బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము/అధ్యాయము 1

1

నర్సాపురం దగ్గిర మొగలితుర్రు మా కాపుర స్థలము. మా ఇంటిపేరు వేమూరు వారు, నా పేరు పార్వతీశం. నేను టెయిలర్ హైస్కూలులో అయిదో ఫారము దాకా చదువుకున్నాను. ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదనీ, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతు లేమిటో అవగాహన కావడము లేదనీ, నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధనవ్యయమూ కాలవ్యయమూ కాలయాపనా ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా, ఇంటి దగ్గిర కూర్చొని, దేశ కాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.

ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితు డొకడు వచ్చి మాటలమధ్య ఇంగ్లండు వెళ్ళి చదువుకోమని హితోపదేశము చేశాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండు ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలూ, కష్టసుఖాలూ, నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతనూ దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్ళి, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి, గుట్టూ మట్టూ తెలుసుకొంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందనీ ఆలోచించి, అక్కడకు వెళ్ళి బారిష్టరు చదువు దామని నిశ్చయము చేసుకొన్నాను.

మా తండ్రి వ్యవసాయదారుడు; ఏమీ చదువుకున్న వాడు కాడు; వట్టి అనాగరికుడు; అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెపితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురము వెళ్ళి నాల్గు రోజులలో వస్తానని ఇంటి దగ్గిర చెప్పి బయలుదేరాను.

ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివిన పాఠమువల్లా, తరువాత చదివిన భూగోళ శాస్త్రమువల్లా, ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును. కాని అక్కడికి తీసుకొని వెళ్ళవలసిన సాధన సామగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో, తెలుసుకుందా మంటే చెప్పడానికి ఎరిగివున్న వాళ్ళూ ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురములో ఉన్న దొరల నెవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళ నడగడము మానివేసి నాసహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడనుంచి తీసుకు వెళ్ళితే ఇంకా కావలసినవి త్రోవలోనో, అక్కడకు వెళ్ళిన తరువాతనో, కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని, అనవసరముగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడ దనుకొని, సూక్ష్మములో తేల్చవలెనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను.

ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒకచివరనుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవికదా అనుకొన్నాను. అందుకని నిద్ర లేవడముతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకొన్నాను. దంత ధావనానికి పది కచ్చికలు నలిపిన పొడుమూ, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలూ, చిన్న ఇత్తడి చెంబూ, దంత ధావనమైన తరువాత స్నానముకదా అనుకొన్నాను. అందు కవసరమైనవి ఒళ్ళు తుడుచుకోటానికి రెండు అంగవస్త్రాలు; స్నానానంతరము తలకు రాసుకోడానికి సీసాలో పోసి కొంచెము కొబ్బరి నూనె; తల దువ్వుకోడానికి దేశవాళి దువ్వెన్న, బొట్టు పెట్టుకోడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు; ముఖము చూచుకోడానికి పావలాపెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయముకదా! అందుకు నాకవసరమని తోచినవి నాలుగు ట్విల్ షర్ ట్లూ; రెండు టైలూ; రెండు మేజోళ్ళ జతలూ (నూలువి); మూడున్నర పెట్టి బూడ్సుజోడూ; అక్కడ సూట్సు అవసరము గనుకనూ, చలిదేశము గనుకనూ, పదిహేను రూపాయలు ఖర్చుపెట్టినా గుడ్డ కొంచెము బాగుండడముచేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకొనడమువల్ల నాకు చాలీ చాలకుండా తయారైన ప్లానలు సూట్లు రెండు. ఇంగ్లండు వెళ్ళితే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంతవరకూ స్వదేశ పద్ధతి అవలంబింతామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాను సిల్కు. ఇంక ధరించవలసిన దుస్తులయిన తరువాత ఆలోచించవలసినది భోజనముకదా అనుకొన్నాను. అందు కవసరమైనది ముందు మంచి నీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళచేతి మాలకూడు తినకుండా మనమే స్వయంపాకము చేసుకుంటే బాగుంటుందికదా అనుకొన్నాను. అక్కడగూడ అన్నము ఎలా దొరకదుకదా! రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి; కొంచెము నెయ్యి! రొట్టెలో నంచుకోడానికి కొంచెము ఆవకాయ, రొట్టెలు కాల్చుకోడానికి చిన్న అట్లపెనము; స్టవ్, స్టవ్ లో పోసుకోడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటూ. భోజన సామగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలి దేశం కదా; కింద పడుకోడానికి కష్టముగా ఉంటుందని నర్సారావుపేట మడతమంచము; దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకొనే బొంత--ఇంట్లో కుట్టినది--కప్పుకోడానికి నారింజపండు రంగు శాలువ.

ఇవిగాక యింకా ఏమి అవసర ముంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోడానికి తుంగచాప తీసుకుని వెళ్ళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళినా హిందూధర్మ విరుద్ధంగా ప్రవర్తించ దలుచుకోలేదు గనుక అక్కడ దొరకవనే భయముతో ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలతాళ్ళూ కూడ తీసుకొని వెళ్ళడము చాలా అవసరమని తోచింది. ఇంక ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసిన వేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనబడవచ్చు. కాని వెళ్ళేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మరచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని, మొదటి నుంచీ ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇంక ఈ వస్తువులన్నీ పెట్టుకోడానికి ఎక్కడయినా కూలివాడు దొరికినా దొరకకపోయినా, నేను తీసుకు వెళ్ళడానికి తేలికగా ఉంటుందని, చిన్ని సీనా రేకు పెట్టె చేయించి చక్కని బంతిపూవు రంగు వేయించాను. ఈ సామగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని, శుభదినము నిశ్చయించుకొని, వర్జము లేకుండా కూడా చూసుకొని శకునము మంచి దయ్యేవరకూ వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను.

మొగలితుర్రు, నర్సాపురము, ఇంకా చుట్టుపట్ల గ్రామములు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళిన వాడిని కాను. ఇంత కాలము నర్సాపురములో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరము లేకపోయింది. ఇవ్వాళ పడవలో కూర్చుని వెళ్ళుతూ ఉంటే మహా సరదాగా వుంది. స్టీమరు మీద వెళ్ళడ మన్నా యింతే కదా అనుకొన్నాను. రాత్రి దారిలో మినప రొట్టీ, సాతాళించిన సెనగలూ కొనుక్కుతింటూ ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా, ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లండు నుంచి తిరిగివచ్చిన తరువాత ఏ విధంగా దేశోపకారము చేద్దామా అనుకుంటూ, నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది.

మెళుకువ రావడముతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి త్వరగా స్టేషనుకు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్దమనిషిని సంబోధించి 'టిక్కెట్టు ఇవ్వండి త్వరగా' అన్నాను.

'ఏమిటా హడావిడి! ఎక్కడికి? ఏ రైలుకు?' అని ఆరంభించాడు ఆయన.

నేనెక్కడికి వెళ్ళితే ఎందు కాయనకు? నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్పితే గుట్టు బయలు పడుతుందని--

'సరే అదంతా ఎందుకు లెండి ఇప్పుడు-టిక్కట్టు త్వరగా ఇప్పించండి ' అన్నాను. నన్ను ఎగాదిగా చూసి 'టిక్కట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు. కాస్సేపు ఉండ ' మన్నాడు.

కొంచం సేపైన తరవాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా 'ఎక్కడికి ' అన్నాడు.

'చెపుతాలెండి, టిక్కట్టు ఇవ్వండి.'

'ఏమయ్యా ఈ అళవు! యా వూరు పోతావయ్యా?'

'నే నేవూరు వెళ్ళితే మీకెందుకు? టిక్కట్టు ఇవ్వండి.'

దగ్గిర ఉన్న వాళ్ళందరూ నవ్వడము మొదలు పెట్టారు.

'ఇది ఎక్కడయ్యా! వట్టి నాటుపురము మాదిరి ఉండావే!

నీవు ఎక్కడ పూడ్చేది చెప్పకపోతే టిక్కట్టు ఎష్ట్లదా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేదువలే ఉంది. వాండ్లంతా కాచుకున్నారు ' అని కేకలు వేశాడు.

దగ్గిర ఉన్నవాళ్ళంతా నన్ను మందలించారు.

'ఈ రైలు చాలా దూరము వెడుతుందండి; చాలా చోట్ల ఆగుతుంది. అందుచేత ఏ వూరు మీరు వెళ్ళాలో చెపితే ఆ వూరుకే టిక్కెట్టు ఇస్తారు' అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశము చేశాడు.

ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది. అందుచేత టిక్కట్టు యిచ్చే ఆయనతోటి 'చెన్నపట్టణము వెళ్ళాలి' అని చెప్పాను.

అనేసరికి కండ్లెర్రజేసి 'ఎన్న అయ్యా యిది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువలె వుండావు! పో అయ్యా! జల్ది పో అయ్యా! వాళ్ళంతా కాసుకొన్నారు. పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి సూస్తావు? పట్నంబండి సాయంకాలం వరకూ రాదయ్యా, అప్పుడుదాకా యెక్కడనైనా పండుకొని తూంగు అయ్యా' అన్నాడు.

నా దగ్గిర వాళ్ళంతా నన్నవతలికి తోశేశారు. పోనీ కొంచెము సమ్మర్దము తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలుకు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి 'పట్నం బండి ఎప్పుడు వస్తుందండీ' అన్నాను.

'సాయంకాలము ' అన్నాడు ఆయన.

'అలాగా, సాయంత్రము దాకా వుండాలా! నాకు తొందర పని ఉందే!'

అప్పుడు నా మొఖము కేసి చూసి 'ఓ! తిరిగి వస్తివా! తొందరపని ఉంటే నడిచిపో ' అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు, మాష్టరు.

నా మీద కోపముచేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజము తెలుసుకొందామని ముందుకు వెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే, 'వస్తివా, పట్నంబండి ఎప్పుడు వచ్చేదీ తెలుసుకొనే దానికి వస్తివా! ఒకసారి చెపితే నీకు బుద్ధి లేదూ! అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపము, అందులో ఆయన ముఖము స్ఫోటకము మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా వున్నది. నే నూరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతా డేమని నాకు కోపం వచ్చింది. 'నేను ఇంగ్లండు వెడుతున్నాను, జాగ్రత్త!' అని చెబుదా మనుకొన్నాను. కాని ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని 'అబ్బే నేను రై సంగతి అడగడానికి రాలేదండీ. మిమ్మలిని చూస్తే ఏమి జ్ఞాపకము వస్తుందో చెప్పడానికి వచ్చానండీ ' అన్నాను.

'ఏం జ్ఞాపకము వస్తున్నది?'

'మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయా, మీ తలకాయ చూస్తే సున్నపు పిడతా జ్ఞాపకము వస్తున్న ' వన్నాను.

అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతు తనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను.

అక్కడనుంచి తిన్నగా దగ్గిర వున్న హోటలుకు వెళ్ళి భోజనము చేసి కాస్సేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసివద్దా మని వెళ్ళాను అక్కడ అటూ యిటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచి పోయినట్లు జ్ఞాపకము వచ్చింది. అవేమిటంటే, గదికి తాళము వేసుకోడానికి చిన్న ఇత్తడి తాళమూ, స్నానానంతరము బట్టలు ఆరవేసుకోడానికి కొబ్బరిపీచుచేంతాడూ, బట్టలు తగిలించుకోడానికి నాలుగు పెద్దమేకులూ. ఈ మూడు వస్తువులూ కొనుక్కుని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలము కాగానే పెందరాడే భోజనము చేసి స్టేషన్ కు వచ్చాను. టిక్కట్ల వేళ అయింది.

నేను వెళ్ళి చెన్నపట్నానికి టిక్కట్టు పుచ్చుకొన్నాను. ఇవతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా? అన్నాను.

'మీ రేఊరు వెడతారు?' అన్నాడు వాడు.

'నీ కెందు కా ప్రశంస?' అని చక్కా పోయాను.

అక్కడొక పద్దమనిషి ఉంటే, ఆయన్నే అడిగాను -ఈ రైలు ఎక్కవచ్చునా?' అని. ఆయనా అదేప్రశ్న వేశాడుమీరేఊరికి వెళ్ళుతారని, నాకు ఒళ్ళుమండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టరుగారి దగ్గిరకు వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా 'ఎక్కడికి వెళ్ళా ' లన్నారు. టికెట్టు ఇవ్వడానికంటే ఊరుపేరు చెప్పితేనేకాని ఇవ్వడానికి వీలులేదంటే చెప్పాను. టిక్కట్టు కొన్న తరవాత కూడా వీళ్ళకీ పరీక్షలన్నీ ఎందుకూ? వీళ్ళరోగము కుదురుద్దామని 'రాజమహేంద్రవరాని ' కన్నాను. అయితే 'ఎక్కవచ్చు ' నన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాష్టరు అక్కడే ఉన్నాడు. రైలు కదిలించి.

ఆయన్ని పిలిచి 'ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలెండి. నేను రాజమహేంద్ర వరము వెళ్ళడములేదు. చెన్నపట్నం వెళ్ళుతున్నాను ' అని నవ్వుతూ చెప్పాను.

ఆయన ఆపాళంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను.

'త్వరగా దిగవయ్యా, ఆలస్య మవుతున్నది '

'నేనెందుకు దిగాలి?'

'ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్ లాగా ఉన్నావు. దిగు. '

'ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి. నేను దిగను ' అంటే రైలులో వాళ్ళంతా నవ్వడము మొదలు పెట్టారు. ఇంతలోనే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించారు. రైలు వెళ్ళి పోయింది. నా కళ్ళవెంబడి నీళ్ళు వచ్చినవి. స్టేషన్ మాష్టరు కొంచెము చీవాట్లువేసి పట్నంబండి యింకొక పావు గంటలో వస్తుం దని ధైర్యము చెప్పాడు. కొంచె మించు మించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగీ ఆగడములో ఎదురుగుండా వున్న పెట్టెలోకి నా సామానునెత్తినపెట్టుకుని ఎక్కబోయాను. ఒకమెట్టు ఎక్కి రెండమెట్టుమీద కాలు వెయ్యబోతూ వుంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నానెత్తిమీద ఉన్న సామాను, నావెనక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండ కింద ఎవళ్ళో కాళ్ళమీద దభీ మని పడ్డది. నేను సామానుకోసము వెనుక్కు తిరిగి చూశాను. ఆపళంగా చెయ్యిజారి నావెనక వాడిమీద నేనూ, నావెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళమీద విరుచుకు పడ్డాము. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడము మొదలు పెట్టారు. కొందరు మామీదనుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తరువాత చూసుకోవచ్చునని ముందు రై లెక్కాను.

రైలెక్కి సామాను పైన పెట్టు కొంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలించి. నావెనుక బల్లమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ నాలుగు ఆశీర్వవచనముల తోటి ముందుకు గెంటింది నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ, అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపుమీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కు మన్నది. నేను మొర్రో అన్నాను. ఆనందసమాధిలో నుంచి కొంచెము మెలుకువ తెచ్చుకుని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూచాడు కాబోలు, కెవ్వుమని కేకవేసి ఏపామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్లపైన పడబోయి ఆపిల్ల నలిగిపోతుందేమోననే భయముతో ఎలాగో తప్పించుకుని తల్లిమీద పడ్డాను. మళ్ళీ ఆవిడా తోసెయ్య పోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టు కొన్నాను. రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడము ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్నూ తనభార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకముగా విడదీసి నన్ను తిట్టడము మొదలు పెట్టాడు. నా తప్పు ఏమీలేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియలేదనీ, తెలిస్తే అలా కౌగిలించుకోక పోయేవాడినే ననీ, ఇదివర కెప్పుడూ అల్లా చెయ్యలేదనీ, ఇక ముందెప్పుడూ చెయ్యననీ, గజగజ వణకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి, నేను కౌగలించుకొన్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీలేదనీ, పొరపాటున కౌగిలించుకొన్నాననీ, పొరపాటెవ్వళ్లకయినా వస్తుందనీ, ఇవ్వాళ ఈయన అయినాడు, రేపు ఇంకొకళ్ళు కౌగలించుకో వచ్చు(పొరపాటున) ననీ, ఈ మాత్రము దాని కాయన అంత కోపపడవలసిన పనిలేదనీ ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్దమనిషిని శాంతింప జేశారు.

ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగలించుకొంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెము స్థలము ఇచ్చారు. పైబల్ల మీద నా పెట్టెపెట్టి దానిమీద మడత మంచమూ, చాపా, పెట్టి ఇవన్నీ కలిపి పైనగొలుసు కనబడితే, దానికీ వీట్లకీ, సాయంత్రము కొన్న చేంతాడు వేసి, లాగి, బిగించి కట్టాను. ఇంక సామాన్లకి ఫరవాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను.

ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరూ మాపెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగా రన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామానుకేసి చూపించి 'ఈ సామానెవరిది ' అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడులుతూ, 'నాదేను ' అన్నాను.

'ఎందు కలా గొలుసుకు కట్టావు?'

'సామాను రైలు కుదుపునకు కింద పడిపోకుండాను, జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా.'

పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడ మారంభించారు. గార్డు యాభైరూపాయిలు జరిమానా ఇవ్వమన్నాడు. 'నాదగ్గి రేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించ ' మని ప్రాధేయ పడ్డాను. ఆఖరుకు ఎలాగైతే నేమి నా సామాను గొలుసుని విప్పివేయ మని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తరువాత నా అపరాధమేమిటని పక్కన ఉన్నవాళ్లనడిగి తెలుసు కున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. యింక కాస్సేపటికి రైలు మళ్ళీ ఆగింది. నాపెట్టెలో కొందరు దిగారు. మరికొందరెక్కారు. కాస్సేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నాపక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు నలభై సంవత్సరముల మనిషి నావైపు వీపుపెట్టి, కాళ్ళు బల్ల మీదికి చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది. మనదేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ, ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ, ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ- అయినా మంచికాలము సమీపిస్తున్నది. నేను మూడు నాలుగు సంవత్సరములలో స్వదేశానికి తిరిగివచ్చి ఈ కష్టాలను తొలగిస్తా ననుకొంటూ నేనూ నిద్ర పోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంత సేపటికి మెళు కువ వచ్చింది. నాపక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపూ నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది. ఆవిడ వీపున ఇంతసేపూ జార్లా బడ్డందుకు సిగ్గుపడి హఠాత్తుగా లేచి కూర్చున్నాను. పాపము ఆవిడ నన్నానుకొని నిద్రపోతూ ఉన్నది కాబోలు, ఆ సంగతి నా కేమితెలుసును? నేనులేపడముతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. పడగానే ఆవిడ 'గోవిందా, గోవిందా ' అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునః ప్రయత్నము చేస్తూఉంటే, పాపము మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటుపెట్టి ముందుకు కొంచెము తోశాను. లేచి నా సహాయమువల్ల లేచాను గదా అని సంతోషించడానికి బదులు, కోపంగా 'అదేమిటి అబ్బాయి, కొంచెము దూరంగా కూర్చో కూడదూ, ఊరికే మీదికి రాకపోతే? నీకు తోడబుట్టినవాళ్ళు లేరూ? ఇల్లు బయలుదేరి రావడమే చాలు నే ఒక్కతెనూ; నా బ్రతుకు అంతా ఇలాగనే వెళ్ళుతున్నది. దారిలో ఎరిగున్న వాళ్ళెవరై నా కనబడక పోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరి నందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది! ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది కదా! చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడు రాత్రిళ్ళు రైలులో ప్రయాణము చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందుచేసుకొని నడ్డివాల్చ మనేవారు ' అని ఒక మాటు కళ్ళద్దుకొని ఒక మాటు ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది.

నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికీ, ఏమి చేయడానికీ తోచింది కాదు. ఒక్కమాటు రైలు ఆపితే బాగుండును. దిగి వెళ్ళి రావచ్చు ననుకొన్నాను. గొలుసు లాగుదామా అనుకొని, ఏభైరూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికివెళ్ళి రైలు ఒక్క మాటు ఆపమని గార్డుగారిని కేకవేశాను. నాకేక ఎవళ్ళకీ వినపడ లేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్దమనిషి నొకాయనను పలకరించి, నా అవస్థ చెప్పి 'ఇలా కేకవేశాను. ఎవళ్ళూ పలకలేదు. ఎలాగు' అని అడిగాను. ఆయన నవ్వి 'అబ్బాయీ, వట్టి వెర్రివాడివలె వున్నావు. మనకు కావలసిన చోటల్లా రైలు ఆపరు. ఇక్కడే గది ఉంది. ఒకటికి వెళ్ళవలసి వచ్చినా, రెంటికి వెళ్ళవలసి వచ్చినా, ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని' చెప్పి గది చూపించారు.

వెళ్ళి, వచ్చి కూర్చుని కాస్సేపు కునికిపాట్లు పడేసరికి తెల్ల వారింది. చక్కగా రైలు ప్రతి స్టేషనులోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైలులో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర లేకుండా అందులోనే పాయఖానా, ప్రతి స్టేషనులోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము; అన్ని ఏర్పాట్లూ బహు బాగున్నవను కొన్నాను. అందుకనే ఇంగ్లీషువాళ్ళు అంత గొప్ప వాళ్లయినా రనుపించింది.

ఇలా ఉండగా ఉదయము తొమ్మిది గంటలయే సరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్ లో దిగేజనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒకాయన నల్లదొర నా దగ్గిరికి వచ్చి టిక్కట్టు ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిటిరా టిక్కట్టు తీసుకు పోతున్నాడు. ఏమన్నా గట్టిగా అడగ డానికైనా-నల్లగా ఉన్నా--దొర కూడాను! నా గతి ఏమికాను? ఎలాగని హడిలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కట్టు నా కిమ్మని ప్రాధేయ పడ్డాను. వాడు నన్ను కోపముతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టిక్కట్టు వాడి చేతిలో చిక్కుపడి పోయింది. అందుకని అభిమానము చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళయింది. ఇంకొక నలుగురైదుగురు నల్లదొరలు చేరారు. 'దయచేసి నా టిక్కట్టు ఇప్పించండి ' అన్నాను.

'Get away man, you seem to be a fool' అన్నాడు.

'అయ్యా నాటిక్కట్టు యిప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కట్టు ఇవ్వరు, పైగా తిడతారేమండీ ' అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది.

'Get in man. You have no bloody fear. Nobody will ask you' అని నన్ను రైలులోకి తోశారు.

రైలు కదిలింది-ఏమి చెయ్యడానికి గత్యంతరము తోచలేదు. స్టేషన్ లో ఆ దొరలంతా కడుపులు పట్టుకుని నవ్వు కుంటున్నారు-నేను దిగుదామా అని ప్రయత్నము చేశాను-నా పక్కనున్నాయన నన్ను ఆపి, ఏమిటి సంగతి అని అడిగాడు-ఆయన తోటి చెప్పాను, ఇలా టిక్కెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడాయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడే అంతా దిగిపోవడము- అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని; టిక్కట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు- నీకే భయము లేదని అభయ మిచ్చాడు. సరే ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గిరాకూడా టిక్కట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనుక వారికి లేనిభయము నాకెందుకని ధైర్యము తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనె చెన్నపట్నము చేరాము.