గురుపూజ
గురుప్రాయులైన శ్రీ వేదము వేంకటరాయశాస్త్రులవారికిని శిష్యుడ నైన నాకునుగల పరిచయవిశేషముల గొన్నింటిని నివేదించి నాయొక్క ఋణభారమును కొంత దీర్చికోనెంచినాడను. నేను క్రైస్తవ కళాశాలలో 1897 వ సం. మొదలు 1902 వ సం. వఱకు విద్యార్థిగా నైదేడు లుంటిని. నేను తెనుగు తరగతికి జేరినవాడనయినను చేరిననాటినుండియు వీరి దర్శన గౌరవమును సల్లాపభాగ్యమును నాకు లభించినవి. ఆకాలమున నాకాలేజిలో 'ఆంధ్రభాషాభిరంజని' యనుపేర తెనుగుసమాజ మొక్కటి యుండెడిది. దాన నేనొక సభ్యుడను. ఏటేట రెండు మూడు పర్యాయములు వచ్చి ఆసమాజమును ఆదరించు గొప్పవారిలో శ్రీ శాస్త్రులవా రొకరు. వీరివచనము మృదుమధురము హాస్యరసశోభితము. ఎట్టి గాఢమైన విషయమైననుసరే, సరళముగను సరసముగను వివరించువిథానము వీరికలవడినట్లు పెఱ అగ్రాసనాధిపతులలో గానంబడద. వీరి ప్రసన్నత సర్వసభి కాకర్షకము. మేము చిన్నవారము, అల్పజ్ఞులము. అయినను మమ్ము మందలించునపుడుసయితము, మిక్కిలి మర్యాదతో, మేము పొరబాటుపాలైనట్లు పల్కుదురగాని తప్పులలో బడినట్లు కఠినముగా పలుకరు. నాకవిత్వతత్త్వవిచారమునకు బీజమైన కళాపూర్ణోదయ విమర్శనవ్యాసమును నేను వీరియధ్యక్షత క్రింద జదువగా గొంతవఱకు అత్యుక్తిదోషమందున్నదని మెత్తనిరీతిని పరిశీలించి