పీఠిక
మదరాసురాష్ట్రీయ ప్రభుత్వమువారి సమాదరణమున తంజావూరి శ్రీ శరభోజీ సరస్వతీ మహలు భాండాగారమువారిచే ప్రకటితమగుచున్న కట్టావరదరాజ కవికృత ద్విపద రామాయణమున నీ వఱకు బాల అయోధ్యాకాండములుగల మొదటి సంపుటమును అరణ్య కిష్కింధా కాండములుగల రెండవ సంపుటమును వెలువడినవి. ప్రస్తుతము వెలువడినది మూఁడవ సంపుటము సుందరకాండము వెంటనే యుద్ధ కాండముకూడ ప్రత్యేక సంపుటముగ వెలువడును. మొదటి రెండు సంపుటముల వలెనే యుద్ధకాండ మొక్కటియే ప్రత్యేక సంపుటము కాదగినంత పెద్ద గ్రంథమగుటచేత, సుందరకాండము దానితో కలుపుటకు వీలులేకపోయినది. మఱియును సుందరకాండ పారాయణ గ్రంథమగుటచేత ప్రత్యేకముగ నొక సంపుటముగనే ముద్రించిన నది కేవలము పండితులైన సాహిత్య విద్యోపాసకులకేగాక, భక్తులకు, స్త్రీలకు, పాఠకలోకమునకు ననుకూలముగనుండునను నభిప్రాయముతో నిట్లు కావింపఁబడినది.
వరదరాజకవినిగూర్చి ప్రథమ సంపుటము పీఠికలో విపులముగ నుండుటచేత నిచట వ్రాయ లేదు. ఆతడు క్రీ. శ. 1630 ప్రాంతమున ప్రసిద్ధుఁడైన రాజకవి.
ఈ సుందరకాండ రచనము, తక్కినకాండముల రచనమువలె, మూలానుసరణమై సులభగ్రాహ్యమైయున్నది. ఈసుందర