కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/తురకల దశావతారములు

4. తు ర క ల ద శా వ తా ర ము లు

మహమ్మదీయులలో షియాలు, సున్నీలు, అనే రెండుతెగలున్నవి. మహమ్మదు ప్రవక్తను గౌరవిస్తూ ఖొరానును పవిత్రంగా ఎంచే రెండువిషయాలలో తప్ప మరే విషయాలలోనూ సున్నీలకూ షియాలకూ సామరస్యం లేదు. ఒకరిని చూస్తే ఒకరికి పరమద్వేషం.

మహమ్మదుగారి కొమార్తె అయిన ఫాతిమాకు, ఆయనచిన్న భార్యాఅయిన ఆయేషాకునుగల క్రోధజ్వాలలు ప్రజ్వలించి మహమ్మదీయ ప్రపంచాన్ని షియా సున్నీలనే రెండు కులాలుగా చీల్చినవి. ఈ రెండు తగలమధ్య వచ్చే తగాదాలలో రక్తపాతం కూడా కలుగుతూవుంటుంది. చిన్న చిన్న మహమ్మదీయ తెగలవారు వీరి మధ్య నలిగిపొతూ వుంటారు. మన దేశంలో సున్నీలే అధికసంఖ్యాకులు గనుక వారిమధ్య జీవించే స్వల్పసంఖ్యాకులుగ వుండే మహమ్మదీయ తెగలవారు తమ కేమి కీడు మూడుతుందో అనేభయంతో వుంటారు.

భగవంతుని దూతయైన మహమ్మదు ప్రవక్త తన తరువాత ఎవరు మతగురువుగా వుండవలసినదీ నిర్ణయించకుండా క్రీ.శ. 632 లో చనిపోయాడు. ఆయన కొమార్తె ఫాతిమయొక్క భర్తయున్నూ, ఆయన ప్రధమశిష్యుడున్నూ అయిన ఆలీ ఆయన తరువాత కాలిఫు అవుతాడని అందరూ అనుకున్నారు గాని మహమ్మదుగాని చిన్నభార్య ఆయేషా ఫాతిమాపట్ల విరోధం వహించి ఒకకక్ష లేవదీసి తనతండ్రి అబుబేకరును కాలీఫుగా ఎన్నుకొనేటట్లు చేసింది. ఆయన తరవాత ఓమరు, ఓస్మాను, కాలిఫు లయ్యారు. క్రీ.శ.655 లో ఓస్మాను చనిపోయిన తరువాత ఆఖరికి ఆలీ కాలీఫుఅయినాడు గాని 661 లో అతనిని ఒక మహమ్మదీయుడు వధించాడు. అతనికి హస్సను, హుస్సేను లని ఇద్దరు కొమాళ్లు. హస్సనుకు విషం పెట్టించి చంపారు.

ఇరాకు అరబ్బీ దేశముల (మొసపొటేమియా) రాజు ఆహ్వనం మీద హుస్సేనుగారు మెదీనానుంచి క్యూఫాకు వెడుతూ వుండగా దారిలో 'కెర్బాలా ' దగ్గర ఆయనను ఆయనకుమారుని ఆరాజు సైనికులే అన్యాయంగా చంపారు ఇంకొక కొడుకును భార్యను సోదరిని ఎత్తుకొనిపోయారు. హుస్సేను తలను క్యూఫాలో ఊరేగించారు.

షియాలు - సున్నీలు

అబుబేకరు ఓమరు ఓస్మానులను అంగీకరించక ఆలీని ఈశ్వరుని అవతారమని నమ్మి ఆయన వంశీయులను ఇమామూలుగా గౌరవించే వారే షియాలు. ఆయనను ఒక కాలీఫుగా మాత్రమే పరిగణించేవారే సున్నీలు. క్రమక్రమంగా ఈ రెండు తగల అచారవ్యవహారాలు భేదించి విరోధాలు ఏర్పడ్డాయి. అని కుల కక్షలుగా పరిణమించాయి.

సున్నీలు ఖొరానులోని ధర్మాలనేగాక సున్నత్ అనె మహమ్మదుగారి జీవిత విధానాన్ని కూడా ప్రమాణంగా అంగీకరిస్తారు. సున్నీలు రోజుకు అయిదుసార్లు ప్రార్ధన చెస్తారు. షియాలు రోజుకు మూడుసార్లే ప్రార్ధన చేస్తారు. సున్నీలు ప్రార్ధించేటప్పుడు చేతులు ముడుచుకొని రొమ్ముమీద వుంచుకొంటారు. షియాలు చెతులు ప్రక్కకు వాల్చుకొనే వుంటారు. షియాలు మహమ్మదుగారి అల్లుడైన ఆలీగారినీ, కొమార్తె అయిన ఫాతిమాను ఈశ్వరాంశ సంభూతులుగా పరిగణిస్తారు. మహమ్మదుగారి చిన్నభార్య ఆయేషా బంధువులైన అబుబేకరు. ఓమరు ఓస్మానులు అక్రమంగా కాలీఫులైనవారని అసహ్యించుకుంటారు. ఈ ముగ్గురు కాలీఫులను సున్నీలు శుక్రవారపు ప్రార్ధనలలో భక్తితో స్మరిస్తారు. వారి పేర్లు పవిత్రంగా యెంచి మశీదు గోదలమీద చెక్కిస్తారు.

ఆలీగారి కొమారుడైన హుస్సేనుగారు మెదినానుంచి క్యూఫాకు పోతూ వుండగా హుస్సేనుగారిని కెర్భాలాపట్నంలో వధించిన ఘోరకృత్యాన్ని స్మరిస్తూ షియాలందరూ మొహరం నెలలో దు:ఖపడుతూ ప్రార్ధనలు చేస్తూవుంటే సున్నీలు దీనిని వెక్కిరిస్తూ ఆతతాయులచేత పులులు మొదలైన మృగాల వేషాలు వేయించి మొహరంలో అల్లరి చేస్తూ దానిని ఒక పండుగలాగ చేస్తారు. ఇదేమనదేశాలలొ పులివేషాల చరిత్ర. కెర్బలాను పవిత్ర ప్రదేశంగా యెంచి అక్కడి మట్టియుండల తావళాలతో షియాలు జపంచేస్తారు. ఆ మట్టిని నీళ్ళలొకలిపి తాగుతారు. సున్నీలు ఇది చూసి అసహ్యించుకుంటారు.

ఆ గా ఖా ను

ఆలీ దగ్గరనుంచి ఏడవతరమువాడైన ఇస్మేల్ అనే మతగురువు భగవదవ తారమని షియా ఇస్మేలీ తెగవారి విశ్వాసం. హస్సన్ బిన్ సబా అనే అతడు అరబ్బీ దేశీయుడు. అతడు షియామతంవాడు. ఈజిప్టుదేశం ముఖ్యపట్టణమైన కైరోలో ఇస్మేలీ మత సిద్ధాంతాలను బాగా అభ్యసించాడు. అప్పుడు పారశీక దేశంలో సున్నీమతం ప్రబలంగా వుండేది. ఇతడు ఒక కొండమీద స్థావరం యేర్పరచుకొని క్రీ.శ. 1090 ఆ ప్రాంతంలో హింసాపద్దతులతో బలవంతంగా మతప్రచారం చెయ్యడం నారంభించాడు. మతవిరోధులను చంపే విధానాలను ప్రారంభించాడు. అతని తరువాత నాలుగవ ('ఇమాం ') మతగురువు 'జాకరేసలాం ' అనే ఆయన కూడా ఆపద్ధతిలోనే మతప్రచారం చేశాడు. తాను ఇస్మేలీ మత గురువుయొక్క వంశంలో ఏడవ తరంవాడనని దైవాంశసంభూతుడనని ప్రచురించుకుని ఇతడు ప్రఖ్యాతిచెందాడు. ఒక సందర్భంలో ఇతని చర్యలు తక్కిన మహమ్మదీయులకు చాలా హేయకరంగా తోచాయి. ఇతడు రంజాను 17 వ రోజున అలమత్తుకోటలో ఒక వేదికమీద కెక్కి తాను భగవంతుని ప్రతినిధి నని ప్రచురించి సామాన్య మహమ్మదీయ మతసిద్దాంతాలను రద్దుచేసి ఆ పవిత్రదినాన్ని 'ఇమాం ' గారికి దివ్యత్వం సిద్ధించినదినంగా పరిగణించాలన్నాడు. యధేచ్చగా పందిమాంసం కూడా తినవచ్చుననిన్ని తప్పతాగవచ్చుననిన్ని ప్రకటించాడు. తరువాత నాలుగేళ్ళలో ఇతనిని ఎవరో వధించారు.

1866 వ సంవత్సరంలో బొంబాయి సుప్రీంకోర్టులో వచ్చిన వ్యాజ్యంలో 1 వ ప్రతివాది అయిన మహమ్మదు హుస్సేన్ హుస్సేనీ అనే పేరు గల ఆగాఖాను గారు ఆ యిమాముల వంశీయు లేనని ఆ కేసులో రుజువుచేశారు. ఈ ఆగాఖానుగారు ఇస్మేలీ షియా మహమ్మదీయుల అనువంశిక మత గురువు. ఏ తెగవారినైనా మహమ్మదీయుల నందరినీ 'తురక ' లని వ్యవహరించడం పరిపాటి అయినది.

క్రీ.శ.16 వ శతాబ్దంలో పారశీకదేశం షియా మతాన్ని స్వీకరించినది మొదలు ఇస్మేలీల బాధలు తగ్గినాయి. ఈమహమ్మదు హుస్సేన్ హుస్సేనీగారి తాత, పారశీక దేశంలో కెర్మను నగర పరిపాలకుడుగా ఉండేవాడు.ఆ ఉద్యోగం అయిపోయిన తరువాత మెహెంతీ జిల్లాలో ఉండేవాడు. ఆయన కొమారుడు హుస్సేనీగారి తండ్రి, యెజ్డు నగరంలో వుండగా ఆయనను 1817 లో హత్య చేశారు. 1838 లో ఆగాఖాను పితూరీ చేసి కెర్మనునగరం పట్టుకున్నాడు. ఆ సమయంలో ఆగాఖానుదగ్గర నౌకరుగా వుండినవాడు పారశీక రాజుదగ్గర పలుకుబడి సంపాదించి ఆగాఖాను కొమార్తెను తనకు పెళ్ళి చెయ్యమని అడిగాడు. ఇది సహించలేక ఆగాఖాను 1840 లో హిందూదేశానికి వచ్చాడు. సింధులో వుండే మూడువేల కుటుంబాల వారు ఆగాఖానుకు సాలీనాకప్పం చెల్లించడంవల్ల సొమ్ముకు ఇబ్బందిలేదు. ఆగాఖాను 1841-42 మధ్య ఆఫ్ గను యుద్ధంలో ఇంగ్లీషు వారికి సహాయంచేశాడు. ఇంగ్లీషువారు 1843-44 లో సింధు అమీరుల రాజ్యాన్ని ఆక్రమించినప్పుడుకూడా ఆగాఖాను వారికి సహాయం చేసినందువల్ల ఆయనకు ఇంగ్లీషువారు ఫించను యిచ్చారు.

1845 లో ఆగాఖాను బొంబయిలో స్థావరంగా వుండడం ప్రారంభించాడు. ఆయన బొంబాయిలో జమాత్ ఖానాలో అధ్యక్షత వహించి మొహరంలోనూ పండుగరోజులలోనూ బహిరంగంగా జరిగే నమాజులో పాల్గొంటాడు. అప్పుడు అలీ కుమారుడు హుస్సేను చచ్చిపోయిన కెర్బాలా పట్నం మట్టిని కలిపిన నీటిని అందరికీ తాగడానికి ఇస్తాడు. ఖోజా తెగవారు ఆయనకు పాదపూజలు సమర్పించి భక్తితో చేతిని ముద్దు పెట్టుకుంటారు. కాఠియవాడు కచ్చి బొంబాయి జాంజిబారు మొదలైన ప్రాంతాలలొ వుండే శిష్యులిచ్చే పాదపూజ సొమ్మువల్ల ఆయనకు సాలియానా ఒకలక్ష యేబదివేల రూపాయిల ఆదాయం వస్తుంది. ఆ సొమ్ములో చాలా భాగం గుఱ్ఱపు పందెముల క్రింద ఆయన ఖర్చు పెడుతాడు' ' అని 1866 లో బొంబయి సుప్రీముకోర్టు న్యాయమూర్తి ఆర్నాల్డుగారు తమ తీర్పులో అప్పటి ఆగాఖాను చరిత్రను వ్రాశారు.

ఇప్పటి ఆగాఖానుగారుకూడా చాలా ధనవంతుడనిన్ని, గుఱ్ఱపు పందెములలో అందెవేసిన చెయ్యి అనిన్నీ, చాలా భోగి అన్నీ, ఎప్పుడూ ఐరోపాలోనే వుంటాడనిన్నీ, అందరికీ తెలిసిన విషయమే.

ఖో జా లు

ఖోజాలనే తెగవారు వేషభాషలలో ఆచారవ్యవహారాలలో హిందువులు, మతంలో మహమ్మదీయులు. వీరిని గురించి వచ్చిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ బొంబయి సుప్రీము కోర్టు న్యాయాధి పతియైన సర్. ఎర్ స్కిన్ పెర్రీగారు 1847 లో యిచ్చిన తీర్పులోను, బొంబయి హైకోర్టులో అడ్వకేటు జనరలుగారికీ, ఆగాఖాను గారికీ జరిగిన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ 1866 లో ఆర్నాల్డు అనే న్యాయాధి పతి ఇచ్చిన తీర్పులోనూ 1875 లో వచ్చిన వ్యాజ్యంలో సర్ చార్లెస్ సార్జెంటుగారనే న్యాయాధిపతి యిచ్చిన తీర్పులోనూ వీరిచరిత్ర చాలా విపులంగా చర్చింపబడింది. వీరికి వారసత్వ విషయములో హిందూ ధర్మశాస్త్రమున్నూ తక్కిన విషయాలలో మహమ్మదీయ ధర్మశాస్త్ర మున్నూ వర్తిస్తాయని నిర్ణయించబడింది.*[1]

“ఖోజాలు హిందు దేశంలో పడమట భాగంలో సివసించే ఒక చిన్న తెగ వారు. వీరు మొదట సింధు, కచ్చి రాష్ట్రములనుండి వచ్చి నట్లు కనపడుతూవుంది. సుమారు అయిదువందల సంవత్సరాల క్రిందట సదర్ దీన్అ నే మ హ మ్మ దీ య పీ రు ( మ హా త్ము డు ) వీరిని హిందూమతంలో నుంచి తురకలలో కలిపినట్లు చెప్పుకుంటారు. యదు వీరికి తెలిసినదల్లా ఆగాఖాన్ అనే ఒక పారశీకప్రభువు తమ మత గురువుగా గౌరవించడం మాత్రమే" నని పెర్రీగారు వ్రాశారు.

ఈ ఆగాఖాను పారశీకదేశంలొ ఇస్మేలీలనే మహమ్మదీయ తెగవారి మతగురువు. తురకలలో వీరు షియామతస్థులు. మహమ్మదు ప్రవక్త అల్లుడైన ఆలీగారిని భగవంతుడి అవతారంగా నమ్ముతారు. ఆ ఆలీగారి దగ్గరనుంచి ఇస్మేయిల్ అనే ఇమాముగారి వరకూ ఈశ్వరాంశ వున్నదనిన్నీ అది ఆగాఖానుగారి వంశంలోపురుషులలో పారంపర్యంగా వస్తూవున్నదనిన్నీ నమ్మి ఇస్మేలీ మతమువా రందరూ ఆగాఖానుగారికి భగవంతునిగానే ఆరాధిస్తారు. ఈ ఆగాఖారుగారికి తమ శక్త్యానుసారంగా ప్రతియేటా కొంతముడుపు చెల్లిస్తారు. ఆ బాపతు ఆయనకు సాలుకు ఒకలక్ష యేబదివేల రూపాయల శిష్యార్జనవుంది.

అందువల్ల ఈ భొజాలుకూడా షియా ఇస్మేలీమత శాఖలో చేరినవారిని యేర్పడుతూ వున్నది. అసలు షియా ఇస్మేలీ మతంలోనే ఇతరుల మనస్సులకు నొప్పి కలిగించకుండా తన మతవిశ్వాసాన్ని కోల్పోకుండా వుండాలనే సిద్ధాంతం ఒకటి వుంది. ఇతర మతాలవారిని తురకలలో కలుపుకునే సందర్భంలో ఇతరమతాలవారి ఆచార వ్యవహారాలను నిరాకరించక క్రూరమైన పద్ధతులతో గాక వారి మతాచారాలను చాలావరకూ అంగీకరించి వాటిని మహమ్మదీయుల మతానికి అనుగుణ్యముగా అర్ధంచెప్పి మతప్రచారం చెయ్యాలనే నియమం కూడా ఒకటి వున్నది. పై రెండు కారణాలవల్లనూ హిందూమతంలో నుంచి తురకలలో కలిసిన భోజాలు చాలావరకు హిందూఆచార వ్యవహారాలనే అవలంబించి వుండడానికి వీలైనది.

హిందూదేశంలో షియా మతస్థులకన్న సున్నీ మతస్థులే అధిక సంఖ్యాకులుగా వున్నారు. సున్నీ మతస్థులకూ షియామతస్థుల ఆచారాలకూ వీరి యాచారాలకూ, చాలా తేడా లున్నాయి. తమదే శిష్టా చారమని సున్నీల ఊహ. ఈదేశాన్ని ఏలిన మహమ్మదీయ రాజులలో చాలామంది సున్నీమతంవారే. అందువల్ల ఈ సున్నీల మధ్య జీవించే షియాలకు చాలాబాధలు కలుగుతూ వచ్చాయి. అందువల్ల ఖోజాలు ఏ యెండకు ఆ గొడుగు పట్టడం నెర్చుకున్నారు.

'దశావతార్ ' అనే మతగ్రంధం

ఈ ఖోజాలు షియామతస్థులతో తాము షియాల మంటారు. సున్నీ మతస్థులతో తాము సున్నీల మంటారు. అయితే వారికి ఈ షియామత మంటేనూ తెలియదు. సున్నీమతమంటేనూ తెలియదు వారికి స్వభాష అయిన కచ్చిభాషలో గాని, వ్యాపారం కోసం నేర్చుకునే గుజరాతీ భాషలోగాని, ఖొరాను తర్జుమాలేదు. ఈ ఖోజాలుండే గుజరాతు దేశాన్ని చాలాకాలం తురకరాజులు పరిపాలించినా ఖొరాను దేశభాషలోకి పరివర్తనం కాకపోవడం ఆశ్చర్యమే. ఈ ఖోజాలలో అరబ్బీ పారశీభాషలు వచ్చినవారెవ్వరూ లేరు. మహమ్మదీయ మతాన్ని గురించి చెప్పగల విద్యాంసులున్నూ లేరు. వారికి తెలిసిన మతగ్రంధం ఒకటి, అది కచ్చిభాషలో సింధీలిపిలోవ్రాయబడిన "దశావతార" మనే పుస్తకం ఇదే వారి మతగ్రంధం.

ఖోజాలందరు దీనిని పూజిస్తారు. అవసానకాలంలో చదివి వినిపించుకుంటారు. హిందూదేశంలోనూ ఖోజాలు వ్యాపారం చేసుకొని జీవించే ఆఫ్రికాతీరమున జాంజిబారులోను మస్కటు మొదలైన ప్రాంతాలలోనూ బొంబయిలోనూ జమాత్ ఖానా అనే ఖోజా మతసభలోనూ ఈ దశావతారమనే గ్రంధాన్ని పురాణంలాగ చదివిస్తారని 1850 లోనే ఒక వాజ్యంలో స్థాపించబడింది.

ఈదశావతారం అనే గ్రంధంలో ఏముందో తెలుసునా?

దాని పేరునుబట్టి అందులోని విషయం స్ఫురిస్తూనేవుంది. అది పది ప్రకరణాల గ్రంధం. ప్రతి ప్రకరణంలోనూ ఒక అవతారాన్ని గురించి యుంటుంది. మొదటి తొమ్మిది ప్రకరణాలలోనూ హిందువుల త్రిమూర్తులలో ఒకడైన విష్ణు మూర్తియొక్క తొమ్మిది అవతారాలను గురించి వర్ణించబడింది. పదియవ ప్రకరణములో పరమపూజ్యుడైన ఆలీయొక్క అవతారాన్ని గురించి వ్రాయబడింది. ఖోజాజమాత్ ఖానాలలోఈగ్రంధాన్ని చదివేటప్పుడు ఖోజాలందరూ ఈ పదియవ ప్రకరణాన్ని అతి భక్తితో వింటారు. ఈ ప్రకరణం మొదలుపెట్టగానే సభవారంతా లేచి అది పూర్తిఅయ్యేవరకూ అలాగ నుంచుంటారు. పరమపూజ్యుడైన మౌలాఅలీ నామం ఉచ్చరించినప్పుడల్లా అతి భక్తితో ప్రణమిల్లుతూ వుంటారు.

ఇలాగ మౌలా ఆలీ దశావతారాలలో ఒక అవతారమైనాడు !

5. జగద్గురు తత్త్వబోధక స్వామి

[రాబర్టో డీ నోబిలీ అనే క్రైస్తవ ఫాదరీ చరిత్ర]

దక్షిణ దేశాన్నంతా ఏకచ్చత్రంగా పరిపాలించిన విద్యానగర చక్రవర్తులలో గడపటివారగు 1885 - 1914 మధ్య రాజ్యంచేసిన వెంగటపతి దేవరాయ మహారాజులు ఆయన కొన్నాళ్ళు పెనుగొండను, తరువాతి చంద్రగిరిని రాజధానిగా చేసుకుని దేశపరిపాలన చేశాడు. ఆయన రాజ్యం కృష్ణానదికి దక్షిణాన కన్యాకుమారివరకు వ్యాపించి యుండేది. శ్రీరంగపట్నంలో ఆయన తమ్ముడి కొమారుడే రాజప్రతినిధిగా వుండి మైసూరు కర్నాటక రాజ్యాలను పరిపాలించేవాడు. 1612 లో రాజఓడయరు మైసూరుకుపరిపాలకుడైనాడు. బేదనూరు, లేక ఇక్కేరీలో ఒక సామంత మండలేశ్వరు డుండేవాడు. ఇలాగే దక్షిణదేశంలో తుండీరానికి జింజిలోను, పాండ్యానికి మధురలోను, చోళదేశానికి తంజావూరులోను, సామంత మండలేశ్వరులు ఉండి పరిపాలించేవారు.

విజయనగర సామ్రాజ్యము నేలిన చక్రవర్తులు తెలుగువారే అయినందువల్లను, వారి కాలంలో వివిధ ప్రాంతాలను పరిపాలించిన రాజ ప్రతినిధులు, సామంత మండలేశ్వరులు రాజబంధువులుగానో, తెలుగునాయకులుగానో ఉంటూవున్నందువల్లను దేశప్రభుత్వమంతా

  1. (1) Cases Illustrative of Oriental Life decided in the Supretne Court of Bombay. (1853) Sir Erskine l'erry pp. 110-129 (2) The Advocate general and others vs. Muhammed Hussain Husseni (Aga Khan) and others. 12 Bombay High Coult Reports pp. 294 and 323.