హిమబిందు/ప్రథమ భాగం/12. బంధితుడు

12. బంధితుడు

శోణనగ మను గ్రామము వేంగీవిషయమున గోదావరీనదీతీరమునకు మూడు గోరుతముల దూరమున నున్నది. శోణనగ మనుపేరు ఆ గ్రామము ప్రక్కనున్న ఎఱ్ఱటి కొండవలన వచ్చినది. ఆ గ్రామము ఫలమంతమగు భూములచే, తోటలచే నలరారుచు నూరు బ్రాహ్మణగడపతో, రెండువందల క్షత్రియులైన రెడ్ల గృహములచేతను, ముప్పది వణిజుల ఇండ్లతోను, రెండువందల ఏబది చాకలి, మంగలి, కుమ్మరి మొదలయిన శూద్రగేహములతోను నిండియున్నది. నూరు బ్రాహ్మణ గృహములలో ఇరువది ఇళ్ళు శిల్ప బ్రాహ్మణులవి. ఆ గ్రామములోని క్షత్రియులు, శూద్రులు, వణిజులు బౌద్ధ దీక్షావలంబకులు. బ్రాహ్మణులు వేదధర్మ మనుసరింతురు. శిల్ప బ్రాహ్మణులు ఈ వైదిక సాంప్రదాయమన్నను, బౌద్ధసంప్రదాయమన్నను సమాన గౌరవము, భక్తియు గలవారు.

శోణనగ గ్రామవాసులు చైత్రశుద్ధపాడ్యమినాడు గ్రామ శృంగాటక ప్రదేశమున అశ్వత్థ నింబ వృక్షసంశ్లేష స్థల విశాలవేదికపై కూడినారు. గ్రామణియు, పూర్వసంవత్సర సంఘసభ్యులు వేదికపై తాటియాకుల చాపల పై నధివసించిరి. తక్కుంగల ప్రజలందరు వేదికచుట్టును నచ్చటచ్చట గుంపులుగా విడిగా కూర్చుండియుండిరి. గ్రామ పురోహితుడగు చంద్రస్వామి పంచాంగ శ్రవణము నొనర్చెను.

ఆపైనా సంవత్సర గ్రామపాలకులగు గ్రామణిని. పంచసంఘ సభ్యులను ఎన్నుకొనిరి. ఎన్నుకొనుట యనగా గ్రామవాసులు వారు వారు సభ్యులువారు గ్రామణులు అని పేర్కొందురు. తక్కినవారు వల్లెయని కేకలనిడుచుగాని, చేతులనెత్తిగాని తెల్పుదురు.

ఎన్నుకొనిన సభ్యులును, గ్రామణియు “దమ్మసూత్త” గ్రంథము చేత నుంచుకొని ఆ సంవత్సరము తాము శోణనగ గ్రామమును ధర్మయుతముగా, ప్రజాహితముగా పరిపాలింతుమనియు, తామాగ్రామప్రజలకు, భగవంతునికి సంపూర్ణ సేవకులమనియు వాగ్దానములు చేసిరి.

ఆ కాండ నెరవేరుటతోడనే గ్రామపురోహితుడును, తక్కుంగల బ్రాహ్మణులును వేదపనసల చదివి, వారందరి నాశీర్వదించిరి. పుణ్యాంగనలు పాటలుపాడి హారతులిచ్చి తిలకములిడిరి. వారిపై అందరు అక్షతల జల్లిరి. అచ్చటనుండి గ్రామోత్సవము లారంభమైనవి. ఆటలతో, పాటలతో, భజనలతో గ్రామమంతయు ఉప్పొంగిపోయినది. ఆంధ్రదేశమునం దాదినము ప్రతిగ్రామమునం దట్టి ఉత్సవములు, ఎన్నికలు జరుగును. రాత్రియంతయు భగవత్కథాకాలక్షేపము జరిగినది. ఆ వెనుక యక్షనాటకము ప్రదర్శింపబడినది.

కాని పురోహితుడగు చంద్రస్వామి ఉత్సవములం దేమియు పాల్గొనక, తలవాల్చికొని యింటికి వెడలిపోయెను. చంద్రస్వామి ఆపస్తంభ సూత్రుడు, కృష్ణయజుర్వేది, భారద్వాజుడు ఆతడు సాంగవేది, ధర్మశాస్త్ర కోవిదుడు, ఐతిహాసికుడు, గృహ్యసూత్రాల ఉద్దండవిజ్ఞాని. చుట్టుప్రక్కల గ్రామముల పురోహితులలో, బ్రాహ్మణులలో తలమానికము వంటివాడు. మధ్యమ వర్చస్వి బక్కపలుచని దేహపుష్టి కలవాడు. విశాలవదనము కలవాడు. ధనువునకు రెండుగుప్పిళ్ళు తక్కువ ఎత్తుతో, సమనాసికతో, చిన్న కళ్ళతో, పొడుగాటి మెడతో భుజములకంటు చెవులతో నాత డపర బృహస్పతి వలె తేజరిల్లుచుండును. ముప్పదిఏండ్ల ఈడువాడయినను బ్రహ్మచారియగుట నాతని గృహము నొక ముదుసలి మేనయత్త నిర్వహించుచుండును.

ఇంటికిబోయి దొడ్డిలోనికిజని కూపమున నీరుతోడికొని స్నానమాచరించి, సాయంకాల మూహించి, మడివస్త్రముల గట్టుకొని యాతడుసంధ్యార్చన చేయగడంగెను. సంధ్యార్చన పూర్తి చేసికొని యాతడు తన పూజాగృహము ప్రవేశించెను. మినుకు మినుకుమను అర్చనాదీపకాంతిలో మహావృషభమూర్తి, పదునాల్గంగుళముల తామ్ర విగ్రహమూర్తిగా ప్రత్యక్షమయ్యెను. ఆ విగ్రహమునకు చంద్రస్వామి సాగిలబడి ప్రార్థనా శ్లోకములు పఠించి లేచి, పద్మాసనము వేసికొని జపముచేయ ప్రారంభించెను.

మేనయత్త ఫలహారము కానిచ్చి, ఇల్లంతయు సర్దుకొని, తలుపు వేసికొని వచ్చి, దొడ్డిలో నులకమంచము వేసికొని పక్క వేసికొని నిద్దుర కూరినది.

గ్రామపు తలవరి మూడవ యామపు కేకలు వేయుచు పోవునంత వరకు చంద్రస్వామి జపదీక్షపరుడై యుండెను. జపము పూర్తి యగుట తోడనే లేచి మహేశమూర్తి ఎదుట సమాలింగిత భూతలుడై లేచి, దొడ్డిలోనికి జనెను. చుక్కలు మిన్కుమిన్కనుచుండెను. దూరమున పొలములలో నక్కకూతలు వినవచ్చుచుండెను. దొడ్డిలోనున్న వృక్షములు నిశ్చలములై దేవదేవుడగు నీశ్వరునిగూర్చి తపస్సు చేయుచున్నట్లుండెను.

“అయ్యో భరతఖండమంతయు నాస్తికుల పాలయినదే. ఎక్కడ బుద్ధుడు! ఎక్కడవేదములు. వేదములు పౌరుషేయములట. భగవంతుడే లేడట. బుద్ధుడే భగవంతుడట. అతడే తాను భగవంతుడనుకాను భగవంతుడే లేడని చెప్పినాడు. గాని ఈ భిక్కులు బుద్ధుడే సర్వసృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు అంటున్నారు. బుద్ధునిమార్గమే అనుసరించెదరు. కొందరపరశైలవాదులట. కొందరుపూర్వశైలవాదులట. ఈ చార్వాకమతము మశూచిరోగమువలె భరతఖండమంతయు నల్లుకొనిపోయినది. భగవద్గీత, వేదాంతసూత్రములు ఎంత యుత్కృష్టగ్రంథములు! “దమ్మసూత్తము” లట; దద్దమ్మసూత్తములు కావా? జాతక గాధలట! త్రిపీఠకములట! వేదములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ధర్మశాస్త్రములు, ఉపవేదములు, అన్నియు నాశనమైనట్లేనా? వినాశ కాలము వచ్చునది. ఏదియో మహా ప్రళయము ఆవహిల్ల బోవుచున్నది. చక్రవర్తులే బౌద్ధ దీక్షపరులైనప్పుడు ప్రజలగతి యేమి?

“శూద్రులందరు బౌద్ధ మతావలంబకులై బుద్ధచైత్యపూజాపరు లయ్యారు. ఏలాగు ఈ భయంకరస్థితిని మాపుట? గురుదేవులు అవతారమూర్తులు. వారే కల్కి అవతారదేవునకు వైతాళికు లగుదురుగాక!” అని ఆలోచించుకొనుచు ఇటునటు నడుచుచుండెను.

ఎవరో వీధి తలుపు తట్టినట్లయినది. “ఎవరువా” రని చంద్రస్వామి కేకవైచి ఇంటిలోనుండివచ్చి ముందరచావడి దాటి సింహద్వార కవాటము తెరచెను. కాగడాలతో కొందరు మనుష్యులు చంద్రస్వామికి కనిపించిరి. కాగడాల వెలుతురున నూత్న గ్రామణియగు శ్వితవుడు, గ్రామసంఘసభ్యులు, ఇరువురు తలారులు, కొందరు సైనికులు, నొక దళిపతియు నాయనకు గోచరించిరి.

చంద్రస్వామి “ఏమి ఇది?” యని ప్రశ్నించెను. శ్వితవుడు “అయ్యా నమస్కారములు. తాము చక్రవర్తిపై నేదియో దోష మెంచినారట. అందుకై తమ్ము బంధించి ధాన్యకటక నగరమునకు కొని తేవలయునని, మహా సైన్యాధికారి ముద్రవేసిన భూర్జపత్రముగొని యీ దళవాయి వచ్చినారు. కానీ మీ రీ క్షణముననే వీరివెంట పోవలయునని మే మందరము ప్రార్థించుచున్నాము. వీరు మీవంటి ఉత్తమ బ్రాహ్మణులను బంధిపకయే తీసికొని పోదురు” అని మనవి చేసినాడు.

వృద్ధుడగు నా క్షత్రియుని అవలోకించి చంద్రస్వామి “చక్రవర్తిపై దోషమా! నేనా!” యనుకొనుచు “చక్రవర్తి శ్రీముఖసాతవాహనుడు ధర్మమూర్తియే! ఎందరు బ్రాహ్మణుల కగ్రహారముల నాయన సమర్పింపలేదు? ఈ అఖండ మహారాజ్యము సుభిక్షమై యా ధర్మరూపుని చల్లని పరిపాలనములో సర్వ సంపదల కాకరమై రామరాజ్యమును దలంపునకు తెచ్చుచున్నదే! వారి పైన నేను దోష మేమి యాచరింపగలను?” యని పలికినాడు. అతనిమోము వైవర్ణ్య మొందినది. విషాదమేఘము లాతని నావరించినవి.

ఆ దళవాయి చంద్రస్వామిని కనుగొని “స్వామీ! మీ రనునది నిజమే! కాని, ఏదో పొరపాటు జరిగి ఉండవచ్చును. తమ్ముగూర్చి వృద్ధశ్వితవులు ఘనముగా చెప్పియున్నారు. మీకు సకల సౌఖ్యముల నొన గూర్చుచు తీసికొని పోదుము. చక్రవర్తి జన్మదినోత్సవము లఖండముగ జరుగుచున్నవి. ఆ ఉత్సవములు పూర్తికాకుండగనే ఈ అభియోగము విచారింపబడగలదు. ఇప్పుడు జాగుసేయక తాము తొందరగ బయలుదేరినచో, మనము తెల్లవారునప్పటికి ఏ మూడు క్రోశములైన పోగలము. తమకు అందలము సిద్ధము చేయించినాము. మేము అశ్వములపై ప్రయాణము చేయుదుము. ఒక వారములోననే మనము ధాన్యకటక నగరము చేరగలము” అని మనవిచేసి నమస్కరించెను.

13. ప్రయాణము

ఆంధ్రదేశమునం దెల్లెడను మహారాజపథములు, ఘంటాపథములు, రాజ మార్గములు, బాటలు విరివిగా నున్నవి.

మహారాజమార్గము ఎనిమిది దండములు వెడల్పు (దండము = 8 అడుగులు, అడుగునకు 9 అంగుళములు). ఘంటాపథము ఆరుదండముల వెడల్పు. ఈ బాటపై ఏనుగులు ప్రయాణము చేయును. రాజమార్గము నాలుగుదండముల వెడల్పు. వీనినే రథ్యలనికూడ పిలుచుచుండిరి. సాధారణపు బాటలకు అశ్వికపథమనియు, ఖరోష్టపథ మనియు, చక్రపథమనియు పేరులున్నవి. ఆశ్వికపథమునకు ప్రక్కనే మనుష్యపథమనియు, పాదపథ మనియు మనుష్యులు నడుచు పథమున్నది. ఈ పథము రెండు అరట్నులు వెడల్పు (1 అరట్ని = రెండు అడుగులు). ఈ బాటపై మనుష్యులు మాత్రమే నడువవలసి ఉన్నది. అన్ని పథములు రాళ్ళతో, సున్నముతో తరతరము లుండునట్లుగా నిర్మింపబడినవి. గ్రామము, గ్రామము కలుపు సాధారణపథములు గట్టిగా దిమ్మెస చేయబడి, ఎడ్లబండ్ల, అశ్వముల యానమునకు ఉపయోగపడు నట్టమరింపబడియుండెను.

ఈ మార్గములన్నిటికి పై అధికారి సర్వమార్గాక్షుడను ఉత్తమోద్యోగి. సర్వమార్గములు సరియైన స్థితిలో నుంచుటయు, మార్గముల ప్రక్క ఆరు గోరుతముల కొకచోట జలగృహముల నుత్తమస్థితిలో నుంచుట, మార్గములవెంట సత్రములు, సత్రములలో భోజనగృహములు, పశువైద్యశాలలు, మనుష్యవైద్య గృహములు నుచితరీతి జరుగునట్లు పర్యవేక్షణ చేయుట-ఇవి ఈ యధికారి ధర్మములు.

ఆంధ్రదేశము ధాన్యకటకమునుండి మహారాజపథములు నాలు గున్నవి. ఒకటి ధాన్యకటకమునుండి కృష్టదాటి వాయవ్యమూలగాబోయి, సువర్ణపురము, నాగేంద్ర