ఈ పుటను అచ్చుదిద్దలేదు
వంకాయలు ఈ రైలులో లేవు. అయినా వంకాయలనేవి ప్రపంచంలో ఉన్నాయని ఒప్పుకుంటున్నామా?
అల్లాగే ప్రపంచంలో కొందరు దేవతల్ని దర్శించారు. కొందరు దర్శించలేదు, దర్శించినవాళ్ళు దర్శించినట్లు చెప్పారు, దర్శింపని వాళ్ళు లేరని వాదించారు!
అంత చవకగా లేదు వాదన. లోకంలో వంకాయలున్నాయని ఎరగనప్పుడు వాదనేరాదు. కొందరు చూచారు, తిన్నారు. వానిని గూర్చి ఇతరులకు ఋజువు చేశారు. ఆ ఋజువుచేసే విధానం, జ్ఞానంకల ప్రతివాడూ ఒప్పుకునేది. కాబట్టి లోకం అంతా ఒప్పుకుంటుంది.
అయితే మనం నమ్మదగిన పెద్దలు __రామక్రిష్ణ పరమహంస, వివేకానందుడు, రమణమూర్తి, అరవిందఘోష్ , మహాత్మాజీ మొదలైన వారు స్పష్టంగా దేవుడు ఉన్నాడనిన్నీ తమ కా అనుభవం కలిగిందనీ చెప్తారే. అంతకంటే ఋజువు ఏం కావాలి?
ఓయి పిట్టపిడుగా! ఆ పెద్దలు మంచివాళ్ళే! కాని వాళ్ళు ఓ విధమైన పిచ్చివాళ్ళు. పిచ్చివాళ్ళకు మనస్సులో అనేకమైన భావాలూ ఉదయిస్తూ వుంటాయి. అవన్నీ వాళ్ళకు నిజంగానే కనబడతాయి. అంతమాత్రంచేత దేవుడూ, దెయ్యమూ వుందని ఏల నమ్ముతాము?
లాహోరు నుంచి సాయంకాలం బయలుదేరి తెల్లారేసరికి సక్కర్ (మనవాళ్ళు సుక్కూర్ అంటారు) చేరాము. సక్కర్ లో మూడు రోజులుందామనుకున్నాము. అక్కడ నా పశుత్వానికి తృప్తినిచ్చింది స్నానాలరేవు. సింధ్ లో ముసల్మానులు ఎక్కువ, హిందువులు తక్కువ. వీళ్ళకు పూర్వ పారశీక యవన పహ్లవాదుల సంపర్కం ఎక్కువ వుంటుంది. సింధ్ లో పరదాలేదు. కొద్దిమంది నవాబుల కుటుంబాలలో వుందేమో? సింధు స్త్రీలవి చంద్రబింబాలలాంటి గుండ్రటి మొహాలు. వాళ్ళు పైజామాలు ఉపయోగిస్తారు. కాశ్మీర్ పంజాబులలో సిల్వాల్ లాగు ఉపయోగిస్తారు, అవి వదులుగా వుంటాయి.
సుక్కూరులో సింధునదికి స్నానానికి పోయాము. అక్కడ ఆడవాళ్ళు ఎంత పెద్ద కుటుంబాల వాళ్ళయినా స్నానం చేసేటప్పుడు పైనున్న చొక్కాలన్నీ తెసేస్తారు. ఒక చిన్న తుండు కట్టుకొని నీళ్ళలోకి దిగుతారు. జవ్వనుల బంగారు వక్షోజాలు కాశ్మీర పూవులలాంటి చూచుకాయలతో నీళ్ళతో మేలమాడుతాయి. ఒక స్నానం కాగానే మెట్లమీదకు వచ్చి కూర్చొని, సబ్బుతోగాని, పిండితోగాని సిగ్గు లేకుండా ఒళ్ళంతా రుద్దుకుంటారు. ఆడవారికీ , మొగవారికీ ఘట్టాలు ఒక్కటే! స్నానమంతా అయి ఒళ్ళు మొగవారి ఎదుట సిగ్గు లేకుండా శుభ్రంగా తుడుచుకొని చొక్కా వేసుకొని, పైజమా తొడుక్కొని ఆపైన కండువా (దుప్పటా అంటారు) వేసుకుంటారు.