ఈ పుటను అచ్చుదిద్దలేదు
వేయించి, ఒళ్ళంతా వెల్లుల్లిపాయి పసుపూ తేనే నూరించి రాయించి, అరగంట అరగంటకు పై మహాపాశు పతాదుల మందే నాలుకకు రాయించినాడట.
93 డిగ్రీల వాతం! ఇరవై నాలుగు గంటలయిన తర్వాత నెమ్మదిగా వేడి అందుకొంది. ఇంకో ఇరవైనాల్గు గంటలకు నాకు వేడి 97 డిగ్రీలకు వచ్చి, నాడి కొంచెం బాగుపడిందట. మా అమ్మకూ ఆయనే వైద్యం చేసాడు.
వైద్యుడు అంతా అయిన తర్వాత నిజం తెలుసుకొని సుశీలను బాగా చీవాట్లు పెట్టి, తర్వాత ఆ మందే ఆ మహాజ్వరాన్ని మళ్ళించలిగిందని మెచ్చుకున్నారట్ట. ఆ సన్యాసికోసం నాకు మహావాతం చేయగానే పరుగెత్తితే అతడక్కడ లేడట.
ఆ జబ్బు నెమ్మదించగానే ఒక రాత్రివేళ నాకు మెలకువ వచ్చింది. సుశీల నా మంచం ప్రక్కనే కుర్చీలో కూర్చుండి, నిద్రవచ్చి,నా నా మంచం మీద తలవాల్చి గాఢనిద్రపోతున్నది. ఆ గదిలో వేరొకచోట చాపపైన మా అమ్మ నిద్రపోతున్నది. గుమ్మం అవతల చావడిలో మా మేనమామ మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు.
శకుంతల వచ్చి నన్ను లేపినట్లు కల వచ్చి అయ్యో, బ్రతికి వచ్చిందా? అనుకుంటూ చెమటలుపట్టి, శకుంతలా అంటూ లేచాను. నా మాట ముద్దమాటలా వచ్చింది.
అందరూ ఒక్కసారి లేచారు. మా అమ్మ నా దగ్గ్గరకు పరుగిడి వచ్చి నాయనా బతికావురా!అని కంటనీరు కారిపోతూ ఉండగా, వెక్కి వెక్కి ఏడ్చి నన్ను కౌగలించుకుంది. మా మేనమామ అక్కా, ఊరుకోవే! వాడు బతికాడు. అదే పదివేలు. కొంచెం కులాసా చిక్కగానే మా ఊరు మనం అంతా వెళ్ళవచ్చును అంటూ కళ్ళనీళ్ళు వరదలు కట్టించాడు. సుశీల కంటనీరు జడివానగా, విశ్వేశ్వరా తండ్రీ! నీ దయే ఇదంతా! అంటూ వణికిపోయింది.
జగత్ రాం పండా కళ్ళు నులుముకుంటూ పరుగెత్తుకుని వచ్చాడు. ఎంత సంతోషం! ఓ విశ్వేశ్వర ప్రభూ! నువ్వు రక్షించావు మమ్ముల నందరినీ! అని చేతులతో మొగం కప్పుకొని నవ్వుతూ, ఏడుస్తూ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ దేవతార్చన గదిలోకి పరుగెత్తాడు.
నాకు కొన్ని రోజులవరకూ ముద్ద మాటలే! కొన్నినాళ్ళ వరకూ భోజనం సయించలేదు. మా అమ్మ ఇంత రససింధూరం, మిరియాలూ నూరి మాత్రలు చేసి వేసేది. పులికడుగు చారు పెట్టేది. అప్పటినుంచి నాకు ఆకలి పుట్టింది. అన్నీ తినాలని బుద్ది పుట్టింది. అతి జాగ్రత్తగా నాచేత పథ్యం చేయించారు. ఆ పట్టు పట్టు ఆరు నెలలకు కోలుకున్నాను. నాకు జబ్బు నెమ్మదించిన నెలరోజులకు నేనూ, మా అమ్మా నా ఆరోగ్యం కోసం హిమాలయాలలో'మస్సోరీ' వెళ్ళవలసిందని డాక్టరుగారు సలహాయిచ్చారు. మా మేనమామ తన కొడుకు కస్తూరి సుబ్రహ్మణ్యాన్ని పంపించాడు. సుబ్రహ్మణ్యం నాకన్న రెండేళ్ళు