తెలుగువారి జానపద కళారూపాలు/కోనసీమ కోలసంబరం

కోనసీమ కోలసంబరం


తిరుపతి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరిపి కొందరు వేంకటేశ్వర ప్రసాదాన్నిచ్చి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మారి కొందరు ఈ కోల సంబరం కథను ఏర్పాటు చేస్తారు.

తెలుగు కళారూపాల్లో ఒక ప్రాంతంలో ప్రచారంలో వున్న కళారూపం మరో ప్రాంతంలో లేదు. ఒకో కళారూపం ఒక జిల్లాకే పరిమితమైన కళారూపాలు కూడా వున్నాయి. అలా చూసు కున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో ఈ కోల సంబరం ప్రచారంలో వుంది. తిరుపతి వెళ్ళి వచ్చిన వారు దీపారాధన రోజున రాత్రి పూట ఈ కథను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనానికి కొబ్బరాకుల పందిరిని ఏర్పాటు చేస్తారు. కథకులు ఇద్దరుంటారు. నుదురు మీదా, భుజాల మీదా, రొమ్ము మీదా, చేతుల మీదా, పెద్ద పెద్ద నామాలను ధరించి, నూనె గుడ్డలు చుట్టబడిన రెండు కోలలను వెలిగించి, రెండు కోలలనూ త్రిప్పుతూ, ఓరోరి వెంకన్న, ఓరి వెంకన్న అని పాడుతూ వుంటే వీరికి వంతలుగా పెద్ద ధ్వని నిచ్చే పెద్ద తాళాలను వాయిస్తూ వంత పాట పాడుతూ వుంటే, ఒక వ్వక్తి వీరి మధ్యలో ఒకరు ఒక చేతిలో పేము బెత్తాన్ని, రెండవ చేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకుని, రంగస్థలంలో, వెనక్కూ ముందుకూ నడుస్తూ, అంగ విన్యాసం చేస్తూ... జన రంజకంగా కథను సాగిస్తారు. రంగస్థలంలో మామూలు లైట్లున్నా, వెలిగించిన కోలల కాంతి కూడా మంచి వెలుగురు నిస్తుంది. చెప్పే కథ తిరుపతి వెంకన్నకు సంబంధించిన కథ. ఇది మామూలుగా పురాణాల్లో వున్న వెంకటేశ్వరుకి కథ కాదు. అలిమేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ, వెంకన్న బాబుల ప్రణయానికి సంబంధించింది. విరహంతో కూడిన భిన్నమైన జానపద కథ అని పడాల రామ కృష్ణారెడ్డి గారు ఉదహరించారు. తెలుగు ప్రజలు ఇదే నిజమైన కథ అని నమ్మి ఎంతో ఆసక్తితో విని ముగ్ధులౌతారు. ఈ కథను కేవలం కథగానే చెప్పటం కాక, మధ్య మధ్యలో సునిశిత మైన హాస్యాన్ని ప్రవేశ పెడతారు. కోలను త్రిప్పే అతను మధ్య మధ్య కథను ఆపి విచిత్రమైన ప్రశ్నలు వేసి వాటికి తగిన సమాధానలను రెండవ వానితో చెప్పిస్తాడు. ఈ ప్రశ్నలు సమాజ జీవితానికి సంబంధించి వుంటాయి. ఇవి ఒక ప్రక్క నవ్వులతో ప్రేక్షకులను రంజింప చేయడంతో పాటు విజ్ఞాన పరుస్తూ సామాజిక బాధ్యతలను తెలియ చేస్తాయి. దానితో పాటు భక్తి తత్వాన్ని ప్రబోదిస్తూ వుంటాయి. ఈ కోల సంబరం కథలు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ప్రదర్శిస్తారు.

మానాటి గొల్లల కథ:

కోల సంబరం అనే జానపద కథా రూపం ప్రాచీనమైనది. ఇది మానాటి గొల్లలచే ప్రారంభించ బడింది. ఆ కులంలో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే స్త్రీ ఈ కథను గానం చేసేది. తూర్పు గోదావరి జిల్లా పెనికేరు దగ్గరలో వున్న కీలక చర్ల ఈమె స్వగ్రామం. నేటికి షుమారు రెండువందలఏభై సంవత్సరాల క్రిందట ఈవిడ ఈ కథను గానం చేసేది. అచ్చెమ్మ గారు చనిపోయిన తరువాత...ఆమె దగ్గర కథ నేర్చుకున్న వెల్లగ్రామ నివాసి అయిన చిక్కాల కోటయ్య కాపు నేర్చుకుని వెల్లగ్రామానికి తీసుకు వచ్చాడు. కోటయ్య ద్వారా ఆయన కుమారులు పట్టాభి రామన్న, జానకి రామయ్యలు నేర్చుకున్నారు. వీరి ద్వారా మిగిలిన వారు ఈ కథాగానాల్ని నేర్చుకున్నారు.

కథకురాలు అచ్చమ్మ:

పూర్వం గొల్ల అచ్చమ్మ గారు తిరుపతి క్షేత్రం నడచి వెళ్ళేటప్పుడు ఈ కథను స్వంతంగా అల్లుకుని పాడుకుంటూ వెళ్ళేది. ఒక సారి ఆమెతో కూడ చిక్కాల కోటయ్య కూడ వెళ్ళడం జరిగింది కోటయ్యతో పాటు, పెద్దాపురం వాస్తవ్యులైన పెనుమాళ్ళ గోవిందు, గోడి సెట్టి నరసన్న మొదలైన వారు కలిసి వెళుతూ కథను ఆకళింపు చేసుకున్నారు.

తిరిగి వచ్చిన కొంత కాలం తరువాత గొల్ల అచ్చెమ్మగారి ఆవసానదశలో చిక్కాల కోటన్ను పిలిచి ... సంబరానికి సంబందించిన కోలలు... నెమలి కుచ్చు బెత్తము... తాళాలు మొదలైన సామానులిచ్చి, ఈ కథను ప్రచారం చేయవలసిందిగా కోరింది.

నాటినుంచి ఈనాటి వరకూ ఈ కథను గానం చేస్తున్నారు. వీరి ద్వారా వెల్ల గ్రామంలో చాల మంది ఈ కథను నేర్చుకుని కథా గానాన్ని చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు.

కోలసంబరం పేరెందుకొచ్చింది.

కోలసంబరం అనే వేంకటేశ్వర స్వామి కథ చాల వ్వాప్తి చెందింది. కోలలు వెలిగించి చెప్పేటటువంటి కథ కాబట్టి, దీనికి కోలసంబరం అని పేరు వచ్చింది. ఈ కోలసంబరం అనే ఈ కథా బృందంలొ ఆయిదుగురుంటారు. పైగా ఒక మనిషి కూడా వుంటాడు. ముందు భాగంలో ఇద్దరు కోలలు పట్టుకుంటారు. వెనుక నిలబడిన ఇద్దరూ కథకుడు పాడిన పాటకు వంత పాడుతూ వుంటారు. వెనుక వంత దారులు తాళాలు వాయిస్తూ వుంటారు. ముందు కోలలు పట్టుకున్న వారికి, వెనుక వంత పాడే వారికి మధ్య కథకుడు కథను చెపుతూ వుంటాడు. ఈ కథకుని గురువు అని పిలుస్తారు. ముందు భాగంలో నిలబడిన ఇరువురూ, హాస్యం చెపుతూ వుంటారు.

ఏడుగురు అన్నదమ్ములు:

వెంకటేశ్వరుని అన్నదమ్ములు ఏడుగురు. వేంకటేశ్వరుడు చిన్న వాడు. శ్రీనివాసులు అని కూడా పిలుస్తూ వుండేవారట. శ్రీనివాసులు తిమ్మరాజు పేరిందేవిల ఏడవ మగ బిడ్డ. శ్రీనివాసుని యొక్క సోదరుల పేర్లు 1.గోవిందరాజులు, 2.పెన్నాడ వెంకన్న శ్రీకాకులం జిల్లా, 3. ఉప్పాల వెంకన్న ( పిఠపురం తాలూకా), 4. బెండపూడి వెంకన్న, 5. యానాం వెంకన్న, 6. వాడపల్లి వెంకన్న, 7. అఖరివాడుగా శ్రీనివాసుడు జన్మించాడట. కాని ఈ ఏడుగురు అన్నదమ్ముల కంటే ముందు విజయవాడలో వేంచేసి యున్న కనకదుర్గ, తిమ్మరాజు, పేరిందేవిల మొదటి సంతానమనీ ఈ కథను చెప్పే కొంత మంది గురువుల చెపుతూ వుంటారు.

తిరుపతి వెంకన్న:

అందరిలోకి చిన్నవాడైన వేంకటేశ్వరుడు, తల్లి దండ్రులను విడిచి పెట్టి తిరుపతి కొండకు చేరి ఆ కొండ మీదే దేవాలయాలు కట్టించుకున్నాడని, పద్మావతిని, బీబీ నాంచారిని వివాహం చేసుకుని, తిరుపతి కొండ మేదే నివాసం ఏర్పరుచుకుని శిలా విగ్రహాలుగా మారిపోయారని కథను పూర్తి చేస్తారు.

కోలసంబరం ప్రదర్శనంలో అందరూ మగవారే పాల్గొంటారు. రాత్రి ఎనిమిది లేక తొమ్మిది గంటలకు కథను ప్రారంభించి ఉదయం ఆరు గంటల వరకు ఈ సంబరం చేస్తారు. ఈ కథను చెప్పేవారిలో ఒకనికి పూనకం వస్తుంది. పూర్వం ఈ సంబరంలోకి ఆబోతును తీసుకువచ్చి సంబరం అయిన తరువాత ఆబోతును ఊరిమీదికి వదలిపెట్టేవారు. కానీ ఈనాటి ప్రదర్శనాలలో ఆబోతును తీసుకురావడంలేదు.

బృందాల సంబరాలు:

చిక్కాల కోటయ్య సంబరాలు చేసే రోజుల్లో ఆబోతుని సంబరంలోనికి తీసుకు వచ్చే వారు. కోటయ్య చనిపోయి ఇప్పటికి షుమారు నూరు సంవత్సరాలైంది.

ఈనాడు కథలు చెప్పే బృందాలు నెలకు ఆరు కథలకు తక్కువ కాకుండా చెపుతారు. ఒక్కొక్క గురువుకూ నెలకు సరాసరి ఆరు

వందల రూపాయలు ఆదాయం వస్తుంది. వెల్లగ్రామంలో షుమారు ఏభై బృందాల వరకూ వున్నాయి. వెల్ల గ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకాలో వుంది.