పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/628

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రగుప్త చక్రవర్తి

సంగ్రహ ఆంధ్ర

యందు పర్షియాదేశ సరిహద్దులవరకును వ్యాపించియున్నట్లు స్పష్టమగును. అశోకుని తండ్రియగు బిందుసారుడు యుద్ధ విజేతగా చరిత్రయందు కనుపించడు. కావున అశోకుడు పాలించిన విశాలసామ్రాజ్యము పితామహుడగు చంద్రగుప్తుని నిర్మాణకౌశల ఫలితమే యయి యున్న దనుట తర్కబద్దముగా నుండగలదు.

తమిళ గ్రంథములలో “వాంబమోరియరులు” అనగా “మౌర్యాధములు” గొప్ప సేనతో తిరునల్వేలి ప్రాంతముపై దాడి సల్పినట్లు పేర్చొనబడి యున్నది. అధము లను విశేషణవాచకమునుబట్టి తమిళ కవులు చంద్రగుప్త కాలవిషయములనే వర్ణించినట్లు రూఢి యగుచున్నది.

ప్రథమ రుద్రదమనుని జునాగడ్ శాసనాధారమున సౌరాష్ట్రము మౌర్య సామ్రాజ్యములోని పరగణాగా నున్నట్లు తెలియుచున్నది. చంద్రగుప్తుని ప్రతినిధిగా పుష్యమిత్రు డను నాతడు సౌరాష్ట్రము నేలుచుండెను. పశ్చిమ భారతదేశమునకూడ మౌర్యాధికారము క్రింద కొంత ప్రాంత ముండియుండెను. థానాజిల్లాలో 'శోపారా' యందు అశోకుని శాసనము కనబడుటచే తత్పరిసరములు చంద్రగు ప్తుని కాలములో గూడ ఆతని సామ్రాజ్యాంతర్భాగమగు రాష్ట్రముగా నుండెనని తెలియగలదు. పూర్వ గ్రంథములయందు 'శోపారా' అను నామము 'శూర్పారక' గా వ్రాయబడి యుండెను.

పరిపాలనా విధానము : పర్షియానుండి దక్షిణాపథము వరకు వ్యాపించి యుండిన సువిశాల సామ్రాజ్యమును సమర్థవంతముగ పరిపాలించుటకు యోగ్యమయిన విధాన మవలంబించుట ఎంతయు దుర్ఘటమైన కార్యము. ఒక మూల నుండి మరియొక మూలకు గల దూరము అతి దీర్ఘము. ఆ కాలములో చెదరియున్న వేర్వేరు ప్రాంతములకు రాకపోకలు సులువుగను, త్వరితముగను నెరవేరు విధము లేకుండెను. పాటలీపుత్రము వంటి రాజధాని నుండి సామ్రాజ్యమంతటిని అదుపులో నుంచుట ఎంతయో కష్టము, చంద్రగుప్తుడు, తన రాజకీయ వివేక సంజనితమగు పథకముతో ఈ సమస్యను పరిష్కరించెను. విసరి వేసినట్లు అందుబాటులో లేని ఈ విశాల భూభాగములను అనుకూలముగను, నిర్వహణ సమర్థముగను ఉండునట్లు పరగణాలుగ, లేక రాష్ట్రములుగ విభజించెను. ఒక్కొక్క రాష్ట్రముపై రాష్ట్రపాలకులను నియమించెను. రాష్ట్ర పాలనా విధానమంతయు నొకే విధముగ నుండునట్లు కట్టడి చేసెను. ఈ విధముగా దేశపరిపాలనమును వికేంద్రీకరణము గావించుటచే దూర ప్రయాణముల సమస్య సమసిపోయెను. ఒకేచోట పరిపాలన యంత్రమును కేంద్రీకరించుట ప్రయాణ సౌకర్యములులేని ప్రాచీన కాలములో సాధ్యమైన పనికాదు. పాలనాధికారమును పైనుండి క్రిందివరకు వేర్వేరు అంతస్తులలో వేర్వేరు అధికారుల పరిధిలో పంచవలసియుండెను. పరిమితమగు ఇట్టి స్థానిక ప్రదేశము లందును అధికార ధర్మమునం దెక్కువ భాగము వివిధములయిన స్వపరిపాలనా సంస్థలకు చెందియుండెను. గ్రామస్థులు స్వపరిపాలనా సంఘముగనో, ప్రజాప్రభుత్వము (republic) గనో ఏర్పడి తమగ్రామ విషయములను, గ్రామావసరములను, చక్క బెట్టుకొను చుండిరి. ఈ విధముగా గ్రామస్థులకు పరిపాలనా విధానము నందు మంచి యవకాశమును, అనుభవమును లభించెను. ఇట్లు ఆ కాలమునాటి రాజనీతివిధానము సిసలైన ప్రజాప్రభుత్వ సంప్రదాయము ననుసరించి యుండెను.

మెగస్తనీసు రచించిన గ్రంథమిప్పుడు దొరకుటలేదు. అయినను అందలి కొన్నికొన్ని విషయ భాగములు వేరు రచనలయందు సూచితమగు చుండుటచే, చంద్రగుప్తుని రాజ్యతంత్ర విధానము మనకు తెలియనగుచున్నది. మెగస్తనీసు వ్రాతలవల్ల ఆనాటి సాంఘిక, రాజకీయసభలు, పలుప్రదేశముల వర్ణన, పాడిపంటలు, పరిశ్రమలు మొదలగు వాటిని గూర్చిన పూర్ణచిత్రము వెల్లడియగుచున్నది. మెగస్తనీసు స్వయముగ దర్శించి, విషయములను ప్రత్యక్షముగ తెలిసికొని వ్రాసిన గ్రంథ మగుటచే అది ప్రత్యక్ష ప్రామాణిక గ్రంథమై, అత్యధికమయిన చారిత్రక విలువ గలిగి యున్నది.

చక్రవర్తి సామ్రాజ్యమునకు సర్వతంత్ర స్వతంత్రాధికారియై యుండెను. ఆతడు యుద్ధ, న్యాయ, నిర్వహణం (executive), శాసనాధికారములను తన స్వాధీనమునం దుంచుకొనెను. సామ్రాజ్య పరిపాలనా వ్యవహారములందు చక్రవర్తి స్వయముగనే ఎట్లు వ్యవహరించు చుండెనో మెగస్తనీసు తెలిపియున్నాడు. చక్రవర్తి పగలు నిద్రించడనియు, దినభాగమంతయు దర్బారు

570