శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదియెనిమిదవ అధ్యాయము

'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదియెనిమిదవ అధ్యాయము )


శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదియెనిమిదవ అధ్యాయము బాబా తన భక్తులను శిరిడీకి రప్పించుకొనుట 1. లక్షీచంద్ 2. బురహాన్‌ఫూరు మహిళ 3. మేఘశ్యాముడు - మొగు వారి అనుభవములు.


శ్రీసాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, అత్మసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండీంటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించుకొనుటకు సమర్ధులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మాసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరికంటె దయార్ద్ర హృదయులు.

సాయిబాబా యనేకసారు లిట్లు నుడివిరి. "నా మనుష్యుడు ఎంత దూరము నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమును నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టి యీడ్చినటుల అతనిని శిరిడీకి లాగెదను". అటువంటి మూడు పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందుము.

1. లాలా లక్ష్మీచంద్

అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీవెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్సు కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజులో, క్రిస్‌మస్ పండుగకు ఒకటి రెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడి యున్నట్లు చూచెను. కొన్నాళ్ళు తరువాత దాసగణు కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తత్రేయ మంజునాథ్ బిజూర్ యింటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగణు బాబా పటమును సభలో పెట్టుట మాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను. పటము, దాసగణు కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసగణు చెప్పుచున్న హరికథ) ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్ శిరిడీ పొవుటకు కువ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదకుటలోను అధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహయపడు ననునది భక్తుల యనుభవమే. అనాటి రాత్రి 8గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి శిరిడీకి వచ్చెదవాయని యడిగెను. అతని యానందమున కంతులేకుండెను. శిరిడీకి పొవెలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన యేర్పటులన్నియును జేసికొనిన పిమ్మట శిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును, స్నేహితుడగు శంకరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణీకుల నడిగిరి. చాలా సంవత్సరములనుంచి శిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్‌గాం రాగానే అతడు బాబా కొరకు జామపండ్లు కొనవలె ననుకొనెను. కాని యా విషయము మరచెను. శిరిడీ సమీపించుచుండగా వారికీ సంగతీ జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్లు గంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండినాపి కొన్ని యెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లు కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామపండ్లు కొనవలె ననుకొనుట, ఆ విషయము మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి అశ్చర్యమును కలుగుజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి శిరిడీ చేరెను. వారు మసీదుపయి జండాలను చూచి నమస్మరించిరి. పూజాసామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను యుచితరీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను జూచి చాలా సంతసించెను. సువాసనగల తామరవువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా యిట్లనెను. "టక్కరి వాడు! దారిలో భజన చేయును. నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరుల నడుగనేల? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరుల నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మార్వడివద్ద 15 రూపాయల అప్పు తీసికొని శిరిడీ దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక యిప్పుడయిన నెరవేరినదా?’

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునుకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవి అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పొవుటకు గాని అప్పు చేయరాదని బాబా యభిప్రాయము.

సాంజా(ఉప్మా)

మధ్యాహ్నభోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను. కాని యెవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను. మూడవరోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్ యేమి నైవేద్యము తీసికొని రావలెననిబాబను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు రెండు కుండల నిండ సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా యిట్లునెను. "నీవు అకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదయిన జౌషధము తీసికొనుము." బాబా తన మనస్సును కనుకొనెనని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్యపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు.

దోషదృష్టి

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగిన దనుకొనెను. అ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో నిట్లనియె. "ఎవరిదో దోషదృష్టి నాపయిపడుటచే నేను బాధపడుచున్నాను." ఇట్లు లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది యంతయి బాబా వెల్లడి చేయుచుండెను.

ఈ విధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపై బడి "మీ దర్శనమువలన నేనంతో సంతోషించితిని. ఎల్లప్పుడు నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప యితరదైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి జెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచభాధలనుండి కాపాడుదురుగాక! నేనెల్లప్పుడు మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాక!" యని ప్రార్థించెను.

బాబా యాశీర్వాదమును, ఊదీప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. శిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను.

2. బురహాన్‌పూరు మహిళ

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము, బురహాన్‌పూరులో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు ’కిచిడీ’ కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమును చాలా సంతసించి అమె యందరికి తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు శిరిడీకి పోవనిశ్చయించుకొని ఒక శుభదినమందు శిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి శిరిడీ చేరి, అచట రెండు మాసములుండిరి. ప్రతి రోజు మసీదుకు బోయి బాబాను దర్శించి, పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని శిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజుల వరకు తటస్థించలేదు. అమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు అమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదుతో నందరు భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసియుండెను. తెరవేసియుందునప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను. అమె కిచిడీ యచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా యాతురత జూచి యందరు అశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్న వారు బాబాకు తన భక్తులపై అసాధారణప్రేమ యుండుననుటను విశ్వసించిరి.

3. మేఘశ్యాముడు

ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్‌గాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాఠేగాని వంట బ్రాహ్మణడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి (’ఓం నమశ్శివాయ’) జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని, గాయత్రీ మంత్రముగాని తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ద గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని యవతారమని సాఠే అతనికి బోదించి శిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘడు శిరిడీకి పోయితీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము శిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. శిరిడీచేరి మసీదుకు పోగాబాబా కోపించి అతనిని లోపలకు రానీయక, "ఈ వెధవను తన్ని తరిమి వేయుడు!" అని గర్జించి మేఘనిలో నిట్లనెను. "నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో నీ కులము పొవును, కనుక వెడలిపోమ్ము!" ఈ మాటలు విని మేఘడు వణక నారంభించెను. అతడు తన మనస్సులో నున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను. కొన్ని దినము లచటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని యతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి పోయెను. అక్కడనుండి త్ర్యంబక్ (నాసిక్ జిల్లా) పోయి యచట ఒక సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి శిరిడీకి వచ్చెను. ఈ సారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, శిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలుచేసెను. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘడు ప్రతిరోజు మైళ్ళకొలది నడచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతలందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజ అంగీకరించక తిరిగి పంపివేసెను. ఖండోబా మందిరము వాకిలి తెలిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను.

గంగాస్నానము

ఒక మకరసంక్రాంతినాడు మేఘడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో నభీషేకము చేయదలచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని యతడనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసులు దూరము నడచి గోమతీనదీ తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము దెచ్చి, యత్నము లన్నియు జేసికొని, బాబావద్దకు 12 గంటలకు వచ్చి, స్నానమునకు సిద్దముగా నుండుమనెను. బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరుగుటచే గంగానదీజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషేకమిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభీషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. "ఓ మేఘా! ఈ చిన్న యుపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పొసి నట్లగును." అట్లనే యని మేఘశ్యాము డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి పారవశ్యమున ’హరగంగే, హరగంగే’ యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. కుండ నొక ప్రక్కకు బెట్టి బాబా వయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.

త్రిశూలము, లింగము

మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబు చాందోర్కరిచ్చిన పటమున పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువఝామున మేఘుడు తన శయ్యపయి పండుకొని కండ్లు మూసి యున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును జూచెను. బాబా అతనిపై యక్షతలు చల్లి ’మేఘా! త్రిశూలము గీయము!" అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేఘడు బాబా మాటలు విని, యాతురతగా కండ్లు దెరచెను. బాబా కనిపించలేదు గాని, యక్షత లక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశులమును గీయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను: "నా మాటలు వినలేదా? త్రిశూలము గీయమంటిని. అది దృశ్యము కాదు స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు. అర్థవంతములు." మేఘుడిట్ల పలికెను. "మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి యుండుటచే యది దృశ్యమను కొంటిని." బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను: "ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను." మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎఱ్ఱరంగుతో గీసెను. అ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచ్చటకు వచ్చెను. బాబా యిట్లనెను "చూడు శంకరుడు వచ్చినాడు! జాగ్రత్తగ పూజింపుము!" మేఘుడు త్రిశూలము గీసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షీత్ దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్దిరోజులలో త్రిశూలము వ్రాయుట పూర్తికాగా బాబా, మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్దపటము వద్ద లింగము ప్రతిష్టించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాల ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి, లింగమును ప్రతిష్టించుట ద్వారా బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేకసంవత్సరములు బాబా సేవ చేసి యనగా పూజా, మధ్యాహ్నసాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబావాని కళేబరముపయి చేతులు చాచి, "ఇతడు నా నిజమయిన భక్తు"డనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పటు చేయుమనెను. కాకాసాహెబు దీక్షీత్ బాబా అజ్ఞ నెరవేర్చెను.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు