హిమబిందు/ప్రథమ భాగం/28. స్వర్ణ ప్రతిమ

ప్రజాపతిమిత్రకు యౌవన మంకురించి దేవలోకమునుండిదిగివచ్చు మూర్తివలె నయినది. చదువులో మొదటిబిడ్డ, సంగీతములో ప్రథమ బాలిక, నాట్యములో ఊర్వశి. ఆ పరమసుందరాంగిని జూచి చారుగుప్తుడు ఆమె పాదములమ్రోల తన ప్రాణము, ఆత్మ పూజాపుష్పముల జేసినాడు. కోటీశ్వరుని తనయుడైనను సర్వవిద్యాపారంగతుడై, బలసంపన్నుడై, రసగ్రహణపారీణుడైన చారుగుప్తునే వరించినది ప్రజాపతిమిత్ర.

ప్రజాపతిమిత్ర కాపురమునకు వచ్చినప్పటినుండియు చారుగుప్తుడు ఇతరము సర్వము సంపూర్ణముగ మరచిపోయినాడు.

28. స్వర్ణ ప్రతిమ

ప్రజాపతి కాపురమునకు వచ్చిన రెండేండ్లకు వారిరువురకు హిమబిందు ఉద్భవించినది.

ప్రజాపతిమిత్ర ఆనందముకు మేరలేదు. చారుగుప్తుడు సీతదొరికిన జనక మహారాజుకన్న ఎక్కువ ఆనందము నందినాడు. వారిరువురు ఉమనుగన్న మేనా హిమవంతులకన్న ప్రకాశించిపోయినారు.

కోటీశ్వరుడైన వినయగుప్తుడు శ్రీకాకుళమునుండి, కావేరి పట్టణమునుండి, తామ్రలిప్తినుండి, భరుకచ్ఛమునుండి, సువర్ణద్వీప, బలిద్వీప, యవద్వీప, సింహళద్వీప, రాక్షసద్వీప, మలయద్వీప, నీలద్వీప అను ద్వీపాది ద్వీపానేకములనుండి నారికేళ, ప్రవాళ, మౌక్తిక, శోణరత్న, లవంగ, జాయక, ఘనసార, చంద్రబాలా, కోరంగి మొదలైన వస్తువులను తెప్పించును. బంగారము, వెండి, రాగి, ఇనుము, కత్తులు, కరవాలములు, ఛురికలు, వర్మములు, దర్పణములు, నగలు, నాణెములు, విగ్రహములు మొదలగు వస్తువు లెన్నియో దిగుమతులు చేయుచుండెను. ఆతనికి వందల ఓడలున్నవి. కీర్తిగుప్తుడు సార్థవాహుడు, వినయగుప్తుడు సాయంత్రికుడు. సాయంత్రికులను పోత వణిక్కులనియు నందురు. ఇరువురు వియ్యమందుట సముద్రుని తండ్రియైన వరుణదేవుడు, గంగాదేవి తండ్రియైన హిమవంతుడును వియ్యమందుట యని దేశము లాడికొని ఆనందము నందినవి.

చిన్న మనుమరాలు పుట్టినప్పుడు కీర్తిగుప్తుడు, వినయగుప్తుడు హిమబిందున కెన్ని సుందరక్రీడావస్తువులు సమర్పించినారో, ఎన్నియలంకారములు, ఎన్ని భూషణములు, ఎన్ని వస్త్రాదికములు తెచ్చినారో! హిమబిందు క్రీడామందిరముల నెన్నియో సాలభంజికలు, లక్కబొమ్మలు, దంతపు శిల్పములు, గంధపు ఆటసామానులు, ముత్యపుచిప్పల పెట్టెలు, వివిధరకముల శంఖములు, గవ్వలు, పవడముల చందుగలు, పళ్ళెములు, అమూల్య రత్నములు, శిలలుదొలిచిన బరిణెలు, సింహ, శార్దూల, వ్యాళ, ఖడ్గమృగ, మృగాది జంతువుల చర్మము లున్నవి. పూసల పేర్లు, కోటుల ఫణములు విలువచేయు ఎర్ర ముత్యముల హారములు, నవరత్నహారములు, బంగారునగలు, రత్నఖచితహారములు, కేయూరములు, శిరోభూషణములు, మేఖలలు, మంజీరములు, లోలకములు, కర్ణభూషలు, చీనా దుకూలములు, బాహ్లిక పారశీకాది దేశ రాంకవములు, నీలదేశవల్కలములు లెక్కలేనన్ని ఆమెకై మందిరములు, మందిరములు నింపినారు ఇరువురు తాతలు. తన మేనకోడలిని చూచుటకు డెమిత్రియసు ఆంధ్రదేశమున కెన్నిసారులో వచ్చినాడు. చెల్లెలిని మేనకోడలిని తన బావ కీర్తిగుపుడు తక్షశిల కొనివచ్చునప్పు డెంతయు యానందమందినాడు. మేనకోడలు ఆతనికి ప్రాణమైనది. తన కొమరుడు హెరాక్లియసు ప్రజాపతిమిత్రను పెండ్లియాడి తీరవలయునని పట్టుపట్టినాడు.

ప్రజాపతిమిత్ర చారుగుప్తుని పెండ్లియాడనున్నదని శుభలేఖ వచ్చినప్పుడు హెరాక్లియసు డెమిత్రియసు లిరువురు కొంచెము హృదయ బాధకు లోనైరి. కాని వారు యాత్రలు సాగించి, మహదాంధ్రముచేరి, ధాన్యకటకమునకు బోవునప్పటికి వినయగుప్తుని వైభవము వారికన్నుల మిరుమిట్లు గొల్పినది. వారి గాథలలో ధనమునకు ప్రసిద్ధికెక్కిన క్రోసియసురాజు వినయగుప్తునికడకు అప్పుకు రావలెను అనుకొనిరి. చారుగుప్తుడు వినయగుప్తునిమించి, యౌవనములోనే అనేక సముద్రయానములు చేసి సాహసియని కీర్తిగొన్నాడు.

అప్పుడా యవనజనక కుమారులకు చారుగుప్తుని ప్రజాపతి యెందుకు ప్రేమించినదో అర్థమయినది. డెమిత్రియసు ఆంధ్రాచారమున ప్రజాపతిని బంగారుతట్టలో మోసి కల్యాణమంటపమునకు గొనివచ్చినాడు. డెమిత్రియసు భార్య సెలినేదేవి ఆంధ్రాచారముల గమనించుచు, అక్కజంపడుచు. తానును ఆంధ్రాంగనావస్త్రాలంకార శోభితమై ముక్తావళీదేవిచే, వినయగుప్తుని భార్య గుణవతీదేవిచే ఎన్నియో మన్ననల నందినది. చిన్నతనములో యవనభూమియగు గ్రీసులో తా నెరింగిన పెర్లాదేవి వేరు, ఈనాటి ముక్తావళీదేవి వేరు.

హిమబిందు పదమూడవఏడు జరుగుచున్నప్పుడు వృద్ధుడగు డెమిత్రియసు దేవతల జేరినాడు. ఆమెకు పదునాల్గవఏడున ప్రజాపతిమిత్ర వ్యాధిగ్రస్తురాలయినది.

చారుగుప్తుడు మతిలేనివాడైపోయినాడు. దేశదేశముల ప్రసిద్ధి నందిన వైద్యులు చారుగుప్తునిచే నాహ్వానితులై వచ్చినారు. ఆంధ్రధన్వంతరులు, చరక శుశ్రుతాది మహాశాస్త్రకోవిదులు దివ్యసుందరి యగు నా సుశీల ప్రజాపతిమిత్ర రోగముచే ననేక విధముల పరిభవింపబడినారు. ఆమె ప్రజ్ఞాపరిమితాదేవిలో ఐక్యమైపోయినది.

చారుగుప్తుడు, వినయగుప్తుడు, కీర్తిగుప్తుడు మువ్వురును మంచము పట్టినారు. ముక్తావళీదేవికి కన్నుల నీరింకిపోయి యొకపక్షముదినములామె చైతన్యరహితయై పడియుండెను.

హిమబిందునకు తల్లి మాయమగుట యను భావ మర్థము కాలేదు. ఇతరులు ఏడ్చినప్పుడామె దుఃఖించినది. దినములు గడచినకొలదియు ఆమె బెంగచే కృశించి పోయినది. బాలిక దుఃఖము చూచి మువ్వురు వణిక్చక్రవర్తులూ దుఃఖమాపుకొనిరి. ముక్తావళీ దేవి తెలివినంది, తన ప్రజాపతి హిమబిందులో నున్నదని ధైర్యముచెంది యా బాలను దివ్యప్రేమచే చుట్టివేసినది. ఏడులు గడచినకొలది హిమబిందు తేరుకున్నది. కాని ఆమె తల్లి ప్రతిరూపము తన పూజామందిరమున నుంచుకొన యౌవనారూఢయైన హిమబిందు ఆశించినది. చారుగుప్తుడు భార్య నూత్నవధువై తన ఇంటికి వచ్చినప్పుడు, ధర్మనంది బావమరిదియు ప్రఖ్యాత స్వర్ణాదిలోహ శిల్పియునగు అమరనందులవారిచే భార్యా ప్రతిమను చిన్న స్వర్ణమూర్తిగా రచింపచేసినాడు.

ప్రజాపతిమిత్ర హిమబిందును చంక కెత్తుకొను రోజులలో శక్తిమతీదేవి ధర్మనందులవారిచే బాలనెత్తికొనిన మాతృమూర్తిని ధవళశిలా శిల్పముగ విన్యసింపఁ జేసెను. చారుగుప్తుడా రెండవప్రతిరూపము తన పూజామందిరమున నెలకొల్పెను భార్య దివంగతురాలైన రెండవసంవత్సరమున అమరనంది, ధర్మనంది ఇరువురు ఇదివరకున్న ఆమె ప్రతిమల విమర్శించి, తమ స్మృతి శక్తిని సహాయముగొని ప్రజాపతి మిత్రను పద్మాసనాసీనగా, ప్రజ్ఞాపరిమితాదేవిగా నిండు బంగారు విగ్రహముగ పోతబోసినారు. విగ్రహము హిమబిందు పూజాగృహమున పూజాపీఠ మలంకరించినది.

హిమబిందుకుమారి దినదినము ఉదయముననే స్నానాదికము లాచరించి సర్వాలంకారయుక్తయై శుభ్రవసనముల ధరించి మాతృవిగ్రహమును పూజసేయును, తన హృదయమంతయు తల్లితో నివేదింపని దినమామెకు లేదు. పూజయంతయు సలిపి, ఒకనా డాబాలిక ఆ స్వర్ణదేవి కడ మోకరించెను. ఆమె రెండుచేతులు తల్లి బంగారు తొడలపైనిడి మోమామె పద్మాసనముపై నుంచెను.

“అమ్మా! పలుక వేమి?”

29. తల్లి అనుమతి

“అమ్మా, నీవు ఎక్కడున్నావు? ఎక్కడనుండి వచ్చితివి. అక్కడికే పోయితివి. నన్ను నీ గర్భమున గంటివి. అంత చిన్నతనములో నన్ను వదలి మాయమైపోతివి.”

ఉత్కృష్టశిల్పరూపమగు ఆ జాంబూనద విగ్రహము హిమబిందు మాటలకు ఏమి ప్రతి వచింపగలదు!

హిమబిందునకు చిన్నతనముననుండియు దూరమున తోచు ఏదియో ఆశ. అది ధనము కాదు, సంపదకాదు, వైభవముకాదు. మహారాణులు కనీ విని యెరుగని నగలామె మందసముల నున్నవి. మానవమాత్రు డూహింపజాలని విచిత్రవస్త్రాదికము లామె పేటికలలో పాముకుబుసములై, పలుచని మబ్బుల మడతలై, పుష్పపుటములై, స్వప్నములై, శ్రీమద్రామాయణ శ్లోకములై జాలువారుచున్నవి. చారుగుప్తు డాబాలిక ఊహకందని పూవుజాతులు దేశదేశమునుండి సేకరించి క్రీడావనముల పెంచుచున్నాడు. అవి జపాకుసుమజాతులు, ఇవి నీలనదీతరంగడోలార్ధ్ర సహస్రదళకమలములు. ఇవి మల్లికలు, అవి సంపెంగలు. ఇవి శేఫాలికలు, అవి కబంధములు. అక్కడ సూర్యకాంతములు, ఇచ్చట పారసీకమునుండి వచ్చిన గులేబకావళులు. ఇవి సంపూర్ణదాడిమీ పుష్పములు, అవి చీనాదేశమునుండి వచ్చిన అరుణచేరులు. ఇచ్చట కరవీరములు. అవి నాగ లింగములు, ఇవి వకుళములు. ఇవి మాలతీలతలు, అవి మాధవీలతలు.

తన చెలులకు పుష్పవనవాటులు చూపి హిమబిందు పొంగిపోయెడిది. పదునేడేండ్ల మిసిమి వయస్సున నున్న హిమబిందునకు నేడు పుష్పవనవాటులు, నగలు, నాణెములు, ఆటలు, పాటలు ఆనందము సమకూర్చ లేకపోయినవి.

ఒకప్రక్క ఆప్రొదితీదేవి భౌతికవాంఛలు, గాఢకాంక్షలు, ఉడుకు రక్తములు, తీరని కోర్కెలు ఆమెకు వరమిచ్చినది. వేరొకప్రక్క సాధుమూర్తియై చతుర్విధ పురుషార్థ ప్రదాయినియైన మాయాదేవి శాంతమును, శ్రద్ధాభక్తులను అరణమిచ్చినది. ఈ రెండు మహాశక్తులు చిన్ననాటనే ఆమెకు తెలియక ఆమెలో మహత్తరగంభీర సుడిగుండముల జన్మింపజేసినవి. ప్రేమయన నెట్టిదో యెరుగని మొదటిదినాలలో తాను సమవర్తిని ప్రేమించితి ననుకొన్నది. ఆమెకు ప్రేమోదంతములు రహస్య కాంక్షలు అవ్యక్తాందో