సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు :- భారతీయ తత్త్వదర్శ నాంశములను పూర్వజన్మ సంస్కారమున గ్రహించి, ఆంధ్రత్వము నిలువబెట్టుటకు పరిశ్రమించిన విరాగి, త్యాగి, పరోపకారపరాయణుడు, దీన జ నా వ ను డు అల్లూరి సీతారామరాజు. బ్రిటిషు ప్రభుత్వమువారి దమన నీతి నసహ్యించుకొని, దుష్టపరిపాలనమునకు ఎదురుతిరిగి, బ్రిటిషు ప్రభుత్వమును ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీరు తాగించిన యోధుడు అల్లూరి సీతారామరాజు.

ఇతని స్వగ్రామము పశ్చిమ గోదావరిజిల్లా, భీమవరముతాలూ కాలోని మోగల్లు గ్రామము. క్షత్రియవంశమువాడు. తండ్రి పేరు వేంకట్రామరాజు. తల్లి పేరు నారా యణమ్మ. ఇతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శ్రీరామరాజు. కాని యితడు వలచిన కన్య సీత యను యువతి అకాలమృత్యువు వాత బడుటచే, ఆమె జ్ఞాపకార్థము తన పేరును సీతారామరాజుగా మార్చుకొనెను.

శ్రీరామరాజు చిన్నతనమునుండియే ఎప్పుడును, ఏదో ఆలోచించుచు ఉండెడువాడు. చదువుసంధ్యలయందు దృష్టి లేకుండెడువాడు. ఇంగ్లీషు పాఠశాలలలో చెప్పెడు విద్య విద్య కాదనియే అతడు భావించుచుండెను. సీతా కన్య మరణానంతరము వివాహకార్యము తలపెట్టక, వైరాగ్యశీలియై, అడవులు పట్టి తపస్సు చేయసాగెను.

అతడు గోదావరీనదీతీరమందలి పాపికొండల గుహలలో ఏకాంతవాసము చేయుచుండెను. అప్పుడు అచ్చటి ఆటవికు అయిన సవరలతో అతనికి పరిచయము కలిగెను. సవరలు అతనికి సపర్యలు చేయుచు, తమగురువుగా నెంచి ఆతనిని మన్నింపసాగిరి.

సవరలు చేయునది బోడువ్యవసాయము. ప్రభుత్వాధికారులు లంచములియ్యని సవరలభూములను లాగుకొని తాము ఏర్పాటుచేసిన ముఠాదారులకు సంక్రమింపజేసి ధనము గడింపసాగిరి. పండ్లు కోసినారనియు, కట్టెకొట్టి నారనియు, వెట్టి చేయలేదనియు ఏవేవో నేరములు మోపి ఆయారణ్యకులను తహస్సీలుదారు, పోలీసు వారు బాధలు పెట్టుచుండిరి. ఈ ప్రభుత్వాధికారులకు క్రైస్తవమిషనరీలు తోడ్పదు చుండిరి. ముఠాదారులకును, సవరలకును విభేదములు ఏర్పడి తగవులు ప్రబలము కాసాగెను.

ఈ ఆటవికుల దుర్భర జీవనమును గమనించి సీతారామరాజు యమాయకులపక్షమున నిలచి ప్రభుత్వాధికారులతో వాదించసాగెను. ప్రభుత్వమునకు ఈ సీతారామరాజు కంటకుడయ్యెను. అంత ప్రభుత్వము సీతారామరాజును గూడనిర్బంధములపాలు చేయుటకు సంకల్పించెను. సీతారామరాజు క్రమముగా ప్రతిఘటించి సవరలను సంస్కరించి యుద్ధసన్నద్ధుల గావించెను. తమ పూజ్యగురువునకు ఎట్టి అపాయము జరుగకుండ సవరలు వేయికన్నులతో కని పెట్టుచు, అంగరక్షకభటులుగా నిలుచుండిరి. పోలీసుబలముతో సవరలకు ముఖా ముఖి పోరాటము 1922లో ప్రారంభమయ్యేను. అడవి లోని దుంపలను తీయగూడదనియు, గొడ్లకు గడ్డిని కోయ గూడదనియు, దొరతనము వారుఆజ్ఞలను కావించిరి. 'ఆకలి మంట లొక్కసారి విజృంభించుటచే సవరలు గండ్ర గొడ్డండ్లతో అరణ్యములోని చెట్లను నరుకుటకు కడంగిరి. ఇదియే పోరాటమునకు కారణము.

సాధు సీతారామరాజు బోధనానుసారము సవరలు సాయుధ విప్లవమునకు సంసిద్ధు లగుచున్నారని పోలీసు సిబ్బందితో అధికారులు గ్రామములపయి దండెత్తిరి. కొంపలను తగులబెట్టిరి. సీతారామరాజును, నూరుగురు సవర ముఖ్యులను పట్టుకొనిపోయి, విచారణతంతు నడిపి, జెయిలుకు పంపిరి. కాని సీతారామరాజు జెయిలునుండి విచిత్రముగా అంతర్ధాన మయ్యెను. పర్లాకిమిడి, జయ పూరు, గోదావరి అరణ్యములు అప్పుడాతనికి ఆటపట్టు లయ్యెను. సవరలకును, ఖాండులకునుతప్ప సీతారామరా జెక్కడ నున్నాడో ఎవ్వరికిని తెలియకుండెను. నమ్మిన బంట్లగు సవరలు, ఖాండులు రహస్యమును కాపాడిరి. ఆటవికులు సాయుధ, నిరాయుధ వర్గములుగా నేర్పడిరి. సాయుధ వర్గము ప్రభుత్వముతో పోరాడునట్టిది. నిరాయుధ వర్గములో కార్మికులు, కర్షకులు ఉండుచుండిరి. నిరాయుధవర్గమువారు సమ్మెలుకట్టి, పన్నులు ఎగ బెట్టి విధినిర్వహించెడువారుగా ఉండిరి. ఈ విధముగా విప్ల వము సిద్ధమయ్యెను. సీతారామరాజు ఈ విప్లవమునకు అధినాయకుడు. ఈ విప్లవ సేన విండ్లు, బాణములు, కత్తులు, బల్లెములు ధరించి 1922 లో చింతపల్లి గ్రామమునకు పోయి పోలీసు స్టేషనును ముట్టడించెను. పోలీసువారు గడగడ వడ కిరి. రాజు ఒక కుర్చీలో కూర్చుండి, అచ్చట ఎట్టి ఆయు ధము లున్నవో ఇన స్పెక్టరు నడిగి తెలిసికొనెను. సీతారామ రాజునకు కుడి, ఎడమ భుజములుగానున్న గాము గంటం దొర, గాము మల్లుదొర అను గ్రాము సోదరులు పోలీసు ఠాణా యంతయు గాలించి, ఆయుధ సామగ్రి తెచ్చి, రాజు సమక్షమున ప్రోగుపరచిరి. రాజు వాటిని వివర ముగా రికార్డు పుస్తకములో వ్రాసి, దస్కతు చేసి, తప్పుడు రికార్డులను చించిపారవై చెను. అచ్చట దొరకిన ఆయుధ సామగ్రితో సపరివారముగా రాజు వెడలి పోయెను. ఎవరిని హింసించలేదు, గ్రామజనము గుమి గూడి తమాషాగా చూచుచు నిలుచుండిరి. పోలీసులు గండము గడచిన దని, ప్రాణములతో బయటపడ్డామని ఊపిరిపీల్చిరి. తరువాత రాజు కృష్ణదేవిపేటలో పోలీసు లను చెట్లకు బంధించి, స్టేషనులోని తుపాకులను గై కొని వెడలిపోయెను. మొట్టాడం వీరయ్యదొర ఒక ధీరుడు. ఇతనిని “లాగ రాయి" పితూరీ జరిగినప్పుడు పట్టుకొనిపోయి నానాకష్ట ముల పాల్చేసిరి. వీరయ్యదొర తప్పించుకొనిపోయి అర 379 అల్లూరి సీతారామరాజు ణ్యములలో సవరల రక్షణలో రహస్యముగా నుండగా ప్రభుత్వమువారు వేగులవారిద్వారా గాలించి పట్టుకొని "రాజవొమ్మంగి" ఠాణాలో నిర్బంధించిరి. వెంటనే సవర నాయకులు ఠాణాపై దాడి నలిపి, కొట్టు పగులకొట్టి, వీరయ్యదొరను విడిపించిరి. అచ్చటి ఆయుధము లన్నియు దోచుకొనబడెను. వీరయ్యదొర విప్లవ సైన్యమునకు ఉప నాయకు డయ్యెను (1922). ఈ విధముగా 28 తుపా కులు, 2500 రౌండ్ల మందుగుండ్లు, 10 కత్తులు, 10 మందుసంచులు, 12 పెద్దగొలుసులు, 28 బయొనెట్లు, 9 ఖడ్డీలు - ఇంకను పోలీసుదుస్తులు, ఇతర వస్తువులు సీతారామరాజు వశమయినట్లు సర్కారు లెక్కలలో వ్రాయబడియున్నది. విప్లవకారులు చర్యలు దొరతనము వారికి తెలియగ నే వందలకొలది పోలీసులు అచ్చటికి పంపబడిరి. తెల్ల అధి కారులుగూడ వచ్చిపడిరి. ఒక వైపున విప్లవ సైన్యము వీర మర్యాదలు పొందుచుండగా, వేరొకచోట ప్రభుత్వదళము ప్రజలను భయ పెట్టసాగెను. విప్లవకారుల గుంపుజాడ దొరతనమువారికి తెలుపువారు ఎవ్వరును కనబడక పోయిరి. పైగా తప్పుత్రోవ చూపుచుండిరి. ఒకసారి రామరాజు నిరాయుధుడుగా నున్నప్పుడు సై నీకుల కెదురయ్యెను. వా రతనిని గుర్తింపజాల రై రి. తమ మూటలను మోయుమని రాజున కాజ్ఞాపించిరి. రా జొకమూటను నెత్తిపై పెట్టుకొనేను. ఆతని యను చరులును మూటల నెత్తుకొనిరి. వారందరును అరణ్య మధ్యములో ఒకచోట విశ్రమించిరి. నడిరాత్రివేళ సైని కులు గాఢనిద్రలో నుండగా, వికృత కోలాహల మొన ర్చుచు, ఆ మూటల నెత్తుకొని అనుచరులతో సీతారామ రాజు అంధకారబంధుర మగు మనారణ్యమధ్యము చొచ్చెను. సైనికులు విఠాకుపడిపోయిరి. ఒకసారి 'ట్రెమన్ హోరు' అనువాని నాయకత్వమున సర్కారు సైన్యదళము అరణ్యములో పితూరీదారులను వెదకుచుండెను. విప్లవకారులు “రామరాజునకు జై" అని కేకలు వేసిరి. సైనికులు తుపాకులు సరి పెట్టుకొను సంతలో కూలీలు పరుగిడిపోయిరి. సైనికులు తుపాకులు కాల్చిరి. అయినను భయపడక విప్లవకారులు తుపాకులు కాల్చుచు ముందుకు వచ్చిరి. బాణవర్ష ము గురియించిరి. టెమన్ హోరుకు బాణములు తగిలెను. అందరును పిరికి పడి ఎవ్వరి అనుమతిలేకయే పరుగిడిపోయిరి. విప్లవ కారులు మందుగుండ్లు, తుపాకులు, కత్తులు, దుస్తులు నూడబెరికి తీసికొనిపోయిరి. దీనిని ప్రథమ సమర మని యెదరు.

మోటువారిని సత్యపథమున నడిపించుటకు దేవీ మహోపకారకములుగా భక్త్యారాధనలు కావున సీతారామరాజు "గూడెము" అను గ్రామములో దేవీపూజలు సలుపుటకు ఏర్పాటు చేసెను. ఈ సంగతి తెలిసి శాండర్సుదొర సైన్యముతో గూడెమునకు బయలు దేరెను. ఇతనికి సహాయముగా టాల్బర్టుదొర రిజర్వు దళముతో "పెదవలస" అను గ్రామములో మకాం చేసెను. దేవీ పూజ నిర్విఘ్నముగా సాగుటకై ఒక యుక్తి చేసి రామరాజు కొందరు విప్లవ కారులను టాల్బర్టు మీదికి పం పెను, వారు ఏమరుపాటుననున్న సైనికుల పై బడి బాగుగ మర్దించి తరిమిపై చిరి. విప్లవకారులు వేగులవాడు శాండ ర్సును సమీపించి టాల్బర్టు పరిభవము ఎరింగించెను. శాండర్సు వెనుకకు మరలేను. పెదవలసకు పోయి విప్లవ కారులను పట్టుకొన తలంచెను. కాని గూడెముకుపోయి దేవీ పూజలో పాల్గొనిరి.

ఒకనాడు దమనపల్లిలో విప్లవ కారుల వంట చేసికొనుచుండిరి. సైన్యములరాక వారికి తెలిసెను. వెంటనే గాముసోదరులు అనుచర స మేతముగా త్రోవగాచిరి, కొండల నొరసికొని ఒక ఏరుపారుచుండును. ఏటి యొడ్డుననుండి బాట పోవును. ఆ బాట మిగుల ఇరు కయినది. గాముసోదరులు ఈ బాటప్రక్కన కొండలపై గుబుగుచెట్టుల చాటున తుపాకులు బారువెట్టి కూర్చుండిరి.

ఒకరి వెనుక నొకరుగా సైనికులు పోవుచుండిరి. నల్లసిపా యిలు దాటిపోయిన తరువాత కవర్లు, హైటరు అను నిద్దరు సేనానులు నడచుచుండిరి. వీరిద్దరు విప్లవకారుల తుపా కుల గుండ్లకు గురియై నేలకూలి దొర్లి, ఏటిలోబడి కొట్టుకొని పోయిరి. మిగిలినవారు పారిపోయిరి. గాముసోదరులు చేసిన హత్యావ్యవహారము రామరాజునకు తెలి యదు. ఆతడప్పుడు పర్వతము పై తపస్సు చేయుచుండెను. ఈ హాత్యావిషయ మాతనికి తెలిసినప్పుడు గాముసోదరు లను కోపగించి, చీవాట్లు పెట్టెను. రామరాజు అహింసా ప్రియుడు.

కవర్డు, హైటరుల మరణము తెల్లవారిలో గొప్ప అలజడిని కలిగించెను. ప్రబల సన్నాహముతో మలబారు పోలీసులతో, పటాటోపముతో మిస్టర్ నాధ్ దొర దిగి వచ్చెను. ఇట్టి బ్రహ్మాండమయిన ప్రయత్నమంతయు నెందులకు? రామరాజు యొక్క ఎనుబదిమంది అను చరులను పట్టుకొనుటకే. “రామరాజు రాజత్వవాది. గూడెము తాలూకాకు తాను ప్రభువు కాదలచి యీ పితూరీని లేవనెత్తెను. గ్రామములను దోచి ప్రజలను హింసించుచున్నాడు" అని ప్రభుత్వమువారు పచ్చి అబ ధపు ప్రకటన చేసిరి.

రామరాజు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి ' స్టేషనులను హఠాత్తుగా ముట్టడించెను. కాని తరువాత తరువాత కలెక్టరుకు నో టీసు ఇచ్చి, ఆప్రకారము చేయుచుండ మొదలు పెట్టెను. గ్రామోద్యోగులకు తాను ఎచ్చటెచ్చటికిపోవుచుండెడిది, ఎప్పు డెప్పుడు పోవుచుండునది తెలుప సాగెను. అడ్డతీగల, పైడిపుట్టి, రంప చోడవరము, ఏనుగగుంట, పాత మల్లు పేట, అనుమలపూడి, అన్న వరము మొదలగు గ్రామములలోని ఠాణాలను ముట్టడించి దోపిళ్ళు జరిపెను. కాని రాజు కార్యక్రమము ముందుగా తెలిసియుండియు అధికారులుగాని, సేనానులుగాని జంకి రాకపోయిరి. వచ్చిన వారు విప్లవకారులను చూడగనే పలాయనము చిత్తగించెడి వారు.

రామరాజు ప్రభుత్వపు గూఢచారులను బట్టుకొని, భయపెట్టి వద లేడువాడు. వస్తుసామగ్రి, ఆయుధాలు, మందుగుండ్లుగల బండ్లను ఆపి అంతయు కాజేసెడివాడు. తలపడి యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు విప్లవకారులు చాకచక్యమునకు సైనికులు విభ్రాంతులగుచుండిరి. విప్లవకారులు ఒక నిమిషమున కొండలమీద, మరు నిమిషమున సమతలముమీద కనబడుచుండిరి. పారిపోవు చున్నారని తరుముచుపోగా. వెనుకనుండి విప్లవకారుల పోటు దుర్భరము కాజొచ్చెను. ఇది రామరాజు యొక్క రణనీతి విధానము.

పెద్దగడ్డపాలెము యుద్ధములో ప్రభుత్వపు సైనికులు మారణ యంత్రములను, ఆగ్నిగోళములను విచ్చలవిడిగ ప్రయోగించిరి. విప్లవకారులు కొందరు మడిసిరి. లింగ పురము ఏటిదగ్గర రాత్రి యుద్ధము జరిగెను. చాలమంది విప్లవకారులు హతులైరి. తరువాత ఎవరిమార్గమున వారు పలాయితు లయిరి. ఇది ఆరవయుద్ధము.

గాయపడిన విప్లవకారులను గ్రామీణులు తమ ఇండ్లలో నుంచుకొని చికిత్సలు జరిపెడివారు. ఉపచర్యలు సల్పెడి వారును గ్రామీణులే. అందుచే ప్రభుత్వమువారు ప్రజలను వేధింప గడంగిరి. క్రూర శాసనములు గావించిరి.

రామరాజు అన్నవరము సత్యనారాయణస్వామి దర్శనార్థము కొండమీదికి వెళ్ళెను. ఈ వార్త పొక్క గానే జనులు గుంపులు గుంపులుగా వచ్చిరి. రాజును దర్శించి ప్రేమ, భ క్తి, గౌరవములను ప్రకటించిరి. పూల మాలలు వేసిరి. మంగళహారతులు పట్టిరి. కానుక లొసం గిరి. పాలు, పండ్లు సమర్పించిరి. అచట రాజు స్నానము చేసి, సంధ్య, జపము, తపము ఆచరించెను. శంఖవరము వెడలినపుడును ప్రజలు ఇట్లే అతనిని సమ్మానించిరి.

ఒకసారి రామరాజు తన ముఖమునకు మసిపూసి కొనెను. విప్లవకారులు మలబారు పోలీసు దుస్తులను ధరించియుండిరి. వీరిని చూచి తమవారే అని తెల్లదొర భ్రమవడి మోటారులు ఆపెను. వెంటనే తుపాకులు గురి పెట్టి అసంసిద్ధులైయున్న సైనికులపై విప్లవకారులు' విజృంభించిరి. తరువాత వారిని నిరాయుధులను చేసి, యుద్ధసామగ్రి నంతయు గ్రహించి పారిపోయిరి.

సర్కారువారు విప్లవకారులకు ఆహారపదార్థములు దొరకకుండ కట్టుదిట్టములు చేసిరి. నదీమార్గములు, భూ మార్గములు, రైలుమార్గములు కాపలా కాచి వర్తకులను నిర్బంధించిరి. కాని యెట్లో ఆహారపదార్థములు మాయమగుచునే యుండెను. ప్రభుత్వమువారు పన్నా గములు పన్ని జనులలో విభేదములు కలిగించుటకు ఆరంభించిరి.

రామరాజు యుద్ధములందు జయాపజయములను పొందినవాడు. ఓడినప్పుడు కొండల కెగబ్రాకి, అనువగు తావులను చేరి, మరల యుద్ధము ప్రకటించుచుండెను. గ్రామోద్యోగులను, సివిలు ఉద్యోగులను బాధించలేదు. వారికి జరిమానాలు మాత్రము విధించెడి వాడు. వారు సంతోషముతో జరిమానాలు చెల్లించుచుండిరి. రాజు వదలి పెట్టిన వారిని ప్రభుత్వమువారు శిక్షించసాగిరి. ఎటు అయినను మనకు కష్టములు, అవమానములు తప్పవుగదా యని ప్రజలు విప్లవకారుల యెడ విముఖులైరి. ప్రజలలో నిరుత్సాహ మధికమయినది.

ఇట్లు పదునారు మాసములు యుద్ధభీతి ప్రవర్తిల్లెను. విప్లవ కారులసంఖ్య పలుచబడెను. అందుచే కొత్తబలగము సమకూర్చుకొనుటకై రాజు వ కిమిడి పోయెను. గంటన్నదొర నాయకత్వమును వహించెను. గంటన్న దొర తప్పత్రాగి ఒక యుంపుడుకత్తె యింటికిపోయెను. ఆ యుంపుడుక త్తె మోసముచేసి వానిని సర్కారువారికి పట్టీయిచ్చెను. గంటన్నదొర పరమవిధేయు డయినబంటు. తాగుబోతుతన మొక్కటే వానియవగుణము. ఆయవ గుణమును మాన్చుటకు రామరాజు ఎంతో ప్రయత్నించెను. చివర కా గుణమే వానికి ముప్పు తెచ్చినది.

రామరాజు పర్లాకిమిడినుండి బలగముతో తిరిగివచ్చి శంఖమును పూరించెను. కాని అంతయు నిరాశాజనక ముగా పరిస్థితులు మారియుండెను. అస్సాము రైఫిల్సు పటాలము రంగమున ప్రవేశించెను. లార్డు వెల్లింగ్ డన్ మద్రాసు గవర్నరుగా విచ్చే నెను.

రామరాజును పట్టియిచ్చువానికి పది వేలరూపాయల బహుమానమును ప్రభుత్వము ప్రకటించెను. మన్యము చుట్టును రాకపోకలు ఆపివై చిరి. వర్తకము స్తంభిం చెను. రాజు విప్లవము నాపివై చితినని ప్రకటించెను. రాజు ప్రజలను రక్షించుటకును, పితూరీచారులకు తిండి సంపా దించుటకును అశక్తుడయ్యెను. 1924 మే నెలలో రామ రాజు అనుచరుల నెల్ల చేరబిలిచి వారికెల్లరకు వీరమర ణము శాసించెను. విప్లవవీరులు ఒక్కొక్కరే సైనికుల నెదిర్చి హోరాహోరీగా యుద్ధముసలిపి వీరమరణము నొందిరి. రామరాజు కనబడుట లేదు.

ఒక యోగి ఒక యేటిదగ్గర ఒక కోయబాలునకు గన్పించెను. ఆ యోగి ఒక లేఖవ్రాసి దానిని సేనాధిపతి కీడుమని వానికిచె ప్పెను. ఒక పోలీసు ఉద్యోగి ఉత్తర మును చదువుకొని యోగివద్దకు వచ్చెను. అతని యొద్ద ఎట్టి ఆయుధమును లేదు. నిశ్చలముగా తపస్సు చేసికొను చుండెను. ఇంతలో సైన్యమువచ్చి అతని చుట్టుముట్టెను. వారికి తానే సీతారామరాజునని యోగి చెప్పెను. ఆ యోగిని మేజరు గుడాలు అను తెల్ల సేనానికడకు తీసికొని పోయిరి. ఇతడు రామరాజు అగునా, కాడా చించుటకు గుడాలు పూనుకొనలేదు. గొలుసులతో యోగిని చెట్టునకు కట్టించెను. యోగి మాట్లాడనుండగా గుణాలు తుపాకి గురిపెట్టెను. కుడి యెడమల వరుసగా పాదములనుండి పైపైకి తుపాకీ కాల్చుచుండెను. పాద ములు, మోకాళ్ళు, తొడలు, నడుము, నాభి తుపాకి గుండ్లతో గాయము లయి రక్తము ప్రవహింపసాగెను. విశాలవడముపై కాల్చుటతో యోగి శాశ్వత నిద్ర చెందెను.

గుడాలు శాసన విరుద్ధమయినపని గావించెను. గుణాలు ఖూనీచేసెను. మరణించిన వాడు రామరాజగునో కాడో తెలిసికొనుటకును, శవమును బహిరంగ పరచుటకును, వీలుగా లేకపోయెను. పరీక్షార్థము ఈ మాంసపుముద్దను ఎచ్చటికి పంపిన ఏమి ప్రమాదమో యని అధికారులు, చేతులు పిసికికొనిరి. గుణాలు నా క్షేపించుచు నెత్తి, నోరు గొట్టుకొనిరి. తమ యపరాధరహస్యము వెల్లడికాకుండ నుండుటకై గప్ చుప్ గా శవదహనము గావించిరి. (మే 7, 1924).

ఆయోగి రామరాజు కాడనియు, పృథ్వీసింగు అను అనుచరుడయి యుండియుండుననియు, అల్లూరి సీతారామ రాజు చిరంజీవియనియు జనులు ఇప్పటికిని తలంచు చున్నారు. ఈతనినిగూర్చి పాటలు, పద్యములు, బుఱ్ఱ కథలు, రచితములై ప్రచారములో నున్నవి.

అల్లూరి సీతారామరాజు గొప్ప మేధావి, తేజస్వి. శివాజీ, రాణాప్రతాపసింహ, ఝాన్సీ లక్ష్మీబాయి మున్నగువారి శ్రేణిలో చేరతగిన జాతీయవీరుడు. లోక హితైక పరాయణుడు.

ఆ. వీ.