పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/19

ఈ పుట ఆమోదించబడ్డది

6 ఆంధ్రకవి తరంగిణి

రుఁ డున్నట్లు తెలిపెడియాధారములు నాకు లభింపలేదు. పైని నుదాహరించిన పద్యములను బట్టి మొదటిపిన్నమరాజు కుమారు డైన సోమరాజునకు శ్రీధరచ్ఛందము కృతియిచ్చెనందుమేని, యాకాలము క్రీ. శ. 1350-1370 ప్రాంతమై యాగ్రంథమునుండి గౌరనమంత్రి లక్ష్యములను గైకొనెనని తలంపవచ్చును. కాని క్రీడాభిరామమునుండి లక్ష్యములను గ్రహించెనని చెప్పవలనుపడదు. రెండవ పిన్నమరాజునకు బుక్కరాయలుగాక సోమభూపాలుఁడను నిఁకనొక తనయుఁ డన్నాఁడని ధ్రువపడి యతఁడే గృతిపతియయ్యెనేని యాకాలము క్రీ. శ. 1450 ప్రాంతమై యుండును. ఆపక్షములో శ్రీధరుఁడు క్రీడాభిరామమునుండి లక్ష్యములను గైకొనెననిన నొప్పును గాని గౌరనమంత్రి శ్రీధరుని గ్రంథమునుండి లక్ష్యములను గ్రహించెనని యనరాదు. శ్రీధరుని గ్రంథము లభించినగాని సత్యము బయటపడదు. భావిపరిశోధనమునఁ దెలియువిషయములనుబట్టి కవికాలమును స్థిరముగా నిర్ణయించుకొందము. శ్రీధరుఁడు పైని జెప్పిన కాలములలో నేకాలమువాఁడైనను, బద్దెననీతిశాస్త్రముక్తావళినుండి లక్ష్యములను గైకొనెననుట కభ్యంతరముండదు క్రీడాభిరామమునుండి లక్ష్యములను గైకొనెనని చెప్పుచున్నారు కావునఁ బ్రస్తుత మీతని గ్రంథకాలము క్రీ. శ. 1450 ప్రాంత మనుకొందము.

————

70. కృష్ణమాచార్యుడు

ఈకవిని గూర్చి శ్రీ నిడదవోలు వెంకటరావుపంతులు M. A. గారు భారతి (పార్థివ-భాద్రపదము) లో నిట్లువ్రా సియున్నారు.

"తెలుగున తొలివచనకావ్యకర్తయు, వచనసంకీర్తనవాఙ్మయమునకు మూలపురుషుడును, వైష్ణవభక్తాగ్రేసరుడు నగు కృష్ణమాచార్యుఁడు కాకతీయచక్రవర్తులలో కడపటివాడగు రెండవప్రతాపరుద్రునికాలమున ననగా క్రీ. శ. 1295 నుండి 1326 వఱకుఁ గలకాలమున విలసిల్లెనని ప్రతాపచరిత్రమును, ఏకశిలానగరవృత్తాంతమును చెప్పుచున్నవి. తిరుపతిదేవస్థానమున సంకీర్తనాచార్యులలో ప్రథములు తాళ్లపాక అన్నమయ్యగారు (క్రీ. శ. 1408-1503) కృష్ణమాచా