శ్రీ సాయిసచ్చరిత్రము /పదునైదవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (పదునైదవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము పదునైదవ అధ్యాయము నారదీయకీర్తనపద్ధతి; చోల్కరు చక్కెరలేని టీ; రెండు బల్లులు


ఆరవ అధ్యాయములో శిరిడీలో జరుగు శ్రీరామనవమి యుత్సవమెట్లు ప్రారంభమయ్యెను? అ సమయములో హరిదాసును దెచ్చుట యెంత కష్టముగ నుండెడిది? తుదకు ఆ పనిని దాసగణు మహరాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగణు జయప్రదముగా నడుపుట యనునవి చదువరులు జ్ఞాపకముంచుకొనియే యుందురు. ఈ అధ్యాయములో దాసగణు హరికథల నెట్లు చెప్పువారో వర్ణింతును.

నారదీయకీర్తనపద్ధతి

సాధారణముగ మహరాష్ట్రదేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసికొనెదరు. తలపైని పాగా గాని, పేటా (ఒక విధమైన యెఱ్ఱని మహరాష్ట్రపు టోపి) కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన నుత్తరీయము, మామూలుగా ధరించెడి ధోవతి కట్టుకొనెదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి, శిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణు తయారయ్యెను. బాబా సెలవు పొందుటకై మసీదుకు బోయెను. బాబా అతనితో, "ఏమాయ్, పెండ్లికొడుకా! ఇంత చక్కగ ముస్తాబై యెక్కడకు పోవుచున్నవు?" అనెను. హరికథ చెప్పుటకు పొవుచున్నానని దాసగణు జవాబిచ్చెను. అప్పుడు బాబా యిట్లనెను. "దానికి ఈ దుస్తులన్ని యెందుకు? కోటు, కండువా, టోపి మొదలగునవి ముందర వెంటనే తీసి పారివేయుము. శరీరముపై యీ అలంకారాలన్నీ యెందుకు>" వెంటనే దాసగణు వానినన్నిటిని తీసి బాబా పాదముల వద్ద నుంచెను. అప్పటినుంచి హరికథ చెప్పునప్పుడు వానిని దాసుగణు యెన్నడు ధరించలేదు. నడుము మొదలు తలవరకు ఏమియు వేసికొనెడి వాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించెడివాడు. ఇది మహరాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించు పద్దతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైని, శరీరముపైన ఏమియు తోడిగేవారు కారు. చేతి యందు వీణను ధరించి యొక చోటునుంచి యింకొక చోటికి హరినామసంకీర్తన చేయుచు పోవువారు.

చోల్కరు చక్కెరలేని తేనీరు

పూనా అహ్మదునగరు జిల్లాలలో బాబాను గూర్చి యందరికి తెలియునుగాని , నానాసాహెబు చాందొర్కరు ఉపన్యాసముల వల్లను, దాసగణు హరికథలవల్లను బాబా పేరు కొంకణదేశమంతయు ప్రాకెను. నిజముగా దాసుగణు తన చక్కని హరికథలవల్ల బాబాను అనేకులను పరిచయ మొనర్చెను. హరికథల వినుటకు వచ్చినవారికి అనేకరుచులుండును. కొందరు హారిదాసుగారి పాండిత్యమునకు సంతసించెదరు; కొందరు వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హస్యము, చమత్కారము, సంతసము గలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంతవిషయములు వినుటకు కొందరు; అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చినవారిలో చాల కొద్దిమంది మాత్రమే భగవంతునియందుగాని, యోగులయందుగాని, ప్రేమవిశ్వాసములు కలుగును. కాని దాసగణుయొక్క హరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతిసమ్మోహనకరముగా నుండెను. ఇచ్చట నొక యుదాహరణము నిచ్చెదము.

ఠాణాలో నున్న కౌపీనేశ్వరాలయములో ఒకనాడు దాసగణు మహరాజ్ హరికథ చెప్పుచు సాయి మహిమ పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ యనునతడుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసగణు కీర్తన నతి శ్రద్డగా వినెను. వాని మనస్సు కరగెను. వెంటనే అక్కడక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మ్రొక్కుకొనెను. "బాబా! నేను పేదవాడను, నాకుటుంబమునే నేను పోషించుకొన లేకున్నాను. మీ యనుగ్రహముచేత సర్కారువారి పరీక్షలో నుత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను శిరిడీకి వచ్చెదను. నీ పాదములకు సాష్టాంగనమస్కారము చేసెదను. నీ పేరున కలకండ పంచి పెట్టుదను." బాబా కృపచే చోల్కరు పరీక్షలో ప్యాసయ్యెను. స్థిరమైన యుద్యోగము దొరకెను. కనుక మ్రొక్కు చెల్లించవలసిన భాద్యత ఎంత త్వరగా తీర్చినచోనంత బాగుండననుకొనెను. చోల్కరు బీదవాడు. వాని కుటుంబము చాల పెద్దది. కనుక శిరిడీయాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను. ఎవరైన పర్వతశిఖరనైన దాటవచ్చునుగాని, బీదవాడు తన యింటి గడుపనే దాటలేడనిగదా లోకోక్తి!

చోల్కరు కెటులైన శ్రీసాయి మ్రొక్కును త్వరలో చెల్లించవలెనని యాతురత గలిగెను. కావున తన సంసారమునకగు ఖర్చులను తగ్గించి కొంతపైకమును మిగుల్చవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చక్కెరను మాని యా మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించెను. ఇవ్విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట, శిరిడీ వచ్చిబాబా పాదములపై బడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించెను. తాను మ్రొక్కుకన్న ప్రకారము కలకండ పంచి పట్టెను. తన మనసులోనీ కోరికలన్నియు అనాడు నెరవేరినవనియు, తనకు యెంతయో తృప్తిక నున్నదనియు బాబాతో చెప్పెను. చోల్కరు బాపూసాహెబు జోగు గృహమందు దిగెను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలువగా బాబా జోగును బిలిచి యిట్లనెను. "నీయతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి యిమ్ము!" ఈ పలుకులలోని భావము గ్రహించినవాడై, చోల్కరు మనస్సు కరిగెను. అతడాశ్చర్యమగ్ను డయ్యెను. వాని కండ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై బడెను. జోగు కూడ ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర యెక్కువగా కలుపుట యనుదాని భావము ఏమైయుండునా యని యోచించెను. బాబా తన పలుకులచే చోల్కరు మనస్సునందు భక్తి, నమ్మకములను కలుగుజేయవలెనని యుద్దేశించెను. వాని మ్రొక్కు ప్రకారము తనకు రావలసిన కండచక్కెర ముట్టినదనియు, తేయాకునీళ్ళులో చక్కెర నుపయోగించక పోవుటయను రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనె ననియు చెప్పెను. బాబా యిట్ల చెప్పనుద్డేశించెను. "నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోట పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీ హృదయమునందె గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు; అదృష్టవంతులు.’

బాబా చోల్కరు కెంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించెనో గదా!

రెండు బల్లులు

ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని యుండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని యుండెను. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికెను. కుతూహలమునకై యాభక్తుడు బల్లి పలికిన దాని కర్ధమేమని బాబా నడిగెను. అది శుభశకునమా, లేక యశుభమా యని ప్రశ్నించెను. తన చెల్లెలు ఔరంగాబాదునుండి తనను చూచుటకు వచ్చునని యా బల్లి యానందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండెను. బాబా పలికినదానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగబాదునుండి యెవరో గుఱ్ఱముపై బాబా దర్శనమునకై శిరిడీకి వచ్చిరి. అతడింకను కొంతదూరము పోవలసియుండెను. కాని వాని గుఱ్ఱము అకలిచే ముందుకు పోలెకుండెను. గుఱ్ఱమునకు ఉలవలు కావలసియుండెను. తన భుజముపై నున్న సంచిని తీసి ఉలవలు తీసికొనివచ్చుటకై పోవునప్పుడు దానిలో నున్న ధూళిని విదిలించెను. అందులో నుండి యొక బల్లి క్రిందపడి యందరు చూచుచుండగా గోడనెక్కెను. ప్రశ్నించిన భక్తున కదంతయు జాగ్రత్తగా గమనించుమని బాబా చెప్పెను. వెంటనే యా బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను. చాలకాలము పిమ్మట అక్కచెల్లెండ్రు కలసికొనిరి. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దిడుకొనిరి. గుండ్రముగా తిరుగుచు నధికప్రేమతో నాడిరి. శిరిడీ యెక్కడ? జౌరంగాబాదెక్కడ? గుఱ్ఱపు రౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసికొని శిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే యిద్దరు అక్కచెల్లెండ్రు కలియుదురని బాబా ముందుగానే యేట్లు చెప్పగలిగెను? ఇది యంతయు బహుచిత్రముగా నున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది.

ఉత్తర లేఖనము

ఎవరయితే యీ అధ్యాయమును భక్తి శ్రద్దలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నియు శ్రీసాయినాథుని కృపచే తొలగును.



శ్రీ సాయినాథాయ నమః పదునైదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు

రెండవరోజు పారాయణము సమాప్తము