పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/331

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్యవాఙ్మయము (తెలుగు)

సంగ్రహ ఆంధ్ర

గూడ మేలైన దూడఆవును, వృషభమ్మును నెవ్వ డొసంగు నతండు స్వర్గంబునందు సుఖంబు జెందు.”

శ్రీరంగ మాహాత్మ్యము : క్రీ. శ. 1704-31 వరకు రాజ్యమును పాలించిన విజయరంగచొక్కనాథు డిగ్రంథమును రచించెను. ఇది శ్రీరంగక్షేత్ర మాహాత్మ్యమును తెలుపు పది అధ్యాయముల గ్రంథము. గ్రంథకర్త ఈ కృతిని శ్రీరంగేశ్వరుని కంకితముచేసి తన వైష్ణవభక్తిని ప్రకటించుకొనెను. ఇందలి వచనశైలి ఇట్లుండును :

“శ్రీరంగ విమానరాజంబు తొలుదొల్త బ్రహ్మలోకంబున నుండు. తదనంతరంబు నీవు తపంబుచేసిన జతుర్ముఖుండు నీ కీయంగలడు. అయోధ్యానగరంబున నీవు నీవలన జనించిన రాజులును పెక్కండ్రు పూజింపగలరు.”

విజయరంగచొక్కనాథుడే మాఘమాహాత్మ్య మను వేరొక వచనగ్రంథమును రచించియున్నాడు.

జైమిని భారతము : విజయరంగచొక్కనాథునికి సమకాలికుడైన సముఖము వెంకటకృష్ణప్పనాయకు డీగ్రంథమును రచించెను. ఈ జైమిని భారతము పిల్లలమర్రి పినవీరభద్రుని పద్యకృతికి వచనానువాదము. ఇది అయి దాశ్వాసములు గల గ్రంథము. విజయరంగచొక్కనాథునికి అంకితమైనది. ఇందు పినవీరన ఉపయోగించిన జాతీయములు, సామెతలు, సమాసములు తిరిగి ఉపయుక్తములైనవి. అచ్చటచ్చట స్వతంత్రరచనయు గలదు. శైలి ప్రౌఢముగానుండును.

సారంగధర చరిత్ర : ఈ గ్రంథమునుకూడ సముఖము వెంకటకృష్ణప్పనాయకుడే రచించెను. ఇది శ్రీరంగనాథునికి అంకితమైనది. ఇందలి శైలియు ప్రౌఢము. ఉదా :

"అప్పుడు ప్రోడలగు చేడియ లాచేడియలం జూచి యిక్కుమారుని చక్కదనంబును, నీ చక్కెరబొమ్మ యక్కరయు, జూచిన నేటి కిచ్చోటి కేమోపాటు వచ్చునని తోచుచున్నది. ఇత్తరి యిబ్బిత్తరి కింత తత్తరం బేటికి?"

ఇవికాక ఈ కవి రాధికాసాంత్వనము, అహల్యా సంక్రందనము అను ప్రబంధములను కూడ రచించినట్లు తెలియుచున్నది.

ఇవిగాక విజయరంగచొక్కనాథుని కాలముననే శ్యామరాయకవిగారి రామాయణవచనము, శ్రీపతి రామభద్రుని హాలాస్యమాహాత్మ్యము, దేవకి వేంకటసుబ్బకవి రామాయణ వచనము అను గ్రంథములు కూడ రచితములైనవి.

కళువె వీరరాజు : క్రీ. శ. 1704–31 వరకు మైసూరును పాలించిన చిక్క దేవరాయల కాలమున ఈ కవి నివసించి, మహాభారతమును వచన కావ్యముగా రచించెను. ఇందు ఆది సభా భీష్మ పర్వములు మాత్రమే లభ్యమగుచున్నవి. గ్రంథాంత పద్యమును బట్టి ఈ గ్రంథము క్రీ. శ. 1730 వ సంవత్సరమున రచించినట్లు తెలియుచున్నది.

హాలాస్య మాహాత్మ్యము: క్రీ. శ. 1760 ప్రాంతమున నివసించిన కళువె నంజరాజు ఈ గ్రంథమును రచించెను. ఇతడు కళువె వీరరాజు కుమారుడు. హాలాస్య మాహాత్మ్యము దక్షిణ మధురాక్షేత్ర మాహాత్మ్యమును తెలుపు డెబ్బది అధ్యాయముల గ్రంథము. ఇందు సుందరేశ్వరుని అరువది నాలుగు లీలలు వర్ణితములైనవి. ఈ కవియే కాశీఖండమునకు ఆంధ్రవచనరూపమగు కాశీ మహిమార్థ దర్పణమును రచించెను.

తుపాకుల అనంత భూపాలుడు: ఇతడు కళువెవీరరాజునకు సమకాలికుడు. చంద్రగిరి కృష్ణరాజు కుమారుడు. ఇతడు నాలుగు వచన గ్రంథములను రచించెను. 1. విష్ణు పురాణము. 2. భగవద్గీతలు. 3. రామాయణ వచనము (సుందర కాండము మాత్రమే). 4. భారత వచనము (సభా, భీష్మపర్వములు). ఈ గ్రంథకర్త తన్ను గురించి “నిఖిల పురాణేతిహాసకథా సంధాన సమేధమానచాతుర్య వచన రచన వైచక్షణ్య" అని వర్ణించుకొనియున్నాడు. ఇతని రచనములను దృష్టియందుంచుకొనిన ఈ మాటలు యథార్థము లనిపించును. రామాయణ సుందరకాండము నుండి ఉదాహరణమునకు కొన్ని వాక్యములు :

“ఓ పురుషపుంగవా! నీ వుత్సాహ సంపన్నుండవగుచు నను గరుణింపుము. నీవంటి వల్లభు డుండి యే ననాథ తెఱంగున నున్నదాన. భూకారుణ్యంబు పరమ ధర్మంబని పూర్వంబున నీ వలననే వినియుందును. నీవు మహా వీరుండవనియు, మహోత్సాహుండవనియు, మహాబల సమన్వితుండవనియు, నెవ్వరికిం గాని కార్యంబు నీకు శక్యంబనియు నెఱుంగుదును.”

ఆంగ్లేయ రాజ్యారంభము - కుంపిణీయుగము : ఈ కాలమున లిఖితములైన గ్రంథముల ననుసరించి ఈయుగమును

286