తెలుగువారి జానపద కళారూపాలు/చిందులు తొక్కే చిందు భాగవతం

చిందులు తొక్కే చిందు భాగవతం


తెలుగు జాతికి గర్వ కారణమైన అన్య ప్రాంతీయులకు కూడ ఆదర్శ ప్రాయమైన, శాస్త్రీయ, సంప్రదాయ... జాన పద నృత్య రీతులను రూపొందించి ప్రచారంలోకి తీసుక వచ్చారు ప్రాచీనాంధ్ర నృత్య శాస్త్ర వేత్తలు.

పూర్వం తెలుగు నాడును ...యక్షభూమి అని పిలిచే వారు. యక్షులనే గంధర్వ జాతికి చెందిన వారు, ఆడి పాడిన, భూమి కనుక వారి నృత్య శైలియే యక్షగానంగా వర్థిల్లిందంటారు. యక్షగానం అతి ప్రాచీనమైనది. పల్లె ప్రజలకు అందుబాటులో వున్న రమణీయ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందు వారు.

ఈ నృత్యం సుమారు రెండు వేల సంవత్సరాల నాటి దంటారు. నాటి నుంచి నేటి దాకా ఒక ప్రత్యేకతను సంతరించుకుని పండితుల్నీ, పామరుల్నీ తమ కళా నైపుణ్యంతో ఈ కళాకారులు మెప్పించి శభాష్ అనిపించుకున్నారు. కాని ఈ కళాకారులు ఆశించేది పట్టెడు అన్నం, పాత వస్త్రాలు మాత్రమే. వృత్తుల ననుసరించి, జాతులు ఏర్పడినట్లే, ఆజాతులపై ఆధార పడి వారికి వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరికొన్ని __తెగలు ఏర్పడ్డాయి.

చిందు మాదిగలు:

మన దేశంలో అతి బీదవారిగా, అందరి కంటే ఆఖరి జాతి వారుగా చూడబడే హరిజనులకు చెందిన... మాదిగ ...వారిపై ఆధారపడి జీవించే కళాకారులు గనుక వీరిని చిందు మాదిగలు అని పిలుస్తూ వ్చారు. సంఘంచే వీరు కడజాతి వారుగా చూడబడ్డారు. వీరులక్ష్మీ ప్రసన్నులు కాకపోయినా, సరస్వతీ పుత్రులు.

తెలుగు వారు ఒక విశిష్ట తెగగా ఏర్పడి తెలుగు భాష దేశ భాషల్లో ప్రాముఖ్యత సంపాదించినప్పుడే వీరుకూడ ఆజాతిలో ఒక భాగంగా జీవిస్తూ ఆటపాటల్లో దేశాన్ని అలరింప చేస్తున్నారు. ఇది వీరి కళల యొక్క ప్రాచీనత.

ఈ చిందు జోగితలు ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలోని నిజామాబాద్... అదిలాబాద్ ...కరీం నగర్ మెదక్ జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ఆడుతారు. మన ప్రాంతాల్లో పగటి వేషధారులు పగటి పూట ఎలా పగటి వేషాలను వీథుల్లో ప్రదర్శిస్తారో వీరు కూడా అదే మాదిరి, పగటి పూటే తమ ప్రదర్శనాలనిస్తారు. స్త్రీలు పురుషులు కూడ అదే మాదిరి, పగటి పూటే తమ ప్రదర్శనాల నిస్తారు. స్తీలు పురుషులూ కూడ ప్రదర్శనాల్లో పాల్గొంటారు. బృందాలుగా ఏర్పడి ప్రదర్శనాల నిస్తారు. వీరు షుమారు ఏబై యక్షగానాల వరకూ ప్రదర్శిస్తారు. వీరి ప్రత్యేకత పాడుతూ ఆడతారు. వారికి కావలసిన ఆలంకరణకు సంబందించిన, వస్తువుల్నీ, దుస్తుల్నీ వారే తయారు చేసుకుంటారు. అవి ఎంతో ప్రవీణతో తయారు చేయ బడతాయి.

జోగితలు:

చిందు జోగితలు ఇంచు మించుగా ఒకే తెగకు చెందిన వారైనా, వీరిలో కొన్ని భేదాలున్నాయి. జోగిత అనే పదాన్ని ఒక బిరుదుగా వుపయోగించేవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి... అలంపురం జోగులాంబ పీఠం ... ఆ దేవి సేవలో అంకితమై నృత్య మాడే వారు గనుక వారిని జోగులాంబలు అని పిలవటంఆచార మైంది.

జోగుల వారని పిలువబడేవారు, నృత్య నృత్తములను మాత్రమే ప్రదర్శిస్తారు. జోగు ... చిందుల స్త్రీలు, నృత్త నృత్యాలతో కూడిన యక్షగానాలను ఆడతారు. ఒక్కొక్క దరువూ ఒక్కొక్క సందర్బంలో ప్రదర్శిస్తారు.

వారి ప్రదర్శనంలో, మృదంగం ... తాళం... చిప్పలు ... గజ్జెలు ... హర్మోనియం శృతి మొదలైనవి ప్రధానంగా వాయించే వాయిద్యాలు నటులు. నేపద్యంలో వుండి వంట పాడుతారు. ప్రతి గ్రామంలోనూ వీరు ప్రదర్శనం ఇచ్చే సమయంలో ..... ఎల్లమ్మ ఆట ఆడటం వారి ప్రత్యేకత. తమ జీవితాలు మోడువారి పోయినా గ్రామాలు

సస్యశ్యామలంగా వుండాలని కోరుతూ తన్మయత్వంతో ఆడతారు. ఆ ఆటవల్ల కరువు కాటకాలు రావని నమ్మే ప్రజలు ఈ నాటికి నిజామాబాద్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో వున్నారు.

ప్రదర్శించే నాటకాలు:

సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందిన ఈ కళాకారులు, ప్రదర్శించే నాటకాలలో ముఖ్యమైనవి, మోహినీ రుక్మాంగద, సారంగధర, చెంచు లక్ష్మి, వీరాభిమన్య , సుందర కాండ, సతీ సావిత్రి, మైరావణ మొదలైన నాటకాలను ప్రదర్శిస్తూ మధ్య మధ్య ప్రజల సమస్యలను సందర్బోచితంగా చొప్పిస్తూ పేద ప్రజానీకాన్ని ఆకట్టు కుంటారు.

చిందు నృత్యాన్ని ప్రదర్శించే సుమారు ఏభై దళాలు నిజామాబాదు జిల్లాలో వున్నాయి. వంశ పారంపర్యంగా తమ పెద్దల వద్ద విద్య నభ్యసించి, ప్రజలకు వినోదాన్ని కూర్చే ఆచారాన్ని, ఈ తెగ పాటిస్తూ వుంది. ఎవరి పాటలు, పద్యాలు వారు పాడాతారు, తాళాలు వాయించడానికి మాత్రం స్త్రీలు వుంటారు. నృత్యంలో, ఆడ వారికీ, మగ వారికీ పెద్ద తేడా కనిపించదు. సాధారణంగ ఈ చిందు కళాకారులు ఒకే ఒక కుటుంబానికి చెందిన వారై వుంటారు. ఆ కళాకారుల బృందాన్ని మేళం అని పిలుస్తారు.

ఆర్మూరు చిందు భాగవతులు:

ఆర్మూరు చిందు భాగవత బృందానికి సలహా సంఘ కార్య దర్శి ఎం. నారాయణరావు నాయకత్వం వహిస్తున్నారు. ఆర్మూరు నిజామా బాద్ జిల్లాలో వుంది. వీరు సారంగధర నృత్య నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శిస్తారు. అద్దాల బిళ్ళలు, బంగారు రంగు ముచ్చి రేకులు అంటించిన కిరీటాలు, అతి ప్రాచీనమైన, వివిధ రకాలైన ఆభరణాలు, ధరించే దుస్తులు కళ్ళు మిరుమిట్లు గొల్పుతాయి. బృందలో వున్న ప్రతి ఒక్కరూ కేవలం చిందు నృత్యం తొక్కడమే కాక, అందుకు తగిన అభినయాన్ని హావ భావ యుక్తంగా ప్రదర్శిస్తారు.

చిందుల యల్లమ్మ:

ఈ బృందానికి చిందుల యల్లమ్మ ప్రత్యేక అలంకారం, ఆమె సారంగ ధరలో చిత్రాంగి పాత్గ్రను ధరించి, నవరసాలనూ, నవరస భరితంగా ఒప్పిస్తూ ఆబాల గోపాలాన్ని రంజింప జేయగల ప్రసిద్ధ నటి.

ఆమె స్త్రీ పాత్రల్ని ఎంత సమర్థ వంతంగా పోషిస్తుందో, పురుష పాత్రల్ని కూడ అంత సమర్థవంతంగా పోషిస్తుంది. ఈమె నటనా వైదుష్యాన్ని గుర్తించి

ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ అధ్యక్షులు, నటరాజ రామ కృష్ణ గారు అకాడమీ విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించారు.

ఈ బృందంలో సారంగధర నాటకంలో రాజరాజ నరేంద్రుడుగా "చిందుల శ్యాం", సారంగధరుడుగా "చిందుల శ్రీనివాస్", చిత్రాంగిగా "చిందుల యల్లమ్మ" రత్నాంగిగా "చిందుల వెంకటరత్నం", చెలికత్తెగా "చిందుల రాజేశ్వర్ ."__

వీరు గాక "చిందుల గంగాధర్", "చిందుల బాబయ్య " "చిందుల నీలమ్మ", "చిందుల సుశీల", "చిందుల చిన్నమ్మ", మొదలైన వారు ఉత్తమ కళాకారులు.

అర్మూరు భాగవతుల్లో మృదంగాన్ని "చిందుల గోపాల్ " తాళం "చిందుల శ్రీమతి శృతీ" "ఎన్. చంద్రయ్య" మొదలైన వారు నిర్వహిస్తారు.

రామకృష్ణ ఆదరణ

అసలే తెలంగాణా వెనుక బడిన ప్రాంతం, అందులో సమాజంలో బాగా వెనకబడి పోయిన వారు వీరు, ఒక్క తెలంగాణాలో తప్పా సర్కారాంధ్ర దేశంలో మరెక్కడా ఈ కళారూపం కనిపించదు. నాటకం, సినిమా, రేడియో, టీవీ, వీడియో మొదలైన అత్యాధునిక కళారూపాల తాకిడికి ఇలాంటి కళారూపాలన్ని తట్టుకోలేక శిధిలమై పోతున్నాయి.

శిథిలమై పోయే ఈ కళారూల్ని బ్రతించాలని, నటరాజ రామ కృష్ణ చిందు కళాకారుల పరిస్థితి పరిశీలించి, ఈ మహత్తర కళారూపం అంతరించి పోకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించేలా చేశారు.