నాల్గవ ప్రకరణము.
179
రెండవకొనవఱకును మనుష్యులతో నిండిపోయి యొకవీధివా రింకొకవీధికి నడుచుట దుర్లభమాయెను. నేనుపల్లకివెంట నడవక వచ్చినమూకలోఁజేరి వారేమి చెప్పుకొందురో వినుచుంటిని. చిరకాల దురాచారవాసనచేతను ద్వేషైక ప్రధానులైన ఛాందసశిరోమణులవలని భీతిచేతను పల్లకులు వీధులవెంటఁబోవునప్పుడు కొందఱు తలుపులుమూసికొన్నను, ఆవధూవరులను జూచిన సామాన్యజనులందఱును సంతోషించి యెక్కడఁజూచినను ఆకార్యములను శ్లాఘించుచునే వచ్చిరి.
రెండవపెండ్లికొమార్తెను తండ్రియనుమతిలేకయే తల్లితీసికొని వచ్చినదని మాప్రతిపక్షు లేలాగుననోతెలిసికొని, అతనిచేత మామీఁద దండవిధాయకునియొద్ద నేరముమోపించి మమ్ము శిక్షింపఁజేయవలెనని ప్రయత్నముచేసిరి. కాని వారిదుష్ప్రయత్నములను మేముయుక్తసమయములోనే తెలిసికొని కష్టముమీఁద తల్లివలన సత్యమునుగ్రహించి మెలఁకువపడి ముందుగా మే మే పెండ్లికొమారితతల్లిని పినతల్లినిపంపి యామెభర్తను మాయొద్దకు రప్పించుకొని సభల కెక్కకుండ తప్పించుకొంటిమి. ఈవివాహమయిన మఱునాటినుండియు మూర్ఖజనుల వలనిబాధ లంతకంతకు ప్రబలసాగినవి. ఈవివాహములను చేయించినవారిని చేసికొన్న వారిని వారితోఁగలిసి భోజనములు చేసినవారినిమాత్రమే కాక వేడుక చూడఁబోయినవారిని సహితము పలువిధముల బాధపెట్ట నారంభించిరి ; ఈ శుభకార్యములయందు కొంచెము సంబంధమున్న వారినందఱిని వారు కాపురమున్న యద్దెయిండ్లలోనుండి లేవఁగొట్టిరి ; కాపురముండుట కెవ్వరు నిండ్లనియ్యకుండిరి ; నూతులలో నీళ్ళుతోడుకోనియ్యకపోయిరి ; నీళ్ళు తెచ్చు బ్రాహ్మణులను తేకుండఁజేసిరి ; శుభాశుభకార్యములకు పురోహితులను బ్రాహ్మణులను రాకుండఁజేసిరి ; దేవాలయములకు పోనియ్యక పోయిరి ; బంధువులు మొదలైనవారిని వారియిండ్లకు పోకుండఁజేసిరి. కనఁబడినచోట్ల మొగముముందఱనే తిట్టసాగిరి ; మఱియు నింక నెన్ని విధముల దుండగములు చేయఁగలుదురో యెన్ని విధముల నాయాసపెట్టఁగలుగుదురో యన్ని విధము