పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/757

ఈ పుట ఆమోదించబడ్డది

వర్షాలొస్తాయనీ, అలాంటి కప్పల్ని పూజిస్తే వర్షాలొస్తాయనీ నమ్మించే వాళ్ళు. ముఖ్యంగా అనావృష్టి జరిగి వర్షం కోసం రైతులు ఎదురు చూసే సమయంలో వాన దేవుడి కోసం చేసే ఆచారాలలో ఇదొకటి.

అనావృష్టి ప్రాంతమైన రాయల సీమలో వర్షం కోసం ఇలాంటి ఆచారమే వుంది. మానవాతీత శక్తుల్ని సంతోషపెడితే వర్షం కురుస్తుందని వారి నమ్మకం. మట్టి మూకుడులో కప్పలనుంచి వాటిపైన తంగేడాకు వుంచి ఆ మూకుణ్ణి నెత్తి మీద పెట్టుకుని లేదా కావడిలో పెట్టి వాన దేవా అని పాడుతూ, భిక్షానికి వస్తారు. వర్షలక్ష్మి ఈ రూపంలో వచ్చిందని నమ్మిన స్త్రీలు బిచ్చం వేస్తారు.

కావడి తగిలించు కున్న వారు ఈ క్రింది విధంగా పాడతారని జానపద విజ్ఞానంలో సుందరంగారు ఈ విధంగా ఉదహరించారు.

బూమెమ్మ కడుపునా బుగ బుగా పొదిలింది,
కన్నీటి పొంగులే, పెన్నేటి కాలువా? ఓ వాన దేవా?
ఏరులూ చెరువులూ ఏకమై పారల్ల
మా కొండ్ర పండల్ల
మా కడుపు నిండల్ల ఓ వాన దేవా..

అనేది కప్పల కావడి సమయంలో పాడే పాటని 1975 లో దోణప్ప గారు ఉదహరించారు.


సాధనా శూరులు

పద్మశాలీలను మాత్రమే అర్చించే వీరిని సాధనా శూరులని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామ నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామలోనూ పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంబిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్రజాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది. దీనిని పగటి వేషంగా భావించవచ్చు. వీరి ప్రదర్శన కాలం మూడు గంటల వరకూ వుంటుంది. వీరి రంగస్థలం గ్రామ కూడలిలో వున్న విశాలస్థలంలో జరుగుతుంది. వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనుకట్టు గారడీగా వుంటాయి. ఉదాహరణకు వీరి ప్రదర్శనంలో ఇరువురు