శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదిరెండవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదిరెండవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదిరెండవ అధ్యాయము గురుని, దైవమును వెదకుట; ఉపవాసము నామోదింపబడుట


ఈ యధ్యాయములో హేమడ్‌పంతు రెండు విషయములను వర్ణించెను. 1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను; వారి ద్వారా దైవమును ఎట్లు గనెను. 2. గోఖలేగారి భార్య మూడురోజుల ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా యెట్లు ఉపవాసదీక్ష మాన్పించెను.

ప్రారంభమున హేమడ్‌పంతు సంసారమును అశ్వత్థవృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్ళు పైన, కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీద వైపు గూడ వ్యాపించి యున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవప్రపంచమువరకు వ్యాపించు యున్నవి. దాని స్వరూపము గాని, దాని యధారముగాని, దాని యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థవృక్షమును నరికీ, ఏ యతీతమార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో యట్టి దాని ననుసరించవలెను.

అట్టి దారియందు నడచుటకు, దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి యవసరము. ఒకడెంత పండితుడైనప్పటికి వేదావేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు. మార్గదర్శియే యుండి సహయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

ఈ విషయములో బాబా యనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకాము జాగ్రత్తగ నడుచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును.

ఆన్వేషణ

ఒకానొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలిడితిమి. మాలో నొకడు అత్కను అత్కచే ఉద్ధరించవలెను గాని యితరుపై నాధారపడరాదు అనెను. అందుకు రెండవాడు మనస్సును స్వాధీనమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము అలోచనలనుండి భావములనుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదని చెప్పెను. మూడవవాడు దృశ్యప్రపంచము సదాపరిణామలశీలమైన దనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మవసరమునియు చెప్పెను. నాలుగవవారు (అనగా బాబా) " పుస్తక జ్ఞానమెందుకు పనికిరాదు. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము; సర్వము వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు, ధృడమైన యంతులేని నమ్మకమవసరము" అనెను.

ఈ ప్రకారము తర్కించుచు, మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగ నారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్రబుద్ధి నుపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్ములను కలసి "ఇప్పుడు చాల ఎండగా నున్నది. ఎంతదూరము పోవుచున్నారు. ఎక్కడికి పోవుచున్నా"రని యడిగెను. అడవులు వెడకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు తిరిగి అడిగెను. ఏదో సంధిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి యతడు కనికరించి యిట్లనెను. "ఆడవుల సంగతి పూర్తిగ తెలియకుండ మీ యిష్టము వచ్చినట్లు తిరుగరాదు. ఆడవులలో సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శ యుండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రాయాస పడెద రెందుకు? మీ రహాస్యాన్వేషణ నాకు జెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి దీసికొని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు" డనెను. అతడంత మృదువుగా మాట్లాడినను, వానిని నిరాకరించి నడువ సాగితిమి. మా కన్ని సంగతులు దెలియును కాన ఇతరుల సహయ మక్కరలేదనుగొంటిమి.

అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను, ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి యటునిటు చాలా సేపు తిరిగితిమి. తుట్టతుద కెక్కడనుండి బయలదేరితిమో యచ్చటికే యదృష్టశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసికొని యిట్లనెను. "మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికిగాని పెద్దదానికిగాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శ యుండియే తీరవలెను. ఉత్తకడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకూడదు. వడ్డించిన విస్తరని త్రోసివేయకుడు. భోజనపదార్థము లర్పించుట శుభసూచకము." ఇట్లునుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక, భోజనము చేయకుండ ప్రయాణము సాగించిరి. వారి హఠ మావిధముగా నుండెను. నేనుమాత్ర మాకలితోను దాహముతోను నుంటిని బంజారా చూపిన యసామాన్య ప్రేమలను లొంగి పోతిని. మేమెంతో తెలివైనవార మనుకొంటిమి కాని, దయా దక్షీణ్యములకు దూరమయితిమి. బంజారా చదువుకొన్నవాడు కాడు; యోగ్యతలు లేనివాడు, తక్కువజాతి వాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండ ఎవరయుతే యితరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని యొంచి వాని యాతిధ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమసోపానమని యనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని.

ఏమి యాశ్చర్యము! వెంటనే మాగురువుగారు వచ్చి నా యెదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని. అప్పుడు వారు "నాతో వచ్చుట కిష్టపడెదరా? మీకు కావలసిన దేదో నేను జూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును" అనిరి. తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక యెక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి యజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు దీసికొని పోయిరి. నాకాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడడుగులు మీదగా నన్ను వ్రేలాడ దీసిరి. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4, 5 గంటల తరువాత వారు మర్ల వచ్చి నన్ను బావిలోనుంచి బయటికి దీసి యేట్లుంటివని యడిగిరి. "అనందములో మునిగియుంటిని, నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు!" అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నావీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లిపక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా యభిమాన యంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారు మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలునిపించెడిది. అది యటువంటి బడి. అందులో ప్రవేశించినవారెవరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా యిల్లు నాయాస్తి నా తల్లిదండ్రులు అంతయువారే. నా యింద్రియము లన్నియు తమతమ స్థానములు విడచి, నాకండ్ల యందు కేంద్రీకృతమయ్యెను; నాదృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నాగురువుపైననే నిల్పితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు నా బుద్ది స్తబ్థమగుచుండెను. నిశ్శబ్ధముగా వారికి నమస్కరించుచుంటిని.

ఇతర పాఠాశాలలలో పూర్తిగా మరోక విధమైన దృశ్యముకు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని, హృదయము మృదువుగా నుండదు. అత డనేకవిషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని ఒప్పింపజేయవు. అత్కసాక్షాత్కార మతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యుల కేమి మేలు చేయును? వారి కేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే యాత్మజ్ఞానము దానిమట్టు కది నాయందు ప్రకాశించెను; నేను కోరుట కేమియు లేకుండెను. సర్వము దాని మట్టు కదియే పగటి ప్రకాశమువలె బోధపడెను. తలక్రిందుగను కాళ్ళు మీదుగను నుంచటవలన గలగు అనందము గురువుకే తెలియును.

నలుగురిలో ఒకడు కర్మరుడు ( అనగా కర్మలందు నమ్మకము గలవాడు). అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్యశరణాగతి చేసినవాడు, భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు చివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు దెలిసిన విధ్యపై నాధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీసాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మస్వరూపులైకూడ వారెందుచేత నితరులతో కలసి తెలివితక్కువగా ప్రవర్తించిరి యెవరైన నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక యుదాహరణము జూపుటకును, వారిట్లు చేసిరి. వారు అవతారులైనప్పటికి ఒక సాధారణుడైన బంజారను గౌరవించి వాని యాహరము నామోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా యాహరమును నిరాకరించినవారు కష్టముల పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారి బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మతగ్రంథముల నభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే అత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములుగాని, మనస్సుగాని, బుద్ధిగాని అత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు సహయము వలననే పొందనగును.

సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియ విద్యలను ప్రదర్శంచి పోయెడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహరు (మాలవాడు) వచ్చి జోహరు చేసి యీ సాయి "మాబాప్" (తల్లియు తండ్రియు) అనియు, వారు మన చావుపుట్టుకలను తుడిచివేయుదు రనియు చేప్పెను. గారడివాండ్రు, గుడ్డి వాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయము వారు, పగటి వేషములవారు కూడ అచ్చట సమాదరింప బడుచుండిరి. తనవంతు రాగా ఆ బంజార కూడ గాన్పించెను. తన పాత్రను ముగించెను. మన మిప్పుడింకొక కథను విందము.

గోఖలేగారి భార్య - ఊపవాసము

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట అత్మను శాంతింప చేయువలెను. కడుపులో తడి కలుగజేయు అహరము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతు నేకండ్లలో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము. ఏచెవులతో వానిని వినగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనముల నాచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. అహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడ మంచిది.

గోఖలే భార్య, కానిట్‌కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కరుకు జాబు తీసికొని శిరిడీకి వచ్చెను. అమె బాబా పాదముల వద్ద మూడురోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందురోజు కేల్కరుతో తన భక్తులను హొళీపండుగనాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా(తన) యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటిదినము అమె దాదాకేల్కరుతో పోయి బాబా వద్దకూర్చుండగా బాబావెంటనే యామెతో, "ఉపవాసము చేయవలసిన యవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము" అనెను. హొళీ పండుగ వచ్చెను. దాదాకేల్కరు భార్య బయటకు చేరెను. కేల్కర్ ఇంట్లో వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహ సయయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి!

బాబా సర్కారు

బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. "నా చిన్నతనములో భుక్తి కొరకు వెదకుచు బోడ్‌గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లికపని దొరికెను. శ్రమ యనక కష్టపడి పని చేసితిని. యజమాని నాపనికి సంతుష్టి చెందెను. నాకంటె పూర్వము ముగ్గురు కుఱ్ఱవాళ్ళు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు, రెండవానికి 100 రూపాయలు, మూడవవానికి 150 రూపాయలు, నాకీమూడు మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీత మిచ్చెను. నా తెలివితేటలు జూచి, యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని, నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను (తలపాగ, శెల్లా) వీనిని వాడకుండ జాగ్రత్తగ దాచుకొంటిని, మానవు డిచ్చినది త్వరలో సమసి పొవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి ’తే తే’ యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడును లేదు. నాసర్కారు యొక్క ఖజనా (అధ్యాత్మిక ధనము) నిండుగా నున్నది. అది యంచువరకు నిండి పొంగిపొవుచున్నది. నేను ’త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు, సుపుత్రుడైనవాడు ఈ ద్రవ్యము నంతయు దాచుకొనవలెను" అనుచున్నాను. "నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగుల భాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు నేను అతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదిరెండవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు