హిమబిందు/ప్రథమ భాగం/27. వసంత సౌరభము

సువర్ణ: అందరు ఇచ్చట చేరినారు. అచ్చట నాయనగా రీపాటికి జపము చాలించి యుందురు. పదండి భోజనములకు. అమ్మయు, మహాలియు వడ్డనమాటే మరచిరి.

తండ్రిగారును, సువర్ణశ్రీయు, ముప్పదినలువురు విద్యార్థులును భోజనము చేసిన వెనుక సేవకుడు కరదీపిక చూపించుచుండ, వారందరు ధర్మనంది శిల్పవిద్యాగారమునకు బోయినారు. అచ్చట దంతాసనముపై కృష్ణాజినముపై ధర్మనంది వసించెను. చుట్టును కుడ్యములనంటియున్న శాద్వలాసనములపై విద్యార్థులును, సువర్ణశ్రీయు నధివసించిరి.

ధర్మనంది గ్రంథపీఠముపై భూర్జపత్రశిల్ప శాస్త్ర గ్రంథమునుంచి, అదిచూడకయే బాలుర కుపదేశింప నారంభించెను. భరతనాట్య సూత్రములు, శిల్పసూత్రములు, రూపరచనా ప్రమాణము, అంకము, ధారణము, రూప ప్రతిరూపములు, మాన ప్రతిమానములు, దేవతా మనుష్య గుహ్యక వానరాదిప్రమాణములు, ఉత్తమపురుష లక్షణములు, స్త్రీల యాకారములు, పద్మ సుఖ వీర యోగాది వివిధాసనములు, అభయ, వరద జ్ఞానాదిముద్రలు, లంబ లీల లోలాది హస్తములు, సమద్విత్రి అతిభంగాది భంగిమములు, పద్మ పద్మపత్ర మత్స్య కురంగ చక్రవాకాది లోచనభేదంబులు, గరుడ సమ శుక తిలపుష్పికాది నాసికాభేదంబులు - ధర్మనంది గంభీరకంఠమున ఆ పవిత్ర సమయమున శిష్యుల కుపదేశించెను.

ఈ పాఠము జరుగుచున్నంతసేపును సువర్ణశ్రీకుమారుని మనస్సు హిమబిందు తన యింటికి వచ్చుట, తాను పారిపోవుట, స్థూపముకడ మరల నా బాలికను సందర్శించుట, ఏవేవో పిచ్చిమాటలు తాను పలుకుట, ఆమె “దారి యిమ్మనవే!” యనుట ఈ దృశ్యములన్నియు నాతని మనోనయనాల ఎదుట ప్రవాహతరంగములరీతి ఒకటి వెంటనొకటి వచ్చి మాయము కాసాగినవి.

27. వసంత సౌరభము

పదునారు సంవత్సరములు నిండి పదునేడవ సంవత్సరము రాబోవు తరుణ వయస్సున బాలికలకు వసంతోదయ ప్రారంభము. ఆ వసంతము నందు సౌరభము లలమికొన ఉప్పొంగి వికసించబోవు మల్లికాకుట్మలము హిమబిందు.

చిన్నతనమునుండియు మహారాజకుమారికలకు జరుగని వేడుకలు, లాలనలు, ముద్దులు, మురిపెములు హిమబిందునకు నెల నెలకు జరిగినవి.

హిమబిందుతల్లి ప్రజాపతిమిత్ర. ఈమె సర్వభారతీయ దేశములతో వర్తకమొనర్చు కీర్తిగుప్త వణిక్సంపన్నుని కుమార్తె. కీర్తిగుప్తుల వారు ధాన్యకటకనగరమునందు విశాలమైన రాజవీధిలో తన భవనము నిర్మించుకొని వర్తకము చేయుచుండెను. ప్రతిష్ఠానమునందు, పాటలీపుత్రమునందు, ఉజ్జయిని యందు, పిష్ఠపురము, దంతిపురము, కాంచి మధుర, తాత్రలిప్తి, భరుకచ్ఛము, కౌశాంబి, మహాశకవతి, కన్యాకుబ్జము, పురుష పురము, ప్రయాగ, పుష్కలావతి, కాశీ, తపిక, తక్షశిల మొదలైన ప్రసిద్ధనగరములందు తన వర్తకస్థానముల నేర్పరచుకొని మహోత్తమ వణిక్సంపన్నుడని పేరుపొందినాడు.

ఆ దినములలో గాంధారమున యవనులు రాజ్యము చేయుచుండిరి. యవన వర్తకుడైన డెమిత్రియసును, కీర్తిగుప్తుడును గాఢమిత్రులైనారు. వీరి వస్తువులు వారు, వారి వస్తువులు వీరు వర్తకమునకై మార్చుకొనుచుండిరి. వర్తకమున కంతయు వ్యవహార మనుచుండిరి. వస్తువులు వర్తకమునకై మార్చుకొనుట, వస్తువులు పణమునిచ్చి కొనుట, మూల్యమునకై అమ్ముట క్రయవిక్రయ మందురు. వ్యవహారమును పణమందురు. ఎగుమతి దిగుమతులు మొదలైనవన్నియు వ్యవహారమే. అమ్మకమునకు, కొనుటకు గల వస్తువులన్నియు పణ్యములు. వస్తువులు వర్తకమునకై అమ్మువారు, కొనువారు వణిజులులేక వణిక్కులు. ఈ వ్యవహారములుసల్పు వారిలోకుల, మత, జాతి బేధములన్నియు నున్నవి. కాని భారతదేశమునందు యీ వ్యవహారము చేయువారు ముఖ్యముగ వైశ్యులు. వీరిలో వ్యవహారము చేయువారు వ్యావహారికులనియు, పాశుపాల్యులనియు, క్షేత్రసంస్కారు లనియు మూడువృత్తు లవలంబించు వైశ్యులున్నారు.

వ్యవహారము సలుపువారలలో క్రయవిక్రయులు వస్తువిక్రయ శాలలు పెట్టుకొను వారు వశ్నికులు వడ్డివ్యాపారస్థులును, పెట్టుబడిదారులును. సంస్థానికులు యితర దేశములతో నెగుమతి దిగుమతి లొనర్చువారు. వీరినే సార్థవాహులు, సార్థకులు అనియు పిలుతురు. ఈ వణిక్కులలో ప్రభువులపక్షమున గనులు త్రవ్వించువారును, ఆటవిక వస్తువులను సేకరించువారుగ రెండువిధములవారున్నారు.

నిమి యను రాజు వర్తకశాస్త్రమును రచించినాడట. ఆ శాస్త్రమును చదివి వర్తకులు వైదేహులను పేరును సముపార్జించుకొనిరి. వర్తకులకు వర్తక సంఘములున్నవి. వానిని సంస్థానములందురు. సంస్థానికము లనియు పేరు గలదు.

కీర్తిగుప్తుడనేక జనపదములందున్న సంస్థానములలో సభ్యుడు. కొన్నింటికి అధ్యక్షుడు.

ఆంధ్ర వర్తకులలో కాశ్మీరముతో వర్తకము చేయువారు కాశ్మీర వణిజులు, గాంధారముతో చేయువారు గాంధారవణిజులు. కీర్తిగుప్తుడు నానా దేశవణిజు డని పేరుపొందినాడు. అతనికడ కౌశికులు, మాద్రులు, కాశ్మీరులు, గాంధారులు, మాళవికులు మొదలైన వర్తకులు ఎందరో యుండిరి.

కీర్తిగుప్తుడు గాంధారమునుండి ఔత్తరపథమున పారశీక, బాహ్లిక, తురుష్క వనాయు, కాంభోజ, కశ్యపసముద్ర, యవన దేశములతో వర్తకము చేయుచుండెను. అతనికి సర్వభాషలు గళగ్రాహములు. అన్ని దేశములవారాతని తమ దేశపువా డనియే భ్రమించియుండిరి.

ఈనాడు కీర్తిగుప్తులవారికి డెబ్బది రెండు సంవత్సరములున్నవి. ఆయనకు ఆంధ్రదేశములో వివిధప్రదేశముల ఉద్యానవనములు, ఫలవనములు లెక్కలేనన్ని యున్నవి. ఆర్యావర్తమునందు, దక్షిణాపథ మందు ప్రతిముఖ్యనగరమునందును కీర్తిగుప్తునకు వణిక్శాలలు, భవనములు ఉన్నవి.

కీర్తిగుప్తుడు ముప్పది సంవత్సరముల ఈడువాడై యున్నప్పుడు ప్రయాణము లొనరించి తక్షశిలానగరముచేరి తనభవనమునకు బోయెను. కీర్తిగుప్తుడు ప్రసిద్ధవర్తకు డగుటచే నాతనిరాక వచ్చిన మరుఘటిక యందే వర్తక లోకమున కంతయు దెలిసిపోయెను. నాలుగు గుఱ్ఱములు పూన్చిన రథము నెక్కి రాత్రి మొదటి యామములోనే స్నేహితుడగు డెమిత్రియసు అతితొందరగ పరువిడి వచ్చినాడు. వారిరువురు ఒకరి నొకరు కౌగిలించు కొనినారు.

డెమిత్రియసు వెంటనే కీర్తిగుపుని యాతనిభవనములో భోజనము చేయనీయక తన ఇంటికే కొనిపోయెను. ఆ యవనవర్తకుని భవనము భారతీయ భవనములరీతిగా నుండలేదు. ఆ భవన మొక అద్భుత వనాంతరమున నున్నది. ఆ వనమందు అపఫల, అలివ, యవననారంగ, అంజీర ఖర్జూర, దాడిమ, ద్రాక్ష, బాదమాది యవన ఫల వృక్షములు; లికుచ, రసాల, జంబు, పనస, ఐరావత, బదరీ. రాజాదన, బిల్వ, రంభాది భారతీయ ఫలవృక్షములు, నున్నవి. కరవీరాది అనేక పుష్పజాతు లున్నవి. వన మంతయు కేళాకూళులు. వాని మధ్య వేదికలపై పాలరాతి యవన దేవతా విగ్రహములు కలవు.

ఆ విశాలభవనమున అనేకమందిరములున్నవి. మద్యశాలలో శృంగార సరస్సులున్నవి. అపొలో యను సూర్యదేవుడు, అర్టెకమిస్ అను చంద్రదేవత, అప్రొదితీ గ్రీకు శృంగార రసాధి దేవత, జ్యూసు, జూనో ముఖ్య దేవదంపతులు, విజ్ఞానదేవి యగు ఎధీనీ, కామసుఖదేవు డగు బాఖస్, లోకవార్తాహరుడు హెర్మిస్, దేవకన్యలు మొదలగు పాలరాతివిగ్రహములు, యవన కలశములు అందందు అలంకరించబడి యుండెను. ధూపకరండములనుండి సువాసనధూపము లెగయుచుండెను.

ఇరువురు మెత్తని పరుపులపై సుఖోపవిష్టులైరి. పారశీక సేవకులు జలకలశముల హస్తప్రక్షాళన జలప్రతి గ్రాహకములు తెచ్చుటయు, వారిరువురు హస్తముల కడుగుకొనిరి. కొందరు బాహ్లికసేవకులు రెండు భోజన పీఠముల గొనివచ్చి వారిరువురి ఎదుట నుంచిరి.

భారతీయేతరమగు మ్లేచ్ఛదేశముల బానిసత్వ మప్పుడు విరివిగ నున్నది. కొందరు బానిసబాలికలు సౌందర్యదీప్తలగువారు వచ్చి, గ్రీకు వాద్యములపై వాయించుచు. యవన, బాహ్లిక, హీబ్రు, పారశీకాది భాషలలో పాటలు పాడుచు నాట్యమొనరింప నారంభించిరి. భారతీయ నాట్యమునకు నా నాట్యములకు ఎంతయో భేదముండెను. కీర్తిగుప్తున కివియన్నియు గ్రొత్తవి కావు.

అప్పుడు బానిసలగు న్యూబియాబాలికలు మోయు ఆందోళికపై యూద బాలికలు వింజామరలు వీవ, పారశీక బాహ్లికసుందరులు గొడుగులు తాల్ప, అత్యంత సుందరి యగు నొకజవ్వని వీరిరువురునున్న కడకు వచ్చెను. బానిసలగు సేవకులు కొందరు దంతసింహాసన మచ్చట నుంచిరి. అందలము దిగి ఇరువది వరముల ఎలప్రాయంపు నా మిసిమి మిఠారి వొయ్యారముగ నడచివచ్చుచు నా సింహాసనముపై నథివసించెను.

డెమిత్రియసు కీర్తిగుప్తునిచేయి పట్టుకొని యామెకడకు గొనిపోయి ఎరుక పరచెను. ఈమె “పెర్లా” నా చెల్లెలు, ఈతడు “కీర్తిగుప్తుడు” నా స్నేహితుడు అని ఒకరికొకరి నెరుకపరచెను.

అది మొదలు కీర్తిగుప్తుడు “పెర్లా” (ముత్యము) దేవికి తన హృదయము, తన సర్వస్వము ధారపోసెను. పెర్లా కాతడు ముక్తావళీదేవి యని నామముంచుకొనెను.

రెండు మూడు నెలలలో వారిరువురికి వివాహము జరిగెను. ఆ దంపతుల జీవితము సకలానందపూరితమై మహారాగమైనది. కతిపయ మాసములలో వారు ఆంధ్ర దేశము తరలివచ్చిరి. ముక్తావళిగర్భమున ప్రజాపతిమిత్ర ఉద్భవించెను. ప్రజాపతిమిత్ర యవన భారతీయ సౌందర్యములను, సుగుణములను రెంటిని తనలో సంగమ మొనరించుకొనినది. ఆమె చిన్నతనమునుండియు ఏలోకమునుండియో వచ్చినట్లు తనలోనే తానై, ఇతరులతో కొలది సంభాషణమే జరుపుచు తా నొక్కరితయు ఆడుకొను చుండెదిది.

“వెఱ్ఱిది, విచిత్రమైనది” అను మాటలు చుట్టములు, పక్కములును, “ఏప్పటిపిల్లనో కొనివచ్చి చేసికొనిన వెర్రి సంతానము పుట్టదటమ్మా!” యని కీర్తిగుప్తుని అక్క చెల్లెండ్రును అనువారు. ప్రజాపతిమిత్రకు యౌవన మంకురించి దేవలోకమునుండిదిగివచ్చు మూర్తివలె నయినది. చదువులో మొదటిబిడ్డ, సంగీతములో ప్రథమ బాలిక, నాట్యములో ఊర్వశి. ఆ పరమసుందరాంగిని జూచి చారుగుప్తుడు ఆమె పాదములమ్రోల తన ప్రాణము, ఆత్మ పూజాపుష్పముల జేసినాడు. కోటీశ్వరుని తనయుడైనను సర్వవిద్యాపారంగతుడై, బలసంపన్నుడై, రసగ్రహణపారీణుడైన చారుగుప్తునే వరించినది ప్రజాపతిమిత్ర.

ప్రజాపతిమిత్ర కాపురమునకు వచ్చినప్పటినుండియు చారుగుప్తుడు ఇతరము సర్వము సంపూర్ణముగ మరచిపోయినాడు.

28. స్వర్ణ ప్రతిమ

ప్రజాపతి కాపురమునకు వచ్చిన రెండేండ్లకు వారిరువురకు హిమబిందు ఉద్భవించినది.

ప్రజాపతిమిత్ర ఆనందముకు మేరలేదు. చారుగుప్తుడు సీతదొరికిన జనక మహారాజుకన్న ఎక్కువ ఆనందము నందినాడు. వారిరువురు ఉమనుగన్న మేనా హిమవంతులకన్న ప్రకాశించిపోయినారు.

కోటీశ్వరుడైన వినయగుప్తుడు శ్రీకాకుళమునుండి, కావేరి పట్టణమునుండి, తామ్రలిప్తినుండి, భరుకచ్ఛమునుండి, సువర్ణద్వీప, బలిద్వీప, యవద్వీప, సింహళద్వీప, రాక్షసద్వీప, మలయద్వీప, నీలద్వీప అను ద్వీపాది ద్వీపానేకములనుండి నారికేళ, ప్రవాళ, మౌక్తిక, శోణరత్న, లవంగ, జాయక, ఘనసార, చంద్రబాలా, కోరంగి మొదలైన వస్తువులను తెప్పించును. బంగారము, వెండి, రాగి, ఇనుము, కత్తులు, కరవాలములు, ఛురికలు, వర్మములు, దర్పణములు, నగలు, నాణెములు, విగ్రహములు మొదలగు వస్తువు లెన్నియో దిగుమతులు చేయుచుండెను. ఆతనికి వందల ఓడలున్నవి. కీర్తిగుప్తుడు సార్థవాహుడు, వినయగుప్తుడు సాయంత్రికుడు. సాయంత్రికులను పోత వణిక్కులనియు నందురు. ఇరువురు వియ్యమందుట సముద్రుని తండ్రియైన వరుణదేవుడు, గంగాదేవి తండ్రియైన హిమవంతుడును వియ్యమందుట యని దేశము లాడికొని ఆనందము నందినవి.

చిన్న మనుమరాలు పుట్టినప్పుడు కీర్తిగుప్తుడు, వినయగుప్తుడు హిమబిందున కెన్ని సుందరక్రీడావస్తువులు సమర్పించినారో, ఎన్నియలంకారములు, ఎన్ని భూషణములు, ఎన్ని వస్త్రాదికములు తెచ్చినారో! హిమబిందు క్రీడామందిరముల నెన్నియో సాలభంజికలు, లక్కబొమ్మలు, దంతపు శిల్పములు, గంధపు ఆటసామానులు, ముత్యపుచిప్పల పెట్టెలు, వివిధరకముల శంఖములు, గవ్వలు, పవడముల చందుగలు, పళ్ళెములు, అమూల్య రత్నములు, శిలలుదొలిచిన బరిణెలు, సింహ, శార్దూల, వ్యాళ, ఖడ్గమృగ, మృగాది జంతువుల చర్మము లున్నవి. పూసల పేర్లు, కోటుల ఫణములు విలువచేయు ఎర్ర ముత్యముల హారములు, నవరత్నహారములు, బంగారునగలు, రత్నఖచితహారములు, కేయూరములు, శిరోభూషణములు, మేఖలలు, మంజీరములు, లోలకములు, కర్ణభూషలు, చీనా దుకూలములు, బాహ్లిక పారశీకాది దేశ రాంకవములు, నీలదేశవల్కలములు లెక్కలేనన్ని ఆమెకై మందిరములు, మందిరములు నింపినారు ఇరువురు తాతలు.