శ్రీ సాయిసచ్చరిత్రము /నలుబదియొకటవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (నలుబదియొకటవ అధ్యాయము)



శ్రీ సాయిసచ్చరిత్రము నలుబదియొకటవ అధ్యాయము 1. చిత్రపటము యొక్క వృత్తాంతము 2. గుడ్డపీలికలను దొంగిలించుట 3. జ్ఞానేశ్వరి పారాయణము.


గత అధ్యాయములొ చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతము చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్, హేమడ్‌పంతుని కలసి ఈ దిగువ కథ నతనికి జెప్పెను.

ఒకనాడు బొంబాయి వీథులలో బోవునప్పుడు. వీథిలో తిరిగి యమ్మువానివద్ద అలీమహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి, తన బాంద్రా యింటిలో గోడకు వ్రేలాడ దీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమడ్‌పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలో నున్న తన బావమరిదియగు నూర్‌మహమ్మద్ పీర్‌భాయి యింటిలో పడియుండెను. బాంద్రాలో తన యిల్లు 3 మాసములవరకు మూయబడి యుండెను. అక్కడ ఎవ్వరును లేకుండిరి. అచ్చట ప్రసిద్ద జెందిన అబ్దుల్‌రహమాన్ బాబా, మౌలానాసాహెబు, మహమ్మద్ హూసేను, సాయిబాబా, తాజూద్దీన్ బాబా మొదలగు (సజీవ) యోగుల పటము లుండెను. వానిని కూడ కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటము లేల బాధపడవలెను? పటములకు గూడ చావుపుట్టుక లున్నట్లుండెను. పటములన్నియు వానివాని యదృష్టము లనుభవించెను; కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొన గలిగెనో నాకింతవరకెవరు చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి యనియు, సర్వవ్యాపి యనియు ననంతశక్తుడనియు దెలియుచున్నది.

అలీమహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హూసేన్ థారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్‌భాయికి ఇచ్చెను. అది యతని టేబిల్‌లో 8 సంవత్సరములు పడియుండెను. ఒకనాడు అతడు దాని జూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసికొనిపోయి సజీవప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచి పెట్టెను. అందులో నొకటి అలీమహమ్మద్ కిచ్చెను. దాని నతడు తన బాంద్రా యింటిలో బెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమ్మన్‌గారి శిష్యుడు. గురువు నిండు దర్చారులో నుండగా నతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కోట్టబొయి నూర్ మహమ్మదు నచటినుండి తరిమి వేసిరి. అతడు మిగుల విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెనుగదా యని చింతించెను. విగ్రహరధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి, ఒక పడవను అద్దెకు గట్టించుకొని సముద్రములోనికి పోయి, దాని నక్కడ నీళ్ళలో ముంచివేసెను. తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను తెప్పించి ( 6 పటములు) వాని కూడ బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీమహమ్మద్ తన బావమరది యింటిలోనుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరది చెప్పెను. ఇది విని అలీమహమ్మద్ తన మేనేజరను బాంద్రా యింటికి పంపి యక్కడున్న పటముల నన్నింటిని సముద్రములో వేయించెను.

రెండునెలల పిమ్మట అలీమహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబాపటము ఎప్పటివలె గోడమీడ నుండుట గమనించి యాశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్ని దీసివైచి బాబా పటము నెట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్న తన బావగారు దానిని చూచినచొ దానిని కూడ నాశనము చేయునని భయపడెను. దాని నెవరికివ్వలెను? దానిని నెవరు జాగ్రత్త పరచెదరు? దానిని భద్రముగా నెవరుంచగలరు? అను విషయముల నాలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ముముజావర్‌ను కలసి వారి యభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచునట్లు చేసెను. అలీమహమ్మద్ ఇస్ముముజావర్‌ను కలసికొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా అలోచించి యాపటమును హేమడ్‌పంతు కివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమడ్‌పంతు వద్దకు బోయి సరియైన కాలములో దానిని బహూకరించిరి.

ఈ కథను బట్టి బాబాకు భూతభవిష్యద్వర్తమానములు తెలియుననియు, చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు నెట్టుల నెరవేర్చుచుండెనో కూడ తెలియచున్నది. ఎవరికయితే అధ్యాత్మికవిషయములలో నెక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాకా వారి కష్టములను తొలగించి వారిని అనందభరితులుగా జేయుచుండిరని రాబోవు కథవలన తెలియును.

గుడ్డపీలికలను దొంగిలించుట - జ్ఞానేశ్వరి చదువుట

బి.వి.దేవు దహనులో మామలతదారు. అతడు జ్ఞానేశ్వరిని. ఇతరమత గ్రంథములను చదువవలెనని చాలకాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాటి భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో నొక యధ్యాయమును ఇతరగ్రంథములనుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగనే ఏవో అవాంతరము లేర్పడుటచే పారాయణ మాగి పొవుచుండెను. మూడు నెలలు సెలవు పెట్టి శిరిడీకి వెళ్ళి యక్కడనుంది తన స్వగ్రామమగు పౌండుకు బోయెను. ఇతరగ్రంథములన్నియు నచట చదువగలిగెను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగనే యేమో విపరీతమైన చెడ్డయాలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదువులేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడ చదువలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగ జేసినప్పుడే, దాని చదువుమని వారి నోటివెంట వచ్చినప్పుడే, దానిని ప్రారంభించెదననియు అంతవరకు దానిని తెరువననియు, నిశ్చయము చేసికొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబసహితముగా శిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబు జోగ్, దేవుగారి నడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు, కాని దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా యాజ్ఞపించినచో దానిని ప్రారంభించెదననియు చెప్పెను. అప్పుడు జోగ్, ఒక పుస్తకము దీసికొని బాబా కిచ్చినచో, దానిని వారు తాకి పవిత్రము చేసి యిచ్చెదరనియు అప్పటినుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహ నిచ్చెను. బాబాకు తన యుద్దేశము తెలియును గనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరిక గ్రహించలేరా? దానిని పారాయణ చేయుమని సృష్టముగా నాజ్ఞాపించలేరా? యనెను.

దేవు బాబాను దర్శించి, ఒక రూపాయి దక్షిణ నిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ యడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలసికొని యతడు బాబాయందు భక్తిని వారి యనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు దెలిపెదనని యతడు బదులిచ్చెను. అ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి యుండుటచే దేవు ఒక మూలకు బోయి కూర్చుండెను. బాబా అతనిని బిలచి శాంతముగా తన దగ్గర కూర్చొనుమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్నహారతి పిమ్మట భక్తులందరు పోయిన తరువాత దేవు, బాలకరాముని జూచి యాతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా యాతనికేమేమి చెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పిరో యని యడుగా బాలాకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగభక్తుని బంపి దేవుని తీసికొని రమ్మనెను. దేవు బాబా వద్దకు బోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా యడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తిని వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు దీసికొనిపోయి స్తంభము వద్ద కూర్చుండి. "నా గుడ్డ పీలకలను నాకు దెలియకుండ దొంగిలించితి వేల?" యనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికలగూర్చి యేమియు తెలియదనెను. బాబా యతనిని వెదకుమనెను. అతడు వెదకెను. కాని యచ్చట ఏమియు దొరకలేదు. బాబా కోపగించి యిట్లనెను. "ఇక్కడ ఇంకెవ్వరు లేరు. నీ వొక్కడవే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికి ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా?" యని కోపగించెను. బాబా మతిచెడినవానివలే తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలుకూడ తినునేమో యనుకొనెను. ఒక గంట తరువాత బాబా యతనిని వాడాకు వెళ్ళు మనెను. దేవు అచ్చటకేగి జరిగినదంతయు జోగుకు, బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలము మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవును రమ్మనెను. "నా మాటలు వృద్ధుని బాధించి యుండవచ్చునుగాని, యతడు దొంగిలించుటచే నేనట్లు పలుకవలసి వచ్చె" నని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ ఆడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి, సాష్టాంగనమస్కారము చేసెను. బాబా యిట్లనెను. "ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము. పోయి వాడాలో కుర్చుండుము. ప్రతి నిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. నేను నీకు జల్తారు సెల్లా నిచ్చుటకు ఇచట కూర్చునియున్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేల? నీకు దొంగతనమునకు అలవాటు పడవలెనని యున్నదా?"

బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని యాజ్ఞాపించె ననియు, తనకు కావల్సినదేదొ యది దొరికెననియు, అప్పటినుండి తాను సులభముగా చదువగల ననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చెను. తాను శరణువేడెను కనుక తనను బిడ్డగానెంచి, జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించుట యనగా నేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డపీలికలు దొంగిలించుట. బాబా కట్టి వైఖరి యిష్టము లేదు. ఏ ప్రశ్నకైన సమాధనము ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరుల నడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే నతని బాధించి చికాకు పెట్టెను. అదియునుగాక యితరుల నడుగకుండ బాబానే సర్వము అడిగి తెలిసికొనవలయు ననియు, నితరులను ప్రశ్నించుట నిష్ప్రయోజన మనియు చెప్పెను. దేవు ఆ తిట్లను అశీర్వాదముగా భావించి సంతుష్ఠితో ఇంటికి బోయెను. అ సంగతి యంతటిలో సమాప్తి కాలేదు. బాబా చదువుమని యాజ్ఞాపించి ఊరుకొనలేదు. ఒక సంవత్సరము లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని యభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేది గురువారము ఉదయము బాబా స్వప్నములో సాక్షాత్కారించి పై అంతస్తులో కూర్చుంది "జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా?" యని యడిగెను. "లేదు" అని దేవు జవాబిచ్చెను.

బాబా : ఇంకా యెప్పుడు తెలిసికొనెదవు? దేవు కండ్ల తడిపెట్టుకొని "నీ కృపను వర్షింపనిదే పారాయణము చికాకుగా నున్నది. బోధపడుట చాలా కష్టము నున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను." అనెను. బాబా : చదువునప్పుడు, నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము. నా సముక్షమున చదువుము. దేవు : ఏమి చదువవలెను? బాబా : అధ్యాత్మ చదువుము. పుస్తకము తీసికొని వచ్చుటకు దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరెచెను. ఈ దృశ్యమును జూచిన పిమ్మట దేవుకెంత యానందము, సంతోషము కలిగెనో చదువరలే గ్రహింతురు గాక!


శ్రీ సాయినాథాయ నమః నలుబదియొకటవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు