ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

తిక్కన సోమయాజి


పద్యములనే వాడియున్నవాఁడు. ఇట్టిపద్దతి భారతములో నుంచుటయెగాక తానురచియించిన నిర్వచనోత్తరరామాయణలోని పద్యములను సైతము నించుక మార్చియు మార్పకయు సందర్భముగలిగినపుడు భారతములోఁ జొప్పించి యున్నాఁడు. ఇందులకుఁ గొన్ని దృష్టాంతములను జూపు చున్నాఁడను.

ద్రోణపర్వమునం దభిమన్యుఁడు చంపఁబడినతరువాత ధర్మరాజునకు దుఃఖోపశమనముగా కృష్ణద్వైపాయనుఁడు బోధించిన షోడశరాజచరిత్రమును దెలుపు నట్టిపద్యములనే శాంతి పర్వమున బంధుమరణార్తిచేఁ దపింపుచున్న ధర్మరాజునకు గదాగ్రజుఁ డాకథను జెప్పవలసిన సందర్భమునఁ బొందుపఱిచి యున్నాడు.

విరాటపర్వము ద్వితీయాశ్వాసములో కీచకుఁడు తనయెడ మోహావేశపరవశుఁడైనపు డాతని నదల్చుటకై ద్రౌపదిచేఁ జెప్పించిన,

"శా. దుర్వారోద్యమ బాహువిక్రరసాస్తోక ప్రతాప స్ఫుర
    ద్గర్వాంధ ప్రతివీర నిర్మథననిద్యాపారగు ల్మత్పతు
    ల్గీర్వాణాకృతు లేవు రిప్డు నినుదోర్లీల౯ విజృంభించి గం
    ధర్వుల్ ప్రాణము మానముం గొనుట తథ్యం బెమ్మెయిం గీచకా!"!

అనుపద్యమునే ద్రౌపదితనభంగపాటును భీమునితో విన్నవించు నపుడును తాను గీచకుని ట్లదల్చితి నని చెప్పుసందర్భమున నీపద్యమునే మరల చెప్పి యున్నాఁడు.