ప్రథమస్కంధము - అధ్యాయము 2

అధ్యాయము - 2

           సూతుండు నారాయణకథా ప్రశంస జేయుట

వ. అని యిట్లు మహనీయ గుణ గరిష్ఠులయిన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్త్రుండై యుగ్రశ్రవసుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు, (1-52)


మ. సముఁడై యెవ్వఁడు ముక్త కర్మ చయుఁడై సన్న్యాసియై యొంటిఁ బో

వ మహాభీతి నొహో ! కుమార ! యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కం జేసె మున్నట్టి భూ

త మయున్ మ్రొక్కెద బాదరాయణిఁ, దపో ధన్యాగ్రణిన్ ధీమణిన్. (1-53)


సీ. కార్యవర్గంబును గారణ సంఘంబు, నధికరించి చరించు నాత్మతత్త్వ

మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ , దెలివి సేయఁగఁజాలు దీపమగుచు

సకల వేదములకు సారాంశమై యసా,ధారణమగు_ _ _ప్రభావ

రాజకంబైన పురాణ మర్మంబును, గాఢ సంసారాంధకార పటలి

తే.గీ. దాటఁగోరెడి వారికి దయ దలిర్ప, నే తపోనిధి వివరించె నేర్పడంగ

నట్టి శుక నామధేయు మహాత్మగేయు, విమల విజ్ఞాన రమణీయు వేడ్కఁ గొలుతు. (1-54)


కం. నారాయణునకు నరునకు, భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ

స్కారము సేసి వచింతు ను,దార గ్రంథంబు దళిత తను బంధంబున్. (1-55)


వ. అని యిట్లు దేవతా గురు నమస్కారంబు సేసి యిట్లనియె. మునీంద్రులారా ! నన్ను మీరు నిఖిల లోక మంగళంబైన ప్రయోజనంబడిగితిరి. ఏమిటం గృష్ణసంప్రశ్నంబు సేయంబడు నెవ్వింధంబున నాత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయు నైన హరిభక్తి యే రూపంబునం గలుగు నది పురుషులకుఁ బరమ ధర్మంబగు. వాసుదేవునియందుఁ బ్రయోగింపఁబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణ కథల వలన నెయ్యే ధర్మంబులు దగులవవి నిరర్థంబులు. అపవర్గ పర్యంతంబైన ధర్మంబున కర్థంబు ఫలంబు గాదు. ధర్మంబునం దవ్యభిచారి యయిన యర్థంబునకుఁ గామంబు ఫలంబు గాదు. విషయ భోగంబైన కామంబున కింద్రియ ప్రీతి ఫలంబు గాదు. ఎంత తడవు జీవించు నంతియ కామంబునకు ఫలంబు. తత్త్వజిజ్ఞాస గల జీవునకుఁ గర్మముల చేత నెయ్యది సుప్రసిద్ధం బదియు నర్థంబు గాదు. తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస. కొందఱు ధర్మంబె తత్త్వంబని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానమను పేర నద్వయమైన యది తత్త్వమని యెఱుంగుదురు. ఆ తత్త్వం బౌషనిదుల చేత బ్రహ్మమనియు హైరణ్యగర్భుల చేతం బరమాత్మ యనియు సాత్వతుల చేత భగవంతుఁ డనియును బలుకంబడు. వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యముల తోడం గూడిన భక్తి చేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మ యందుఁ బరమాత్మం బొడఁగందురు. ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మ భేదంబులం జేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి. ఏకచిత్తంబున నిత్యంబును గోవిందు నాకర్ణింపను వర్ణింపను దగు. చక్రయుధ ధ్యానంబను ఖడ్గంబున వివేకవంతు లహంకార నిబద్ధంబైన కర్మంబుఁ ద్రుంచి వైతురు. (భగవంతునియందు శ్రద్ధయుఁ దత్కథా శ్రవణాదులం దత్యంతాసక్తియుఁ బుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచే సిద్ధించును) కర్మనిర్మూలన హేతువులైన కమలలోచను కథలం దెవ్వండు రతి చేయి నిచ్చగించు వాని కితరంబులెవ్వియు రుచి వుట్టింపనేఱవు. పుణ్యశ్రవణ కీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబు లాచరించు. అశుభంబులు నష్టంబులయిన భాగవత శాస్త్రసేవా విశేషంబున నిశ్చల భక్తి యుదయించు. భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామక్రోధాదులకు వశంబు గాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగు. ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు దీపించు. ఈశ్వరుండు కానంబడినఁ జిజ్జడ గ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగు. అహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు. సంశయ విచ్ఛేదంబైన ననారబ్ధ ఫలంబులైన కర్మంబులు నశించుం గావున, (1-56)


కం. గురుమతులు తపసు లంత: , కరణంబులు శుద్ధి సేయు ఘనతరభక్తిన్

హరియందు సమర్పింతురు, పరమానందమున భిన్న భవ బంధనులై. (1-57)


తరల వృత్తము :- పరమపూరుషుఁ డొక్కఁ డాఢ్యుఁడు పాలనోద్భవ నాశముల్

సొరిదిఁ జేయు ముకుంద పద్మజ శూలిసంజ్ఞలఁ బ్రాకృత

స్ఫురిత సత్త్వ రజస్ తమంబులఁ బొందు నందు శుభస్థితుల్

హరి చరాచర కోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై. (1-58)


వ. మఱియు నొక విశేషంబు కలదు. కాష్ఠంబున కంటె ధూమంబు, ధూమంబున కంటెఁ ద్రయీమయంబైన వహ్ని యెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబున కంటె రజోగుణంబు, రజోగుణంబున కంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు సత్త్వమయుండని హరి నధోక్షజుం గొలిచిరి. కొందఱు సంసారమందలి మేలు కొఱకు నన్యుల సేవించుచుందురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన భూతపతుల విడిచి దేవతాంతర నింద సేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు. కొందఱు రాజస తామసులై సిరియు నైశ్వర్యంబును బ్రజలను గోరి పితృభూత ప్రజేశాదుల నారాధించుదురు. మోక్షమిచ్చుటం జేసి నారాయణుండు సేవ్యుండు. వేద యాగ యోగ క్రియా జ్ఞాన తపోగతి ధర్మంబులు వాసుదేవపరంబులు. నిర్గుణుండైన పరమేశ్వరుండు కలుగుచు లేకుండుచు గుణంబుల తోడం గూడిన తన మయ చేత నింతయు సృజియించి, గుణవంతుని చందంబున నిజ మాయా విలసింతంబులైన గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞాన విజృంభితుండై వెలుంగు. అగ్ని యొక్కరుండయ్యుఁ బెక్కు మ్రాఁకులందుఁ దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్కఁడు తన వలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు. మనోభూత సూక్ష్మేంద్రియంబుల తోడం గూడి గుణమయంబులైన భావంబులం దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులువడక తద్గుణంబు లనుభవంబు సేయుచు లోకకర్తయైన యతండు దేవ తిర్యఙ్ మనుష్యాది జాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించు నని మఱియు సూతుఁ డిట్లనియె. (1-59)