దుడుగక యొనర్చి పిమ్మట
యడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433

ఆఱవ యుపకథ


చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాం
గదుని నివాసమై యలరు కాశికిఁ బోయెడుత్రోవ నీడపు
ట్టదు గద నాఁగమించినయెడ న్నొకచో నొకలేఁతమఱ్ఱి య
భ్యుదయము నొందసాగెఁ దఱినొందినవానలచేత నంతటన్. 434

తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్ల
ద్రెంచి శాఖావితానము ద్రుంచివైవ
మోడుపడియుండె నది నిల్వనీడపట్టు
గొమ్మయును లేమి తనయందుఁ గుదురుకొనఁగ. 435

తే. అంత నొక శైవుఁ డాత్రోవ నరుగువాఁడు
కెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చి
చెంతఁబడియున్నఱాయి యాచెట్టుమొదటఁ
జేర్చి విఘ్నేశుఁ డనుచుఁ బూజించి చనిన. 436

క. అది మొదలుగఁ దెరువరులిం
పు దలిర్పఁగఁ దెచ్చి తెచ్చి పుడిసెఁడు నీళ్లుం
బదియైదు గఱికిపోచలు
గదియించి చనంగ నచట గణపతి నిలిచెన్. 437

సీ. పాల్పొంగి వఱదలై పాఱఁ జెంగటి యూళ్ల
కాఁపుగుబ్బెతలు పొంగళ్లువెట్ట
నీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథ
రాసురు ల్నారికేరములు గొట్ట

యుండిగల్నిండఁ బొన్నూళ్ల కేగెడు బేరు
లకలంకభక్తి గానుకలు వైవఁ
గుప్పగాఁ దెరువాట్లు గొట్టెడు పెనుదొంగ
బంటు లాదాయంబు పంచి యొసఁగ
తే. నీడపందిరి చెంత గన్నేరుతోఁట
నమ్మి పూజించుఁ గ్రొత్తకాణాచినంబి
పొంతనిన్చిన దారువిభూతిపాత్ర
మమరఁ గనుపట్టె నచట విఘ్నాధినేత. 438

సీ. తను దలంచినవేళ ధరణీధరకుమారి
పాలిండ్ల బోరునఁ బాలు గురియఁ
బొడఁగనవచ్చు వేల్పులఱేని కరిఁ జూచి
దాక్షాయణీభర్త తన్నుఁ దలఁప
మనసునిల్వమి నెమ్మి మాపుపై వయ్యాళి
మన్నీఁడు తనుఁజూచి మరలిపోవ
మముఁ బిల్వఁ బంపుకొమ్మా యని ప్రమథసం
ఘమ్ములు తనపేరఁ గమ్మలనుప
తే. నతుల కైలాసలీలాగృహాంతరాళ
కేళికాపాళికలును గపోల మరిచ
కాయమానమహచ్ఛాయజాయమాన
మేదురామోదుఁ డయ్యె లంబోదరుండు. 439

క. ఆతనికి వెఱచి పథిక
వ్రాతము తనుఁ జెనకకునికి వటభూరుహ మ
త్యాతతశాఖాగ్రవస
ద్యోతటినీహంసికాసముత్కర మయ్యెన్. 440

వ. ఆసమయంబున. 441

సీ. పాటలావనిజాతపటలదోహదము కా
సారార్థజలకుంభజన్మమూర్తి
సహకారశుకభారసాధారకరణి వ
న్యానంగశూలిఫాలాక్షవీక్ష
శాల్మలీఫలదండసంఘట్టనంబు ద
క్షిణమరున్మదహస్తిసింహరుతము
పథికప్రపాంగణప్రాపణాంకణము మ
రీచికానిమ్నగాస్వఘటపటిమ
తే. మహితశైత్యవధూస్తనమార్గదర్శి
చటులజంఘాలవాత్యాళిజననవేళ
తాలవృంతాదిమూల్యప్రదాయకంబు
దనరు సంతప్తజనము నిదాఘదినము. 442

మ. తురగాస్యోత్క్రమకృద్దవోద్గతమహాధూమాంబువాహంబు వే
చరమాశాగతమైన గాలి కెదురై సారోజ్జ్వలస్యందనం
బు రహిం గ్రాలఁ గుమారు గాలిపటముం బోలెందివి న్మెల్లనే
తిరుగంగా నిటులయ్యె నాఁగదినము ల్దీర్ఘంబు లయ్యెం గడున్. 443

చ. పడమటిగాలి వెట్ట నొకపారియుఁ గ్రోలమి నీరసంబులై
జడిసిన చిల్వగుంపు నొకపారియు మ్రింగమి సొమ్మసిల్లి మ్రా
న్పడినగుఱాని నొల్లని ధణాయునికిం దనవాహనంబులం
బడిబడియంపెనో యమరభర్త యనందగెదావధూమముల్. 444

మ. జలజాప్తోగ్రమయూఖపుం జెకుముకి న్సప్తాశ్వకాంతోపల
మ్ముల సోఁకించి తదుద్గతాగ్నిలవముం బోధించి వాత్యాననా

నిలవేగంబునఁ గాలుకొల్చి పతగానీకంబు పాకంబుగా
నలరించె న్సమయాఖ్యపాచకుఁడు భూతాహారసంప్రాప్తికిన్. 445

మ. జలమింక న్నయనంబు లాతపభయభ్రాంతంబులై మధ్యసం
ధ్యలనుం దోఁచని యంబుకేళికయి ప్రాతర్వాసరాపోదయం
బులఁ గాన్పించె ననంగఁ దీరనగరాంభోజాతనీరాకరం
బులు నీరార్చుటకైన బల్చెలమల న్బొల్పొందె నవ్వేసవిన్. 446

తే. దారుణారుణకిరణసంతాపదిశల
ననుభవింపఁగఁ జాలక యంబుదములు
మెఱుపు లుఱుములు దొరఁగి భూమిపనికాయ్య
దేశముల నిల్చె ధూమంపుఁదిత్తు లగుచు. 447

క. ఆవేసవి నిష్కాసితుఁ
డై వసుథాదేవుఁ డొక్కఁ డాత్మపురీయా
శ్రావేశితకుతుకంబున
నావట మున్నట్టిత్రోవ నరుదెంచె వెసన్. 448

సీ. గమనవేగంబునం గావిడి వెదురు వె
క్కసపు మ్రోఁతలఁ గిఱ్ఱుకఱ్ఱు మనఁగ
సగళకరోటిపై బిగియఁ జుట్టిన పటాం
చల మింత గాలిచే సంచలింప
సరకులుంచిన మాత్రసంచిలో నంటగ
ట్టిన యట్టి నేతిలడ్డిగ దనర్పఁ
గొనలెత్తి కదియఁజెక్కిన కావిధోవతి
పైఁ గట్టుకొన్న కంబళీ యెసంగ
తే. నాతపగ్లానిచే నీడ లరయఁబాఱి
గాఢవీక్ష నిరాశచే గ్రమ్మఱంగ

వచ్చివచ్చి యతండు దుర్వారపుణ్య
వత్కృతప్రపమైన యవ్వటముఁ జేరె. 449

వ. చేరి తద్విశాలపానీయశాలాంతరంబునం బరికీర్ణోశీరతాశీతలం బగుభూతలంబున విశ్వనాథేతివచనముఖరుం డగుచు విపథం డించినవిధంబునం గంబడి పఱచి సుఖాసీనుండై యచ్చెంగటం గూడిన యధ్వనీనులవలన యాచితోపలబ్ధం బగుతాంబూలంబునం బరితుష్టుండై యందు నందంబగు పందిటం దోరణంబుగా హత్తించిన పసుపుటాకులగుత్తుల కత్తమిల్లు నెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై దిశాభిత్తికల నొత్తుకొనుటకుం బ్రమోదాయత్తచిత్తుం డగుచు దట్టంబుగా నుట్టులం బెట్టినసారంబు లగుఘృతక్షీరపూరంబుల నుగ్గులిడి యగ్గలపునిగ్గులు గలపాలబుగ్గలు ముద్దాడి నిద్దంబులై వ్రేలు వైణవడోలికల బాలకుల నునిచి జోలలు వాడుచు నిజమందిరాంగణంబునం బోలె మెలంగు పథికాంగనలఁ గనుంగొని యాశ్చర్యధుర్యుం డగుచుఁ జెంగటం జెలంగు నికుంజపుంజంబులం బరిచారికలు సూపాన్నశాకంబులు పాకంబులు సేయునంతకు నిద్రాముద్రితులై సమయంబగుటయుఁ గెలంకునం బొకంబగు కొలంకున నకలంకంబు లగు జలంబులం దోఁగి సుస్నాతులై వచ్చి యచ్చటి కాయమానంబుల నాలంబమానంబు లగు గోపీచందనశ్వేతమృత్తికాదులు మతానుసారంబుగాఁ దాల్చి చను నధ్వన్యమాన్యుల నాహారంబు లడుగు తెరువరుల దీనాలాపంబులకు దుర్వారనిర్వేదంబు నొందుచు నపారపిపాసాయాసులై చేరి తదీయాధికారి దత్తామలకపూర్వకంబుగా శీతలోష్ణోదకంబుల యథాభిలాషంబుగఁ గొని ప్రసంగవశజనితంబు లగు రాజకార్యంబులం బక్షాపరపక్షంబులు వహించి పోరాడుగ్రామీణుల నిరర్థప్రయాసంబునకుం దరహాసంబు సేయుచు దధితగ్రవిక్రయంబు లుపదేశమాత్రంబులుగా జారాన్వేషణంబులు ప్రధానకార్యంబులుగా సమీపజనపదంబులనుండి వచ్చియున్న యాభీరభీరువులపరిభాషలభావం బెఱింగి యంతరంగంబులుం గరంగి మార్గశ్రమంబును దినావసానప్రపాస్థలదూరంబులును విచారింపక తదానీతులై సంకేతలతాగృహంబుల కరుగుకుమారపాంథుల వయోమదాంధత్వంబుఁ దిలకించి యించువిలుకాని యకాలశౌర్యనిర్వహణంబునకు మెచ్చుచు నత్తైర్థికుండు పూర్వరాత్రంబునఁ బ్రయోజనవశంబున జాగరూకుండై యుండుటం జేసి శయనించి నిద్రాముద్రితనేత్రుండై యుండునంత. 450

తే. తత్ప్రపాంతరజనుల సంతాపదశల
పాలుపఱుపని తనప్రతాపంబు రోసి
కొంచెపఱిచెనొ రవినాఁగఁ గోష్ణమయ్యె
నతులయామశయానాంతరాతపములు. 451

తే, అప్పుడచ్చటఁ గూడిన యధ్వగాళి
చనియె నిర్దిష్టనగరవిశ్రాంతి నొంద
బ్రొద్దు గ్రుంకినఁ బిళ్లారిపూజ సేయు
బ్రాహ్మణుండును జెంగటిపల్లె కరిగె. 452

ఉ. అంతట మేలుకాంచి వసుధామరవర్యుఁ డనార్యనిర్గత
ధ్వాంతము నధ్వనీనరహితత్వముఁ జూచి దిగు ల్జనింప లో
నెంతయుఁ జింతనొంది తెరు వెక్కడనో కనఁగూడ దీడనే

కాంతము గాఁగ నిల్వఁగ భయం బగుచున్న దటంచు ఖిన్నుఁడై. 453

క. అంత విచారించియు మన
సంతమసము కతన వెడలి చనరామి నతం
డంతికతటాకమున సా
యంతన విధిఁ దీర్చి వచ్చి యతిభయ మెనయన్. 454

శా. గంగే! డుంఠి గణేశ! భైరవ! మహాగౌరీపతే! పాహి! యం
చుం కాశీపురి వేల్పులం దలఁచికొంచు బవ్వళించెం దటో
త్తుంగాత్యాతతశాఖి క్రిందఁ దనకుం దోడేమియు న్లేమి నా
నంగాఁ జోరభయంబు చీమ చిటుకన్నం గావడిం జూచుచున్. 455

తే. ఇట్లు శయనించి నిద్దుర యెనయకునికి
నమ్మహీజమ్ముఁ జూచి వృక్షాగ్రగణ్య!
యల గయావటమైన నీయంత గలదె?
నిన్ను మావంటివారు వర్ణింపఁ గలరె? 456

తే. సద్ద్విజాశ్రయములు భవచ్ఛాఖ లెల్ల
నిబిడవర్ణాత్మకంబులు నీదు జడలు
హరిగతిప్రతిపాది నీ యగ్ర మరయ
నీ మహాగమవిఖ్యాతి నెఱయ మెఱసె. 457

క. నీ నీడఁ జేరు కతన న
హీనతరఖ్యాతిఁ జెంది యీ సుమపూజల్
బోనములు నడపఁగా నీ
యేనుఁగు మొగమయ్య వెలసె నిచ్చట ననినన్. 458

చ. అలరి మహీరుహాగ్రణి నిజాగ్రపతత్రిభయంకరంబుగాఁ
గలకల నవ్వి యోబుధశిఖామణి నీఫణితంబు విన్న వే
చెలఁగితి నీదునీడ వెలసెం గణనాయకుఁ డన్నమాటకున్
భళిభళి నిశ్చితార్థ మతిభంగికి మెచ్చమి దోష మొందదే. 459

క. అనుమాటకు శైలసుతా
తనయుఁడు కోపించి మంచి తగవౌ నేనిం
దునికి న్నీ విటు ప్రబలితి
నిను జేరుట వెలసినాఁడనే మహిరుహమా. 460

క. మునుపున్న యునికిఁ దలఁపక
ననుఁజేరుటకతన వెలసినాఁ డీగణరా
జని పలుక న్నో రెటు లా
డెను సిగ్గు జనింపదేమొ డెందములోనన్. 461

తే. అనిన జలపాదియై పాదపాగ్రగణ్యుం
డిట్లనియెఁ దైర్థికుండౌర యిట్టివేళ
వీరికలహంబుకతమున వెఱపులేక
యుండఁగల్గెఁగదా యని యూకొనంగ. 462

మ. జలరాశిం బవళించు శౌరి నుదరాంచల్లోకచాతుర్దశీ
కలితు న్మున్గకయుండఁ బత్రమున విఖ్యాతంబుగాఁ దాల్చి మ్రాఁ
కులలో నగ్రగణ్యతం దనరు నాకు న్నీవు ప్రాపన్న సి
గ్గులచే టింత యెఱుంగ కాడితివి నీకుం బ్రాపునై యుండఁగన్. 469

క. నానీడ నిలుచుపథికులు
కానుకగాఁ గొన్ని యొసఁగ గాదే మఱినీ

కీనడవడి గలిగె న్మదిఁ
గావున మత్కృతమహోపకారము సుమతీ. 464

మ. అని లంబోదరుతో వటం బతికుతర్కాలంబమై యున్నచో
నినబింబంబుదయంబుఁ గాంచుతటి నాపృథ్వీసుపర్వార్యుఁ డా
త్మనగర్యాదరధుర్యుఁడై యరిగె నంతం దద్రుమాఖర్వగ
ర్వనిరాసంబున కంబికాసుతుఁడు దుర్వారప్రభావమ్మునన్. 465

మ. హితపూజాపరుఁడైన భూసురునితో నే నిచ్చట న్నిల్వ నేఁ
డతిసమ్మోదముతో స్థలాంతరసపర్యాలోలతం బోయెదన్
మతిఁజింతింపకు మంచుఁ బల్కి తలఁగెం బానీయశాలం బడెం
బ్రతివేళాగతపాంథవేధవటముం బ్రాగ్రూప మొందె న్వెసన్. 466

క. ఆవెనుక నేలతొడరితి
దేవునితో ననుచు వట మతివ్యథఁ జెందెన్
భూవల్లభ వింటివికద
యావగ యగుదీవు నన్ను నడిగితివేనిన్. 467

క. అటు గనుక నీవె తెలియుము
పటుగతి నేఁ డెల్లఁ గానఁబడకుండిన ని
చ్చటి కెల్లి వచ్చి తెలిపెద
ఘటియింపు మనుజ్ఞ మన్నికాయంబునకున్. 468

తే. అని ప్రధానతనూజ గేహమున కరిగె
ననుచుఁ గీరంబు వల్క సుధాంశుకాంత
నికరములనీరు జాఱక నిలువఁజూచి
యా ప్రభావతి క్రీడాగృహంబుఁ జేరె. 469

క. క్రమమున భాస్కరుఁ డంతటఁ
గమలాసీనుఁడయి కమలకరుఁడై కమలా
రమణీయుఁ డగుచుఁ గ్రుంకినఁ
బ్రమదాంబుధి దేలి యాప్రభావతి బాళిన్. 470

తే. రాజవిరహప్రభావతిరస్కృతంబు
కృతసఖిప్రార్థనాశతాంగీకృతంబు
నైనభూషణచయము నేమైనదనినఁ
జేరఁ జనుదేరఁజూచి యక్కీరవరుఁడు. 471

తే. అమ్మ నీనుఁ జూచినపుడెల్ల నయ్యమాత్య
తనయ తలఁపునఁ బాఱెఁడు దానినైపు
ణీవిశేషంబు వినుమంచు నిలువఁబట్టి
గట్టిచల ముట్టిపడ సెట్టిపట్టి కనియె. 472

క. తనుమదిగనఁజాలక య
త్యనుపమ మగుచింత విక్రమార్కుఁడు పిలువం
బనిచిన యమ్మఱునాఁడుం
జనియె న్ఘనబుద్ధితనయ సవినయుగరిమన్. 473

వ. అని యథాపూర్వంబుగా నాసీనయై మీనహాసకారణాజ్ఞానాధీనుండైన యమ్మానవాధీశ్వరుఁగుఱించి యాస్థానంబునం గలజనంబులు నిజమధురవచనసుథాసారంబునకుఁ గర్ణాంజలిపుటంబు లొగ్గ నక్కంజనయన యిట్లనియె. 474

తే. పరులు దెలియంగరాని యీపరమగోప్య
మైనకార్యంబు నీవు న న్నడిగితేని
స్వపతి జారుల కెడసినచపల యనెడి
కాంతతో జంట యగుదు వాగాధ వినుము. 475