పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/276

ఈ పుట ఆమోదించబడ్డది
వీర శైవం, వీర వైష్ణవం:

వీర వైష్ణవం, తమిళనాదులో ప్రారంభమై ఆంధ్ర దేశంలో ప్రవేసిస్తే వీరశైవం, కర్ణాటకలో ప్రారంభమై ఆంధ్రదేశంలో ప్రవేసింది. రెండు మతాల మధ్యా బద్ధవైరుధ్యం చెలరేగింది. ఉభయ మతాల మధ్య సామరస్య సాధనకు ఆంధ్ర దేశంలో పలనాటి బ్రహ్మనాయుడూ, తిక్కన సోమయాజీ కలసి హరిహర ఉద్యమాన్ని లేవదీసినట్లూ, ఆ వుద్యమంలో వీర శైవుల్నీ, వైష్ణవుల్నీ కూడ చేర్చుకుని మాచర్లలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని స్థాపించి ఆ ప్రాంగణం లోనే వీరభద్ర స్వామిని కూడ ప్రతిష్టించాడు.

శివకేశవుల ఎదుట పేరిణి:

మాచర్లలో నున్న శివకేశవుల దేవాలయాల్లో, దేవతామూర్తుల ముందు పేరిణి నృత్యాన్ని భక్తి భావంతో ప్రదర్శించేవారు. అంతే కాదు శైవ క్షేత్రాలైన కోటప్ప కొండ, శ్రీశైలం మొదలైన పుణ్య క్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో పేరిణి నృత్యానికి సంబందించిన కొన్ని జతులు ప్రదర్శింప బడేవి.

ఈనాటికీ మాచర్ల సమీపంలో వున్న కారంపూడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర్ఫుల దినోత్సస్వం ప్రతి సంవత్సరమూ జనవరిలో జరుగుతుంది. అక్కడ వీరుళ్ళ దేవాలయాలున్నాయి. ఆ వుత్సవాల్లో నేను కళ్ళారా చూచిన పేరిణి నృత్యం లోని కొన్ని జతులు ప్రదర్శింపబడ్డాయి. ఆ నృత్యాలు మహా ఉత్తేజంగా వుండేవి. ప్రేక్షకులను ఉద్రేకపర్చేవి. పూర్వ వీరుల ఔన్నత్యాన్ని చాటేవి. నిజానికి అవి జానపద నృత్యంగా కనిపించినా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి, సాంబ్రాణి రూపంలో మునిగి పోయి, సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది చేసే ఆ పేరిణి జతుల నృత్యం ప్రేక్షకులకు కూడా వెర్రి ఎక్కించేది. వీరశైవ పేరిణి నృత్య ప్రభావం అంతటిది. అయితే అది ఆనాడు శాస్త్రీయతను కోల్పోయి, గణాచారుల నృత్యంగా మిగిలి పోయింది.