తెలుగువారి జానపద కళారూపాలు/ఘటనృత్యం

ఘటనృత్యం


ఆంధ్రదేశపు జానపద నృత్యాలలో ఈ ఘటనృత్యం ఒకటి. ఇతర నృత్యాలవలె ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించే నృత్యం కాదిది. ఏ పర్వదినాల్లోనూ ఈ నృత్యాలు జరగవు. ఒక్క జాతర్ల సందర్భాలలో తప్పా మారెప్పుడూ ఈ ఘటనృత్యాలు జరగవు.

గరగల సంప్రదాయానికీ, ఘటానికీ దగ్గర సంబంధమున్నా రెంటికీ కొంత వరకు వ్వత్యాసం వుంది. కృష్ణా గుంటూరు జిల్లాలలో ఒకప్పుడు విరివిగా వాడుకలో వుండేవి. జాతర్లూ, జంతు బలులూ తగ్గిన తరువాత ఈ ఘట నృత్యాలు కూడ తగ్గిపోయాయి. ఆంధ్ర దేశంలో ఆనాది నుంచీ ప్రదర్శింపబడే ఈ నృత్యం జాతర్ల సందర్భంలో ప్రదర్శిస్తారు. పల్లెల్లో పశువులకు జాడ్యాలు వచ్చినప్పుడు, కలరా, మశుచికం వ్వాపించి నప్పుడు దేవతలకు ముడుపులు కట్టి మ్రొక్కుతారు. ఇలా మ్రొక్కిన కొన్ని దినాలకు గ్రామంలో ఇంటింటికి చందాలు వసూలు చేసి గ్రామ మధ్యలో దేవతల విగ్రహాలను ప్రతిష్టించి ఒక నెల రోజులు పంబల కథలతో సాధులతో రాత్రిళ్ళు ప్రదర్శనలిస్తూ సన్నాయి వాయిద్యగాళ్ళ వీరంగ వాయిద్యం తోనూ, కనక తప్పెట్ల తోనూ మహోధృతంగా జాతర చేస్తారు. ఇలా జరిగే జాతరకు ముందు నెల రోజుల పైన వివరించిన ఘటం కుండ ఊరంతా ఇంటింటికీ తిరిగి, అన్నం,మజ్జిగలను కుండతో సేకరిస్తారు.

ఇలా ప్రతి ఇంటివద్దనూ సేకరించిన, అన్నం మజ్జిగను వాయిద్య కారులూ రజకులూ పంచుకుంటారు.

రజకుల ప్రాతినిధ్యం:

ఇలా ఘటాన్ని నెత్తిన పెట్టుకుని వూరేగేవారు. చాకళ్ళు (రజకులు) ఘటం ఎత్తుకున్న వ్వక్తి ఎంతో ఉద్రేకంగా నృత్యం చేస్తాడు. ఇలా చేసే నృత్యానికి ఏ విధమైన శాస్త్రీయతా వుందని చెప్పలేము. కాని ఇది ఆవేశనృత్యం, ఘటనృత్యం చూసేటందుకు చాల ఉత్తేజంగా వుంటుంది. ఘటం ఇంటింటికీ తిరిగి అన్నం మజ్జిగ సేకరించడంలో వుద్దేశం కేవలం దేవతల సంతృప్తి కోసం అందుకు ప్రతి ఇంటివారు ప్రసాదం వేస్తారు.

ఘటం కుండను, పశుపుతోనూ, కుంకంతోనూ అలంకరిస్తారు. ఘటం యొక్క అంచుకు చుట్టూ వేపాకు తోరణం కడతారు. ఘటాన్ని చూస్తూనే అది ఒక దేవతా మూర్తిగా కనబడుతుంది. ఇక ఘటం ఎత్తుకున్న వ్వక్తి పూజ్య భావంతో ఎవరితోనూ మాట్లాడక, తప్పెట్ల వాయిద్యానికి అనుగుణంగా వీరనృత్యం చేస్తాడు. అలా చేసే నృత్యం ఎంతో భక్తి భావంతోనూ, నిండు నమ్మకంతోనూ జరుగుతుంది.

ఇలా జరిగే ఘట నృత్యానికి ఏ విధమైన సాహిత్యం గానీ వుండదు. కేవలం మూగ తాండవం ఎంతో ఆవేశపూరితంగా జరుగుతుంది... ఇలా ఆవేశంగా జరిగే నృత్య సమయాల్లో కొంత మందికి పూనకం వస్తుంది...ఇలా గణం పూనిన వ్వక్తులు చిందులు, శివాలు త్రొక్కుతారు. ఇలా త్రొక్కడం ప్రళయ తాండవ నృత్యంలా వుంటుంది. ఈ నృత్యాలు ఏ గ్రామలో జాతర జారిగితే ఆ గ్రామంలో మాత్రమే ఈ ఘట నృత్యాలు జరుగుతూ వుంటాయి. కానీ ఈనాడు జాతర్ల ప్రభావం తగ్గుతున్న కొద్దీ, ఈ నృత్య ప్రభావం కూడా తగ్గిపోతూ వుంది.