శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదియైదవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదియైదవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదియైదవ అధ్యాయము దాము అన్నా కాసార్ (అహమదునగర్) - సట్టా వ్యాపారము - మామిడి పండ్ల లీల


భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడను, మహయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు సాయినాథునకు సాష్టాంగనమస్కారము లొనర్చి ఈ అధ్యాయమును ప్రారంభించెదము. యోగిచూడామణియగు శ్రీసాయినాథమహరాజుకు జయమగు గాక! సమస్తశుభములకు నిలయము, మన అత్మరాముడు, భక్తులపాలిటి అశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్ణలు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణభక్తి యున్నప్పుడు వాని కోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమడ్‌పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయ కోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమడ్‌పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ది, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు అశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్దమైనది. అది యొక చంద్రకాంతమణి వంటిది. దానినుండి సాయిలీలలను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.

భక్తునకు సాయియందు పరిపూర్ణమైన, హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖములనుండి అపాయములనుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్‌నగరు నివాసియగు (ప్రస్తుతము పూనావాసి) దామోదర్ సావల్ రాం రాసనే కాసార్ వురుఫ్ దాము అన్నా కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా (దామోదర్ సావల్‌రాం రాసనే)

6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్చమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామునవమినాడు ఉరుసు యుత్సవము ప్రారంభించినప్పుడు శిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సహమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టి వ్యాపారము: 1. ప్రత్తి

బొంబాయి స్నేహితుడొకడు దామ్ అన్నాకు, ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు రెండులక్షలు సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియుఅతడు వ్రాసెను. దాము అన్నా యా బేరమును చేయుటయా? మానుటయా? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండెను. దాని గూర్చి బాగుగ అలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామ కొక జాబు సవివరముగ వ్రాసి బాబా నడిగి వారి సలహను తెలిసికొనుమనెను. అ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందర బెట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను? శ్యామా అహమద్‌నగరు నుండి దాము అన్నాయేదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా యిట్లనెను." ఏమి వ్రాయుచున్నాడు? ఏమి యెత్తు వేయుచున్నడు? భగవంతుడిచ్చినదానితో సంతుష్టిజెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము" బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొనివచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను. కొందరిని లేఖాల రూపముగాని తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్న్నవు?" అనెను. బాబా "ఓ శ్యామా! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు?" అనెను.

అప్పుడు శ్యామా ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనెను. "సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రోట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు అయాసపడవద్దని చెప్పుము." శ్యామా జవాబు పంపెను. దానికొరకు కాతురతో దాము అన్నా కనిపెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైనదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా శిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే శిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానములు కూడ బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్ర లిచ్చును. తీపి వస్తువులు అరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్దిచేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగ తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. " ప్రపంచ విషయములో తగుల్కొనుటకు నా కిష్టము లేదు." బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము

పిమ్మట దాము అన్నా ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ యాలొచనకూడ బాబా గ్రహించి "నీవు 5 సేర్లు చొప్పున కొని 7 సేర్లు చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను" మనెను. కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షముల విశేషముగా కురిసెను. ధరలు హఠత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువచేసిన వారెల్ల నష్టపడిరి. ఈ దురుదృష్టమునుండి దాము ఆన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టి వ్యాపారము కూడ కూలిపోయెను. అ దళారి ఇంకొక వర్తకుని సహయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు.

అమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము

ఒకనాడు 300 మామిడపండ్ల పార్సెలు వచ్చెను. రాళేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరుచున్నప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధినములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో(కుండలో) పెట్టెను. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె"ననెను.

దాము అన్నాకు ఇద్దరు భార్యలు గలరు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జోతిష్యులను సంప్రదించెను. అతడు కూడ జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహప్రభవ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనికొనెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండు గంటలకు అతడు శిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పొగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లపైపు చూచుచున్నరు కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను." దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి(బాబా ముఖ్యభక్తుడు) దాని నిట్లు సమర్థించెను. "చావనునది యహంకారమును గూర్చి. దానిని బాబాయందు చంపుట యొక యాశీర్వదాము." బాబా యతనితో నిట్లనియె: "నీవు తినవద్దు, నీ చిన్న భార్య కిమ్ము. ఈ యామ్రలీల అమెకు నలుగురు కొడుకులను, నలుగురు కుమార్తెలు ప్రసాదించును." దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్యుని మాటలు ఉత్తవాయెను.

బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి మాహత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా యిట్లనెను "సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను శరణుజొచ్చినవారితో నా సమాధి కూడ మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను మీవద్ద నుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుకొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు!" హేమాడ్‌పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు.

ప్రార్థన

"ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమన్నటికి మరగకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనియకుండ యడ్డుకొనుము. మాదృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పొవు నైజము నాపనంతవరకు అత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకుగాని, భార్యగాని, స్నేహితుడుగాని యుపయోగపడరు. నీవే మాకు అనందమును, మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక. మా యాలోచనలను అవి మంచివే యగుగాక చెడ్డవే యగుగాక తరిమి వేయుము. మాగృహములను శరీరమును మరచునట్లు జేయుము. మా యహంకారము నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తియిందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరుచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో యా యజ్ఞానాంధకారము నిష్ర్కమించును. నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీకటాక్షము చేతను గతజన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."

నోటు:- దాము అన్నా యిచ్చిన వాజ్ములము ఈ సందర్భమున గమనింప దగినది.

ఒకనాడనేకమందితో నేను గూడ బాబా పాదముల వద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సు రెండు సంశయములు కలిగెను. ఆ రెండిటికి బాబా యిట్లు జవాబిచ్చెను.

1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరు బాబావలన మేలు పొందెదరా?

దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్టు వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును.

2. ఇది నాగురించి యడిగినది. బాబా భౌతికశరీరము విడచిన పిమ్మట నా జీవితమనే ఓడ నెట్లు నడుపగలను? అది యెటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి యేమి?

దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. "ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను." 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలిసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి.

నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పాకులకర్ణి యింటిలో బొబ్బట్లుతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నాయింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంవత్సరముల నుండి యొక స్నేహితుడుండెను; అతడు నాభార్య యొక్క నగలపెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫోటో ముందేడ్చితిని. ఆ మరుసటి దినమే యా మనిషి నగల పెట్టెను తిరిగి యిచ్చి వేసి. క్షమాపణ కోరెను.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదియైదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు