40
వరవిక్రయము
లింగ :- ఆహా! అట్టి యవకాశమేయున్న నదృష్ట మేమనవచ్చును!
గీ. సంపద మహత్వ మెరుగని చవట బ్రహ్మ
చావు లేకుండగా నేని సలుప డయ్యె
చచ్చునప్పుడు వెను వెంట సకలధనము
తీసికొనిపోవు విధమేని తెలుపడయ్యె. (తెరపడును.)
రెండవ రంగము
ప్రదేశము: లింగరాజుగారి కచేరి చావడి
(ప్రవేశము: పురుషోత్తమరావుగారు, లింగరాజుగారు, బసవరాజు, పేరయ్య, వీరయ్య చాపలపైఁ గూరుచుండి)
లింగ :- విన్నావా? మున్నంగివారికిని, మాకును మూడుతరముల నుండి సంబంధ మవిచ్ఛిన్నముగా సాగుచున్నది. మూర్తి రాజు పంతులు గారా సంగతులన్నియు నెత్తుకొని మూరెడుత్తరము వ్రాసినారు. అందుచేత నింత దూరమాలో చించవలసి వచ్చింది-
వీర :- మూడు తరలానాటి సంబంధ మొకటేనా? మూడువేల రూపాయల కట్నమో!
పేర :- వీరయ్యా! నీ గొడవ మా విపరీతంగా వుందే! మూడు వేలు మూడువేలని యిక్కడికి ముప్పయిసార్లన్నావు. ముష్టి మూడువేలు మేరేకాని మేమివ్వలేమనుకున్నావా? లింగరాజుగారు! ఆ మొత్తం మే మే యిస్తాము. మా కింద ఖాయం!
వీర :- అదేమన్నమాట? మీరథికంగా అన్నదేముంది?
పురు :- అట్లయిన నింకొక యైదువంద లధికముగా నిచ్చెదము.
వీర :- మా పంతులుగారు మరియైదువందలు.
పేర :- వొయ్యోయ్? వద్దుసుమా వొద్దు! మా పంతులుగారి సంగతి తెలియక మాజోరుగా వస్తున్నావు! మాట దక్కదు సుమా.
వీర :- పేరయ్యా నీ బెదిరింపులకు నేను జడిసేవాడ్ని కాను! మా పంతులుగారు పెట్టమన్న మొత్తం వఱకూ పెట్టిమరీ తీరుతాను.