ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పరీక్షలు

సంపద, దైవభక్తియు నే నెపు డైన ననుభవింతునా ? ఈయనవలె నీశ్వరసంసేవనార్థమై ప్రచారము సలుపుటకు నోఁచుకొందునా యని నన్ను నే సంప్రశ్నించుకొంటిని.

27. పరీక్షలు

23 వ తేదీని వెంకటరావు వ్యాధిగ్రస్తుఁ డయ్యె నని విని యాతనిఁ జూచుటకుఁ బోయితిని. ఆతఁ డిపుడు పడకనుండి లేవనే లేఁడు ? తీవ్ర ధాతుదౌర్బల్యమునఁ బడిపోయియుండెను. ఒక గొప్ప మహమ్మదీయవైద్యుఁడు మం దిచ్చుచుండెను. వ్యాధి నెమ్మదిపడు ననెడి యాశ లేకున్నను శక్తివంచన లేక తాను మం దిచ్చెద ననియు, రోగి దైవముమీఁదనే భారము వేయవలె ననియు, వైద్యుని యభిప్రాయ మని, నామిత్రుఁడు హీనస్వరమునఁ బలికెను. దైవమును నమ్ముకొనినయెడల, అతనికి రోగనివారణ మగు నని దైర్యము చెప్పితిని. కాని, తా నిపుడు సేవించు మందువలెనే నా మాటలును, నెగటు కాఁగా, వెంకటరావు : - "మిత్రుఁడా, న న్నీ సంగతిలో బాధింపకండి. దేవుఁడు గీవుఁడు అనెడి అసత్యానగత్య విషయములన్ని బైటనే పెట్టి, మరీ గదిలోకి రం డని వేడుకుంటున్నాను. నిజమైన యే యిహలోకవిషయమును గురించి యైన నాతో మాటాడ రాదా ? దైవమునుగురించి అప్రస్తుతప్రశంస చేసి, నా మనశ్శాంతికి భంగము కలిగింప వద్దని, నీకు, నీ దైవమునకు నమస్కారాలు చేస్తాను !" అని చెప్పివేసెను.

ఇంతకంటె విషాదకర మైనసంగతి యేది ? ఐనను, మన మేమియుఁ జేయలేని యిట్టివిషయములోనుపేక్షయే యుత్తమముగదా. వెంకటరావువంటివారల యజ్ఞాన నాస్తికత లెట్లు పాయునా యని నేను విచారించితిని.

ఆ రోజులలో నే నొకప్పుడు షికారు పోవుచుండఁగా, పెద్దాడ సాంబశివరావు నాకుఁ గానఁబడి, మీ పను లెట్లు సాగుచున్నవని యడిగెను. అంత మే మిరువురమును పోఁతగట్టుమీఁదికిఁ బోయి కూర్చుండి మాటాడుకొంటిమి. అదివఱ కతఁడు సంఘసంస్కరణ సమాజసభ్యుఁ డైనను, విగ్రహారాధన, జన్మాంతరము మొదలగువాని యందు విశ్వాసము గలిగియుండువాఁడు. పండిత శివనాథశాస్త్రి యిక్కడకు వచ్చి యుపన్యాసము లిచ్చుతరుణమునఁ దన సందియము లన్నియు నివారణ మయ్యె ననియును, తన కిపుడు ప్రార్థన సమాజసిద్ధాంతములందు నమ్మిక గలుగుచున్న దనియు నాతఁడు చెప్పెను. నా మాటలందు గౌరవము చూపిన యాతని మనస్సునకు నచ్చునట్టుగ నే నిట్లు పలికితిని : - "అన్ని సంస్కరణములకును ప్రార్థనయే మూలకందము. భగవంతుని నిష్కల్మష హృదయమున ప్రార్థించి, ఆయన యొసఁగిన జ్ఞానజ్యోతిసాహాయ్యమున మన విధుల నెఱవేర్పవలెను."

పిమ్మట నేను గంగరాజు గదిలోఁ బ్రవేశించితిని. శివనాథశాస్త్రి వీరేశలింగముగార్లను గుఱించి మేము చెప్పుకొంటిమి. ఈమధ్యనే వీరేశలింగముపంతులు శాస్త్రిగారితో మాటాడుచు, తన కేమి తటస్థించినను లెక్క సేయ నని పలికెనట ! పంతులచిత్తస్థైర్యమును నేను గొనియాడితిని. ఈఘను లిరువురు నిశ్చలభక్తిపరులు. కావుననే జనుఁ భూషణదూషణములను పాటింపక, తమ యుద్యమనిర్వహణమును వారు కొనసాగింపఁగలిగి రని నే జెప్పి, "మిత్రమా, మన జీవితావధి సమీపించుచున్నది. ఇంతవఱకు మన మేకార్యమును జేయలేదు. ముందును విద్యయందే మన మనస్సులు లగ్న మైయున్నచో, జీవితారంభదశనే మన మీలోకమును వీడవలసియుండు నేమో!" యని నే నంటిని.

30 వ తేది సాయంకాలమున నేను షికారుపోవుచు, చీఁకటి పడుచుండుటచే మార్కండేయాలయము చొచ్చి యొకవేదికపైఁ గూర్చుండి, యందలి సందడిని గనిపట్టుచుంటిని. కోమట్లు కర్షకులు ననేకులు గుడిలోనికి వచ్చి గంట కొట్టి దేవునికిఁ బ్రణమిల్లుచుండిరి. విద్యార్థులును నచటఁ గలరు. వారిపూజలు నేను నిరసింపక, యేమియు లేనిదానికంటె నీమాత్రము భక్తి మంచిదిగదా యని తలపోసితిని. దేవాలయప్రవేశము, విభూతిధారణము, జేగంటకొట్టి నందికి నమస్కరించుట, కనులు మూసి యొకింతసేపు దేవుని స్మరించుట, పూజారిచే శఠగోపము పెట్టించుకొని వానిచేతఁ గొంతరాలిపి బిల్వపత్రము లందుకొనుట, - ఇదియే యచట జరిగెడి కార్యప్రణాళిక !

హృదయాంతర్యామి యగు పరమాత్ముని మదిలో దర్శించి, విశుద్ధప్రవర్తన మూని యుండుట పరమార్థ మని ప్రజ లెపుడు గ్రహింతురా యని నేను బరితపించితిని.

2 వ నవంబరు : - ఈదిన మంతయు దేహమున ససిగాలేదు. పరీక్షలోని యేవిషయమును నేను బాగుగఁ జదువకుండుటచే, అందు జయ మందుదు నను ఆశ యంతరించిపోయినది. ఎక్కువగఁ జదివి యారోగ్యము చెడఁగొట్టుకొనుటకు నేనిపుడు సమకట్టలేదు. పిలిచినచో నాదేహమునుండి రోగము పలుకుచున్నటు లుండెను ! పెందలకడనే పుస్తకము మూసివైచి, వ్యాయామమున కేగితిని. కాని, దారిలో చెలి కాండ్రు కానఁబడినందున, షికారు మాని సంభాషణమునఁ బాల్గొంటిని.

రాత్రి, సంభాషణసందర్భమున కొండయ్యశాస్త్రి, వీరేశలింగముగారి పాండిత్యప్రకర్షమును నిరసించెను. ఓపికతో నే నూఁకొట్టుచుంటిని. అంతకంత కాతనిప్రల్లదము పెచ్చు పెరిఁగి, "ఇతనికంటె దుర్నీతిపరు లెవరు?" అని శాస్త్రి వదరెను ! నే నిఁక పట్టలేక, "ఈ మహాసంస్కర్తను గూర్చి నీ విట్లు కాఱులు ప్రేలి, నీ యవివేకము నవినీతియు వెల్లడించుకొనుచున్నావు ! నోటికిఁ గొంత బుద్ధి చెప్పుము !" అని వానిని వారించితిని. అంత శాస్త్రి, "వీరేశలింగము చేసిన భ్రష్టులేకఁదా యీ విద్యార్థిలోకము ! ఎంతమందిబాలు రీతిని యుసురు పోసికొని యధమగతిపా లైరి ! ఇం తేల ? సంస్కరణములను పేరుతో నీవు నమ్మెడి వంకరటింకర సూత్రములకు ఈదుష్టగ్రహమే కారకుఁడుగదా !" అని రోషావేశమునఁ బలికి, యీసంస్కర్తప్రహసనాదులందు తమ ప్రవర్తనమును వెల్లడించి వెక్కిరించుటచేత జీవితములను గోలుపోయిన కొందఱు సజ్జనులను గుఱించి శాస్త్రి పెద్ద సోదె చెప్పుకొనివచ్చెను !

నాకు తీవ్రమైన యాగ్రహము జనించినను, శాంతించి, నే నిట్లు తలపోసితిని : - "దైవమా ! పంతులవంటి గొప్పవారిని పామరజనులే కాక, శాస్త్రివంటి విద్యాధికులుగూడ నెట్లు దురభిప్రాయులై దూషించుచున్నారు ! ఇంక వారి కేది శరణ్యము !"

శాస్త్రితలంపులు వికృతములు విపరీతములును ! అంతరంగ మెంత కలుషిత మైనను, మందహాససుందరవదనమున భాసిల్లి, సంస్కృతభాషాపాండిత్యము, పూర్వాచార పరాయణత్వమును సమృద్ధిగగలవారే శాస్త్రిమెప్పు వడయువారలు !

ఈ యన్నిటియందును శాస్త్రికి నాకును చుక్కయెదురే ! కాని, ఈ దుసమయమున, మా సామరస్యమును భంగపఱిచెడి చర్య లెవ్వియు నే నవలంబింపరాదు. నే నిట్లు తలపోసితిని : - "ఇంట నే నిపుడు తటస్థముగ నుండి, యెట్టిచర్యలలోను పాల్గొనక, కాలమును శక్తియుక్తులను నిక్షేపించుకొనుచున్నాను. శాస్త్రివంటి మనస్తత్వము గలవారితోఁగూడ వాగ్వాదములు పెట్టుకొన నిది యదను గాదు. దైవానుగ్రహ మున్నచో, పిమ్మట నిట్టివారలకుఁ దగు సమాధానము చెప్పితీరెదను. ఇదిగాక, సగము మతి చెడి దివ్యజ్ఞానవిశ్వాసకు లైన కాంతయ్య లక్ష్మీనారాయణగార్ల కీతఁడు కూరిమి నెయ్యుఁడే కదా."

తన సమాచార మిట్టి దయ్యును, శాస్త్రి యూరకుండువాఁడు కాఁడు. అపుడపు డతఁడు సంస్కారప్రియత్వమును సూచించుమాటలు మాటాడి, తాను విశాలమనస్కునివలెఁ బ్రసంగింప వెనుదీయఁడు. కాని, యొక్కొకతఱి నీతఁడు, అగ్ని పర్వతమువలె సంస్కర్తలమీఁద నిప్పులు గ్రక్కుచుండును !

డిశంబరు 5, 6, తేదీలందు, అధికముగఁ జదువుటవలన నేను శ్రమఁ జెందితిని. పెందలకడనే పుస్తకములు మూలఁ ద్రోచి ధవళేశ్వరమువైపునకు గోదావరియొడ్డున నేను షికారుపోయితిని. పచ్చనిచెట్లు, పండఁబాఱిన సస్యములును జూచి నా కనులు సేద దేఱెను. కొమ్మలమీఁది పక్షులరుతములు, సేద్యగాండ్ర కూనరాగములు, నా వీనులకు శ్రావ్యసంగీతనాదము లయ్యెను. వ్యవసాయకులు కేక లిడుచున్నను, జొన్నకంకులమీఁదఁ జివాలున వాలి, చంచువులతో గింజ లందుకొని చతురతతోఁ బరుగులిడు పక్షుల నవలోకించుచు, నే సాగిపోయితిని. ఆహా! శీతకాలవాయువు లెంత సుఖదాయకములు ! తన్నుఁ బరిశీలించెడివారి శ్రమకు ప్రకృతికాంత యెంతయుదారహృదయమునఁ బారితోషిక మొసంగుచున్నది !

15 వ తేదీనుండి మద్రాసు సర్వకళాశాలాపరీక్షలు ప్రారంభ మయ్యెను. ఎంత ప్రయత్నించినను కొన్ని రాత్రులు నాకంటికిఁ గూర్కు రాకుండుటవలన, పరీక్షాదినములలో నా దేహము మిగుల నిస్సత్తువఁ జెందియుండెను. నే నెటులో ప్రశ్నపత్రములకు సమాధానములు వ్రాసితిని. నే ననుకొనినంత బాగుగఁ గాకున్నను పరీక్షలో జయ మందుటకుఁ జాలినట్టుగ వ్రాసితి నని తలంచితిని. గణితమునందు నాకు గండము తప్పవలెను ! ఎటులో జయింపవచ్చు నని యాశించి యూరడిల్లితిని.

19 వ తేదీతో మాపరీక్షలు పూర్తియయ్యెను. మఱునాఁడె నాకు జ్వరము సోఁకెను. శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ జూడవచ్చి, మంచిమందు పుచ్చుకొమ్మని చెప్పిరి కాని, గోల్డుస్మిత్తువలె నేను సొంతవైద్యము చేసికొనఁగోరితిని ! ఈ జ్వరము నాలుగైదు రోజులలో నెమ్మదించినను, నాకనుల కిపు డొక క్రొత్తరోగము ప్రాప్తించినటు లుండెను. కన్నులయెదుట ముత్యాలసరమువంటి చిన్న చుక్కలబారు కనపడ నారంభించెను ! కంటివైద్యము చేయించుకొన నే నపుడు వేగిరపడితిని.