే వారిని సర్కారాంధ్ర దేశంలో మాదిగవారంటారు. వీరు చెప్పులు కుట్టటంతో పాటు చర్మ కారులుగా వృత్తిని సాగిస్తారు. చాటింపు వేయడం, జాతర్లకూ, వుత్సవాలకూ డప్పు వాయిద్యాలను వాయించుట చేస్తుంటారు.

తెలంగాణాలో వున్న జోగువారు డప్పుల వాయిద్యంతో పాటు నైపుణ్యంగా నృత్యం చేస్తారు. వారి తెగలో ఎవరైనా మరణిస్తే వారిని శ్మశాన వాటికకు ఉత్సవంగా తీసుకుపోతూ డప్పుల వాయిద్యంతో నృత్యం చేస్తారు.

కేవలం నృత్యం చేయటమే కాక, నృత్యంతో పాటు గొల్ల కలాపంలో మాదిరి పిండోత్పత్తి క్రమాన్ని వివరంగా వివరిస్తారు. జీవుడు మాతృ గర్భంలో పిండోత్పత్తిలో ప్రవేశించింది మొదలూ నవమాసక్రమంలో పిండం యెక్క చలనాన్నీ అభివృద్ధిక్రమాన్ని వివరిస్తారు.

కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సందర్బాలలో, వేడుకలలో, వివాహాలలో, ఉత్సవాల్లో కూడ ఈ జోగులవారు వారి డప్పుల నృత్య విన్యాసాన్ని ప్రదర్శిస్తారు. ఈ డప్పు వాయిద్యం చూపరులకు ఉత్తేజాన్ని కలుగజేస్తుంది.