తెలుగువారి జానపద కళారూపాలు/వినోదభరితమైన విలువిద్యా ప్రదర్శనలు

వినోదభరితమైన విలువిద్యా ప్రదర్శనలు

ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన విలువిద్యా ప్రదర్శనలు ఈనాడు మచ్చుకు కూడ కనిపించడంలేదు. ఆదిమ మానవుడు అడవులలో జీవించిన కాలం నుంచీ, ఆయా కాలాల్లో ఆయాజాతుల పరిణామాల్లో, రామాయణ భారత భాగవత కథలలో, జానపద కథలలో ఎక్కడ చూచినా, ధనుర్విద్యా ప్రదర్శనాలుగా పిలువ బడుతున్న విలువిద్యా ప్రదర్శనాలు, నాటి ఆంధ్రదేశంలో అన్ని కళలతోపాటు ఈ ప్రదర్శనలు కూడా ఎంతో ప్రాముఖ్యం వహించాయి.

విలువిద్యలో పురాణ పురుషులు:

పురాణ యుగపు కథానాయకుల నుండీ, ప్రతి నాయకులూ, రాజాధి రాజులు మొదలు, సామాన్య పౌరులూ, అందరూ విలువిద్యను నేర్చిన వారే, అందరికీ నేర్పిన వారే. ఆదిమ అడవి జాతులుగా పిలువబడి ఈ నాటికీ అడవుల్లో నివశించే గిరిజన జాతుల వరకూ అందరూ విల్లుపట్టి ఆరితేరినవారే. ద్రుపదుని కొలువులో మత్స్యయంత్రాన్ని కొట్టిన అర్జునుడూ, శివధనుస్సును విరిచి సీతను పెళ్ళాడిన రాముడూ, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద విలువిద్యను నేర్చినవారే, విలువిద్యను నేర్చిన రాముడు రాక్షసులైన మారీచు

సుభాహులను, మాయ లేడిని, చెట్టు చాటునుండి వాలినీ చివరికి రావణునీ వధించింది విలువిద్యతోనే. రామరావణ యుద్ధం ముగిసింది మారణాస్త్రాలతోనే.

ద్రోణాచార్యుల వద్ద కౌరవ పాండవులందరూ విలువిద్యను నేర్చినవారే అందరూ విల్లును పట్టి ఒకరి నొకరు వధించుకున్నవారే. విలువిద్యలోనే గురువును మించిన శిష్యుడనిపించుకున్నాడు ఏకలవ్యుడు.

ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన విల్లుతో, విల్లంబుల సైన్యంతో, గడగడ లాడించి తుపాకులకు ఎదురు నిల్చి, విల్లుతో ఎందరినో హతమార్చాడు.

కనుమరుగౌతున్న కళ:

ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశ చరిత్రలో చూచినా మందు గుండూ, మారణాయుధాలు లేని నాడూ, అందరూ విల్లును బట్టి ఆహారాన్ని సంపాదించుకున్న వారే. విల్లుతో విరోధుల్ని, ఎదుర్కొన్నవారే. తుపాకి పట్టిన వారికి ప్రప్రథంమంగా గురి చూసి కొట్టడం నేర్పింది విల్లే. అలాంటి విలువిద్య నాగరిక ప్రపంచంలో నానాటికీ కనుమరుగై పోయింది. కేవలం వైరుల నెదిరించటానికే కాకుండా, అదొక నైపుణ్యంగల ఉత్తమ కళారూపంగా కూడా అభివృద్ధి చెందింది. ఈ నాటికీ కోయలు, చెంచులు, సవరలు, జాతాలు, కొండ రెడ్లు, గోడులు మొదలైన అడవి జాతులకు చెందిన విలుకాండ్రు పేరు చెప్పి ఒక్క దెబ్బతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నారు.

ఆనాటి ఆదరణ:

ఒకనాడు ఈ విలువిద్యను ఆహారం కోసం జంతువులను వేటాడే సాధనంగా కాక నైపుణ్యంతో కూడిన కళగా తీర్చి దిద్దారు. ఈ నాతికీ ఈ కళ జాతీయంగానూ, అంతర్జాతీయం గానూ క్రీడల పోటీలలోనూ ప్రవేశపెట్టారు. అధునిక ప్రపంచంలో, ప్రపంచ వ్వాత్పంగా ఈ విలువిద్య ఈ నాటికీ ఎంతో ప్రఖ్యాతి వహించింది.

ఒకనాడు ఆంధ్రదేశంలో రాజులూ, జమీదారులూ, ఈ విలువిద్యా ప్రదర్శనలను ఎంతగానో పోషించారు. వారి సమక్షంలోనే పోటీలను నిర్వహించారు. ఉత్తమ విలుకాండ్రకు ఉత్తమ బహుమానాలను బహూకరించేవారు.

ఈ పోటీలకు ఎక్కెడెక్కడ విలుకాండ్లందరూ పోటీలకు తయారై వచ్చేవారు. ప్రజలు ఈ ప్రదర్శనాలను చూడటానికి తండోప తండాలుగా వచ్చి విలువిద్యా ప్రదర్శనలు చూచి నివ్వెరపడిపోయేవారు. ప్రదర్శనాలను చూచి వెళ్ళిన యువకులూ బాలురూ విల్లంబులను తయారు చేసుకుని పిట్టల్నీ వేటాడేవారు.

ప్రజలను అలరించింది:

అలాటి ఈ ధనుర్విద్యా ప్రదర్శన కళ, జానపద కళగా అభివృద్ధి చెందింది. అన్ని కళారూపాలతో పాటు ప్రజలను రంజింప చేసింది. అలాంటి ఈ కళారూపం శిధిలమై కనుమరుగై పోతూ వుంది.ఈ నాడు కనుమరుగై పోతున్న అన్ని జానపద కళారూపాలతో పాటు విలువిద్యా ప్రదర్శనలు కూడ కాలగర్భంలో కలిసిపోతూ వున్నాయి.

ఈనాటి యువతరానికి రాముడో, ద్రోణాచార్యుడో బాణాలు సంధించారనీ, యుద్దాలు చేసారనీ టి.వి.లో చూడటమేకాక, ఒక నాడు ఆంధ్రదేశంలో ఈ వులువిద్యలో ఆరితేరిన నిపుణులున్నారనీ, అత్యద్భుతంగా ప్రదర్శనాలు ప్రజామోదం పొందాయన్న విషయం చాల మందికి తెలియదు. తెలుసుకోవాలనుకునే వారూ లేరు.

అడవి జాతుల వారే ఆరాధిస్తున్నారు:

వారి వారి అవసరాల కోసం, జీవనాధారం కోసం అక్కడక్కడ అడవులలో వున్న గిరిజనులలో మాత్రమే ఈ విలువిద్య బ్రతికివుందే తప్ప, ఆంధ్రదేశంలో మాత్రం ఈ విలువిద్యా ప్రదర్శనాలు ఎక్కడా ప్రదర్శిస్తున్నట్లు మనకు దాఖలాలు కనిపించవు. కారణం విలువిద్య చాల కష్టమైంది. ఎంతో సాధన చేస్తే గానీ అలవడని విద్య. గిరిజనులు తమ బిడ్డలకు చిన్నతనం నుంచే విలువిద్యను నేర్పుతారు. ఎందుకు? ఒక ప్రక్క మాంసాహారం కోసం, జంతువుల వేటకూ, క్రూర మృగాల ప్రమాదాల నుంచీ తప్పించుకోవడానికీ విలువిద్యను ఎంతో భక్తి శ్రద్ధలతో గురువు వద్దనే నేర్చుకుంటారు. ప్రతి తండ్రీ తన బిడ్డకు విలువిద్యను నేర్పుతాడు.

అయితే ఆంధ్రదేశంలో మచ్చుకు అక్కడక్కడా ఈ విలువిద్యా ప్రదర్శనలో నిపుణులైన ఆ తరానికి చెందిన వృద్ధులు కొందరు కనిపిస్తారు. అలా పశ్చిమ గోదావారి జిల్లాలో ఇంకా ఈ విలువిద్య బ్రతికేవుంది. ఈ విద్యను పెంచి పోషించిన వారూ, ఈ నాటికీ బ్రతికిస్తున్న వారూ క్షత్రియులైన రాజులు.

వారి పేరైతే నాకు తెలియదు కాని ఆయన ప్రదర్శించిన విలువిద్యా ప్రదర్శనను మద్రాసు, 'సెంటనరీ హాలు ' లో "కళాభారతీ" వార్షికోత్సవం సందర్భంలో చూచి ఆశ్చర్యపోయాను. కను చూపు తగ్గిపోతూ వున్న డెబ్భైమూడు సంవత్సరాల వయస్సులో ఆయన ప్రదర్శించిన ప్రదర్శనమది. అది ఒక అద్భుత ప్రదర్శనం. అపూర్వ ప్రదర్శనా నిదర్శనం. హాజరైన మూడు వేల మంది ప్రేక్షకులూ ఆశ్చర్యానందంలో మునిగి పోయారు. ఈ రోజుల్లో ఇంతటి విలువిద్యా నిపుణులున్నారా? అని విస్తు పోయారు. వేనోళ్ళ పొగిడారు. తమ తమ అభినందనాలను తెలియజేసుకున్నారు.

ఇంతకీ ఆ అద్భుత ప్రదర్శనం:

ఇంతకీ ఆ అద్బుత ప్రదర్శనం ఏమిటి? పైకి వ్రేలాడదీసిన చేప ప్రతి బింబాన్ని క్రింద పళ్ళెంలో వున్న నీళ్ళలో పైన వ్రేలాడ దీసిన చేప ప్రతి బింబాన్ని చూచి విల్లు పైకి సూటిగా వెక్కు పెట్టి అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినట్లు ఒక దెబ్బతో పైన వ్రేలాడదీసిన పండును కొట్టాడు రాజుగారు. హాలంతా కరతాళ ధ్వనులతో దద్దరిల్లి పోయింది. అలా అర్జునుడు కొట్టాడనుకున్నారు. కాని రాజుగారు కొట్తగలరని ఎవరనుకున్నారు? ఇదీ రాజుగారి అపార విలువిద్యా ప్రదర్శన.

అలాగే కళ్ళకు గంతలు కట్టుకుని దూరంగా ఒక మనిషిని నిలబెట్టి అతని చేతికి దారంతో వ్రేలాడ గట్టిన నిమ్మ పండు అతని చేతికిచ్చి అటూ ఇటూ ఊపుతున్నాడు. అలా వూపుతున్న దారాన్ని రాజు గారు అంబుతో తెగ గొట్టాడు. పండు క్రిందకి పడింది.

అలాగే నాలుగు నిమ్మ పండ్లకు దారాలు కట్తించి, గుండ్రంగా త్రిప్పమన్నాడు. త్రిప్పుతూ వుండగా అంబుతో నిమ్మపండ్లు కట్తిన నాలుగు దారాలను ఒక్క దెబ్బతో తెగ గొట్టాడు. నాలుగు నిమ్మ పండ్లూ నేలమీద పడ్దాయి.

అలాగే కండ్లకు గంత కట్టుకున్న మరో ప్రదర్శన దూరంగా ఒక బల్ల చెక్కను నిలబెట్టి ఆ చెక్క మీద గుండ్రని కాగితాన్ని అంటించి, దాని ప్రక్కన చిన్న పుల్లతో శబ్దం చేయమన్నాడు. ఆ శబ్దం ఎక్కడ నుంచి వస్తూ వుందో దానిని గమనించి అంబును వదిలాడు. అది సూటిగా వెళ్ళి బల్ల చెక్క మీద అంటించి వున్న కాగితం మధ్యలో నాటుకుంది. ఇది శబ్ద భేది అని మన పురాణాల్లో విన్నాము.

ఎన్నో అద్భుతాలు:

అలాగే నిలబడి వున్న మనిషి తలమీద నిమ్మ పండు వుంచి మనిషికి ఏ ప్రమాదమూ లేకుండా తల మీద నున్న నిమ్మపండుకు అంబును నాటటం.

అలాగే ఒక గోడకు ఒక బల్ల చెక్కను ఆనించి, ఆ చెక్క ముందు మనిషిని నిలబెట్టి కళ్ళు మూసుకుని నుంచున్న మనిషి చుట్టూ బల్ల చెక్కకు బాణాలు సంధించడం.

అలాగే అంబు వేగాన్ని తగు మోతాదులో సందించటం. మరో అద్భుత ప్రదర్శన. మనిషి నుదుటికి ఒక రూపాయి అంటించి రాజు గారు నాలుగు గజాల దూరంలో నిలబడి నొసటి మీద రూపాయి నుంచుకున్న మనిషికి ప్రమాదం లేకుండా ఆ రూపాయిని తగు మోతాదులో బాణాన్ని సంధించి దానిని పడగొట్టటం.

అలాగా నాలుగు గజాల దూరంలో నిమ్మ పండు కట్టిన దారం పుచ్చుకున్న ఒకే మనిషిని నిలబెట్టి తాను వెనుకకు తిరిగి విల్లు వీపు వెనుక సరిగా వెక్కు పెట్టి, ఆ దారాన్ని తెగగొట్టటం. ఇలా ఒకటా రెండా? ఎన్నో అద్భుతాలను రాజు గారు ప్రదర్శించారు. ఆ కొంచెం సేపూ ఆయన అపర అర్జునుడులాగే అందరికీ కనిపించాడు. బాణాన్ని సంధించే ప్రతి సారీ, ఏమౌతుందో నన్నంతగ భయభ్రాంతులయ్యే విధంగా ప్రదర్శనం సాగిపోయింది.

వీరే రాజు గారు:

రాజుగారు ఆజానబాహువు. నెరసిన గిరిజాల జుట్టు, మెలికలు తిరిగిన బుగ్గ మీసాలు. గ్లాస్కో పంచెను సైకిల్ కట్టు, నిపుణత్వంతో కూడుకున్న దృడదీక్ష, కొట్ట వచ్చినట్లు కనిపించాయి.

విలు విద్య ఆషామాషా విషయం కాదు. ఎంతో సాధన, పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్ర లక్ష్యం వుంటే గాని ఈ విద్యను సాధించడం కష్టం. అలా కష్టపడి ఎందరో ఈ విద్యను సాధించారు. ప్రదర్శించారు. ప్రజల మన్నన లందుకున్నారు.

ఆదరణ లేని అద్భుత విద్య:

ప్రావీణ్యంతో కూడు కున్న ఈ విలువిద్యకు ఈనాడు ఏ ఆదరణా లేదు. జీవన భృతి కోసం, వుత్సవాలలోనూ, సభా సందర్భాలలోనూ ప్రదర్శిస్తున్నారు. యుగ యుగాలుగా, తర తరాలుగా ప్రజా జీవితంలో భాగమై పోయి అది ఒక మహోజ్వల కళారూపంగా అభివృద్ధి చెంది, అశేష ప్రజా సామాన్యాన్ని అలంరించిన నాటి విలువిద్యను ఒక కళారూపంగా ఆభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతో వుంది.

ఈనాడు జీవించి వున్న వృద్ధ కళాకారుల వద్ద వున్న విద్యను వీడియో తీయడం, వారిని ఆహ్వానించి ఆదరించటం, వృద్ధాప్యంలో వున్న వారికి ఫన్ షన్ లు ఇవ్వడం, ఆ కళాకారులను కాపాడు కోవటం జరగాలి.

మరెన్నో కళారూపాలు

మరెందరో కళాకారులు