తెలుగువారి జానపద కళారూపాలు/కారువా మేళ నృత్యం

కారువా మేళ నృత్యం

తెలుగు నాట వర్థిల్లిన జానపద కళా రూపాలన్నీ అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారంలో వున్నాయి. కొన్ని ముఖ్యమైన కళా రూపాలు తప్ప మిగిలినవన్నీ ప్రాంతీయంగా అభివృద్ధి చెందాయి. అలా ప్రాంతీయంగా అభివృద్ధి పొందిన కళారూపం కారువా నృత్యం. ఇది ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఈ నాటికీ ప్రచారంలో వుందంటారు.

రాధాకృష్ణుల రాస లీలలు మాదిరి సమ సంఖ్యలో ఎనిమిది మంది గోపికలుగానూ, మరొ ఎనిమిది మంది కృష్ణులుగానూ వేషాలు ధరించుకుని, వలయాకారంగా నిలబడి నృత్యం చేస్తూ వుంటే వలయాకారపు మధ్య రాధా కృష్ణులు నాట్యమాడుతూ వుంటారు. వరుస క్రమంలో కృష్ణుడు, తరువాత గోపిక, మరల కృష్ణుడు, మరల గోపిక, ఇలా గుండ్రంగా నిలబడి నృత్యం చేయడాన్ని కారువా మేళంగా వర్ణించారు. దీనిని గురించి నాట్య శాస్త్రల్లో 'కర్షణీ ' నర్తనంతో పోల్చవచ్చు నంటారు. నటరాజ రామకృష్ణ గారు. ఉత్తర భారత దేశంలో ఈ నృత్యం రాసలీలా నృత్యంగా విరాజిల్లుతూ వుంది.

ప్రదర్శన తీరు:

కారువా నాట్యం కేవలం సంగీత వాయిద్య ఆధారంతోనే ప్రదర్శింపబడుతుంది. ఇందులో పాటలు పాడటం చాల తక్కువ. వాద్య సంగీతం ప్రారంభమై ఉధృత లయతో అంత మొందుతుంది. నృత్యం కూడా ఆ వాయిద్యాల వేగానికి అనుగుణంగా ప్రారంభమై వేగాన్ని పుంజు కుంటుంది. పతాక స్థాయి నందుకున్న తరువాత మళ్ళీ ప్రాధమిక లయకు మారుతుంది.

లీలా నర్తనం:

కారువా నాట్యంలో ఒక ప్రత్యేక భాగాన్ని లీలా నర్తనమని పిలుస్తారు. ఈ నృత్యంలో ముఖ్యంగా రాధాకృష్ణ పాత్రలు ప్రాముఖ్యం వహిస్తాయి. గోపికలూ, కృష్ణులూ నాట్యమాడి నిలబడి పోయి తరువాత వలయం మధ్యలో వున్న రాధాకృష్ణ పాత్రధారులు లిరువురూ నృత్యాన్ని ప్రారంభిస్తారు. వివిధ రకాల విన్యాసాలతో ఆ నృత్యం కనుల పండువుగా వుంటుంది. మధ్య మధ్య కృష్ణుని చేతిలోని మురళిని రాధ కొంటెగా లాగుకొని, తానే కృష్ణునిగా వేణువును వూదుతూ తానే కృష్ణుడుగా బావాభినయాన్ని చేస్తుంది. దీనిని లీలా నర్తన మంటారు.

ఎనిమిది మంది గాని, పద్దెనిమిది మంది గానీ ఎందరున్నా సమసంఖ్యలో పాల్గొని మాత్రమే నృత్యం చేస్తారు. శిధిలమై పోతున్న ఈ కళారూప సంప్రదాయాన్ని కాపాడటం ఎంతైనా అవసరం.