పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/725

ఈ పుట ఆమోదించబడ్డది

తెలగ దాసరులే, గంటె భాగవతులు

శాస్త్రీయంగా యక్షగానాలను ప్రదర్శించే కూచిపూడి వారు వేరు. జీవనోపాధిగా మిగిలిన ఈ కళను నమ్ముకొని జీవయాత్ర కొనసాగిస్తున్న ఈ సంచార తెగ వేరు. వీరు తెలగ దాసరులు. తెలంగాణా లోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, హైదరాబాదు జిల్లాలలో ఎక్కువగా నివసిస్తున్నారు.

గంటె భాగవతులు:

వీరిని గంటే భాగవతులని కూడా పిలుస్తారు. పెట్రోమాక్సులైట్లు, ఎలక్ట్రిక్ లైట్లు లేని ఆ రోజుల్లో పెద్ద పెద్ద గరిటెల్లో (అంటే గెంటెల్లో) ఆముదం పోసి అందులో వత్తుల్ని నానబెట్టి వెలిగించి ఆ వెలుగులో వీథి నాటకాలను ప్రదర్శించే వారట. అందుకే వీరికి గంటె భాగవతులనే పేరు కూడా వచ్చింది.

నాగరికత పెరిగిన తరువాత అనేక కళలు ఎలా కాలగర్భంలో కలిసిపొయ్యాయో ఈ కళ కూడ నానాటికి నశించిపోతూ వుంది. ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని ఆ రోజుల్లో ఈ ప్రదర్శనాలను చూడటానికి పల్లెల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ప్రదర్శనం చూసి ఆనందించే వాళ్ళు. అయినా ఈ కళ ఏ ఆదరణా నోచుకోక పోయినా ఇంకా కొన వూపిరితో కొట్టుకుంటూ వుంది.

వారి ప్రదర్శనాలు:

గంటే భాగవతులు, రామనాటకం. సావిత్రి, సారంగ ధర, గయోపాఖ్యానం, లక్షణ భరణీయం, శశి రేఖా పరిణయం, గరుడాచలం, ప్రహ్లద, జయంత,జయపాల, సిరియాళ, గజగౌరి, అదృష్ట బాలచంద్ర మొదలైన పౌరాణిక జానపద యక్షగానాలను ప్రదర్శిస్తారు.

సంక్రాంతి మొదలు ఉగాది వరకూ రోజువిడిచి రోజు ప్రదర్శనాలు జరుగుతాయి. పల్లెల్లో వున్న మోతుబరి ఆసాములు ఇరవై ముప్పై రూపాయలిచ్చి, ప్రద్రర్శనాలను ఏర్పాటు చేస్తారు. గ్రామ ప్రజలందరూ ఉచితంగానే ఈ ప్రదర్శనాలను చూచి ఆనందిస్తారు. పర్వదినాలలో కూలీలు కూడ వీరి చేత నాటకాలు వేయిస్తారు.