పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/441

ఈ పుట ఆమోదించబడ్డది

కథా, గొండ్లి ఒకే రకమైన కళారూపంగా వర్థిల్లి వుండ వచ్చని నటరాజ రామకృష్ణగారు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నాటికీ గోండు జాతి నృత్యాలు:

ఈనాటి తెలంగాణాలో కేసలాపురం భీమదేవు దేవాలయం గోడు జాతికి సంధించినది. ఇక్కడ గోండు జాతివారు గొప్ప జాతర జరుపుతారు. జాతర వుష్య మాసం తరువాత ప్రారంభమౌతుంది. పదిహేను రోజుల పాటు జరుగుతుంది.

వేలాది గోండు జాతి ప్రజలు గుమికూడతారు. ఈ వుత్సవంలో పాల్గొన డానికి గోండు కవులూ, వాయిద్య కారులూ, పాటకులూ అందరూ హాజరయి ప్రధాన వాయిద్యాలను వాయిస్తూ వుండే పాట కాండ్రు భక్తి గీతాలు పాడతారు.

ఈ వుత్సవాలలో వివాహమైన పెండ్లి కూతుళ్ళు, ప్రధాన పాత్రలు వహిస్తారు. విగ్రహం ముందు నిలబడి రాత్రి తెల్లవార్లూ తన్మయీ భావంతో వివిధ రకాలైన నృత్య ప్రదర్శనాలు జరుపుతారు. ఈ ప్రదర్శనలకు గోండు ప్రజలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ హాజరై ఆనందిస్తారు.