తెలుగువారి జానపద కళారూపాలు/అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు

అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు


ఈ తరం వారికి బుట్ట బొమ్మలను గురించి అంతగా తెలియక పోయినా ఆ నాటి తెలుగు ప్రజల్లో బుట్ట బొమ్మలను గురించి తెలియని వారెవరూ వుండరని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు.

బుట్ట బొమ్మలు, పెళ్ళి వూరేగింపులలోనూ దేవుని కళ్యాణ వుత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరుణాళ్ళలోనూ, జాతర్లలోనూ ప్రదర్శింపబడుతూ వుండేవి.

బుట్ట బొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా వుండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ వుంటాయి.

ఇతర కళారూప ప్రదర్శనాలకు ప్రజలు ఎలా ఆకర్షితులౌతారో, ఈ బుట్త బొమ్మల ప్రదర్శనాన్ని కూడ వింతగా చూస్తారు.

ఈ బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోదపరుస్తాయి.

బొమ్మల శృంగారం:

ఈ బొమ్మల్ని పురుషులే ఆడిస్తారు. ఈ బొమ్మల్లో భార్యా భర్తలు, వారి ప్రేమ కలాపాలు, వారి ప్రేమను భగ్నం చేసే దుష్ట పాత్ర, స్త్రీ బొమ్మతో కామ కేళీ విలాసాలు. ఇది చూచిన భర్త బొమ్మ వెంటబడి దుష్టపాత్రధారిని తరమడం తరువాత భార్యవెంట పడటం, స్త్రీ పాత్ర క్షమించమని వేడుకోవటం, ఇలా బొమ్మల ప్రదర్శనం జరుగుతుంది. ఈ ప్రదర్శనానికి కూడ డప్పుల వాయిద్యముంటుండి. బొమ్మను ధరించిన పాత్రధారి కాళ్ళకు గజ్జెలు కట్టుకునే అడుగులు వేస్తాడు.

అలాగే ఈ బుట్ట బొమ్మల్లో పాముల వాడి బొమ్మ ఉంటుంది. నాగస్వరం ఊదుతూ, నృత్యంచేస్తూ వుంటుంది. ఒక్కొక్క సారి ఈ బొమ్మలు నాలుగైదు కూడా వుంటాయి...వీటిలో శింగి, సింగడు లాంటి హాస్య పాత్రలు కూడా వుంటాయి.

ఈ బొమ్మలు అతి సహజంగా జీవకళ వుట్టి పడేలా రంగు రంగులలో చిత్రించబడి వుంటాయి. ఈ బొమ్మలు పైభాగమంతా బొమ్మ ఆకారంగా వుండి లోపలి భాగం డొల్లగా వుండి బొమ్మ యొక్క కళ్ళ భాగంలోనూ, నోటి దగ్గరా రంధ్రాలుంటాయి. ఆటగాడు ఈ లోపలి భాగంలోకి దూరి, తలను దూర్చి నృత్యం చేస్తే కేవలం బొమ్మే అభినయించినట్లుంటుంది.

కట్టా సూర్యనాయాయణ:

ఈ బొమ్మలను తయారు చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన కట్టా సూర్యనారాయణ, బుట్ట బొమ్మల తయారీలో నేర్పరి.

ఆయన బొమ్మల తయారీని తన తండ్రి యల్లయ్య వద్ద నేర్చుకున్నాడు. యల్లయ్య 1930 లో దసరా వుత్సవాలకు మైసూరు వెళ్ళి, బుట్ట బొమ్మలు చూసి వాటి తయారీ నేర్చుకొని వచ్చాడు.

ఈ బొమ్మల తయారీకి చింత గింజలు, వెదురు ...రంగులు అవసరమౌతాయి. ఒక బొమ్మ తయారీకి నాలుగు కేజీల చింత గింజలు, రెండు వెదురు గడలు

అవసరం. బొమ్మ పూర్తిగా తయారవడానికి నెల రోజులు సమయం పడుతుంది. చింత గింజలను నానబెట్టి, ఉడికించి, గుజ్జు తయారుచేస్తారు. వెదురుతో తయారు చేసిన ఆకారానికి గుజ్జు పులిమి అది అరాక రంగులు తీర్చి దిద్దుతారు. ఒక బొమ్మ తయారీకి వెయ్యి రూపాయల పెట్టుబడి అవసరం. ప్రదర్శనలు లేని సమయంలో, బొమ్మల పరిరక్షణకు ఎంతో శ్రద్ధ వహించాల్సి వుంటుండి. కలరా వుండలు (నెప్తిలిన్ బాల్సు) ఎలుకల మందులు వేసి గుడ్డలు చుట్టి భద్ర పరుస్తారు.

ప్రదర్శన రక్తి:

బుట్ట బొమ్మల ప్రదర్శనాన్ని రక్తి కట్టించాలంటే కనీసం పది మంది కళాకారులైనా వుండాలంటారు సూర్యనారాయణ గారు. వీరిలో బొమ్మలను తయారు చేసేవారు కొందరైతే, వాయిద్యాలు వాయించేవారు కొందరు. దేవతా మూర్తుల బొమ్మలతో జరిగే ప్రదర్శన అత్యద్భుతంగా వుంటుంది.

ముఖ్యంగా ఈ బొమ్మలు పెద్ద వాళ్ళతో పాటు పిల్లల్నికూడ ఎంతగానో ఆకర్షిస్తాయి. జనం మధ్యలో అవి ఎంతో ఆకర్షవంతంగా చూడముచ్చటగా పుంటాయి. ప్రణయ విలాసాలూ, ప్రణయ కలహాలూ చివరికి సుఖాంతాలూ, యవ్వనంలో వున్న యువతీ యువకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య వచ్చే సింగీ సింగడు లాంటి హాస్య బొమ్మలు లాంటివి పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. బుట్ట బొమ్మలను మనుషులే ఆడించినా, బొమ్మలే మనుషుల్లాగా ఆడుతున్నాయనే భ్రమను కలిగిస్తాయి. ఉత్సవ సమయాల్లోనూ, పెళ్ళిళ్ళ సమయాల్లోనూ వివిధ రకాలైన వినోదాలకు ఎటువంటి అవకాశాన్నిస్తారో ఈ బుట్ట బొమ్మలకు కూడా అంతటి ప్రాముఖ్యాన్నిస్తారు. రాష్ట్ర వ్వాప్తంగా ఈ బొమ్మలను ఆడించే కళాకారులు ఇరవై అయిదు మంది వరకూ వున్నారు. సూర్య నారాయణ గారు రాష్ట్రంలోనే కాక ఢిల్లీలో కూడ ప్రదర్శన లిచ్చారు. ప్రభుత్వం జరిపిన అప్నా ఉత్సవంలోనూ, రిపబ్లిక్ ఉత్సవం లోనూ కూడా మన బుట్ట బొమ్మలు ప్రదర్శించబడ్డాయి. బుట్ట బొమ్మలు ఈ నాటికీ ఆడించతగినవే.