హిమబిందు/ప్రథమ భాగం/13. ప్రయాణము

మందరము ప్రార్థించుచున్నాము. వీరు మీవంటి ఉత్తమ బ్రాహ్మణులను బంధిపకయే తీసికొని పోదురు” అని మనవి చేసినాడు.

వృద్ధుడగు నా క్షత్రియుని అవలోకించి చంద్రస్వామి “చక్రవర్తిపై దోషమా! నేనా!” యనుకొనుచు “చక్రవర్తి శ్రీముఖసాతవాహనుడు ధర్మమూర్తియే! ఎందరు బ్రాహ్మణుల కగ్రహారముల నాయన సమర్పింపలేదు? ఈ అఖండ మహారాజ్యము సుభిక్షమై యా ధర్మరూపుని చల్లని పరిపాలనములో సర్వ సంపదల కాకరమై రామరాజ్యమును దలంపునకు తెచ్చుచున్నదే! వారి పైన నేను దోష మేమి యాచరింపగలను?” యని పలికినాడు. అతనిమోము వైవర్ణ్య మొందినది. విషాదమేఘము లాతని నావరించినవి.

ఆ దళవాయి చంద్రస్వామిని కనుగొని “స్వామీ! మీ రనునది నిజమే! కాని, ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చును. తమ్ముగూర్చి వృద్ధశ్వితవులు ఘనముగా చెప్పియున్నారు. మీకు సకల సౌఖ్యముల నొన గూర్చుచు తీసికొని పోదుము. చక్రవర్తి జన్మదినోత్సవము లఖండముగ జరుగుచున్నవి. ఆ ఉత్సవములు పూర్తికాకుండగనే ఈ అభియోగము విచారింపబడగలదు. ఇప్పుడు జాగుసేయక తాము తొందరగ బయలుదేరినచో, మనము తెల్లవారునప్పటికి ఏ మూడు క్రోశములైన పోగలము. తమకు అందలము సిద్ధము చేయించినాము. మేము అశ్వములపై ప్రయాణము చేయుదుము. ఒక వారములోననే మనము ధాన్యకటక నగరము చేరగలము” అని మనవిచేసి నమస్కరించెను.

13. ప్రయాణము

ఆంధ్రదేశమునం దెల్లెడను మహారాజపథములు, ఘంటాపథములు, రాజ మార్గములు, బాటలు విరివిగా నున్నవి.

మహారాజమార్గము ఎనిమిది దండములు వెడల్పు (దండము = 8 అడుగులు, అడుగునకు 9 అంగుళములు). ఘంటాపథము ఆరుదండముల వెడల్పు. ఈ బాటపై ఏనుగులు ప్రయాణము చేయును. రాజమార్గము నాలుగుదండముల వెడల్పు. వీనినే రథ్యలనికూడ పిలుచుచుండిరి. సాధారణపు బాటలకు అశ్వికపథమనియు, ఖరోష్టపథ మనియు, చక్రపథమనియు పేరులున్నవి. ఆశ్వికపథమునకు ప్రక్కనే మనుష్యపథమనియు, పాదపథ మనియు మనుష్యులు నడుచు పథమున్నది. ఈ పథము రెండు అరట్నులు వెడల్పు (1 అరట్ని = రెండు అడుగులు). ఈ బాటపై మనుష్యులు మాత్రమే నడువవలసి ఉన్నది. అన్ని పథములు రాళ్ళతో, సున్నముతో తరతరము లుండునట్లుగా నిర్మింపబడినవి. గ్రామము, గ్రామము కలుపు సాధారణపథములు గట్టిగా దిమ్మెస చేయబడి, ఎడ్లబండ్ల, అశ్వముల యానమునకు ఉపయోగపడు నట్టమరింపబడియుండెను.

ఈ మార్గములన్నిటికి పై అధికారి సర్వమార్గాక్షుడను ఉత్తమోద్యోగి. సర్వమార్గములు సరియైన స్థితిలో నుంచుటయు, మార్గముల ప్రక్క ఆరు గోరుతముల కొకచోట జలగృహముల నుత్తమస్థితిలో నుంచుట, మార్గములవెంట సత్రములు, సత్రములలో భోజనగృహములు, పశువైద్యశాలలు, మనుష్యవైద్య గృహములు నుచితరీతి జరుగునట్లు పర్యవేక్షణ చేయుట-ఇవి ఈ యధికారి ధర్మములు.

ఆంధ్రదేశము ధాన్యకటకమునుండి మహారాజపథములు నాలు గున్నవి. ఒకటి ధాన్యకటకమునుండి కృష్టదాటి వాయవ్యమూలగాబోయి, సువర్ణపురము, నాగేంద్ర నగరము, పర్వతనగరము, మహానగరముల మీదుగా మంజిష్ఠానదీతీరముననున్న గంగా పట్టణమునకుబోయి యచ్చట నుండి ప్రతిష్టాన నగరమునకు బోవును.

రెండవ మహారాజపథము ధాన్యకటకమునుండి తూర్పుగా ఇంద్ర కీలాద్రి పురమునకుబోయి అచ్చటనుండి ఆగ్నేయముగా కృష్ణానదీతీరముననే భట్టిప్రోలు పోయి, యచ్చట కృష్ణ దాటి ఘంటికాశాలకును ఆ పురమునుండి శ్రీకాకులమునకును బోవును.

మూడవ మార్గము ధాన్యకటకమునుండి దక్షిణముగా ధనదపురమునకు, నచ్చటనుండి ఉదయ పర్వతమునకు, నచ్చటనుండి కాంచీ పురమువరకు పోవును.

నాల్గవమార్గము ధాన్యకటకమునుండి ఈశాన్యముగాబోయి, వేంగీ పురము, అచ్చటనుండి గౌతమీతీరముననున్న గోతీర్థముకడ గౌతమిని దాటి దక్షిణకోసల రాజధాని, పిష్టపురమును, పూర్వాంధ్రదేశ ముఖ్య నగరమగు శాతవాహనగుండము, ఆంధ్రగిరి పోయి, అటనుండి త్రికళింగ దేశము చేరును.

చంద్రస్వామిని శిబికారోహిని జేసి శాతవాహనసైన్య దళపతియు, సైనికులును రెండు దినములలో ఇంద్రకీలపర్వతము జేరినారు. ఇచ్చట కృష్ణానది ఇంద్రకీలపర్వత పంక్తి ఛేదించి, సింహమధ్యమయై, వేగవతియై సముద్రతీర భూములైన నాగవిషయమున ప్రవహించి, ప్రాచీనాంధ్ర ప్రభువగు సుచంద్రుడు, అవతారమూర్తియగు ఆంధ్రవిష్ణువు పరిపాలించిన శ్రీకాకులపురమును పవిత్రముచేయుచు, మూడుగోరుతముల దూరమున సముద్రమున జేరును. (ఇప్పుడు కృష్ణానది శ్రీకాకులపురమునుండి పదిమైళ్ళు తూర్పుగా నదిఒండ్రుచే వెనకకు జరిగినది.)

చంద్రస్వామి ప్రయాణము చేయుచు గ్రామగ్రామమున జరుగు చక్రవర్తి జన్మదినోత్సవములు చూచుచుండినాడు. ప్రజలందరు మేకల వంటివారు. వారీనాడొక మార్గము మంచిదందురు. రేపు వేరొక పథము శుభమందురు. ఎల్లుండి మరియొక్క టందురు. వారికి నిలకడ ఎక్కడ? ఈ రోజున వెర్రిభక్తితో నాగదేవులను కొల్తురు. గ్రామ దేవతలకు నరపశువునుగూడ బలియిచ్చుటకు సిద్ధమగుదురు. రేపు బౌద్ధసన్యాసి యొక్కడు వచ్చి అహింస బోధించగనే, మాంసాహారమునైన మానుదురు. కాషాయాంబరముల ధరింతురు. నగల నూడ్చివైతురు. రెండు మూడునూరుల సంవత్సరములలో ఈ పవిత్ర భూమి యంతయు నీ చార్వాకమత మల్లుకొనిపోయినదే. యాగములు పనికిరావట, చైత్యములకు పూజలట.

మనుష్యుడు దేహము వదలిన వెనుక నేమున్నది? ఖననమై భౌతి కేంద్రియము లన్నియు పంచభూతముల లీనమైపోవలెగదా! ఉపనిషన్మత విరోధముగ బోధించి దేహము మాయయని చెప్పుచు, నా దేహమున ఎముకయు, వెండ్రుకయు, దంతము, నఖముకూడా పూజనొందవలయునని శాసించిన యాతడు అర్హతుడట, బుద్ధుడట. చితిపై గట్టబడిన కట్టడము చైత్యమట, అద్దానికి పూజలట, అది త్రిరత్నముల నొకటియట!

అని యూహించుకొనుచు చంద్రస్వామి కృష్ణానదిలో ప్రాతఃకాలముననే గ్రుంకులిడి ఉదయ సంధ్యార్చన మొనర్చి, సూర్యున కర్ఘ్యమిడి పురసత్రమున వంటయొనర్చుకొని, భుజించి మరల శిబిక నారోహించి బయలుదేరెను. సాయంకాలమగునప్పటికి వారందరు ధాన్యకటక నగరము జేరిరి.

దళవాయి కోట ఈవలనున్న ఉప సైన్యాధ్యక్షుల భవనమునకు గొనిపోయి ఆజ్ఞలనంది చంద్రస్వామిని తోటలోనికి గొనిపోయి ద్వితీయ ముహూర్తపు భేరీలు మ్రోగకముందే రాజపురోహితాశ్రమమున ప్రవేశపెట్టెను. ఆ మరునాడు కోటలో ప్రాడ్వివాకసభా భవనమున చంద్రస్వామి విచారణము ప్రారంభించిరి. చంద్రస్వామికి అన్ని సౌఖ్యములు రాజపురోహితు లొసగిరి. ఉదయాస్తమయముల గాయత్రి జపించుకొనువాడు. తపస్సు చేసికొనువాడు. భగవన్నామ స్మరణానందప్రేంఖణమగు గానపరవశత్వ మందువాడు. చంద్రస్వామి భక్తుడు. భక్తులకు భయము, ప్రఫుల్లపద్మసూనంబులకు దుర్గంధము, పండువెన్నెలలకు వేడిమి యెచ్చట?

పూర్వకాలమునందు న్యాయవిచారణ నేటికన్న వేయిమడుంగులుత్తమముగ నుండెడిది. దేశమునకంతకు మహారాజసభ ప్రధాన న్యాయస్థానము. దాని వెనుక ప్రాడ్వివాకులసభ స్థానీయ, ద్రోణముఖ, ఖార్వతిక, సంగ్రహణ యనునవి పోనుపోను చిన్నవి. ఎనిమిది వందల గ్రామములకు ద్రోణముఖమును, రెండువందల గ్రామములకు ఖార్వతికము, సంగ్రహణము పది గ్రామములకు న్యాయస్థానములు. ఈ సభలు రెండు విధములు: ధర్మస్థీయము, కంటకశోధము అనునవి. ధర్మస్థీయము వ్యావహారిక ధర్మమునే విచారించును. కంటకశోథసభ వర్తకము, వృత్తి, రాజకీయము మొదలగు విషయముల ధర్మనిర్ణయ మొనర్చును. ప్రాడ్వివాకునిసభ ధర్మస్థీయ కంటక శోధ విషయముల రెంటిని విచారించును. ఆ పైన రాజే సభాపూర్ణుడై స్వయముగా న్యాయ విచారణ చేయును.

నేడు చంద్రస్వామిని కోటలోనున్న ప్రాడ్వివాకుని సభకు గొని వచ్చిరి. రాజభటు లిరువు రాతని తీసికొనివచ్చిరి. ప్రాతఃకాలోచిత కృత్యములు దీర్చికొని పిమ్మట ఉదయము రెండవ మూహూర్తఘటిక మ్రోగు నప్పటికి సభావ్యవహారము ప్రారంభింతురు. సభయందు ప్రాడ్వివాకు డొక ఉన్నతాసనముపై నధివసించియుండెను. ధర్మశాస్త్ర పండితులగు సభ్యులు మువ్వు రితరాసనములపై వేరొకయెడ వసించియుండిరి. ఒక వేదికపై నలువురు బౌద్ధభిక్షువు లొక మృదులమగు ఖర్జూరపుచాపపై నధివసించి యుండిరి. సంధ్యాపాలుడు, లేఖకుడు, గణకుడు (లెక్కలవ్రాయువాడు) వారి వారి యథాస్థానముల నుండిరి. ఏ న్యాయ సభయందును నొక్కపురుషుడు ధర్మనిర్ణయము చేయుట పూర్వకాలము నందెప్పుడును లేదు. వారుకాక నేర మెచ్చటనుండి వచ్చినదో అచ్చోటునుండి ధర్మ సహాయులు కొందరు వచ్చెడివారు. వారుగాక, ఏవిషయమున అనుమానము తటస్థించినను తమ అభిప్రాయములనిచ్చి సందేహము తీర్చుటకు ధర్మశాస్త్ర పారీణులగు భిక్షులు, బ్రాహ్మణులు కొందరు సభయం దుందురు. మహారాజే స్వయముగా విచారించినప్పుడై నను వీరందరు నుండవలసినవారే.

ఎవరి పైనైనను నేరము మోపబడినపుడు ప్రాడ్వివాకానుజ్ఞాతుడై సంధ్యాపాలుడు రాజముద్రాంకితమగు “ఆ సేద్యము” (పిలుపు) పంపును. ఆ పైన వారు వచ్చి తీరవలయును. బాలబాలికలు, ముదుసలులు మొదలగువారు మాత్రము రానక్కరలేదు. చంద్రస్వామిని రాజభటులు కొనిరా, పండితుడును యువకుడునగు నా ద్విజోత్తముని నొక చిత్రాసనమున కూర్చుండుమని ప్రాడ్వివాకుడు కోరెను. ఉత్తమకులసంజాతుడును, ధర్మశాస్త్ర పారీణుడును, సత్యవాదియు నగువాడే ప్రాడ్వివాకుడుగా నుండనరుడు.

14. నిర్దోషి

గణకుడు వచ్చి చంద్రస్వామి నవలోకించి “ఆర్యా! మహామంత్రి శ్వైత్రులవారు మీరు మహారాజుపై కుట్రలు సలుపుచున్నట్లుగా నేరము మోపినారు. దాని నిప్పుడు