ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అనుబంధము
ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (సంపుటము 18. సంచిక 2. పుటలు 115-121) యందు భైరవకవి ప్రణీతమైన- కవిగజాంకుశమును- (మానవల్లి వారిచ్చిన ప్రతి) ప్రచురించినారు. దానినే యథాతథముగా నిందు చేర్చినాను. కవి 4 పద్యమున కవిగజాంకుశ మనియు చివరి పద్యమున కవిరాడ్గజాంకుశ మనియు- వ్రాసినాడు.
కవిగజాంకుశము
(భైరవకవి)
క. శ్రీమత్పరమసితానన
తామరసవికాసలీలఁ దగిలి భ్రమరాం
బామధుమత్తభ్రమరిక
నామనసరసీరుహంబునన్ భ్రమియించున్. 1
వ. అని యిష్టదేవతాప్రార్థనంబుఁ జేసి, 2
క. నిరుపమమతివిస్ఫురణం
బరఁగినసత్కవులఁ దొల్లి బహువిధముల న
చ్చెరువొందఁ జెప్పవలసిన
నరనుతసాహిత్యలక్షణగ్రంథములన్. 3
క. సందడిపడు లక్షణమును
బొందుగ ధవళించి జాగు పోవిడిచి సుధీ
బృందంబుమెచ్చ నేనొక
చందమ్ముగఁ గవిగజాంకుశ మ్మనుపేరన్. 4