పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/95

ఈ పుటను అచ్చుదిద్దలేదు

తలుగా ఉన్నాయి. ఆమె మాడుపై ఏవో మందుపట్టీ వేశారు. వైద్యుడు రోగి నాడి పరీక్ష చేస్తున్నాడు.

                                                                                                                           జగత్ రాం పండా, నేనూ గదిలోనికి రాగానే  వైద్యుడు  మావైపు  నావైపు తీక్షణంగా చూచి,  నువ్వేనా  శ్రీనాథమూర్తివి? అని అడిగినాడు.  చిత్తం పండిట్ జీ  అన్నాను.
    ఈమె బ్రతకాలంటే  నీలో ఉంది, ఈవిడకు జ్వరం మెదడుకు పట్టింది, గుండె చాలా నీరసంగా ఉంది. నువ్వు ఈగది  అత్యంతావసరాలకుగాని  వదలకుండా రాత్రింబగళ్ళు మందు లివ్వడం, మంచినీళ్ళివ్వడం,  వగైరా  అన్ని పనులు  చేయాలి. అప్పుడు  ఈ  అమ్మాయి  బ్రతకడానికి  సావకాశాలు ఉన్నాయి. లేకపోతే  రెండు రోజులకన్న  ఎక్కువ పూచీ  పడలేను.
   నేను, గుండె రణభేరీ వాయిస్తూవుండగా సరేనని  తల ఊపాను.
    శ్రీనాథ్! నువ్వు నాకు బిడ్డనీయకుండా....వెళ్ళిపోతావా?....ఇన్నాళ్ళనుంచీ....నామీద  ప్రేమ....దొంగ....ప్రేమా అని గొణుగుతున్నది  సుశీల.
   నాకు  చెమటలు పట్టాయి. ఆ   వైద్యుడి ముఖం  చూడలేకపోయాను  సుశీల  మంచం మీద  ముఖం వాల్చుకుని  కూచున్నాను. ఆమె  చేయి నా రెండు  చేతులతో పట్టుకున్నాను. కళకళ  కాగిపోతోంది  ఆమె వళ్ళు.
    ఆమె  నుదుటి మీద  చేయివేసి, ఆమె చెవిలో 'సుశీలా' అని పిలుస్తూ ఉండు. తల్లిలా, కుమారునిలా నువ్వు  సంచరించాలి. జ్వరం తగ్గి తెలివి వచ్చిన తరువాత  మందులు  మారుస్తాను అన్నాడు వైద్యుడు.
   ఆమె నుదుటిమీద చెయివేశాను. అబ్బా!  నాకెన్ని పరీక్షలు?  ఇలాగే నా శకుంతలను  నా కోసం బ్రతుకు  అని  ప్రార్థించాను. అయ్యో  శకుంతలాదేవీ! నా కెలాంటి పరీక్షలు  పెట్టావు  ప్ర్రాణేశ్వరీ! 
   సుశీల చెవిలో  సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నీ కోసం వచ్చాను. నెమ్మదించు సుశీలా! అని  కళ్ళనీళ్ళు కారిపోతూ  వుండగా   పిలిచాను.
   సుశీల కొంచెం  శాంతించింది. కదలకుండా పడుకుంది. నేను నా చెయ్యి  ఆమె నుదుటిమీద అలానే ఉంచాను. ఆ గదిలోకి  ఎవ్వరినీ  రాకుండా  భర్త  గుమ్మందగ్గర కాపలా! నేనూ, వైద్యుడు లోపల. వైద్యుడు  పాశుపతాస్త్రము అనే  మందు ఇస్తున్నాను. ఇది ఇచ్చిందగ్గర నుంచి చాలా జాగ్రత్తగా  ఉండాలి నాయనా! అన్నాడు. ఏమిటా జాగ్రత్త  అని భయపడి పోయాను. తేనెలో రంగరించి, ఆయన ఆ మందు  సుశీల  నోరుతెరచి  నాలుకకు రాచినాడు, ' నేను మళ్ళీ వస్తా'అని చెప్పి వైద్యుడు వెళ్ళిపొయినాడు. పండా గుమ్మం దగ్గరే  రాయిలా  కళ్ళనీళ్ళతో  సుశీలవైపు  చూస్తూ, చేతులు నలుపుకుంటూ  నిలుచున్నాడు. సుశీల  చెవిదగ్గర  నా  నోరుంచి  సుశీలా! నేను శ్రీనాథమూర్తిని, నువ్వు మా అందరికోసం బ్రతకాలి. సుశీలా! నేను ఇదివరకే  ఎంతోకష్టం అనుభవించాను. సుశీలా! నా నెత్తిపై  ఇంకో చావు కూడా  పెట్టకు సుశీలా!అన్నాను. నా కంటినీరు ప్రవాహాలై  కారిపోయినాయి.