ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కాసె సర్వప్ప

8. కాసె సర్వప్ప

ఇతడు సిద్ధేశ్వరచరిత్ర మనునామాంతరముగల ప్రతాపచరిత్రమును ద్విపదకావ్యముగా రచించెను. ఈకవికాల మెప్పుడో నిశ్చయముగా దెలియదుగాని యితని గ్రంథము మిక్కిలి పురాతన మైనదనుటకు సందేహములేదు. ఇతడు ప్రతాపరుద్రుని యనంతరమున గొంతకాల మయిన తరువాత నుండినవాడు. ఈతని కవిత్వమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగము లనేకములు గానబడుచున్నను, చరిత్రముగా నీగ్రంథము మిక్కిలి యుపయుక్త మయినది. ఈతని గ్రంథము నుండియే కూచిమంచి జగ్గకవి తనసోమదేవరాజీయము నందు విశేష భాగముగ్రహించి యున్నాడు. తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంథమునుండి కొంతభాగ ముదాహరింపబడినందున, ఇందుండి యిప్పుడు గొన్నిపంక్తులు మాత్రమే గ్రహింపబడును.

ద్వి. గణపప్రసాదత గలిగినసుతుని
గణపతినామంబు ఘనముగా బెట్టి
తూర్పుదేశం బేగి తూర్పురాజులను
నేర్పుతో సాధించి యోర్పుమీరంగ
బాండుదేశాధీశు బాహుబలాడ్యు
గాండంబులనుగొని గం డడగించి
చండవిక్రమకళాసారదుర్వార
పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు

  • * * *


ఇది శ్రీసకలవిద్వదిభపాదకమల
సదమలసేవన సభ్యసంస్మరణ
భాసురసాధుభావనగుణానూన
భూసురాశీర్వాద పూజనీయుండు
కాసె మల్లనమంత్రి ఘనకుమారుండు
వాసిగా జెప్పె సర్వప్పనునతడు.