19-ప్రకరణము
శ్రీ వేంకటగిరి మహారాజా
కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరువారు
శాస్త్రులవారికి నెల్లూరిపై నభిమానముమెండు. శృంగారనైషధ ముద్రణానంతరము నెల్లూర నివాసమేర్పఱుచుకొని తమ్ము ఆదినుండియు నాదరించుచున్న శ్రి వేంకటగిరిప్రభువు లేమి, శ్రీ లక్ష్మీనరసారెడ్డిగారివంటి పోషకులేమి, గునుపాటి యేనాది రెడ్డిగారివంటి మిత్రరత్నములేమి ఇంకను శిష్యసమూహమేమి బంధుకోటియేమి నిండియున్న తావున స్వజనమునడుమ నుండం దలంపుగొనియుండిరి. ఇట్లుండగా 1914 సం. న ఐరోపీయ మహాసంగ్రామము ప్రారంభమాయెను. మదరాసునకు సమీపముగా పోవుచుండిన జర్మనునౌక ఎండన్ అనుదానినుండి శత్రువులు చెన్ననగరముపై మూడుగుండ్లనుపేల్చిరి. మదరాసు అపాయకరమైన ప్రదేశమనితలంచి శాస్త్రులవారు, ఎట్లును నెల్లూరికేగ దలంచియుండిరి గాన, అంత పెద్దయచ్చాపీసును నెల్లూరికి మార్చుకొనిరి. ఈమార్పుచే వారికి నష్టమేవచ్చినది. గుమాస్తాలుగా చేరినవారు పలువురు వంచకులై ద్రవ్యమునేమి, పుస్తకముల నేమి, యంత్రభాగములనేమి, పనిముట్లనేమి, పెక్కింటిని హరించిరి.
కుటుంబమునువృద్ధియైనది. శాస్త్రులవారికి వేంకటరమణయ్యగారు ఏకైకసంతానము. వారికి తమమిత్త్రులు కీ.శే.శ్రీ శేషగిరిశాస్త్రులవారి కడగొట్టు కొమార్తె సరస్వతమ్మను వివా