హిమబిందు/ప్రథమ భాగం/5. శ్రీకృష్ణశాలివాహనుడు

5. శ్రీకృష్ణశాలివాహనుడు

శ్రీముఖ సాతవాహన మహారాజు అభయభాహు సాతవాహన చక్రవర్తికి ప్రథమ తనయుడు. బౌద్ధశకము 426వ సంవత్సరమున ధాన్యకటకాన కౌశికీదేవి గర్భశుక్తి ముక్తాఫలమై శుభలగ్నమునందు జన్మించినాడు. శ్రీముఖుడు బౌద్ధశకము 453వ వర్షమున ఆంధ్రసింహాసన మధివసించి మహాప్రజ్ఞతో రాజపాలన మారంభించినాడు.

సార్వభౌముడు బంగారు ఛాయవాడు. సంపూర్ణముగ ధనువు పొడువు గలవాడు. కోలనగు మోము, చక్కని కోరమీసములు, దీర్ఘసమ నాసిక, విశాలములై, అరమూతలై నిమ్నములుకాని కళ్ళు, సమఫాలము, పెద్దనోరు శ్రీముఖుని ముఖము సర్వసార్వభౌమ జయశ్రీ విలసితము. కండలు కట్టిన దేహము, కొంచెము చిరుబొజ్జ ఆ విగ్రహానికి ఒకనిండు తెచ్చినవి.

శ్రీముఖుడు మరి మూడేండ్లకు పట్టాభిషిక్తుడగుననగా పెద్దకుమారుడు శ్రీకృష్ణుడు జన్మించినాడు. శ్రీకృష్ణసాతవాహన యువమహారాజు వెనుక, చక్రవర్తికి ఇరువురు రాకుమారికలు, ఒకరివెనుక ఒకరు నాలుగేండ్లు భేదముగా జననమొందినారు. ఆ వెనుక ఇద్దరు కుమారులు పుట్టిపురిటిలనే సందుగొట్టి చనిపోయినారు. తర్వాత రెండేండ్లకు శ్రీకృష్ణునికి పదునారు సంవత్సరముల ఈడున అతనికి తమ్ముడు మంజుశ్రీ రాకొమరుడు జన్మించినాడు. పదునారవ సంవత్సరమున శ్రీకృష్ణుడు యౌవ రాజ్యాభిషిక్తుడై ప్రతిష్టాన నగరపాలన భారము వహించెను. ప్రతిష్టాన నగర పాలకత్వము నందిన యువరాజులు మహారాజను బిరుదము వహింతురు.

శ్రీకృష్ణసాతవాహనమహారాజు ఇప్పు డిరువదిరెండు వర్షముల ప్రాయమున సింహకిశోరమువలె విస్ఫారితవక్షుడైమధ్యమోన్నత శరీరుడైయౌవన పరిమళార్ధ్ర వయస్కుడై, మహావీరుడై, శతృహృదయ విదారకుడై, ప్రతిష్టాననగరాన రాజ్యపాలన మొనర్చుచున్నాడు.

సార్వభౌముని జన్మదినోత్సవములకు మహారాజు శ్రీకృష్ణసాతవాహనుడు ప్రతిష్టానమునుండి ధాన్యకటకమునకు సేనాపరివృతుడై సర్వవైభవోపేతుడై విచ్చేసినాడు. యువరాజు ధాన్యకటక నగరానికి మూడు గోరుతము లెగువను కృష్ణాతీరముననున్న విజయస్థలిత యనుకోటలో విడిదిచేసెను. వచ్చిన మరునాడు శుభముహూర్తమున శ్రీకృష్ణుడు సపరివారుడై, మాతాపితలకు పాదాభివందన మాచరింప సార్వభౌముని మహాభవనమునకు వెడల సన్నద్ధుడగుచున్నాడు. అలంకరణ మందిరమునుండి మంజులశ్రీ మూర్తియై, కిరీటకేయూరాది సకల భూషణాలంకృతుడై, మందహాస వదనుడై బయలుదేరెను. మౌక్తికాలంకృత దుకూలాంబరావృత ధవళచ్ఛత్రముతాల్చి చ్ఛత్రవాహనుడు వెనుక నడువ, చామరగ్రాహిణులగు సుందరులు కరకంకణక్వణన మనోహరముగ నిరుదెసల వీచోపులిడుచుండ, పార్శ్వవర్తిని యగు మనోహరాంగి భుజమున ఎడమచేయినిడి, దక్షిణ హస్తమున లీలానీలకుముదము ధరించి, వేణు, కాహలాది వాద్యముల మధురగీతములు సెలగుచుండ సాయుధులగు నంతఃపుర రక్షకవనితలు పరివేష్టించి నడువ, శ్రీకృష్ణ సాతవాహనమహారాజు బయలుదేరి గుమ్మము దాటుటకు కుడిపాదముంచినతోడనే ఒక శ్వేతోరగము బుస్సుమనుచు, ఎట్టఎదుట ఆడుచు ప్రత్యక్షమైనది. భయావృతమనస్కులై ఎచటి వారచట ఆగిపోయారు. పార్శ్వవర్తిని కెవ్వున అరచి రెండుచేతుల కళ్ళుమూసికొనినది. శ్రీకృష్ణకుమారు డాశ్చర్యమున, ఒక్కతృటికాల మట్లే యుండిపోయినాడు.

ఇంతలో నీలాంబుదావృత విశాలాకాశము వెలిగించి, మాయమగు విద్యున్మాలవలె నా శ్వేతపన్నగి వారందరు చూచుచుండగనే మాయమైపోయినది.

అద్భుతాశ్చర్యహృదయులై, వారందరు శ్వేతఫణి తమతమ పాదాలను చుట్టినదేమో అని చేష్టలుదక్కి ఆ సుందర మందిర పురోభాగమున మలచిన ప్రతిమలవలె క్షణకాలము గన్పట్టిరి.

రక్షకభటులు, దౌవారికులు, పారిపార్శ్వకులు, ముఖపతులు, మంత్రు లొక్కసారి సాయుధహస్తులై యా మందిరమంతయు వెదకనారంభించిరి.

శ్రీకృష్ణమహారాజు ఆ శ్వేతపన్నగినే తలంచుకొనుచు, చిరునవ్వు వెలుగులు మరల మోమున నలమికొన, పార్శ్వవర్తినితో “మన ప్రయాణము సాగనిమ్ము” అని యాజ్ఞనిడెను.

అయిదు లిప్తలలో మరల పరివార జనము, మంత్రులు, సేనాధిపతులు యథాస్థానములకుజేరి మహారాజు కనుసన్నల ముందుకు సాగిరి.

మహారా జిట్టు దుర్గప్రవేశమొనర్చి అంతఃపురముచెంత దన పరిజనమును నిలిపి, లోనికరిగి, దర్శనసభలో సింహాసనాసీనులైయున్న తల్లిదండ్రుల పాదములకు సాష్టాంగ ప్రణామ మాచరించినాడు.

బుద్ధభిక్షులు, విప్రులు ఆశీర్వచనములు పలుక, సార్వభౌముడు, సామ్రాజ్ఞియు సింహాసనములనుండి లేచి, నయనముల ఆనందబిందువులు నృత్యమాడ, వంగి కుమారుని చేరియొక చేయిపట్టి లేవనెత్తుచు, “చిరంజీవివి, సత్వర వివాహితుడవు, సిద్ధసకలాభీష్టుడవు కమ్ము తండ్రీ” అని ఆశీర్వదించిరి.

జననీ జనకుల నోటినుండి ఆశీర్వాదము వెలువడుచున్నప్పుడు శ్రీకృష్ణకుమారుని హృదయమున తెల్లని పామొకటి ఆడుచు కనిపించినది.

సార్వభౌముని అనుమతిగొని యువరాజు తల్లితో అభ్యంతరమందిరమునకు బోయినాడు.

మహారాణి: కుమారా! ప్రయాణము కుశలముగ జరిగినదా?

శ్రీకృష్ణుడు: దేవమూర్తులైన తమ ఆశీర్వాదబలము నాకు వజ్రకవచముగదా తల్లీ!

మహారాణి: మా కడుపును పవిత్రము చేయుటకు పుట్టినమూర్తివని నేను వేయిదేవులకు సర్వదా నమస్కరించుకొందును తండ్రీ!

శ్రీకృష్ణుడు: మా తమ్ములు బంగారు తొనల బొమ్మ, మంజుశ్రీ మూర్తి జాడలు తెలియలేదుకదా?

మహారాణి: నాయనా నా కడుపులో ఆ బాధ ఎప్పుడును కుములుచునేయుండును. ఏ దుర్మార్గునకు చేతులు వచ్చినవో!

శ్రీకృష్ణుడు: ధనమునకాశించి ఇట్టిపని జరిగి ఉండదు. అమ్మా! మీరు పరిపూర్ణ ధైర్యమువహించి ఇంకను కొన్నినెలలుమాత్ర మోపికపట్టుడు.

మహారాణి: నాయనా! నేను పైకి ధైర్యమువహించినా, అసలు నా హృదయములోని బాధ ఏలాగు తీసివేసుకోగలనయ్యా! నీవు తమ్ముని వెదకి ఆరునెలలలో అమ్మగారి ఒడిలో కూర్చుండపెట్టుదునని ప్రతిజ్ఞపట్టితివని వింటిని. తండ్రీ! నా చిన్ని బాబును ఒడిలో కూర్చుండ బెట్టుకోగల భాగ్యము మాకు వచ్చునా! అందుకు మీరందరు ఏమరుపాటులేక ప్రయత్నములు చేయుచునే యున్నారు, అయిన నా అదృష్టమెట్లుండునో!

శ్రీకృష్ణుడు: అమ్మా! మీరు కంట తడి పెట్టకుడు. తమ్ములు బ్రతికి క్షేమముగ నున్నారని తెలిసికొన్నాను. ఆ సాక్ష్యము అనుమాన రహితమైనది, శుకబాణులవారే తెచ్చినారు.

మహారాణి: అవును తండ్రీ, మహారాజుగారు ఆ విషయమును చెప్పినారు. అందుకే ఈ మాత్రము ధైర్యముగ నున్నాను. నేనును, మహారాజుగారును త్రయంబకమునకు...

శ్రీకృష్ణుడు: అవును జననీ! తామును చక్రవర్తియు ఎప్పుడు త్రయింబక గౌతమీ జన్మస్థలమునకు రాగలరు?

మహారాణి: సార్వభౌముడు ఒకసారి పశ్చిమదేశాలకు రావలెనని యనుకొన్నారు. త్వరలోవారు ఏదియేని నిర్ణయమునకు వచ్చెదరనుకొందును.

శ్రీకృష్ణుడు: అమ్మా! తమ పాద సేవ చేయుటకు వచ్చుచుండ, నాకీదినమున ఒక తెల్లని తాచుపాము శకునమైనది. దానికి ఫలమేమో యని ఆలోచించుచున్నాను.

మహారాణి: ఏమిటి తండ్రీ! పామా! బుద్ధభగవానుని రక్ష, నీకు పరమేశ్వరామృత రక్ష! చిరంజీవ! చిరంజీవ! ఎచ్చట ఈ పాము కనబడినది? రాచబాటనా!

శ్రీకృష్ణుడు: లేదు తల్లీ! మహాభవనానికి పయనమై అలంకార మందిరము దాటివచ్చిననాకు మందిరాంగణమునం దది ఆడుచు ప్రత్యక్షమైనది.

మహారాణి కొమరుని శిరము పొదవిపట్టుకొని తనమోమున కాన్చి కొని మరల వదలినది.

శ్రీకృష్ణ సాతవాహనుడు ఇంచుక నవ్వుచు తల్లిమోమున చూడ్కివఱపి

“జననీ! తాము మహాంఘారామానికై కట్టించు విహారము పూర్తియయినదను కొందును. గురువులగు అమృతపాదార్హతులకు దాని నర్పించు శుభ ముహూర్తమెపుడు?” అని ప్రశ్నించెను.

“బాబూ! మీ తండ్రి గారును, నేనును సౌందర్యనిధియగు కోడలిని వరియించినాము. బాలిక చిత్రమును జూచి నీ యభిప్రాయము చెప్పవలయును. నీ వివాహమును, విహారార్పణము ఒకమారే” అని కుమారుని వైపునకు తిరిగి యా సామ్రాజ్ఞి చిరునవ్వు తెచ్చుకొనుచు పలికినది.

శ్రీకృష్ణసాతవాహనుడు నవ్వుచు “శ్వేతపన్నగ సందర్శన ఫలితమా తల్లి!” అనుచు వంగి తల్లిపాదముల నంటెను.

సార్వభౌముని దేవేరి, పుత్రుని నవ్వుచూచి, ఏదియో అవగతము చేసికొన ప్రయత్నించుచు, చిరునవ్వుతో తీవ్రాలోచనసలిపి, సుతునిశిరముపై చేయినుంచినది.

శ్రీకృష్ణసాతవాహనునకు తన తమ్ముని, మంజుశ్రీని, చోరులు తస్కరించుకొని పోవుటలోని ఉద్దేశ్య మెంత ప్రయత్నించినను అర్థముకాలేదు.

చక్రవర్తి అంతఃపురములోనికి చొచ్చుకొనిపోయి, మాయావేషములతో మహాధైర్యముతో వేయిమంది రక్షకభటుల, రక్షకస్త్రీల, కంచుకుల, ద్వారపాలుర దాసీజనముల మధ్యనుండి రాజకుమారుని ఎత్తుకొనిపోగల దిట్టరి ఎవడు?

ఇది ఒకరిపని కాదు. అత్యంత సమర్థుడైన పురుషుడు కొన్ని వేలమంది సహాయంతో, అంతఃపురములోని దాసదాసీజన సహాయముతో, కొందరు రక్షకభటుల సహాయముతో జరిపియుండుననికదా శుకబాణుల వారు అభిప్రాయ మందినారు. వారితో మహారాజును, మహామాత్యులు, సర్వ సైన్యాధక్షులు ఏకీభవించినారు.

రాజ్యమునకై ప్రయత్నమా? కసితీర్చుకొను ప్రతీకారమా? ముక్కుపచ్చలారని బిడ్డను కొనిపోవ వారి హృదయ మెట్లొప్పినది? శుకబాణుల చారులు దేశమునంతయు దువ్వెనతో దువ్వినారు. ప్రభువు అనుమానమును శుకబాణుల అనుమానమును, స్థౌలతిష్యమహర్షి మీదనే ఉన్నది. కాని ఎన్నివిధములైన మాయలు పన్నినను, అనుమానాత్మకమగు ఒక చిహ్నమైన స్థౌలతిష్యమహర్షి యాశ్రమమునందు గోచరింపలేదట. వారి ఆశ్రమములో వైద్యశాలలున్నవి. సర్పవైద్యమునకై అష్టఓషధుల తోటలున్నవట. మంత్రములకు కట్టుబడి పెద్దపులులు, సింహములు, చిరుతలు మొదలగు క్రూరమృగములెన్నేని యాతని మృగశాలయందున్నవట.

విద్యార్థులై దేశదేశములనుండి ఎందరో పండితులు, ఋషులు, కాపాలికలు, యోగులు వచ్చుచుందురు. వైద్యమునకు ముక్తికి మంత్రోప దేశములకు లక్షలమంది ఆ పవిత్రాశ్రమమునకు వచ్చుచుందురు. ఆ మహర్షి రాజకుటుంబమన్న ప్రేముడికలవాడు. తన తాతగారి సహాధ్యాయుడు సర్వతంత్ర స్వతంత్రుడు.

వారణాసిలో, తక్షశిలలో, విష్ణుప్రయాగలో, హృషీకేశములో, నవద్వీపమునందు, ధాన్యకటకమునందు, నర్మదాతీరమున, కావేరీతీరమున ఇట్టి మహాపండితుని, ప్రజ్ఞావంతుని ఎచ్చటను చూడలేము? అయినను స్థౌలతిష్యునిమాట తలచుకొన్నచో ఏదియో తనకు భయము కలుగును. శుకబాణులవారు కొందరిని అనుమానించి తనతమ్ముని మంజుశ్రీరాజకుమారుని తస్కరించుకుపోయినవారు వారేనని నిర్ధారణ చేసినారు. అయినను మూల కారణుడు స్థౌలతిష్యులవారేననియు శుకబాణుల యనుమానము. శ్రీకృష్ణుడట్లు కక్ష్యాంతరముల గడచి, చక్రవర్తియున్న సాహిత్యమందిరము చేరెను.

శ్రీముఖుడు చిరునవ్వుతో, “బాబూ, మీకు ధాన్యకటక నగరాతిథ్యము ప్రీతికరముగ నున్నదా?” యని ప్రశ్నించెను.

“మహాప్రభూ! నా విడిది యధానందదాయకమైయే యున్నది. అయిన నొక్కచిన్న సంఘటన జరిగినది. ఎచ్చటనుండియో ఒక తెల్లనిత్రాచు నేను తమ దర్శనార్థము వచ్చుచుండ నెదుటబడి, ఆడి, మరుక్షణమున మాయమైనది” అని శ్రీకృష్ణుడు జనకునకు విన్నవించెను.

ఇంతలో మాంత్రికుడగు నొకభిక్షుకు డచ్చటికివచ్చి “మహాప్రభూ! మహారాణీగారు యువరాజులుంవారికి పాము కనబడినదనియు, తత్సంబంధ మంత్రోచ్ఛాటనాదులచే యువరాజులకు ఆపద ఘటిల్లకుండ చూడవలె ననియు మహాసంఘారామమునకు గురుపాదులకు వార్తనంపిరి. వెంటనేవారు నన్నిక్కడకు పంపిరి” యని విన్నవించెను.

మహారాజు ప్రశ్నార్థకముగ నా బిక్షుకునివంక చూచుచు “దయచేయు” డని యొకపీఠము చూపించెను. ఆతడు పీఠ మథివసించుటయు,

“అది పాలవలె, వెన్నెలవలె తెల్లటిపాము” అని యువరాజనియెను.

“మహాప్రభూ! శ్వేతపన్నగములు మనుష్యుల కండ్లపడవు. పడినచో నా పురుషునకు గాని, వనితకుగానీ ఏదియో ఉత్తమశుభము చేకూరగలదని సర్పశాస్త్రము శకునశాస్త్రము చెప్పుచున్నవి. శ్వేతపన్నగ సందర్శనమునకు మంత్రతంత్రములేమియు నవసరములేదు. యువరాజులకు త్వరలో శుభము కల్యాణమగునని మా శాస్త్రము చెప్పుచున్నది” అని యా భిక్షుకుడు తేల్పినాడు.

“స్వామీ! మీ మాటలు మాకు ధైర్యమొసగుచున్నవి. యువరాజుల వారును, మేమును మహారాణియు గురుపాదులకు, తమకు ఎంతేని కృతజ్ఞులము” అని సార్వభౌముడు పలికెను. ఆ భిక్షుకుడు “బుద్ధదేవుడు మిమ్మురక్షించుగాక, ధర్మము మిమ్మురక్షించుగాక, సంఘము మిమ్మురక్షించు గాక” యని ఆశీర్వదించుచు అటనుండి మహారాణి కడకు జనియెను.

భర్తయు, జ్యేష్టపుత్రుడును తనకన్నతండ్రి దొరికితీరునని ధైర్యము చెప్పుచున్నారు. అబ్బా! ఎంతటి చిన్నబాలకుని ఆ కఠినాత్ములు కొనిపోయినారు! ధనమునకై యాశించికాదు. రాజ్యసంక్షోభము కల్పించుటకుగాదు. అందాలబిడ్డను కన్నతల్లి చేతులనుండి ఊడబెరికి, ఆ తల్లిని దుఃఖ పెట్టుటకు మాత్రము ఆ కరుణహీనులు అట్లు చేసినారు.

ఆ అయిదేడుల బాలుడు ఎన్ని కడగండ్లు పడుచుండెనో. అతని బంగారు పనసతొనలు ఎండిపోయెనో? తల్లియైన ఆ మహారాణికి కన్నుల నీరు తిరిగినది.

ఇంతలో ఒయ్యారముగ నడచుచు మహారాజు కొమరికలగు మాయాదేవియు, శాంత శ్రీదేవియు, పరిచారికలు కొలువ తల్లికడకు విచ్చేసి తల్లిపాదములకడ మోకరించిరి. ఇరువురిని చెరియొక చేతితో లేవనెత్తి, మహారాణి తన హృదయమున కత్తుకొన్నది.

“మాయాకుమారీ! రేపుమీరు సలుపు నాట్యమేమి?” అని మహారాణి అడిగినది. వర్షమువెలిసి, మబ్బులు మాయమైనవెనుక వెన్నెలవలె, ఆమెమోమున చిరునవ్వులు ప్రసరించినవి.

“మాయాదేవి జనకుని పోలిక, శాంతశ్రీదేవి అచ్చముగ తల్లిపోలిక, వారిరువురు చక్కనిచుక్కలు. రాజశ్రీవారి కన్నులలో, చంపకపుష్పనాసికలలో మందారకుట్మ లార్ధ్రములుగు పెదవులలో వెలిగిపోవుచుండెను.

వారిరువురు తల్లికి చెరియొక ప్రక్క నధివసించిరి.

మాయాదేవి: అమ్మగారూ! అన్నయ్యగారు తమ అంతఃపురములోనికి వచ్చినారటకదూ!

శాంతశ్రీదేవి: అన్నయ్యగారు మా మందిరానికి ఎందుకు వచ్చినారు కారండీ?

మహారాజ్ఞి: అరుగో ఈ దారినే యువరాజు వచ్చుచున్నారు.

అప్పచెల్లెళ్ళిద్దరు లేచి ముందుకు త్వరితముగ బోయి అన్నగారి పాదములకు నమస్కరించిరి. శ్రీకృష్ణుడు వారిరువురకు మాయామాత రక్షచెప్పి, లేవదీసి, ఇద్దరినీ చెరియొక చేతితో నడుములుచుట్టి తనకదుముకొని, వారి తలలను తన చెంపలకాన్చి, వారి ఫాలములు ముద్దుకొని, మరియు వదలెను. ఆనందదేవియు లేచి వీరి మువ్వురికడకు వచ్చెను.

“మా అన్నయ్యగారు ఈదినము మా ఇంట నాతిథ్యముపొందరా?” అని మాయ అన్నది.

“రండి అన్నగారూ, నేను వీణమీద ఇరువదియైదు మూర్ఛనలు నేర్చుకొంటిని. అవి అన్నియు పాడి వినిపింతును” అని శాంతశ్రీ యన్నది.

“నాయనా! మీరు ఈ పూట వీరి మందిరానికే భోజనమునకు పొండు. ఈ రాత్రియు, రేపుదయమునను మహారాజు మందిరమున మీకు ఆతిథ్యము” అన్నది ఆనందదేవి.