శ్రీకాకుళములో పెద్దమనుష్యులొకరు ఉచితముగా గది నిచ్చినారు. వారిపిల్లలకు చదువులుచెప్పుచు, ప్రబంధములు పఠించుచు అచ్చట రెండు నెలలుండిరి. ఆకాలములో కథాసరిత్సాగరమును చదివిరట. అంతట, ఏదోతోచి, శ్మశానములో రాత్రులు పిశాచములు బేతాళములు తిరుగుచుండునని అందులోకలదే చూతము ఏమయిన కనబడునేమోయని రాత్రులు తిరుగుచుండు వారట. ఒకదినము ఎవరోచూచి 'ఏమండోయి, శాస్త్రులవారూ, ఎక్కడ తిరుగుతున్నారు. ఈ అపర రాత్రివేళ?' అని యడిగిరి. 'పిశాచాలేమైనా కనబడతాయేమో చూతామని' అని శాస్త్రులవారు బదులుచెప్పిరి. 'మంచిపిశాచాలే, ఈఊరు ఏలాంటిదో ఎరగరు. ఇక్కడ బోగంకొంపలు, ఖూనీలు జరుగుతాయి. ఎవరోఅనుకొని రాత్రిపూట మిమ్మల్ని కడతేరిస్తే, ఏమైపోతారు. పదండి, పదండి ఇంటికి' అని వారు నివారించిరి, దానితో పిశాచాలకుగాను తిరుగుట మానివేసిరట.
అనంతరము చోడవరము తాలుకాస్కూలు ప్రథానోపాథ్యాయులుగా నియమింపబడిరి. ఈ స్కూలులో ప్యూను పేరు పేరిగాడు. వీడు బడికిరాక అనుదినము సెక్రిటరీగారి యింట నౌకరీచేయుచుండువాడు. ఎప్పుడైనను బడికివచ్చెనా స్కూలువరాండాలో బల్లలమీద పరుండి నిద్రపోవువాడు. శాస్త్రులవారు వీనికి బుద్ధిచెప్పదలంచినారు. అన్నిపనులను బడిలో ఉపాథ్యాయులే చేసికొనవలసియుండెను. పూర్వముండిన ప్రథా