హిమబిందు/ప్రథమ భాగం/10. విజయలక్ష్మీధవుడు

ఇంక విజయలక్ష్మీ ఆసీనయైయున్న తావు అర్ధగోరుతదూరము మాత్రమున్నది. తన్ను వెన్నంటివచ్చు పెనుభూతపు పిన్నవాని పిప్పిచేయవలేనని సమవర్తి తలపోసెను. అతని కన్నులయందు క్రోధము ఫాలాక్షుని మూడవచూపై, ఆ సుందర ముఖమును వికృత మొనర్చినది. అతని ముక్కుపుటములు కామందక కులపాలకుల ముక్కుపుటముల వలె విస్త్రతములైనవి. అతని పసరముల ముక్కులనుండి రక్తపంబొట్టులు తొలకరి సతుంపరులవలే చెదరిపోవుచుండెను.

చారుగుప్తుడు వంగిపోయి తనపీఠము గట్టిగా పట్టుకొని గృధ్రపుదృక్కుల పరుపుచు పందెకాండ్రవైపు చూచుచుండెను. ఆతడి పెదవులు వణకుచుండినవి. అస్పష్టమై ఏవియో మాటలు పైకి వెలువడుచున్నవి. మొదటినుండియు తన వృషభములు తప్పక నెగ్గితీరునని యాత డనుకొన్నాడు. ఆ సందడిలో నా కొత్తబాలుని బండిదూడల కనుగొన్నవారు లేనేలేరు. మొదటిసారి వెళ్ళివచ్చి, మరలివెళ్ళువరకు ఎవ్వరును ఆ యువకునివైపే కనుగొనలేదు. ఇప్పుడాతడు చారుగుప్తునకు ఎక్కడనుండియో అవతరించిన విఘ్నరాక్షసునివలె తోచినాడు. ఆ బాలుడు తనకును, తన కోర్కెలకును ఎడబాటుమంత్రమైనాడని చారుగుప్తుని గుండెయందు గుభిల్లని ఆలోచన కలిగినది. ఒక్కసారి లేచి సునాయాసముగ పరుగిడివచ్చు నా కొత్తబండిగిత్తల కూల్పవలెనని యాతనికి వెర్రియాలోచన పుట్టినది.

ప్రజలందరు చెప్పగారాని ఆలోచనాభావమున తన విజయనాదములు మానివేసినారు. ఒకసారి వాన వెలిసినట్లు, నిమ్మకు నీరువోసినట్లు హృదయభీకరమగు నిశ్శబ్దత నింగి నావరించినది. అందరును చారుగుప్తుని మందిరమువైపు చూచినారు. మరల పరుగిడు పందెకాండ్ల పరికించినారు.

ఇంక పావుగోరుతమున్నది. సమవర్తి “కా-మం-ద-క! కుల-పాలక!న-డు-డు!” అని వగర్చుచుండెను. వజ్రతుల్యమగు నా శూరుని శరీరము వణకినది. కామందక కులపాలకులు ప్రజలోకమునకు విస్మయము కలుగునట్లు ఆతని పలుకుల నాలకించగనే మహాజవమున అరపావుగోరుతము కనుమూతలో గడచిపోయినవి. కాని పాడునీడవలె యా కుర్రవాని బండి ఆతని బండిని వెన్నంటియే వచ్చినది. ప్రథమమున జనులు “కామందక విజయ! కులపాలక విజయ!” అని యరచినారు. ఉత్తరక్షణముననే వెన్నంటివచ్చినయా పిల్లవాని చూచిరి. వారందరి హృదయములు నాతనిపట్ల కోపముచే క్రూరములైనవి.

10. విజయలక్ష్మీధవుడు

ఇంకను కొన్ని ధనువులు గడచినవి. సమవర్తికి తన్ను వెన్నంటు పిశాచరూపుని బండి ఇంకను కూడనున్నదనే తోచినది. ఇంతలో మెరుమువలె ఆతనికి ఒక్కసంగతి గోచరించినది. ఆతని ముఖము ప్రఫుల్లమయినది. ఆతని పెదవులపై మబ్బులు కమ్మినరాత్రి మబ్బులమాటునుండి తొంగిచూచు చంద్రరేఖవలె చిరునవ్వు కలకలలాడినది. గుండెలపైనుండి పెద్దబరువు తీసివేసినట్లయినది. కొన్ని పసరములు మంచి పరుగుగలగిత్త లైనను, తమంతట తాము దారిని పరుగిడలేవు. ఏ బండియైనను ముందుండిన తాము వెనుక నడువగలవు. ఆ ముందుబండి ఎంత వేగవంతమైన అంతవేగమున ఆ విచిత్రజాతి వృషభములు పరుగిడగలవు. అంతియ. ఈ ఆలోచన సమవర్తికి వేయి ఏనుగుల బలము నిచ్చినది. క్రుంగిపోయిన మనుష్యుడు ఒక్కుమ్మడిలేచి కామందక, కులపాలకలను ఎలుగెత్తి పిలుచుచు, “ఇదిగో గమ్యస్థానము ఒక్కఅడుగు, వెనుదీయకండి, పౌరుషము నిలబెట్టుడు!” అని అరచినాడు. ఆ ఉత్తమ బలీవర్దములును తమ శక్తికి మించిన బలమును తెచ్చుకొని పది ధనువులురికినవి.

చారుగుప్తుడు, సమవర్తి మోమును చూచినాడు. ఆతని ఆలోచనా పథము తనకును సువ్యక్తమై తోచుటతోడనే చిరునవ్వున ఆతనిమోము ప్రఫుల్లమైనది.

హిమబిందు తండ్రివదనమును, తమ శకటమును, వెనుకవచ్చు ఆ ఆంధ్ర యువకుని శకటమును, ఆ విచిత్రంపు కోడెలను, ఆ వెనుకబండ్లను ఆలోచనారహితయై, అదటువహించిన హృదయముతో పరిశీలించుచుండెను. వ్యాకుల మేఘాచ్ఛాదితమైన జనకుని వదనము ఇంతలో నిర్మలమై హాసయుక్తమగుట కనుంగొని, యామె ధైర్యమువహించి, యా నూత్నబాలకునివైపు అపహాసము పరపినది.

ఇంక నూటయిరువది ధనువుల దూరమున మాత్రమే గమ్యస్థానమున్నది. అప్పుడే ప్రజలు విజయ మెట్లయినను సమవర్తిదే యని కేకలు వేయుచుండిరి.

ఇంతలో దావానలాంతరాళమునుండి జనించి శిఖల నన్నింటిమీరి గుప్పున దుముకుజ్వాల సామ్రాజ్ఞివలె, అనేక వాయుసమీకరణోద్భవమై మహాపవనము లన్నింటి దాటి విసవిసబోవు సుడిగాలిరీతి, పూర్వాదిసమీపమున సంభవించి చదలుదాక లేచి అమితవేగమున తరలి తరలి సాధారణ కల్లోలములపై దూకివచ్చు ఉత్తుంగకల్లోలము విధాన, సునాయాసముగ వెనుక వచ్చు నా కుమారుని ఎద్దుబండి సమవర్తి శకటమును దాటి ముందునకు గడిచిపోయినది. ఆ సమయమున నా ప్రఖ్యాతవీరుడు రౌద్రమూర్తియై, గాఢక్రోధమున ఎట్లయిన తన విరోధి బండిని నిలుపు దురుద్దేశమున విడిగానున్న యొక పగ్గపుత్రాడు చటుక్కున అత్యంత నిపుణముగ తన యెదిరివాని యెద్దుల మెడలమీదికి విసరెను. అది చూచి అంద రొక్కసారి హాహాకారముల సలిపిరి. కాని మగటిమి గల ఆ కుర్ర పోటీదారుడు తన చబుకు చురుక్కున పేలించి సమవర్తి చేతిపై మేరుమువలె, బాణమువలె, నాటించి పగ్గము హస్తమునుండి సడలిపోవునట్లొనర్చెను.

సమవర్తిచేయి పట్టువీడిన పగ్గముతాడీడ్చుకొనుచునే ఆ బాలకుని బండి గమ్య స్థానమునకుబోయి నిలిచెను. ఆ గిత్తలు వగర్చుచు ముట్టెలు భూమి నాన్చి, నాల్కలుజూచి, డొక్కలెగురవేయుచు నిలిచియున్నవి.

ఇరువది ధనువులవెన్క సమవర్తి వచ్చెను. శివస్వాతియు, కాళింగుడగు మల్లినాథుడును మూడవవారుగా వచ్చిరి.

ఒక్కుమ్మడి ప్రజలందరు “ఇదిమాయ! తంత్రము! ఇంద్రజాలము! వీడు బ్రాహ్మణ మాంత్రికుడు! వీనిపట్టుడు! కొట్టుడు! చీల్చివేయుడు!” అని కేకలువేయుచు దగ్గరనున్న ఆయుధముల సేకరించి హుమ్మని విజయలక్ష్మీ ధవుడగు నా బాలకునికడ కురికిరి. అచ్చటనున్న రక్షకభటులు ఇట్టిరంగ ముద్భవిల్లునని కలనైన తలచియుండకపోవుటచే, ఆ మూకల నాపుచేయలేకపోయిరి. చక్రవర్తి అంగరక్షకులు కొందరు తమ గుఱ్ఱముల నా విజయునికడకు బరువెత్తించి ఆతని చుట్టును శూలముల జళిపించుచు నిలిచిరి. వారి నెట్లు తప్పించుకొనిరో నల్వురైదుగురు వీరులు సువర్ణశ్రీ బండిని కత్తులెత్తుకొని సమీపించిరి. ఆ బాలుడు తనకుకలిగిన ఆయాసము నడంచుకొనుచు, చిరునవ్వు మోముతో నీ గడబిడ చూచుచు, తనదూడల పల్కరింపుచు, ప్రేమచే వాని మూపురములు, గంగడోళ్ళు, ముట్టెలు దువ్వుచు, వాని ఆయాసము తీర్చుచు, తనపై దుముకువారివైపు చూచుచుండెను. ఎప్పుడీ నల్వురు కత్తులెత్తుకొని తనమీదికి దూకిరో, అప్పుడా బాలుడుచేతనున్న బంగారు కట్లుకట్టిన, మణులు పొదగిన పెద్ద పులితోలు తాళ్ళుగలిగిన, దంత కశాయుధము పట్టుకొని ముందున్న వాని మోముపై చురుక్కున నంటించెను. “హో” యని యార్చియాతడు కత్తి పారవైచి, కశాఘాతంబుచే రక్తము స్రవించు మోముపై చేతులనుంచుకొని కూలిపోయెను.

ఇంతలో అపరభీమునివలె మహాసత్వుడై పర్వతమువలె ఉన్నతుడై ఆజానుబాహుడై, అమూల్యవస్త్రధారియై, చిరుగంటలు గలిగిన పెద్దగదను ధరించి యొక పురుషుడు రాజాయము కడనుండి పరుగునవచ్చి, సువర్ణశ్రీ కుమారునికడకురికి, పిడుగుమాటలతో “ఎవ్వరీబాలుని స్పృశింప దలంతురో వారు ముందే గదాయుధంబు రుచిచూతు” రని పలికెను.

ధనుర్వేదాచార్యుండును, చండవిక్రముండును, సమస్తవీరహృదయా నందుడును, పవిత్రుడగు సోమదత్తు డానూత్న బాలునకు సహాయియై వచ్చెనని చూడగనే ప్రవాహము వలెవచ్చు ప్రజానీకము పర్వతము అడ్డమురా నాగినట్లయ్యెను. అందరును వెనుకకు తిరిగిరి. అప్పుడు సార్వభౌముని గజ తురగ రథ సైనికులు జవంబున విచ్చేసి మూకల నిటునటు తరిమివేసిరి. సార్వభౌముని కడకు విజయుని గొనిరా రాజాజ్ఞయయ్యెను.

ఈ కోలాహలమంతయు సమవర్తి జూచుచునేయుండెను. జనులు తన్నోడించిన యాబాలునిపై గవిసినప్పుడు సమవర్తిమోము హర్షప్రఫుల్ల మయ్యెను. సోమదత్తుడువచ్చి ఆ కుర్రవానిని ఆపదనుండి రక్షించునప్పుడు సమవర్తి పండ్లు బిగించి సోమదత్తునివైపు చురచుర చూచెను.

ఆ బాలుడు తన్ను రక్షింపవచ్చిన తన గురునకు పాదాభివందన మాచరించి ఆనందాశ్రువులతో నాయన మోము దిలకించెను. సోమదత్తుడు సంతోషమున శిష్యుడగు నా బాలుని బిగవుగిలించుకొని మూర్ధము ముద్దు గొనియెను. వారిద్దరు గజగమనముతో రాజమందిరము సమీపించిరి. ఈలోన ప్రజలకు కోపముతగ్గి ఎట్టి బహుమాన మా బాలుడు బడయునో, సార్వభౌముడేమి చెప్పునో ఆ బాలుడెవరో తెలిసికొన కుతూహలము కలిగి, ఎప్పటియట్లు తమ స్థానముల ఇష్టము చేతనైననేమి, సైనికుల యొత్తిడి చేతనేమి యధివసించిరి. అంతయు నిశ్శబ్దమయ్యెను. చీమ చిటుక్కుమన్న వినిపించునట్లుండెను.

సార్వభౌముని మందిరముకడ అమాత్యులు, సచివులు, సైన్యాధికారులు మొదలగు గొప్ప యుద్యోగులు, సామంతనృపాలురు, ఆంధ్రపండితులు, కవులు, వీరులు-అందరు అధివసించి యుండిరి. శ్రీముఖ సాతవాహనమహారాజు దేవేరితో గద్దెపై నధివసించి యుండెను. రాజసింహాసనము కుడిప్రక్కగా యువరాజాసనముపై చక్రవర్తి పెద్ద కుమారుడగు శ్రీకృష్ణసాతవాహనుడును, ఆ ప్రక్కపీఠికపై శ్రీముఖుని తమ్ముడగు సుధన్వ సాతవాహనుడును కూర్చుండిరి. వెనుక పరిచారికలతో అంతపుర స్త్రీలోకము మణిమయ స్వర్ణపీఠముల ఉపవిష్టమైయుండెను.

సోమదత్తు తనశిష్యుని రాజుమ్రోలకుం గొనిపోయినాడు. ఆ బాలకుడు సార్వభౌమునకు సాష్టాంగప్రణామ మాచరించి, యాతనిచే ననుజ్ఞాతుడై లేచి నిలువబడెను, అప్పుడు సోమదత్తుని మోము పరికించి చక్రవర్తి యిట్లనియె “వ్యాయామాచార్యా! సోమదత్తా! ఈ బాలకు డెవరు? ఈతని యుదంతమేమి?” అని యడిగెను.

“మహారాజాధిరాజా! ఆంధ్రసార్వభౌమా! సర్వరాజన్యకిరీటమణి ప్రభాస్నాత పాదుకా! జయ జయ! ఈ బాలుడు దేవరశిల్పియై విఖ్యాతి గాంచిన మహాభక్తుడగు ధర్మనంది తనయుడు. సువర్ణశ్రీకుమార నామధేయుడు. నా శిష్యులలో నుత్తముడు. ఉక్షాశకట పరీక్షకు మా పరిశ్రమాలయ పక్షమున నొకవీరుని పంపుట పూర్వమునుండియు ఆచారము. శ్రీ శకటాధ్యక్షులు మాకు లేఖ నంపుటతోడనే మే మొక పందెము నేర్పరచి అందు విజయుడగువాని నీ ఉత్సవపరీక్షకుపంపుట దేవరకు విశదము. ఈ సంవత్సర మీబాలుడు విజయియై ఇచ్చటకువచ్చి ఇక్కడను జయము గొన్నాడు” అని విన్నవించెను. అప్పు డొక్కసారి వందిమాగధులు పాడినారు. దుందుభుల మ్రోగించినారు. జయ జయధ్వానము లొనర్చినారు. వైతాళికులు కీర్తించినారు. మేళపతులు శంఖ కాహళ నాగస్వరాది వాద్యముల పల్కించిరి.

11. విజయ బహుమానము

సద్దుమణగినంతనే సార్వభౌముడు మహామంత్రివైపు చూచెను. మహామంత్రి ప్రధాన వైతాళికుని కన్నుసన్న జేసెను. అప్పుడు తళుకు తళుకుమను దీపలక్ష్ములు, సర్వభూషణాలంకృతలై హారతులగొనివచ్చి, పాటలు బాడి మంగళము లిడిరి. ఇరువురు బాలికలు వెంటనే వివిధ సుమమాలల గొనివచ్చి యాతని మెడను వైచిరి.

అంత వీణానాదము మృదంగము వేణుస్వనము వినవయినవి. ఈ వలావలనుండి సుందరులగు ఇరువదిమంది బాలికలు నాట్యము చేయుచు విచ్చేసి సువర్ణశ్రీ కుమారుని చుట్టును “ధర్మవిజయము”ను అద్భుతాభినయపూర్వకముగ నాట్యమొనరింప నారంభించిరి. ఆ బాలికలలో సార్వభౌముని ఇరువురి తనయులు, రాజకుటుంబములోని బాలికలు, సచివుల సేనానాయకుల కుమార్తెలు, కోటీశ్వరుడగు చారుగుప్తుని పుత్రి హిమబిందును కలరు. ఆ నాట్యమునందు పాల్గొననుత్తమవంశ సంజాతలగు యువతీ రత్నములకే అర్హత.

మంగళవాద్యములు మ్రోగుచుండెను. దేవవేషమున నాట్యగురువు ప్రవేశించెను.

ఈ విజయ గీర్తింప
ఈ వియచ్చరులెల్ల
గగన పథముల వచ్చి
కాంతితో ప్రసరించి
పూలవర్షము కురిసి
తేలుచున్నారదిగొ
ఈ విజయ గీర్తింప”


బాలిక లప్సరసలవలె నభినయించుచు,

“ఓయి యౌవనమూర్తి
ఓయి సుందరస్వామి
రావయ్య జయదామి
కావక్షుడవు కమ్ము”