శుకసప్తతి/అయిదవ యుపకథ

తే. అని యమాత్యతనూజ యయ్యధిపుచేత
నంపకము గాంచి యింటికి నరిగె ననుచు
జిలుక వచియింప నంతలో జలజబంధుఁ
డుదయగిరిసౌధవీథిపైఁ బొదలుటయును. 366

చ. కనుఁగొని యాప్రభావతి జగజ్జనరంజనరాజభాషణం
బెనయక చిల్క పల్కులకు నేమఱియెన్ హృదయం బటంచు మో
హనగృహసీమఁ జేరి మఱి యంబుజము ల్ముకుళించు వేళఁ బూ
నినపని కేగుచోఁ గలువనేజపురాయనితేజి యింపునన్. 367

తే. కప్పురపుబొట్టు చెమటచేఁ గరఁగి జాఱెఁ
జక్క దిద్దుము పూర్ణిమాచంద్రవదన
యింతలో నొక్కకథ వినిపింతు ననుచుఁ
బలుకఁదొడఁగెను బులకండ మొలుకుచుండ. 368

క. మఱునాఁడు విక్రమార్కు
డరసియుఁ దెలిసికొనలేక యమ్మంత్రిసుతం
బరిచారకయువతి పరం
పరచే బిలిపించికొని సమాదరణమునన్. 369

తే. తెరమఱుంగున నిలుప నత్తెఱవ పరుల
నడుగఁగూడని యిక్కార్య మడిగినపుడె
ప్రబలతరమైన జాతిస్వరంబుఁ జూపి
యడలు తురగంబుతోడ జోడగుదు వీవు. 370

అయిదవ యుపకథ


ఉ. ఆకథఁ జిత్తగింపుము ధరాధిప సాధువనం బనంగ న
స్తోకతరప్రసిద్ధిఁ బొలుచుం బుర మొక్కటి యందు మందరా

ఖ్యాకలితుండు శూద్రుఁడు నయాన్వితుఁడై తగునాతఁ డిందిరా
లోకన మేమి లేమి నతిలోకదరిద్రతఁ జెంది కుందుచున్. 371

సీ. కొలుచువారల నోరుగొట్టి లెక్కలు వ్రాసి
హరువు మీఱఁగ మణియములు చేసి
బ్రమసి యాసాసలరసవాదము లొనర్చి
ప్రకటించి రాజపట్టికలు దీర్చి
ప్రతివాసరంబు లేర్పడఁగఁ జేరువగట్టి
వాటంబుగాఁ దెరువాటు గొట్టి
వేళ్లమందు లమర్చి విషవైద్యతవహించి
తఱుఁగుబేరముల నెంతయును మించి
తే. మ్రుచ్చువగయును గని చూచి మూటమోసి
సుంకరులతోడ నొనగూడి జూదమాడి
యిట్లు వర్తించియును నాతఁ డేమి యందు
గళవళముఁ జెందెఁ గూడుఁ గోకయును లేక. 372

తే. అంత నమ్మందఱుం డమందార్తి నుదర
పోషణంబునకై యూరిపొంత దోస
తోఁటఁ గావించెఁ గావడిపాటుపడుచు
నదియు నధ్వన్యదృక్పరం బై తనర్చె. 373

ఉ. అంతట నొక్కనక్కదొర యంబుజబాంధవుఁ డస్తపర్వతో
పాంతముఁ జేరుదాక బొరియం జఠరానలకీల నెంతయుం
జింతిలుచుండి రేలు తన జీతపుబంటులు దాను భీతియొ
క్కింతయు లేకయే మెసవి యేగుఁ దదీయఫలంబు లన్నియున్. 374

తే. ఆసృగాలాగ్రణికి ఘటకాక్య వెలయు
నాతఁ డీరీతిఁ గర్కరికాతిపక్వ

ఫలపరంపర నుదరసంభరణవృత్తి
నడుపుచుండఁగ మందరుం డలుకవొడమి. 375

ఉ. అక్కట దోసతోఁట యిదియైనఁ దదీయఫలంబు లమ్మి యీ
డొక్కను సాకగోరితిఁ గడు న్నడురేలున వచ్చి యెవ్వరో
మక్కువ లేక నాకడుపుమంటయుఁ బుచ్చికొనంగఁ బూని యీ
చక్కెరవంటి పండ్లు తినసాగి రటంచుఁ గృశించు నెంతయున్. 376

చ. ఒకమృగధూర్తరాజవరుఁ డుజ్జ్వలనీతివిదుండు ధీరనా
మకుఁ డతిదూరఘోరననమధ్యవిహారుఁడు విద్విషద్విదా
రకుఁ డొకనాఁడు వేడుక సరాళముగా భటకోటితోడ నో
డక యరుదెంచె నచ్చటి కటత్తటిదీక్షణవీక్షితాస్యుఁడై. 377

తే. వచ్చి బడలిక దీర్చు దుర్వారకర్మ
రీఫలామోదధౌరంధరీవరిష్ట
పవనములచేత నాహారభాగ్య మిచట
నబ్బు నని యెంచి కెలని బిట్టడవి విడిసె. 378

క. తనమంత్రి వరులతో మం
తనమున నీదోసతోట తనరెడుచోటన్
మనజాతివార లుండరె
యని యాలోచన మొనర్పు నాసమయమునన్. 379

మ. ఘటకుండంతట వేగువారు నుడువంగా ధీరుఁ డారీతి వ
చ్చుట లెల్ల న్విని మంత్రులం బిలిచి యిచ్చోఁ బోయి సంధించి యు
త్కటమద్వైభవ మెల్లఁ జూపుటనువో కాదో విచారింపుఁ డే
మిటికన్న న్మన కొక్కవేళకగు తన్మిత్రత్వమం చెన్నెదన్. 380

చ. అది యటులుండె నంతటి మహామహుఁ డిచ్చటి కేగుదెంచినం
దుది మొద లే నెఱింగియు నెదుర్కొని పూజయొనర్పకున్కి యొ

ప్పదు మనమ ట్లొనర్చినను బ్రాభవహానియె గౌరవంబు సొం
పుదనర మున్ను మ్రొక్కి గద మ్రొక్కు గొనన్వలయుం జగంబునన్. 381

క. అనిన విని సచివులందఱు
ననఘా మఱి యాతఁ డింత యధికుం డైనం
గొనివచ్చి పూజలిచ్చిన
మనకుం దప్పేమి యది సమంచిత మనినన్. 382

తే. బుద్ధిసారాఖ్యసచివుండు పూని పలుకు
దొరను మంత్రులఁ జూచి సంతోషమయ్యె
మొదల నెందైనఁ జన నాకు ముదలయిచ్చి
ధీరజంబుకవరుని సంధింపఁజనుఁడు. 383

వ. అనినం దదీయసంధానసముత్సాహభంగకారణం బగు నతని ప్రతికారవచనంబులకుఁ జిడిముడిపడి యితం డేమి యెఱుంగు విచ్చేయుం డనుచు సంధానపరకృత్యులైన యమాత్యులం గూర్చుండ నియమించి యామృగధూర్తచక్రవర్తి యిట్లనియె. 384

క. ఒకనికిఁ దెలియు న్వేఱొక
నికిఁ దెలియక యుండుఁ గార్యనిర్ణయ మితఁడే
టికి నడ్డుగాళ్లు వైచెనొ
యకటా యది యెల్లఁ దెలియ నడుగన్వలయున్. 385

క. అని బుద్ధిసారు నెమ్మొగ
మునఁ జూపులు నిలువఁ గేలు మొగిచి యతం డో
యనఘాత్మ వీరికన్నం
ఘనుఁడంగా నైన నొక్కకార్యము వినుమా. 386

చ. మును వినియుందు ధీరుని సమున్నతగర్వవిహారుఁ డంచు నా
తని మదికి న్భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నై
కనఁబడు నీవు పల్కు నుడికారపుమాటల కెల్ల నాతఁ డా.
డును విరసంపుఁబల్కులు గడు న్మఱి మోసము వచ్చు నత్తఱిన్. 387

క. మోసము వచ్చుట యరుదే
యీసునం దద్గర్వభాష లిచటి సృగాలా
గ్రేసరులు సైతురే విను
మాసమయము సుమ్ము దొరల కవగడ మరయన్. 388

ఆ. అతఁడు గర్వయుక్తుఁ డౌటయుఁ గాకున్న
నొక నిదర్శనము మహోగ్రశౌర్య
ప్రభుగుణంబు విడిచి పరభూమి కింత దూ
రంబు వచ్చునే సరాళ మనుచు. 389

క. కావున గర్వాతురుఁడై
కావలెఁ గాదేని యిచటి కర్కరికాళిం
దావిని తదాశ వచ్చెం
గావలె నెట్లైన మనకుఁ గావలెఁ జుమ్మీ. 390

మ. మనకీకర్కరికాఫలాళిగద సామ్రాజ్యంబు గల్పింపఁ జా
లినయాహారము దానికై యితఁడు దోర్లీలాసముల్లాసతం
జనుదేర న్మనమేగి విందులగతి స్సంధించు టేకార్య మి
ప్పని నాకు న్సరిపోదు మీకు రుచియింపం బోలు నిప్పట్టునన్. 391

వ. అకార్యమాత్సర్యకృతానురాగు లగు నీనియోగుల మాటలకుం గోపాటోపంబు నామదిం బాటిల్లదు దుష్టనిరసనశుభానయనిష్టాగరిష్ఠులు కాక కాలోచితప్రభంజనమాత్రకృత్యులగువార లమాత్యులే యది యట్లుండె నతనిం గని తోడితెచ్చితేనియుం దదీయశ్రమాపనోదారం బగు నాహారం బిడవలయుం గదా యీకర్కరీవనంబు కొంచెంబగుటం బరాక్రమంబుఁ జూపకుండునే యంటివేని దానికిం బ్రతికార్యం బీయుపాయంబునఁ బన్ని వచ్చెద నని కర్ణోపాంతంబునం గొన్ని మాటలు నొడివి నిజాధినాథు దెస దరహాసంబగు నంగీకారంబుఁ గైకొని బుద్ధిసారుండు తదాస్థానంబు వెలువడి. 392

క. తటచలితచలదళచ్యుత
తొటతొటరవశాలిఫలమిథోరణకేళీ
పటుతరజలచరనికరో
త్కటమై తనరారు చెఱువు కాలువఁ జేరెన్. 393

తే. చేరి పనిపూని యిటకు నచ్చితి మదుక్తి
కొదవపడకుండ నెట్లొనఁగూడు నొక్కొ-
కార్యమని నాల్గుదిక్కులు గనుచునుండ
దైవవశమున నత్యద్భుతంబుగాఁగ. 394

సీ. క్రవ్యాగతోగ్రకాకవిధూతమక్షికా
పుంజమై తగు వెన్నుపుంటితోడ
బాలకక్రీడావిపాటితరోమజా
లంబైనయట్టి వాలంబు తోడ
నగ్రిమపాదబంధాతికృధాసముం
దనములౌ వెడవెడ దాట్లతోడఁ
గఠిననిజస్వామికరకాష్ఠనిహతజా
తంబునై తొరఁగు రక్తంబుతోడఁ

తే. గర్ణకంఠోదరాభారకంబు లగుచు
నమరు ముయ్యూరుపిడుఁదుతండములతోడ
నచ్చటికి వచ్చె నొకయశ్వ మల్పహేష
జాతి దెల్పఁగ జలపానసంభ్రమమున. 395

ఉ. వచ్చి జలంబు గ్రోల నిలువంబడఁ గల్గొని బుద్ధిసారుఁ డు
ద్యచ్చతురత్వ మొప్ప వినయంబునఁ జేరి నమస్కరించి యే
నిచ్చట నిన్నుఁ జూచి చనియెన్ బహుకాలము నేఁడుగంటినా
ముచ్చట లెల్లఁ దీఱ మన మున్పటి నెయ్యము లెంచుకొందువే. 396

చ. అది యటు లుండె తను వనంతబలాఢ్యము బక్కచిక్కియు
న్నది యిది మాఱురూపువడి యద్దిగ యిద్దురవస్థ యేక్రియం
గదిసనొ నన్నువంటి చెలికాఁ డొకఁ డుండఁగ నిమ్మనోవ్యథా
భ్యుదయము వొందనేటికి నయో నను వింతఁగఁ జూడఁ బాడియే. 397

క. అనిన విని యత్తురంగం
బనఘా నిను మఱవనేర్తునా బహుకాలం
బునకైన బుద్ధిసారుం
డనుసుకృతివి గావె నెయ్య మలఁతియె మనకున్. 398

క. మామా యల్లుఁడ వని మన
మామాడ్కిన్ వావి యొకటి యమరించి నయ
శ్రీమించఁ బ్రవరిల్లుట
యేమైన న్మఱచువాఁడనే గుణహారా. 399

చ. ప్రకటవిషాదవేదనవరస్పరవృత్తి నినుం గనంగఁ దా
వకవిహితప్రవృత్తికి నవజ్ఞత యెంచక పల్కరించి నీ

వకుటిలవృత్తివైతి వినయాభరణా మదిఁగోరి యుందు మా
మకహృదయవ్యథాకథ సమస్తము నీ కెఱిఁగింప నెప్పుడున్. 400

ఉ. ఈపురి నొక్కరెడ్డి వెలయిచ్చి ననుం గొని తెచ్చి పోషణ
శ్రీపరివర్ధమానునిఁగఁ జేయుట నీవు నెఱుంగుదే కదా
యాపయి నాతః డొక్కయెడరైన నను న్వెలకిచ్చె నన్యవి
త్తాపహృతిప్రణీతమతిహారికి వేఱొక బేరివానికిన్. 401

క. అతఁ డింక నేమి సెప్పుదు
సతతము నూరూరిసంతసంతల కత్యు
ద్ధతిఁ బెఱిక లెత్తి తఱుము
న్మతినరయం డింతయైన మత్తనుబాధన్. 402

తే. పెఱికయేచాలు నానడ్డి విఱుఁగఁ జేయ
దానిపైఁ దాను నెక్కు నింతయునుగాక
యకట వయ్యాళిగాఁగఁ బొమ్మనుచుఁ గొట్టు
నతనిచేతులలోఁ జెంగలమ్మ గొట్ట. 403

మ. పొరుగూళ్ళం దిరునాళ్లు సాగిసభరంపున్మానిసి న్మోయ ని
ష్ఠురవృత్తి న్ననుఁ జూపి సుంకము లటంచుం గూలియించు న్వరా
లురయం బారఁగ మోచి నన్నుఁ దఱుము న్లోభాప్తిమైఁ దా నిరా
దరుఁడై మేఁపఁడు కాళ్ళు గట్టి విడుచుం దత్తత్ప్రదేశంబులన్. 404

తే. గొఱపమా లేదు నీ రార్చుగొడవ యెఱుఁగ
గడ్డి వేయఁడు కవణంబు గానివాని
జంబుకాధీశ చూడు మీచాయ నేను
గుఱ్ఱమై పుట్టి యీగోడు గుడుపవలసె. 405

క. త్రిమ్మరి మాపటికై తన
యిమ్మున కేతేర దుక్కి యెనుపోతులు రెం
డిమ్ములఁ గొమ్ములఁ జిమ్ముం
గ్రమ్మిన నిర్దయతఁ బసులగాడింగట్టన్. 406

ఉ. అక్కఠినాత్మకుండు కసవారసి తెమ్మని కూఁతుచేతికిం
జెక్కుడుఁబాఱ యీయ వడి నెట్టది వెల్వడి చేనిమంచెపై
నెక్కినజారుఁగూడి రమియించి దినాంతమునందు వచ్చి బ
ల్తొక్కులు నా మొగంబున విదుర్చును గొన్నితృణాగ్రఖండముల్. 407

క. తొంటిజని వానియు ప్పటు
తింటిఁ జుమా యింతపాటుఁ దెచ్చుకొనుటకై
కంటికిఁ గూరుకురా దాఁ
కంటికిఁ దుది లేదు చిక్కకయె యెట్లుందున్. 408

క. ఇటువలె నున్నది నాకథ
ఘటకసృగాలేంద్రుఁ గొలిచికద యుండుదు వ
ప్పటుమతికి సేమమే యి
చ్చటి కేటికి వచ్చి తనిన జంబుక మనియెన్. 409

తే. అకట నీయట్టి సుగుణరత్నాకరునకు
నిట్టిదురవస్థ వచ్చెనే యింకమీఁద
నంతయును జక్కనయ్యెడు నస్మదాగ
మనము వినిపింతు వినుమాసమానమాన. 410

క. ఘటకున కహిభయ మొదవె
న్బటుగతి నీకుఁగల పక్షపాత మతనిపై
నటియింపఁ జేసి మెలఁగుము
దిట మలరం దార్క్ష్యనామధేయుఁడ వగుటన్. 411

వ. అని ధీరాగమనంబు సవిస్తరంబుగాఁ దెలిపి వెండియు. 412

తే. నీవు మాకెల్ల దొరవోలె నేఁడు మొదలు
కొన్నినాళ్లుండు భవదీయఘోరమూర్తిఁ
గాంచి ధీరుం డపూర్వమృగం బటంచుఁ
దలగు నది మాకు శుభము గంధర్వరాజ. 413

క. ఈరేయి దోసపం డ్ల
వ్వారిగఁ దిను మర్కు డపరవసుధాధరముం
జేరిన పిమ్మట నిలుమీ
చేరువ నే నపుడు వచ్చి చేర్చెదఁ దోఁటన్. 414

క. అనిపల్కి బుద్ధిసారుఁడు
చని యంతయుఁ దెలిపె ఘటకజంబుకకులనా
థున కంతటఁ జారులు దె
ల్పిన నది విని ధీరుఁడొక్క లేనగవలరన్. 415

క. తనమంత్రి సుముఖనామకుఁ
గనుఁగొనుటయు నతఁడు లేచి కార్యముమీఁద
న్ననుఁ జిత్తగింపు మనుచుం
జనియెం దత్తురగమున్న చక్కటి కెలమిన్. 416

చ. చని కరము ల్మొగిడ్చి బుధసన్నుత జంబుకజాతివాఁడ న
త్యనఘుఁడ నే నతీతము ననాగతము న్మఱివర్తమానముం
గని వివరింతు నిప్పు డొకకాఱియచే వెతఁ జెందినాఁడ వి
ద్ధినమున నీకుఁ గల్గువడదేఱఁగ గర్కరికాఫలావళుల్. 417

చ. ఇది నిజమైన ఱేపు వచియించెదఁ దక్కినకార్యమంతయుం
దుదినొక విన్నపంబు దయతో విను మాఁకటఁ గుందినాఁడ నేఁ
డదనున దోసపండ్లు తినునత్తఱి నన్నొకసారి పిల్వు

నేఁ
జెదరని ప్రీతి నివ్వెలుఁగుచెంగట నివ్వలఁ బొంచియుండెదన్. 418

[1]క. అనిపూన్చి ధీరుతో న
త్యనుపమగతి సుముఖనాముఁ డవగడమగున
ట్లొనరించి వేగవచ్చితి
నని తెలిపె న్రవియుఁ బశ్చిమాంబుధి గ్రుంకెన్. 419

వ. అంత. 420

మ. రవి రాక న్మదిఁగోరు పద్మినులు చక్రస్త్రీలు మోము ల్ముడుం
ప వియోగవ్యథఁ గుందఁ బాల్పడియెమామాడ్కి న్మముం గోరుకై
రవణీలోకము చెంగలించె నది చంద్రప్రేమ మస్మద్విలో
కవిసృష్టం బనిజారలాడ నడరెం గాఢాంధకారచ్ఛటల్. 421

శా. ఆవేళ న్నిజకామినీకరగృహీతాభీలదండావనీ
జావాలీకృతబాహుమూలుఁడు మహీయఃకంబళాచ్ఛాదితుం
డావిర్భూతకఠోరరోషుఁ డయి యాతాకల్పితోర్వారువ
న్యావీరుజ్జనితోత్ఫలాననపరుం డమ్మందరుం డుండఁగాన్. 422

చ. ఘటకుఁడు పంపఁగా నరిగి కంపవెలుంగు తలంగఁద్రోచి యు
ద్భటగతి బుద్ధిసారుఁ డటు తారునఁ గర్కరికాఫలాళిఁ జూ

పుటయుఁ దురంగము న్మెసవెఁబో లతిక ల్తెగిపోవఁ బత్రముల్
త్రుటితములై పడం బృథులతుండము భూస్థలి సోఁకునట్లుగన్. 423

తే. అంత సుముఖుని దలఁచి యయ్యశ్వరత్న
మలఘుహేషారవంబునఁ బిలుచుటయును
నిదియె పండ్లెల్ల దినిపోయె నేమొ యనుచు
మందరుఁడు కోలచేఁ బరిమార్చెదాని. 424

క. ఇటువలె నొగిలి తురంగం
బటునిటు వడి పాఱిపోయి యస్మధ్వనియే
మిటికిం జూపితకట యని
చటులవ్యథఁ గుందె మహిభుజా వింటికదా. 425

క. కావున నేఁడెల్లను నీ
భావంబున నరయు మెఱుకపడకుండినచో
నీవిధ మని జలచరహా
౽సావిర్భూతికిని హేతు వమరవచింతున్. 426

తే. అని నియోగితనూజ యయ్యధిపుఁ డనుప
నిలయమున కేగె నని చిల్కపలుకఁ గమ్మ
తమ్మినెత్తావి తెమ్మెర ల్గ్రమ్ముటయును
నల ప్రభావతి కేళిగృహంబుఁ జేరు. 427

ఉ. అంతఁ గ్రమక్రమంబున నహస్కరబింబము పూర్వశైలసౌ
ధాంతహిరణ్యకుంభము విహాయసమండలనామఖేటకా
భ్యంతరధాతురాగ మపరాద్రివిమానవితానితాతిదు
రదాంతవిభావిభావ్యముకురంబును నై జలరాశీఁ గ్రుంకినన్. 428

సీ. అద్దంబులోఁ దోఁచు నబ్జరేఖ యనంగ
మోముపైఁ దెలినాభినామ మమరఁ

దలిరాకుపై మొగ్గు నలరుమొగ్గ యనంగ
మోవిపై ముక్కఱముత్తె మమర
వలమురిపై నంటు జలధిపంక మనంగ
గళము పైఁ గస్తురి కప్పు మెఱయఁ
గాలాహిపై మించు కంచుకంబొ యనంగ
జడమీఁద ముడి పూవుసరము లొరయ
తే. లతనుదోహదధూమము ల్గప్పుకరణి
నంగయష్టిక నీలసంవ్యాన మెసఁగఁ
గదలి యేతెంచె రాజసంగమసుఖైక
పరతఁ జెంది ప్రభావతీపద్మగంధి. 429

ఉ. వచ్చినఁ జూచి కీర మనివారితచాతురి మీఱ నారి నీ
యిచ్చ గణాధినాథు గణియింపు తదాదృతి లేకయున్న నీ
వచ్చటి కేగుకార్యము రయంబునఁ గూడదు చిత్తగింపుమా
తచ్చరితం బటంచు నుచితంబుగ నెచ్చెలి నిల్పి యిట్లనున్. 430

తే. అంత మఱునాఁడు విక్రమార్కావనీశు
డలయమాత్యతనూజాతఁ బిలువఁ బనిచి
చనపరులు చెంతఁ గొలువ నాస్థానసీమఁ
జేరి సింగఁపుగద్దె నాసీనుఁ డగుచు. 431

తే. తెరమఱుంగునఁ గూర్చుండి తేనెవాన
ప్రబలఁ గథఁ జెప్ప నేర్చిన బాఁపనమ్మ
యిప్పుడైనను దెల్పుమా యేలనవ్వెఁ
బక్వమీనము లనుఁడు నప్పడఁతి పలికె. 432

క. అడుగం గూడని కార్యం
బడిగెద వట్లేని మును గజాస్యునితో వా

దుడుగక యొనర్చి పిమ్మట
యడలిన వటమునకు సుద్ది యగుదువు సుమ్మా. 433

ఆఱవ యుపకథ


చ. అది యెటులంటివేని వినుమా హురిశాహురినుండిపన్నగాం
గదుని నివాసమై యలరు కాశికిఁ బోయెడుత్రోవ నీడపు
ట్టదు గద నాఁగమించినయెడ న్నొకచో నొకలేఁతమఱ్ఱి య
భ్యుదయము నొందసాగెఁ దఱినొందినవానలచేత నంతటన్. 434

తే. అధ్వగులు కోడిగములకై యాకులెల్ల
ద్రెంచి శాఖావితానము ద్రుంచివైవ
మోడుపడియుండె నది నిల్వనీడపట్టు
గొమ్మయును లేమి తనయందుఁ గుదురుకొనఁగ. 435

తే. అంత నొక శైవుఁ డాత్రోవ నరుగువాఁడు
కెలని కొలనున నాహ్నికక్రియలు దీర్చి
చెంతఁబడియున్నఱాయి యాచెట్టుమొదటఁ
జేర్చి విఘ్నేశుఁ డనుచుఁ బూజించి చనిన. 436

క. అది మొదలుగఁ దెరువరులిం
పు దలిర్పఁగఁ దెచ్చి తెచ్చి పుడిసెఁడు నీళ్లుం
బదియైదు గఱికిపోచలు
గదియించి చనంగ నచట గణపతి నిలిచెన్. 437

సీ. పాల్పొంగి వఱదలై పాఱఁ జెంగటి యూళ్ల
కాఁపుగుబ్బెతలు పొంగళ్లువెట్ట
నీళ్లు వెల్లువగట్ట నికటాగ్రహారథ
రాసురు ల్నారికేరములు గొట్ట

  1. క. అనిన విస్మయమంది యయ్యశ్వరత్న
    మెంత తార్కాణగాఁ జెప్పె నితఁ డటంచు
    నెంచి యాహారవేళఁ దలంచువాఁడ
    ననుచు నమ్మిక లిచ్చిన నాక్షణంబ.

    క. చని సుముఖుం డధిపతితో
    ననఘా యీయశ్వమునకు నవగడమగున
    ట్లొనరించి వేగవచ్చితి
    నని తెలిపె న్రవియుఁ గ్రుంకె నాసమయమునన్.