తెలుగువారి జానపద కళారూపాలు/బవనీలే బైండ్లవారు

బవనీలే బైండ్లవారు

ముఖ్యంగా తెలంగాణా జానపద కళారూపాలలో శైవ మతాన్ని ప్రబోధించేవీ, శక్తి స్వరూపాన్ని ఆరాధించేవి, గ్రామ దేవతల్ని పూజించేవీ ఎన్నో వున్నాయి.

తెలంగాణాలో రేణుకా ఎల్లమ్మ, మూహురమ్మ, పోశమ్మ, బతకమ్మ, మహంహాళీ, అంకమ్మ మొదలైన ఎందరో దేవతలు ఇంటింటా వాడవాడలా వున్నారు. ఆ దేవతల్ని ఎంతగానో పూజిస్తారు.

ఆ దేవతలకు సంబందించిన కథలనీ, గాథల్నీ గ్రామ గ్రామానా ఒగ్గు కథలు చెప్పేవారూ, బైండ్లవారూ, గొల్లసుద్దులు చెప్పేవారూ, ఎందరో కనిపిస్తూ వుంటారు. ఈ నాటికీ ఆ కథలూ, కళారూపాలూ నిలిచి వున్నాయంటే చారిత్రకంగా వాటి ప్రాముఖ్యం ఎటువంటిదో ఊహించవచ్చును.

ఇలా కథలు చెప్పే వారిలో బవనీలనీ, బైనీడివారనీ, బైండ్ల వారనీ రకరకాల పేర్లతో పిలుస్తూ వుంటారు. ఈ బైండ్లవారు హరిజనులైన పూజారులు.

అయితే బవనీలు కాకతీయ చక్రవర్తుల కాలం నాటికే ప్రాముఖ్యం వహించినట్లు క్రీడాభిరామంలో వున్న ఈ క్రింది ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చును. ఈ వుదాహరణను కాకాతీయుల కళావిన్యాసం శీర్షికలో చర్చించిన మాచల్దేవి క్రీడాభిరామ శీర్షికలో ఉదహరించబడిందే. అది ఇది.

బవనీల ప్రసక్తి:

వాద్యవైఖరి కడు నెరవాది యనగ
ఏక వీరామహాదేవి ఎదుట నిల్చి
పరశురాముని కథ లెల్ల ప్రౌఢి పాడె
చారుతర కీర్తి బవనీల చక్రవర్తి.

అని అనడాన్ని బట్టి బవనీలు ఈ రకమైన కథలు చెప్పడంలో ఎంతటి ప్రఖ్యాతి వహించారో తెలుసుకోవచ్చును.

వీరశైవ మతస్థులకు వినోదాన్ని కల్పించే వీరిని బైండ్లవారంటారు. కులాల వారీగా, మతాల వారీగా అచార్యులూ, కళాకారులూ వున్నట్లు వీరు కూడా కేవలం శైవమతస్థులకే వినోద ప్రదర్శన లిస్తారు.

వీరు శైవమతస్థుల ఇళ్లలో పెండ్లి మొదలైన శుభకార్యాలలోనూ, చావు మొదలైన దుర్దినాలలోనూ కథలను చెపుతారు. అయితే పెండ్లికీ, చావుకీ వేరువేరుగా వాయిద్యాలు వాయిస్తారు.

సంప్రదాయ కథలు చెప్పే బైండ్లవారు
సమిడికయే, జముకు.

బైండ్లవారు ఉపయోగించే వాయిద్యం జమిడిక. దీనినే కాలక్రమాన జిమిలిక, జముకుగా పిలుస్తున్నారు. నేటి జముకును చూసిన వారందరికీ జమిడిక ఎలా వుంటుందో ఊహించవచ్చు. కథకుడు మధ్యలో వుండి కథాగానం చేస్తూ వుంటే ప్రక్కన నున్న వంతలు జిమిడికల్ని వాయిస్తూ వుంటారు. ఈ జమిడికలు కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కర్రతోనూ తయారు చేసుకుంటారు. జమిడిక వాయిద్యం నేటి జముకుల నాదం లాంటిదే. జుకజుం జుకజుం అని నినాదాన్నిస్తాయి. పాట వరుస ననుసరించి, ఈ వాయిద్యం మారుతూ వుంటుంది. సన్నివేశాన్నిబట్టి ఉధృతంగా వాయిస్తారు. అయితే బైండ్ల వారి కథల బాణీలకూ, జముకుల కథల బాణీకీ చాల వ్వత్యాసముంటుంది. బైండ్ల వారు తెలంగాణాలో ప్రాముఖ్యం వహిస్తే జముకుల వారు తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో ప్రాముఖ్యం వహిస్తున్నారు. జముకుల కథల వివరాలను ఆ శీర్షికలో వివరంగా వివరించబడింది.

ప్రారంభం 13 వ శతాబ్దంలో:

ఎల్లమ్మ కథా గాన ప్రచారం 13 వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. నాటి నుంచి ఈ నాటి వరకూ తెలంగాణా జిల్లాలలో రేణుకా, ఎల్లమ్మ కథలు విరివిగా సాగుతూనే వున్నాయి. ఇక ఎల్లమ్మ గుడులు తెలంగాణాలో ఎక్కడ చూచినా కోకొల్లలు. ఎల్లమ్మను ఇంత శ్రద్దగా వారు కొలుస్తూన్నారంటే, ఆ కథల పట్ల ప్రజలలో వున్న భక్తి శ్రద్ధలను అర్థం చేసుకోవచ్చు.

ఆయా రాజుల పారిపాలనా కాలంలో మారిని చారిత్రిక పరిస్థితుల దృష్ట్యా, రేణుకా ఎల్లమ్మ కథా గానం, ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో కూడ ప్రవేశించి, తెలంగాణా సరిహద్దుల దాటి మహారాష్త్రకు వెళ్ళిన గొండ్లి వారు, ఎల్లమ్మ కథలను గానం చేస్తూ కర్ణాటకకు కూడా వ్వాపింప చేశారు.

ఈనాటికీ కర్ణాటకలో రేణుకా దేవాలయాలున్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ జరిగే ఉత్సవాలలో స్త్రీలు వివస్త్రలై నగ్నంగా అవేశంతో ఆలయం చుట్టు పరుగెత్తుతూ రేణుకాదేవిని పూజిస్తారు.

ముఖ్యంగా పల్లెల్లో వచ్చే కలరా, మశూచికం, పొంగు, ఆటలమ్మ మొదలైన వ్వాధులకు ఈ దేవతలే కారణంగా పూజిస్తారు. ఒకో ప్రాంతంలో ఒకో రకమైన దేవతల్ని అలాగే పూజిస్తారు.

కోస్తా ఆంధ్ర ప్రాంతంలో గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ,ఎర్ర మారెమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ,మొదలైన దేవతలను పైన ఉదహరించిన వ్వాధులు సంక్రమించినప్పుడు ఆదేవతల్ని నీచ దేవతలుగా ఎంచి, వాటిని సంతృప్తి పర్చటానికి, కొలువులను కొలుస్తారు.

ఆ దేవతల పుట్టు పూర్వోత్తరాలను ఆ వుత్సవాల సందర్భంలో కథా గానం చేసే వారు. ఆ కథా గానం చేసే వారే పూజారులుగా వుండేవారు. ఆ పూజారులు హరిజనులు ఆసాదులు, కుమ్మరి వారు, రజకులు, బైండ్ల వారూ మొదలైన వారుండేవారు. బైండ్లవారనే వారు హరిజనులే__

రేణుకా మహాత్యం:

జమదగ్ని మహాముని ఆజ్ఞ ననుసరించి కుమారుడైన పరశురాముడు తల్లి యైన రేణుకను వధించిన తీరునూ, ఆ కథ యొక్క పూర్వాపరాలనూ, వధానంతరం రేణుక యొక్క మహాత్య గాధలనూ ఉత్తేజంగా బైండ్లవారు చెపుతారు. రేణుక చేసిన త్యాగానికి ముగ్ధులై రేణుకను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

ఎల్లమ్మను ఆరాధించే భక్తులు, వారి ఆడపిల్లలను ఎల్లమ్మ పేరు మీద జోగితలుగా అర్పిస్తారు. ఆమెను బసివిగా పిలుస్తారు. ఆ అమ్మాయి ఊరందరి సొత్తు. ప్రతిఫలాపేక్ష లేకుండా అందరి కామ వాంఛలూ తీరుస్తుంది. ఆ సాంప్రదాయం ఈ నాటికి తెలంగాణాలో కొనసాగౌతూనే వుంది.

ఎల్లమ్మ:

ఎల్లమ్మ పుట్టు పూర్వోత్తారాలను గురించి డా॥ ఎల్దెండ రఘుమారెడ్డి "పల్లె పదాలలో ప్రజా జీవనం" అనే గ్రంధంలో ( 352 వ, పేజీలో) ఉదహరించిన జానపద గేయాన్ని బట్టి ఎల్లమ్మ జన్మ వృత్తాంతం తెలుస్తున్నదని కె.వి. హనుమంతరావుగారు ఆంధ్ర ప్రభలో ఉదహరించారు.

శివుని బిడ్డవమ్మా ఎల్లమ్మ:

శివుని చిన్న బిడ్డవమ్మా ఎల్లమ్మ,
నీవు శివువెల్లి మాతవమ్మా ఎల్లమ్మ,
పుట్టలో పుట్టినావు ఎల్లమ్మా,
నీవు పుడమిపై బడ్డావమ్మ ఎల్లమ్మ.
నాగవనన్నె చీరలమ్మ ఎల్లమ్మ నీకు.,
నీకు నెమలి కండ్ల రవికెలమ్మ ఎల్లమ్మ.
ఎదుము గల్వాలు తల్లీ ఎల్లమ్మ నీకు
ఎనుక నీకు దరిసెనమ్మ ఎల్లమ్మ
గవ్వలాది కంకణమ్ము ఎల్లమ్మానీకు
ఘంటలాది రాగమమ్మా ఎల్లమ్మా
నాగుబాముల బట్టినావూ ఎల్లమ్మా నీవు
నడికట్టు వేసినావు ఎల్లమ్మా
జెఱ్ఱిపోతుల బట్టినావూ ఎల్లమ్మా నీవు
జడికొప్పులు వేసినావు ఎల్లమ్మా
కాలి గజ్జెలు గల్లు మనిపిస్తే ఎల్లమ్మ నీవు.
ఓరుగల్లు తల్లడిల్లే ఎల్లమ్మా
ఓరుగంటి రాజులకు ఎల్లమ్మా నీవు
ఓంకారమడిగితివి ఎల్లమ్మా.

ఎల్లు ఎల్లు ఎల్లమ్మా ఎల్లమ్మా నీవు.
ఎల్లు నీవు ఎదురైనచో ఎల్లమ్మా

తల్లి ఎవరమ్మా, ఎల్లమ్మా|