శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదితొమ్మిదవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదితొమ్మిదవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదితొమ్మిదవ అధ్యాయము 1. బాబా సంస్కృత పరిజ్ఞానము: భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము: 2. మహసమాధి మందిరనిర్మాణము


ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానా సహెబు చాందోర్కర్ చెప్పినదనియు ననుటచే, హేమడ్‌పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోను నొకే విషయ ముండుటచే రెండును నిందులో పొందుపరచడమైనది.

తొలిపలుకు

శిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు, తుదకు అక్కడనే మహసమాధి పొందిరి. శిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారికొరకే చాలా దూరమునుండి యచటకు వచ్చెను. మొదట శిరిడీ చాలా చిన్న గ్రామము. సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రస్థల మాయెను. అచట నుండు స్త్రీలు కూడ ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారి స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు తదితర గృహకృత్యముల చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారి చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనఃశాంతి కలుగ జేయుచుండెను.

బాబా చెప్పిన యర్ధము

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలో ఒక శ్లోకమునకు బాబా చక్కని యర్ధమును నానా సాహెబు చాందోర్కరుకు భోదించి అశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీసాయిలీల, సంపుటి-IV,పుట-563, ’స్పుటవిషయ’ నందు) వ్రాసినారు. వారు స్వయముగా నానా సాహెబు చందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తెలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను.

నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. అయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యనములతో చదివి యున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని, సంస్కతముగాని తెలియదని అయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులుగుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.


బాబా : నానా! యేమి గొణుగుచున్నావు? నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా : ఏ శ్లోకము? నానా : భగవద్గీతలోనిది. బాబా : గట్టిగా చదువుము. నానా : (భగవద్గీత 4-వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.) "తద్విద్ధి ప్రణీపాతేన పరప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః" బాబా : నానా! అది నీకు బోధపడినదా? నానా : అవును. బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవచేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానముగలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు. బాబా : నానా! శ్లోకము యొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము వ్యాకరణము, మరియు దాని యర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను. బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచొ చాలునా? నానా : ప్రణిపాత యను పదమున కింకొక యర్దము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగనమస్కారమని నాకు తెలియును. బాబా : పరిప్రశ్న యనగా నేమి? నానా : ప్రశ్నలడుగుట. బాబా : ప్రశ్న యనగా నేమి? నానా : అదే, అనగా ప్రశ్నించుట బాబా : పరిప్రశ్న యున్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయునచో, వ్యాసుడు "పరి’ యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా : పరిప్రశ్నయను మాటకు నాకితరయర్ధమేమియు తెలియదు. బాబా : సేవ యనగా నెట్టిది? నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా : అట్టి సేవ చేసిన చాలునా? నానా : సేవయను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచట లేదు. బాబా : రెండవ పంక్తిలోని "ఉపదేక్ష్యంతి తే జ్ఞానం" అనుదానిలో జ్ఞానమును పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించగలవా? నానా : అవును బాబా : ఏ పదము? నానా : అజ్ఞానము బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించొనచో, ఈ శ్లోకములో నేమైన అర్థము గలదా? నానా : లేదు; శంకరభష్య విధముగా చెప్పుట లేదు. బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము, అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్థము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన అక్షేపణ కలదా? నానా : అజ్ఞానమును పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్త్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ-చేయుయని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా : అవును, అతడు తత్త్వదర్శీయే, కాని అర్జును నితరజ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచటలేదు. బాబా : నీకది బోధపడలేదా?


నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను. 2. ఊరిక ప్రశ్నించుట చాలదు. దుర్భుద్ధితోగాని, దొంగయెత్తుతోగాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితోగాని యడుగకూడదు. నిజముగా తెలిసికొని దానిచే మోక్షము పొందుటకు గాని, అధ్యాత్మికాభివృద్దికిగాని యడుగవలెను. 3. సేవ యనగా ఇష్టమున్నచొ చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే యభిప్రాయములో చేయునది సేవకాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు, వారి సేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును.

గురువజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు.

బాబా: జ్ఞానము ఉపదేశమెట్లగును? అనగా సాక్షాత్కారము బొధించుట యెట్లు? ఆజ్ఞానము నశింపజేయుటయే జ్ఞానము.

జ్ఞానేశ్వరమహరాజు ఇట్లు చెప్పియున్నారు. "అజ్ఞానమును తొలిగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానము నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతము నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెదమనగా, అద్వైతము గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలననినచో, ద్వైతమను భావమును మనలోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతమును గుర్చి మాట్లాడగలవా రెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లు తెలియను? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, అశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు, వారు మానవాకారమున అవతరించుట, జగత్తును, మానవాళిని ఉద్దరించుటకు మాత్రమే. దానివలన వారి యసలయిన నిర్గుణస్వభావము కొంచెము గూడ వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము తానే శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు "నేను సామాన్య నికృష్టజీవుడను" అనుకొనుచు. గురువు ఈ యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించ వలెను. ఎన్నో జన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొనె శిష్యునికి గురువు ’నీవే దైవము, శక్తి యుతుడవు, ఐశ్వర్యశాలివి" అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నితాంతభ్రమ అనేకజన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించిన యజ్ఞానలక్షణములు:

1. నేను జీవిని (ప్రాణిని). 2. శరీరమే యాత్మ (నేను శరీరమును). 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. 4. నేను దేవుడను కాను. 5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట. 6. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.

ఈ తపులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యనుసంగతి గ్రహింప జాలడు. ఈ సంగతులను భోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును నశింపజేయుటకొరకే. బాబా యింకను ఇట్లనెను:

1. ప్రణిపాత మనగా శరణాగతి చేయుట. 2. శరణాగతియనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట. 3. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానుల నాశ్రయించు మననేల?

సద్భుక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును, భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగనే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, అత్మలగాను భావించును. ఇటువంటి భక్తులు, గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి యుండుటచే, వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. ఆట్టివారి గొప్పతనము హెచ్చి యందరికి తెలియవలెననియే కృష్టుడట్లు పేర్కొనెను.

సమాధిమందిర నిర్మాణము

బాబా తాను చేయు నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమి సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పిరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము.

నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపూసాహెబు బూటీ శిరిడీలో సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళు పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడ అట్టి దృశ్యము గనిపించెను. బాపూసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. "బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడను నిర్మింపుము. నేను అందరి కొరికలను నెరవేర్చుద ననెను. బాబా ప్రేమమధురమైన పలుకులు విని, భావావేశమున మైమరచితిని; నాగొంతుకు యార్చుకొనిపోయెను. నాకండ్లనుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని." వారిద్దరి దివ్యస్వప్నము ఒకటే యయినందులకు బాపూసాహెబు బూటీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు(శ్యామా) సహయముతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబు దీక్షీత్ దాని యామోదించెను. దానిని బాబా ముందర పెట్టగా, బాబా కూడ వెంటనే యామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరిగృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబా కూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపూసాహెబు జోగును చూడమనిరి. అది నిర్మించునప్పుడు, బాపూసాహెబు బూటీకి ఒక యాలోచన కలిగెను. చుట్టూ గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీకృష్ణుని) ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకీ సంగతి తెలియజేసి వారి యభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పొవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి "దేవాలయము పూర్తికాగానే నేనే యిచ్చట నివసించుటకు వచ్చెదను" అని వాడావయిపు జూచుచు "వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందర మచ్చట నుందము. అందరు కలసి మెలసి యాడుకొందాము. ఒకరి నొకరు కౌగలించుకొని సంతోషముగా నుండవచ్చును" అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా అని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్దికాలములో పని పూర్తి యాయెను. మురళీదర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి.

అది తయారు కాకమునపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపూసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందక ముందు "నన్ను రాతి వాడాలో నుంచుడు!" అన్నట్టి పలుకులు బాపూసాహెబుకే గాక యందరికి ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్రశరీరమును మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుడు కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధిమందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్రజీవితము లోతును కనుగొన శక్యముగాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి యగుటచే బాపూసాహెబ్ బూటీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.


శ్రీ సాయినాథాయ నమః ముప్పదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు