ఆంధ్ర రచయితలు/మాడభూషి వేంకటాచార్యకవి

మాడభూషి వేంకటాచార్యకవి

1835 - 1895

వైష్ణవబ్రాహ్మణుడు. కౌశికగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తల్లి: అలివేలమ్మ. తండ్రి: నరసింహాచార్యులు. జన్మదేశము: నూజివీడు. జననము: 1835. నిధనము: 1895-మన్మథనామ సంవత్సర ఫాల్గున బహుళ తృతీయ. గ్రంథములు: 1. భరతాభ్యుదయము (ప్రబంధము) 2. వామననాటకము. 3. పుష్పబాణవిలాసము, 4. హంససందేశము, 5. మదనమోహన చరిత్ర (వచనము) 6. బృహద్వైద్యరత్నాకరము. 7. రామావధూటీ నక్షత్రమాల (చాటుపద్యమణి మంజరి-ద్వితీయభాగము చూడుడు) 8. ఆనంద గజపతిపై వ్రాసిన 65 సీసములు.

శతావధానములను బ్రచారములోనికి దెచ్చినవారిలో వేంకటాచార్యులుగారు కనిష్ఠి కాధిష్ఠితులు. భట్టుమూర్త్యాదులు శతలేఖిని పద్యసంధానధురంధరుల మని చెప్పికొనినారు. వేంకటాచార్యుల వారు అసాధారణుడైన మేధావి. ఈయన గంటకు వందలకొలది పద్యములు చెప్పగలనేర్పరు లనుట తటుంచి, యేకసంధాగ్రహణమున నూరులకొలది పద్యములు అప్పగించు బుద్ధిమత్తరులు. వీరి మేధావిశేషమునకు బెక్కుకథలు తెలుగుదేశమున బ్రాకియున్నవి. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు "చాటుపద్య మణిమంజరి" లో వెలువరించిన కథ యొకటి ప్రకటించెదను.

"పనప్పాకం అనంతాచార్యులుగారిదగ్గఱ కొకప్పుడు అవలిప్తుడగు అరవదేశపు విద్వాంసుడు వచ్చి స్వరచితము లైన శ్లోకములను జదువుచు వివరించుచు బ్రశంసించుకొనుచు నుండగా వేంకటాచార్యుల వారు వినుచుండిరి. పది శ్లోకము లయినవి. ఆత్మౌత్కృష్ట్య ప్రశంసాపరాయణుడుగా నున్న యా పండితునితో "అయ్యా ఈశ్లోకములు పిన్ననాడు మా నాయనగారు నాకు జెప్పిరి. ప్రాచీన కవికృతములైన యీశ్లోకము లనంతాచార్యులుగా రెఱుగ రని యాత్మీయములుగా జదువ నారంభించితిరా?" యని పలికిరట. కుపితుడై వెడవెడ నవ్వునవ్వి యా యఱవదేశపండితుడు వేంకటాచార్యులు నెఱుగక 'ఏదీనీకు వచ్చునేని చదువుము, రచించినవాడను నేనే యిక్కడ నుండగా నాతోనే యిట్లు పలికెదవేమయ్యా! ఎవ్వరనీవు?'అని తుటారించెనట. ఇదిగో చదువుచున్నానని యేకసంధాగ్రహణమున నప్పగించిరి. వెల్లబోయి యా పండితుడు వేడుకొనెనట. మీ మాహాత్మ్యము నెఱుగనైతిని మన్నింపుడని-"


ఇట్టికథలు గాథలు వీరినిగూర్చి త్రవ్వితండములు. కని విని యెఱుగని భాషలోనివి కొన్ని పద్యములు వీరికడ నొక్కసారి చదివినజాలును. అవి యద్భుతముగా వల్లించిన పద్యముల వలె నప్పగించువారట. ఆయన ధారణాశక్తి యట్టిది. ఒక గదిలో నూఱుచెంబులు పెట్టి పుల్లతో ముందు వరుసగా వాయింపగా, గది వెలుపలనుండి విని మరల నడుమ నేచెంబుపై దెబ్బ కొట్టినను 'ఇది యీసంఖ్యకల చెంబు' అని చెప్పువారట. శబ్దగ్రహణమున గూడ నాయన కిట్టి బుద్దిసౌక్ష్మ్య ముండెడిది. దేవులపల్లి సోదరకవులు, తిరుపతి వేంకటకవులు వీరిని విని యవధానము లారంభించిరి. తిరుపతి వేంకటకవులు అవధానలతను దేశము దేశమెల్ల బ్రాకించిరి. వేంకటాచార్యులుగారు శతావధానియే కాదు. సంస్కృతాంధ్రముల లోతు చూచిన పండితుడు. తర్క వ్యాకరణములు గురుకుల కిష్టుడై కఱచెను. మొత్తముమీద జదివినదానికంటె జూపినదెక్కువ. సంస్థానముల కెక్కుట యవధానములు గావించి యాశుకవిత చెప్పు-----------తెలుగురాజు లెందఱో వీరి నాదరించి సత్కరింప ........ నెలవైన నూజువీట గాపురము. తోచినప్పుడక్కడికెళ్ళి ప్రభుని దర్శించి ....... ....... కానుకల గొని తెచ్చి ఇంట గ్రుమ్మరించి ..... ..... పీఠికాపుర మహారాజు గంగాధర రామారావుగారిని దర్శించి 1879 లో నవధానము చేసెను. ఆయవధానమునకు మహారాజు మహాశ్చర్యభరితుడై మనకవివరుని గొప్పగ సన్మానించెను. ఈరీతి నీయన పొందిన రాజగౌరవములకు మేరలేదు.


చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే ఉచ్చింతకాయ వాక్కాయ సాధాకాయ తమాంజలిం. ఈ మొదలైన కొంటిరకపు శ్లోకములు వేంకటాచార్య రచితములుగా జాలమంది చదువ విందుము. ఆచార్యులుగా రొడ్డుపొడుగులుగల మానిసి. స్ఫురద్రూపి. ఆయన రసికతకు నిదర్శనములుగా గొన్ని రచన లున్నవి. "రామావధూటి తారావళి" వానిలో నొకటి, ఆ పద్యములు రసఘటికలు. రెండుదాహరింతును.


సీ. శ్రీరాధికాకుచాశ్లేషజ సంతోష

వివశుడౌ శ్రీకృష్ణవిభువ ఠెరగి

సకలవిద్యావ్యాప్తి సాధనభూతయౌ

శారదాంబకు నమస్కారములిడి

యైహికానంద ప్రవాహపూరకమైన

శృంగారరస మాత్మ నిరపుకొలిపి

మదవసామ్రాజ్య సింహాసనారుధులౌ

పురణించు రసిక శేఖరుల నెంచి


వివిధ రతితంత్రపాండిత్య భవమహారు

భవములె పదార్థములుగ నేర్పఱిచి సీస

పద్య నక్షత్రమౌలిక భావవిదుల

మనము లలరంగ గూర్తు రామావధూటి. ఒకనాటి కలలోన సకియ | నీకాలి పా

జేబులో జందెంబు చిక్కినట్లు

ఒకనాటికలలోన సకియ| కౌగిటజేర్చు

తఱి గంటె గద్దావదా కినట్లు

ఒకనాటికలలోన సకియ|మెల్లవ నాదు

గూబలో 'కొక్కొరో' కూసినట్లు

ఒకనాటి కలలోన సకియ| నీ చేతిపో

చీలోన జందెంబు చిక్కినట్లు


ఇన్ని విధముల నచ్చట నున్ననాటి

వన్నెలన్నియు గలలోన వచ్చి యిచట

గాసి గూర్చు చున్నవి నిన్ను బాసి యెట్లు

మరులు నిల్పగనేర్తు రామావధూటి!


వేంకటాచార్యులుగారు నూజవీటి శ్రీరాజా శోభనాద్రి అప్పారావుగారి సంస్థానమున విద్వత్కవి. ఈయన కభినవపండితరాయ లని బిరుదము కలదు. వీరి తండ్రి నరసింహాచార్యులుగారును కావ్యకర్తలు. పల్లవీపల్లవోల్లాసము, రుక్మిణీకల్యాణము, నీలాపనిందానిసారణము ఈ గ్రంథములు వారురచించినవే. వీరేశలింగము పంతులుగారి కవులచరిత్రలో తండ్రి కొడుకుల చరిత్రలు రెండును గలవు. మన వేంకటాచార్యులుగారు 'భరకాభ్యుదయ' మను ప్రౌడప్రబంధము సంతరించిరి. దీని ప్రాక్తవ్యము కవిచరిత్రమున సంక్ష్పించి యుంట బునరుక్తి చేయలేదు. .......... ............ .......... యాసు కవితయు నించుమించుగ ......... శోభనాద్రి అప్పారావు గారు ...... .... ........ . ............ ........... .....?( గీతలున్న స్థానములో అక్షరములు కనబడలేదు) సరసుడు దూరమేగునని చాలగ నామది చింతనొందు నె

ల్లరకు వినోదియైనను గళానిధి వైర మొనర్చె వెండియున్

బరభృత కాకలీరవము బాసి తనర్చును నిష్కుటీ విసృ

త్వర మలయానిలంబులస బ్రాణములేహరియించు నెంతయున్.


ఆచార్యులుగా రనపత్యులు. 'భరతాభ్యుదయము' వారిపుత్రుడు. అవధాన ప్రతిభాయాతమగు కీర్తి వారిపుత్రిక. గుంటూరిలో నిప్పుడు న్యాయవాదులుగా నున్న వేదాంత నరసింహాచార్యులుగారు వీరి దత్తకుమారులు.

                           __________